యోగసాంఖ్య యోగులు అక్షరమైన పరబ్రహ్మమును పొందారు అని భీష్ముడు చెప్పగా ధర్మరాజు
" తాతగారూ ! ఉత్తరాయణము ప్రవేశించుటకు కొద్ది రోజుల వ్యవధిమాత్రమే ఉన్నది.
కాని నేను మీ నుండి తెలుసుకోవలసిన విషయములు అనంతములు. దయచేసి నాకు అన్ని
విషయములు వివరించండి ? " అని అడిగాడు.
అక్షరము
భీష్ముడు
బదులుగా " ధర్మనందనా ! నీకు వశిష్టుడికి జనకుడికి జరిగిన సంభాషణ
వివరిస్తాను. ఒక సారి జనకుని వద్దకు వచ్చిన వశిష్టమహామునికి నమస్కరించి
అతిథిసత్కారం చేసి " మునివరా ! ఆద్యంతం లేనిది, పునరావృత్తి రహితమైనది,
నాశనం లేనిది, శుభప్రథమైనది అయిన తత్వం గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు
" నేత్రములు, కళ్ళు, ముఖం, చేతులు, కాళ్ళు ఉండి కూడా ఆద్యంతం వృద్ధి క్షయం
లేనిదానిని అక్షయం అంటరు. అక్షరం నుండి 24 క్షరతత్వములు ఉద్భవించాయి.
అక్షరతత్వం విక్రియగా వైరుధ్యం పొందడమే ప్రకృతి అవ్యక్తం అంటారు. వాటి
నుండి మహాతత్వం దాను నుండి అహంకారం దాని నుండి పంచభూతములు వాటి అయిదు
గుణాలైన శబ్ధ, స్పర్శ, రూప, రస, గంధాదులు పది ఇంద్రియములు మనసు పుట్టాయి.
ఇలా 24 క్షరతత్వాలు గోచరాలు ఔతాయి. 25 వ తత్వమైనక్షర తత్వమే పరతత్వము. ఈ
అక్షరతత్వము సత్వగుణముతో చేర్చి తనకు అర్హమైన ధర్మములు ఆచరించి దివ్యత్వము
పొంది స్వర్గసుఖాలు అనుభవిస్తుంది. రజోగుణముతో కలిసి మానవునిగా పాప
పుణ్యకార్యాలు చేస్తూ కష్టసుఖాలను సమానంగా అనుభవిస్తుంది. తమోగుణముతో కలిసి
కేవలం పాపకార్యములాచరించి పశుపక్ష్యాది జన్మలెత్తి దుఃఖమును నరకమును
అనుభవిస్తుంటుంది. అక్షరతత్వము వర్ణరహితమైనది అయినా సత్వగుణంతో చేరి శ్వేత
వర్ణం, రజోగుణంతో చేరి ఎరుపు వర్ణం, తమోగుణంతో చేరి నలుపు వర్ణంగా భ్రమింప
చేస్తుంది. అక్షరతత్వం గుణరహితమైనా అహంకారంతో చేరి అనేక విధములైన వికారము
పొందుతూ ఉంటుంది. అక్షరతత్వం అమలినమైనది అయినా త్రుగుణాత్మకమై యజ్ఞములు,
యాగములు, ఉపవాసము, భూశైనము, నియమ నిష్టలు, సన్యాసం, ముని వేషధారణ చేసి
నారచీరలు ధరించి జడలుకట్టించి దండధారణ మొదలైనవి చేసి శరీరమును బాధపెడుతూ
ఉంటుంది. అక్షరతత్వానికి చావు పుట్టుకలు లేవు. అది అమలినము అమృతము అయినది.
కాని తనను తాను మరచి ఈ అవలక్షణములను తనకు ఆపాదించుకుని భ్రమలా ఉంటుంది.
తనను తానుతెలుసుకున్న నాడు మబ్బువిడిచిన చంద్రుడిలా ప్రకాశిస్తుంది " అని
వశిష్ఠుడు చెప్పాడు.
జంతుసృష్టి
స్త్రీకి
కాని పురుషుడికి కాని విడిగా సంతానోత్పత్తి చేసే శక్తి లేదని స్త్రీ
పురుషుల కలయిక వలనే పునరుత్పతి సాధ్యమని వేదములు ఘోషిస్తున్నాయి. ఆ జీవికి
స్త్రీ నుండి రక్తము, చర్మము, మాంసము లభిస్తాయి. పురుషుడి నుండి మజ్జ,
ఎముకలు, నరాలు లభిస్తాయి. మొత్తం ప్రాణికోటికి ఇలాగే జరుగుతుంది. ప్రకృతి
పురుషుడు ఒకరిని ఒకరు ఆకర్షించడం వలనే ఈ సమస్త సృష్టి జరుగుతుంది కదా !
స్త్రీ పురుష సంబంధాలు వారిప్రవర్తన వలన తెలుస్తుంది కాని మోక్షమార్గం ఎలా
ఉంటుందో తెలియడం లేదుకదా ! అవ్యక్తము, అనుపమానమూ, అతీంద్రియము, అనంతము,
అనామము, అమలము అయిన తేజస్సు ఒకటి ప్రకాశిస్తుందని వేదాలు చెప్తున్నాయి
కదా ! ఆ తత్వాన్ని గురించి వివరించండి " అని జనకుడు వశిష్టుడిని కోరాడు. వశిష్ఠుడు
"మహారాజా ! సకల శాస్త్రములను అధ్యయనం చేసిన నువ్వువాటిని సరిగా అర్ధం
చేసుకోలేక పోయావు. అర్ధం చేసుకోలేని విద్య వ్యర్ధంకదా ! కనుక నేను చెప్పేది
శద్ధగా విను " సాంఖ్యము యోగము ఒక దానిని ఒకటి అనుసరించి ఉంటాయి కాని రెండూ
ఒకటే. సాంఖ్యముకు మూలము వేదము. ఈ సృష్టిలోని సకల ప్రాణులకు మూడు లింగాలు
ఉన్నాయి. కాని ఆత్మకు లింగబేధము లేదని వేదాలు ఘోషిస్తున్నాయి. విత్తనము
నుండి విత్తనము, మనిషి నుండి మనిషి, ఇంద్రియముల నుండి ఇంద్రియములు, మనసు
నుండి మనసు పుడుతుంది. కాని ఆత్మబీజము నుండి కాని, మనిషి నుండి కాని,
ఇంద్రియముల వలన కాని మనసు వలనకాని జన్మించదు. ఆత్మ నిర్గుణము, నిరాకారము,
నిర్వికల్పము. కనుక ఆత్మకు సుఖదుఃఖము భవబంధాలు లేవు. ప్రకృతికి లింగబేధము
లేకున్నా దాని నుండి ఉద్భవించిన ప్రాణులకు లింగబేధము ఉంది. ఋతువులకు రూపము
లేకున్నా వాటి స్వభావాల అనుసరించి వాటికి నామాలు ఉన్నాయి. కనుక ప్రకృతిలో
గుణములు ఉన్నా ఆత్మకు గుణములు అంటవు. ఇదే అక్షరముకు క్షరముకు కల భేదము.
వీటిని ఏకము అనేకము, తత్వము నిస్తత్వము, దర్శనము అదర్శనము అని కూడా
పిలుస్తారు. అక్షరపరబ్రహ్మము మూఢులకు అవివేకులకు కనబడదు. వివేకము కలిగిన
సాంఖ్యులు, యోగులు తమ బుద్ధితో వివేచనతో ఈ 25వ తత్వమైన అక్షరపరబ్రహ్మాన్ని
తెలుసుకొనగలరు " అని చెప్పాడు.
ఆత్మ ఏకత్వము అనేకత్వము
జనకుడు
" మహర్షీ ! ఆత్మకు ఏకత్వము అనేకత్వము ఉన్నాయి కదా ! అలాగే విద్య అవిద్య
ఉన్నాయి కదా ! నా బుద్ధిమాంధ్యము వలన నేను తెలుసుకొనజాలక ఉన్నాను కనుక
క్షరము, అక్షరము, సాంఖ్యము, యోగము గురించి వివరించండి " అని అడిగాడు. వశిష్ఠుడు
" జనకమహారాజా ! యోగమనగా ధ్యానము. అది రెండు విధములు. మొదటిది ప్రాణాయామము,
రెండవది మానసిక ఏకాగ్రత. మొదటిది సగుణోపాసన రెండవది నిర్గుణోపాసన.
ప్రాణాయామము మూత్రవిసర్జన సమయంలో భోజనము చేసిన తరువాత చెయ్యకూడాదు. యోగి
మితాహారము తీసుకోవాలి. ఇంద్రియములను నిగ్రహించాలి. శబ్ధ, రస, రూప, గంధాదుల
వంక మనసు మరల్చకూడదు. బుద్ధి మనసునందు నిలిపి మనసును ఆత్మ అందు నిలపాలి.
కోరికలు విసర్జించి శిలాసదృశ్యముగా ఉండాలి. అలాంటి యోగి పగటికి రాత్రికి
భేదము లేక నిరంతర ధ్యానములో మునిగి ఉంటాడు. గాలిలేని చోట వెలిగేదీపంలా
నిశచలమనస్కుడై ఆనందం అనుభవిస్తాడు. దీనినే యోగము అంటారు. ప్రకృతివాదులైన
సాంఖ్యులు ఈ ప్రకృతిని అవ్యక్తము అంటారు. ప్రకృతికి జన్మనిచ్చే ధర్మము ఉంది
కనుక తానుగా బుద్ధి, అహంకారము, పంచభూతములు, విషయవాంఛలు, ఇంద్రియములుగా
లోకమంతా విస్తరించి ఉంటుంది. దీనికి పురుషుడు అధిష్టానుడు. ఈ సృష్టి
అనులోమానుపాతంగా జరుగుతూ ఉంటుంది. సంహారసమయంలో విలోమానుపాతంగా జరుగుతుంది.
జననమరణ సమాయాలలో ప్రకృతి ప్రకోపిస్తుంది. ప్రకృతి, క్షేత్రము, అవ్యక్తము
మూడూ ఒకటే. దానిని సత్వము అనికూడా అంటారు. జీవుడికి క్షేత్రము గురించి
తెలుసు కనుక అతడిని క్షేత్రజ్ఞుడు అంటారు. జీవుడు ఈ అవ్యక్త పురములో ఉండడం
వలన అతడిని పురుషుడు అంటారు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు అన్నది తెలుసుకోవడమే
జ్ఞానం. పురుషుడికి ఈ జ్ఞానము తెలుసు. ప్రకృతి సగుణాత్మకము పురుషుడు
నిర్గుణుడు. 24 వికారములకు సాక్షిగా పురుషుడు నిలిచి ఉంటూ కైవల్యాం
పొందుతాడు అదే పునరావృత్తి రహితమార్గము. ఈ సత్యము తెలిసిన వాడికి మరణం అంటే
భయం ఉండదు.
విద్య అవిద్య
జనక
మహారాజా ! నీకు సాంఖ్యమును యోగమును, అక్షరము గురించి వివరించాను. ఇంక
విద్య అవిద్య గురించి వివరిస్తాను. విద్య అంటే 25 వ తత్వమైన అక్షర
పరబ్రహ్మము. కర్మేంద్రియములకు జ్ఞేనేంద్రియములు, జ్ఞానేంద్రియాలకు మనసు,
మనసుకు పంచభూతములు, పంచభూతములకు అహంకారం, అహంకాముకు బుద్ధి, బుద్ధికి
అవ్యక్తము, అవ్యక్తముకు 25వ తత్వమైన అక్షర పరబ్రహ్మము వరుసగా విద్యగా
పరిగణించబడతాయి. జనకమహారాజా ! నీకు క్షరముఅక్షరము గురించి ఇంతకు ముందు
వివరించాను. కొందరు ప్రకృతిని క్షరమని, జీవుడిని అక్షరమని అనుకుంటారు. మరి
కొంత మంది ప్రకృతి, జీవుడు కూడా క్షరమని అంటారు. మరి కొంతమంది జీవుడు,
ప్రకృతి కూడా అక్షరని అంటారు. రెండింటికీ ఆది అంతము లేక పోవడము, ఈశ్వరతత్వం
కలిగి ఉండటం వలన సారూప్యము ఏర్పడింది. జీవుడు, ప్రకృత్తి సహజములైన మహత్తు,
అహంకారములతో చేరి, ప్రకృతి తానుగా తలుస్తాడు. అప్పుడు జీవుడు క్షరమౌతాడు.
అదే జీవుడు ప్రకృతి వికారములకు లోబడక స్వతంత్రుడైతే అక్షరుడౌతాడు. జీవుడికి
జ్ఞానప్రకాశం కలుగగానే ఈ విధంగా అనుకుంటాడు " ఇంత కాలము ప్రకృతి
అనుకుంటున్నాను. ఈ ప్రకృతి తన వికృతులతో నన్ను భ్రమింప చేసింది. కాని నీరు
నీటిలోని చేప వేరు అన్నట్లు ప్రకృతి వేరు, జీవుడు వేరు. నేను నిష్కళంకుడను,
నాకు రూపము లేదు, నాకు ఈ ప్రకృతితో సంబంధం లేదు కనుక నేను దానికి దూరంగా
ఉంటాను. అసలు ఈ తప్పు ప్రకృతిది కాదు నాదే, సంగమం అంటే ఏమిటో తెలియని
వాడిని ప్రకృతితో ఎందుకు కలిసాను. నాకు ఇన్ని రూపములు సంభవించడానికి కారణం ఈ
ప్రకృతే కారణం కదా ! ఈ ప్రకృతితో కలిసిన కారణంగా మమతా మమకారాలు చెలరేగి
జన్మ వెంట జన్మ వస్తున్నాయి. ఇప్పుడు నేను ఈ ప్రకృతిని వదిలి నిర్మలంగా
ఉన్నాను. అహంకారం మమత కారణంగా ప్రకృతి ఇన్ని రూపాలు ధరించడానికి కారణం
అయింది. నేను ఈ రెండింటిని వదిలితే ప్రకృతి నన్ను ఏమీ చెయ్య లేదు.
సోమరితనం, చెడు అలవాట్లయందు ఆసక్తి ప్రకృతి లక్షణములు. అందుకే ఈ ప్రకృతిని
వదిలి నిశ్చలానందాన్ని పొందాలి " ఇలా ఆలోచుస్తూ జీవుడు అక్షరత్వమును
పొందుతాడు. ధర్మనందనా ! పూర్వము ఈ విద్యను బ్రహ్మ వశిష్టుడికి చెప్పాడు, వశిష్ఠుడు నారదునికి చెప్పాడు, నారదుడు నాకు చెప్పాడు, నేను నీకు చెప్పాను. దీని వలన నీకు శాశ్వతానందం కలుగుతుంది.
వసుమంతుడు
భీష్ముడు ధర్మరాజుకు ఇంకా ఇలా చెప్పసాగాడు. ఒకరోజు వసుమంతుడు
అనే రాజు వేటకై అడవికి వెళ్ళి అక్కడ భృగువంశ సంజాతుడైన ఒక మునిని చూసి "
మునిపుంగవా ! ఈ లోకములో కాని పరలోకములో కాని ఆచరించతగిన ధర్మము ఏదో
చెప్పండి " అని అడిగాడు. అందుకు ఆముని " మహారాజా ! మనం ప్రతి రోజు చేసే
మంచి పనులు చెడ్డ పనుల వలన మనకు సుఖముదుఃఖము కలుగుతున్నాయి. అత్యాశతోను
పనులు చెయ్యాలనుకోవడం తప్పు. తియ్యటి తేనె కొరకు కొండమీదకు ఎగబాకుతున్నామని
అనుకుంటారు కాని అక్కడ నుండి జారితే విరగబడతాము తెలుసుకోరు. ధర్మాన్ని
జ్ఞానాన్ని నిర్మలమైన మనస్సుతో అభ్యసించాలి. ఎల్లప్పుడూ సత్సంగంతో గడపాలి.
అలా చేసిన మానవునికి ఇహలోక సుఖమే కాక పరలోకసుఖము ప్రాప్తిస్తుంది.
బ్రాహ్మణులకు హితమైన పనులు చెయ్యాలి. అర్హులకు దానమివ్వాలి. ఇచ్చిన తరువాత
దానికి బాధపడకూడదు. క్రోధమును కామమును వదలాలి. మనసు దృఢంగా ఉంచుకోవాలి.
మనసికంగా బలహీనుడైనందు వలన పూర్వము మహాభిషుడు బ్రహ్మలోకం నుండి భూమికి జారాడు. యయాతిమహారాజు
మనో ధైర్యము ఉండటం చేత ఆపదల నుండి బయటపడ్డాడు " అని చెప్పిన ముని మాటలకు
వసుమంతుడు కామక్రోధములను వదిలి మనోధైర్యము పొంది ధర్మ మార్గాన నడిచాడు.
యాజ్ఞవల్క్యుడు
ధర్మరాజు
" పితామహా ధర్మము అధర్మము అను బేధము లేనిది, చావు పుట్టుకలు లేనిది, సకల
సందేహములను నివృత్తి చేయకలిగినది, శుచియై, నిత్యమై, అవ్యక్తమై, ధుఃఖ
రహితమై, ఆనందమయమై, పరతత్వమై ఉంటుందో దానిని నాకు వివరించండి " అని అడిగాడు.
భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడు
యాజ్ఞవక్యుల మధ్య జరిగిన సంభాషణ గురించి వివరిస్తాను. సకలలోకములలోకెల్లా
విజ్ఞానఖని అయిన యాజ్ఞవల్క్యుడితో జనకుడు " మునీంద్రా ! ఇంద్రియములు,
అవ్యక్తము అయిన ప్రకృతి, బ్రహ్మము, పరతత్వము, పంచభూతములు ఎలా పుట్టాయి. ఎలా
లయమౌతాయి. ఆకాలమును గురించి వివరించండి " అని అడిగాడు. అందుకు యాజ్ఞవల్క్యుడు
" మహారాజా ! సృష్టిని, లయమును ప్రకృతి కల్పిస్తుంది. ఒక రోజులో పగలు పది
కల్పములు, రాత్రి ఒక కల్పము ఉంటాయి. పగలు సృష్టి జరుగుతుంది, రాత్రి లయము
జరుగుతుంది. ఈ లోకము లోని జీవరాశులకు జీవనాధారముగా ఓషధులు సృష్టించబడ్డాయి.
సృష్టికార్యము కొరకు బ్రహ్మ
సృష్టించబడ్డాడు. ఆ బ్రహ్మ పంచభూతములు సృష్టించాడు. వాటికి శబ్ధ, స్పర్శ,
రస, రూప, గంధములు అను గుణములను సృష్టించాడు. వీటిని గ్రహించడానికి పంచ
జ్ఞానేంద్రియములను పంచ కర్మేంద్రియములను సృష్టించాడు. ఈ ఇంద్రియములకు మనసు
అధినేత. జ్ఞానేంద్రియములైన కన్ను, ముక్కు, చెవి మనసు చేతనే విషయము
గ్రహిస్తాయి కాని స్వయముగా ఏమీ చేయలేవు. మిగిలిన అన్ని అవయమలు మనసుచేత
నియంత్రించబడతాయి. ఈ విషయము జ్ఞానులు అజ్ఞాలు సమానంగా గ్రహించగలరు.
ఇంద్రియములు విశ్రమించినా మనసు విశ్రమించదు. కనుక ఇంద్రియములను ప్రాపంచిక
విషయముల నుండి నిగ్రహించి మనసును అదుపులో ఉంచాలి. అది అభ్యాసము మీద
అలవడుతుంది.
ప్రళయము
ఇక
ప్రళయము గురించి వివరిస్తాను. రాత్రి కాగానే అవ్యక్తమైన ప్రకృతి అహంకార
పూరితుడైన పురుషుని ప్రభోదిస్తుంది. ఆ పురుషుడు 12 రూపములు ధరించి
సర్వభూతములను లయం చేస్తాడు. ఆ తరువాత భూమి అంతా జలమయమౌతుంది. ఆ జలమును
కాలాగ్ని ఆవిరి చేస్తుంది. కాలాగ్నిని వాయువు తుదముట్టిస్తుంది. వాయువు
ఆకాశంలో లయమౌతుంది. ఆ కాశం మనసులో లయమౌతుంది. ఆ మనసును అహంకార పూరితుడైన
పురుషుడు కబళిస్తాడు. ఆ అహంకారం అవ్యక్తమైన ప్రకృతిలో లీనమౌతుంది. ఇలా
రాత్రి జరుగుతుంది. తరువాత పగలు రాగానే తిరిగి పునఃసృష్టి జరుతుంది.
ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము
ఇక
ఆది భూతము, ఆది దైవతము, ఆధ్యాత్మము గురించి చెప్తున్నాను. మన శరీరంలోని
పాదము, ఆపానము, జననేంద్రియము, చేతులు, నాలుక ఆధ్యాత్మము. అవి వరుసగా నడచుట,
విసర్జించుట, సృష్టించుట, కార్యనిర్వహణ అనునవి అది భూతములు. వీటికి వరుసగా
విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు
అది దేవతలు. అలాగే కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము, చెవి ఆధ్యాత్మములు. వాటి
గుణములైన దృష్టి, రుచి, వాసనా, స్పర్శ, శబ్ధములు అధిభూతములు. వాటికి
వరుసగా సూర్యుడు, వరుణుడు, భూమి, వాయువు, ఆకాశము అదిదేవతలు. మనసు
ఆధ్యాత్మము, మనసు విషయాలను గ్రహించడం స్పందించడం అనేవి అది భూతములు. మనసుకు
అదిదేవత చంద్రుడు.
ఇది వేదప్రమాణము. బుద్ధి ఆధ్యాత్మము విషయ పరిజ్ఞానము, శాస్త్రపరిజ్ఞానము
దానికి అధిభూతములు. బుద్ధికి క్షేత్రజ్ఞుడు అదిదైవతము. అహంకారము
ఆధ్యాత్మము. బుద్ధికి అభిమానము, స్వాతిశయము అధి భూతము. దానికి అదిదేవత బ్రహ్మము.
ప్రకృతి పురుషుడు
ఇంక
ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తాను. ప్రకృతి తన ఇష్టం వచ్చిన విధంగా
త్రిగుణాల ఆధారంగా అనేక రకములైన వికృతులను ఒక ఆటగా పెంపొందిస్తూ ఉంటుంది.
ఒక దీపము అనేక దీపములు వెలిగిస్తున్నట్లు ఈ ప్రకృతి అనేక రూపములను
ఆవిష్కరిస్తుంది. సంతోషము, ఆనందము, ఆరోగ్యము, కోపరహితమైన స్వభావం, మంచి
నడవడి, పరిశుభ్రత, ప్రకాశవంతంగా ఉండటం, మనసు స్థిరంగా ఉండటం, అహింస, నీతి
నియమము, సిగ్గు, శ్రద్ధ, సత్యము, శుచి, ఆచారము, కరుణ, లోభరహిత నడవడి,
కామవాంఛలు, ఇతరుల మీద చాడీలు చెప్పని గుణం సత్వ గుణాలు. తగవులాడుట,
అహంకారము, గర్వము, కామవాంఛలు, కోపము, నిర్ధయ, మాత్సర్యము, భోగలాలసత, దుఃఖము
ఇవి రజోగుణ లక్షణాలు. సదా ఏడుపు, అధికమైన మోహంతో ఉండటము, ఎప్పుడూ తింటూ
ఉండటం, అనవసరమైన వాదనకు దిగడం, మూర్ఖత్వం, ఒకరితో ఒకరికి కలహాలు పెట్టడం
ఇవి తమోగుణ లక్షణాలు. జీవాత్మ ఈ గుణములకు అతీతుడు కాని జీవుడు అనేక
రూపములతో కళంకితుడౌతున్నాడు. జీవుడు చైతన్య మూర్తి ప్రకృతి చైతన్య
రహితమైనది. జీవుడి ప్రకాశంతో ఎప్పుడూ వెలుగుతున్నా జీవుడు ప్రకృతికి
వశవర్తియై ఉంటాడు. జీవాత్మ తన నిజ స్థితిని తాను తెలుసుకోలేదు. జీవాత్మ
ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధాన
కర్మలను ఆచరించి స్వర్గ లోక ప్రాప్తి పొందుతూ ఉంటుంది. రజోగుణ ప్రధాన
కర్మలను ఆచరించి మానవజన్మ ఎత్తుతుంది. తమోగుణ ప్రధానకర్మలను ఆచరించి
రౌరవాది నరకములను పొందుతుంది. తనను తాను తెలుసుకున్న జీవుడు ఈ త్రిగుణములలో
చిక్కు కొనక అంతర్ముఖుడై అక్షర రూపమైన ప్రబ్రహ్మ పదమును పొందుతాడు అని
యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.
జీవుడు జీవాత్మ
జనకుడు " మునివర్యా ! పురుషుడు చైతన్యవంతుడని ప్రకృతి జడమని చెప్పారు కదా దానిని వివరించండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " జనకమహారాజా ! సగుణము అగుణము కాదు. అగుణము సగుణము కాదు. త్రిగుణాత్మకము అవ్యక్త్యమైన ఈ ప్రకృతి చైతన్యవంతమైన జీవాత్మ
స్థితి ఎలా పొందుతుంది. జీవాత్మ సహజ స్థితి తెలుసుకునే జ్ఞానం ప్రకృతకి
లేదు. కాని పురుషుడికి ప్రకృతి దాని స్వభావము తెలుసు. కనుక ఈ ప్రకృతి
అచేతనము. పురుషుడు చేతనత్వం కలవాడు. సదా ప్రకృతిలో విహరిస్తున్న పురుషుడికి
దాని వికారములు అంటవు. ఇది ప్రకృతి పురుషుల సంబంధము. సదా నీటిలో ఉండే తామర
రేకులకు నీరు అంటదు. అలాగే పురుషుడు ప్రకృతిలో లీనమై ఉన్నప్పటికీ ప్రకృతి వికారములు అంటవు.
యోగము ప్రాణాయామము
జనకమహారాజా !
నీకిక యోగము గురించి చెప్తాను. సాంఖ్యము కలుగు జ్ఞానము యోగముతో కలిగే బలమూ
రెండూ సాటి లేనివి. కొంత మంది సాంఖ్యము యోగము వేరు వేరు అంటారు కాని నాను
మాత్రం రెండూ ఒకటే అని భావిస్తాను. 'మనోధారణ ప్రాణాయామము అనునవి రెండు ప్రధాన యోగములు. మొదటిది నిర్గుణము రెండవది సగుణము. మనో ధారణ అంటే మనసును ఏకాగ్రతగా ఉంచడం. ప్రాణాయామము
అనగా శ్వాసను క్రమపద్ధతిలో వదిలి పీల్చడం. ఇది మానవుడికి అసౌకర్యం
కలిగించదు. క్రమపద్ధతిలో ప్రాణాయామం చేస్తూ ఇంద్రియములను అదుపులో ఉంచుకున్న
వాడు యోగసిద్ధి పొందగలడు. ప్రాణాయామం చేసే సాధకుడు నియమ నిష్టలు
పాటించాలి. ప్రాణాయామముకు రోజూ కొంత సమయము పాటించాలి. శరీరముకు అసౌకర్యం
కలుగని రీతిలో ప్రాణాయామం అభ్యసించాలి. ఇలా ప్రాణాయామం పగలు రాత్రి
అభ్యసించాలి. దీని వలన లోపలి వెలుపలి శరీరం శుద్ధి పొందుతుంది. యోగసిద్ధికి
ప్రాణాయామము దానివలన కలిగే అంతః బాహ్య శుద్ధి మూలము. ఇది సగుణతంత్రం.
మనోధారణ నిర్గుణతంత్రము. ఇంద్రియములను మనసులో, మనసును అహంకారంలో,
అహంకారమును బుద్ధిలో, బుద్ధిని ప్రకృతిలో లీనం చేయడమే ధ్యానం. నిరంతరం
ధ్యానంలో నిమగ్నమైన వాడికి ముసలితనము లేదు. యోగికి మలినములు అంటవు, నిరంతర
ఆనందము పొందుతూ పరమాత్మ దర్శనం పొందుతాడు. యోగి గాలిలో పెట్టిన దీపంలా
నిశ్చలంగా ఉంటాడు. నిర్మలాకాశంలా ఉంటాడు, అటుపోటులకు చలించని సముద్రంలా
ఉంటాడు. అతడి చుట్టూ భయంకర శబ్ధాది మనసుని కలవర పెట్టే విషయములను పట్టించు
కొనడు. దీనినే యోగ మార్గం అంటారు. కాని ఈ మార్గంలో నడవడానికి ఎలాంటి
అలసత్వం పనికి రాదు. ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండాలి. ఈ యోగికి ఎవరికి అందని
మోక్షం లభిస్తుంది.
మరణం లోకాలు
మరణ సమయంలో ఈ యోగికి పాదముల నుండి ప్రాణములు పోయినట్లైన విష్ణుపదము,
పిక్కల నుండి పోయిన వసువులు ఉండే లోకమును, జానువుల (మోకాళ్ళ) నుండి పోయిన
సాధ్యులు ఉండే లోకము లభిస్తుంది, విసర్జకావయవము నుండి పోయిన సూర్యలోకము లభిస్తుంది, తొడల నుండి పోయిన ప్రజాపతిలోకము
లభిస్తుంది, జననేంద్రియముల నుండి పోతే భూలోకప్రాప్తి లభిస్తుంది,
పార్శ్వముల నుండి పోతే మరుత్తుల లోకము ప్రాప్తిస్తుంది, బొడ్డులోనుండి పోతే
చంద్రలోకము లభిస్తుంది, చేతుల నుండి పోతే స్వర్గలోక ప్రాప్తి లభిస్తుంది, వక్షస్థలం నుండి పోతే కైలాసప్రాప్తి
లభిస్తుంది, ముఖములో నుండి పోతే విశ్వదేవతలు ఉండే లోకం లభిస్తుంది. చెవుల
నుండి పోతే దిక్పాలకులు ఉండే లోకం లభిస్తుంది. ముక్కుల నుండి పోతే
వాయుదేవుడు ఉండే లోకం లభిస్తుంది. కళ్ళ నుండి పోతే అగ్ని దేవుడు ఉండే లోకం
లభిస్తుంది. కనుబొమల నుండి పోతే అశ్వినీ దేవతలుండే లోకం ప్రాప్తిస్తుంది.
నుదురు నుండి పోతే పితృ దేవతలు ఉండే లోకం లభిస్తుంది. తలపైభాగం
(బ్రహ్మరంధ్రం ) నుండి పోతే శాశ్వతానందం ఇచ్చే మోక్షం లభిస్తుంది.
మరణ సమయము
మరణసమయం ఆసన్నమైనప్పుడు ఆకాశంలో అరుంధతీనక్షత్రం కనిపించదు. ముక్కు చెక్కినట్లు కనపడినా, చంద్రుడు
మలినంగా కనపడినా అతడి ఆయుస్షు ఒక సంవత్సరమని తెలుసుకోవాలి. ముఖవర్ఛస్సు
పెరిగినా తరిగినా, తెలివితేటలు పెరిగినా తరిగినా అతడి ఆయువు ఆరునెలలే అని
తెలుసుకోవాలి, పూర్ణచంద్రుడిలో, సూర్యబింబంలో వెలితి కనపడితే అతడి
ఆయుర్ధాయం ఏడురోజులే అని తెలుసుకోవాలి. దేవాలయముకు వెళ్ళినప్పుడు దేవుడికి
సమర్పించిన పుష్పములు, సుగంధద్రవ్యములు దుర్ఘంధం వెదజల్లితే అతడి ఆయుస్షు
ఆరునెలలు మాత్రమే చెవులు ముక్కు వాలిపోయినా దంతములు రంగుమారినా కళ్ళలో
కాంతి సన్నగిల్లినా, శరీరం నల్లబడ్డా అతడికి తక్షణమే మృత్యువు అని
తెలుసుకోవాలి. మానవుడు అంత్య కాలంలో చేరినప్పుడు ఏ కారణం లేకుండానే కళ్ళలో
నుండి నీరు కారుతూ ఉంటుంది. తలమీద నుండి పొగలు సెగలు వచ్చినా అతడికి చివరి
దశ ఆసన్నమైనదని తెలుసుకోవాలి. యోగి అయిన వాడు ఈ సూచనలు గమనించి నిరంతర
ధ్యానసమాధిలో ఉండి జీవుడిని ప్రమాత్మలో కలపడానికి ప్రయత్నిస్తాడు. అటువంటి
యోగి ప్రాణములు విడువగానే పరమాత్మలో లీనమై శాశ్వతానందం పొందుతాడు.
పరతత్వము
జనకమహారాజా ! పరతత్వము గురించి వివరిస్తాను. ఈ ప్రశ్న సూక్ష్మమైఅది కనుక వివరిస్తాను. నేను సూర్యుడిని గురించి తపస్సు చేసాను. సూర్యుడు నాకు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని చెప్పాడు. యజుర్వేదము
అధ్యయనము చేసే శక్తిని ప్రసాదించమని నేను కోరాను. యజుర్వేదాధ్యయన శక్తి
ప్రసాదించే సమయాన నన్ను నోరు తెరవమని చెప్పాడు నేను నోరుతెరవగానే వాగ్దేవి
నానోట్లో ప్రవేశించింది. నా శరీరం తాపంతో దహించుకు పోయింది. సూర్యుడు నన్ను
చూసి కొంచెం సమయము ఓర్చుకుంటే చల్లబడుతుంది అన్నాడు. తరువాత సూర్యుడు " ఓ
విప్రుడా ! నీకు వేదవిద్య లభిస్తుంది. నీకు సాంఖ్యము యోగము లభిస్తుంది. నీ
మనసు ఉల్లాసంగా ఉంటుంది " అని పలికి సూర్యుడు వెళ్ళాడు. నేను నా స్వగృహముకు
వెళ్ళి సరస్వతీదేవిని ఉపాసించాను. నాకు సరస్వతీదేవి
ప్రత్యక్షం అయింది. ఆ దేవిని చూడగానే నాకు యజుర్వేదము స్పురణకు వచ్చింది.
నేను యజుర్వేదమును అధ్యయనం చేసి శిష్యులకు నేర్పుతూండగా కొంత కాలం
గడిచింది.
విశ్వావసుడు
ఇంతలో
విశ్వావసుడు అనే గంధర్వుడు ఒక రోజు నావద్దకు వచ్చాడు. నేను అతడికి అతిథి
సత్కారాలు చేసిన తరువాత అతడు నన్ను " విశ్వము అనగా ఏమి ? అ విశ్వము అనగా
ఏమి ? మిత్రావరుణులు ఎవరు ? జ్ఞానము జ్ఞేయము అనగాేమి ? తపస్సు అనగా ఏమి ?
తపస్సు కానిది ఏమి ? సూర్యుడు అతి సూర్యుడు ఎవరు ? విద్య అనగా ఏమి ? అవిద్య
అనగా ఏమి ? తెలుసుకో తగినది ఏది ? తెలుసుకో కూడనిది ఏమి ? కదిలేవి ఏవి ?
కదలనివి ఏవి ? వేదములు ఆమోదించినవి ఏవి ? నాకు వివరించాండి " అని అడిగాడు.
నేను " భూత వర్తమాన కూడిన అవ్యక్తమైన ప్రకృతియే విశ్వము అంటారు.
గుణరహితుడైన పురుషుడు అవిశ్వము. మిత్రావరుణులే పురుషుడు, ప్రకృతి. జ్ఞానము,
జ్ఞేయము, తపస్సు, తపస్సు కానిది, సూర్యుడు, అతి సూర్యుడు, ఇవన్ని ప్రకృతి
పురుషులు. విద్య, అవిద్య, తెలుసుకో తగినది, తెలుసుకో లేనిది, కదిలేది,
కదలనిది వరుసగా ప్రకృతి పుషులను తలపిస్తాయి. అజములు, అవ్రణములు, అక్షయములు,
అతీద్రియములు ప్రకృతి పుషులు అంటారు. ఈ రెండు తత్వములు కలిసిన రోజు
ప్రకృతి పురుషుని వలె గోచరిస్తుంది. వేదార్ధమును తెలుసుకో లేని వాడు వేదము
చదివినా ప్రయోజనం లేదు కేవలం కంఠశోష మిగులుతుంది. వేదముల అర్ధము, సారము
తెలుసుకున్న పండితుడు క్షరము అక్షరమైన పరతత్వము గురించి తెలుసుకోకలడు.
అప్పుడు క్షరమును వదిలి పెట్టి అక్షరయోగము కొరకు ప్రయత్నిస్తాడు. 25వ తత్వమైన అక్షరతత్వము తెలుసుకున్నవాడు పరతత్వము
గురించి తెలుసుకుంటాడు. ప్రకృతి పురుషులను వేరు వేరుగా చూడవచ్చు. 25వ
తత్వము అయిన అక్షర తత్వము 26వ తత్వమైన పరతత్వము ఒకటే. 26వ తత్వమే
పరమేశ్వరుడు అతడే పురుషోత్తముడు. అది నిరంజనుడు, నిత్యము, జ్ఞానము, ఆనంద
స్వరూపము " అని యాజ్ఞవల్క్యుడు పలికాడు.
పురుషుడు ప్రకృతి
విశ్వావసుడు " 25వ తత్వము గురించి దానికన్న మిన్న అయిన పరతత్వము గురించి నారద, జైగీష, దేవల, కపిల, సుమంత, పైల
మొదలైన మహా మునుల గోష్టిలో విన్నాను. కాని అర్ధము చేసుకోలేక పోయాను కనుక
మిమ్ము ఆశ్రయించాను. దయచేసి వివరించాండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు "
విశ్వావసా ! సమయంలో నీ మనసులో చేరిన మలినంవలన నీకు అర్ధము కాలేదు. కనుక
మనసు నిశ్చలం చేసి విను. అవ్యక్తమైన మైన ప్రకృతి పురుషుడు వేరు అని తెలుసు
కదా ! పురుషుడు ప్రకృతితో చేరి అనేక రూపములు పొందుతూ జనన మరణ చక్రంలో
ఇరుక్కు పోతూ ఉంటాడు. పురుషుడిని జీవుడు అంటారు. ప్రకృతి పురుషుడిని
చూడలేక పోయినా పురుషుడు ప్రకృతిని చూస్తూ అందులో లీనమై ఇక పరమాత్మ వైపు
చూడ లేడు. కాని పరమాత్మ ఈ పురుషుడిని ప్రకృతిని సాక్షీ భూతంగా చూస్తూ
ఉంటాడు. పురుషుడు పరమాత్మను దర్శించే ఉపాయము చెప్తాను. పురుషుడు ప్రకృతితో
స్నేహం చేస్తూ ప్రకృతే తాను అనుకుని క్రమంగా ప్రకృతిలో లీనమౌతాడు. అందువలన
అహంకారం పెరుగుతుంది. ప్రకృతిలోని వస్తువుల మీద మమకారం పెరిగి వాటిని
పొందాలన్న కోరిక పెరుగుతుంది. పురుషుడు ప్రకృతిని చూస్తున్నంత కాలం
పరమాత్మను దర్శించ లేక జీవుడిగా మిగిలి పోతాడు. ఎప్పుడైతే పురుషుడు తానే
ప్రకృతి ప్రకృతే తాను అన్న భావన విడిచి నీటిలో ఉన్న తామరలా తాను వేరు నీరు
వేరు అనుకుంటాడో అప్పుడు ప్రకృతిలో సంచరిస్తున్న పురుషుడు తాను వేరు
ప్రకృతి వేరు అని తెలుసుకుని పరమాత్మను దర్శిస్తాడు. పురుషుడికి జనము,
వృద్ధాప్యము, మరణము తప్పవని తెలుకుని యోగి సాంఖ్యమును, యోగమును ఆశ్రయించి
మమకారాన్ని వదిలి పునర్జన్మ లేని పరతత్వాన్ని పొందుతాడు. ప్రకృతి వేరు తాను
వేరని పురుషుడు భేదం గ్రహించినప్పుడే పరమాత్మను చేరగలడు. పురుషుడు వేరు
పుషోత్తముడు వేరని సామాన్యులు అనుకుంటారు కాని విజ్ఞులకు అభ్యాసం వలన
ఇద్దరూ ఒకరే అని గ్రహించగలుగుతారు. అజ్ఞాని మాత్రం పురుషుడు వేరు
పురుషోత్తముడు వేరని అనుకుంటారు. మమకారమును పోగొట్టుకున్నప్పుడు
పురుషోత్తముడిని గురించి తెలుసుకోగలుగుతారు " అని చెప్పాడు. యాజ్ఞవల్క్యుని
బోధలకు సంతృప్తి చెందిన విశ్వావసుడు వెళ్ళి పోయాడు.
యాజ్ఞవల్క్యుడు
యాజ్ఞవల్క్యుడు
జనకుడితో ఇంకా ఇలా చెప్పాడు. " జనక మహారాజా ! నేను చెప్పిన విధముగా
ఆచరించిన మానవులు, దేవతలు పురుషోత్తముని గురించి తెలుసుకోగలరు. జనన
మరణములను జయించడమే ముక్తి అంటారు. జజన మరణాలను జ్ఞాన సముపార్జన వలన మాత్రమే
జయించగలరు. కనుక జ్ఞాన సముపార్జన ముఖ్యము. జ్ఞానము గురుముఖతః లభ్యమౌతుంది.
గురువుకు కులము అనేది ముఖ్యము లేదు. జ్ఞానమును ఉపదేశించిన వాడే గురువు.
గురువు వద్ద అత్యంత శ్రద్ధాసక్తులు శిష్యునకు లేకున్న జ్ఞానము లభించదు కనుక
శిష్యుడికి శ్రద్ధాసక్తి ముఖ్యము. అజ్ఞానంతో జనన మరణ చక్రంలో ఇరుక్కున్న
జీవుడు జ్ఞానంతో మాత్రమే ఆ చక్రము నుండి విడివడగలడు. జనకమహారాజా ! నీవు ఇక
నేను చెప్పినవి శ్రద్ధగా ఆచరించిన మోక్షమును పొందగలవు " అని చెప్పాడు. ఆ
మాటలకు జనకుడు అమితానందం పొందాడు. ధర్మనందనా ! జనకుడికి యాజ్ఞవల్క్యుడు
చెప్పిన మాటలు వింటివి కదా నీవు కూడా వాటిని శ్రద్ధగా ఆచరించి ముక్తిని
పొందు " అని భీష్ముడు పలికాడు.
గృహస్థధర్మము మోక్షము
ధర్మరాజు " పితామహా ! గృహస్థధర్మాలను విడువకుండా మోక్షసాధన సాధ్యమేనా ? వివరించండి. " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! నీకు జనకుడికి సులభకు మధ్య జరిన సంభాషణ వివరిస్తే ఈ విషయము అవగతము ఔతుంది. జనకుడు యోగధర్మంలో చిక్కు పోయినప్పుడు ఆయన రాజ్యంలోని సులభ
అనే స్త్రీ ఆయన జ్ఞాన పరిజ్ఞానం పరీక్షించాలని అందమైన భిక్షుకి వేషంలో ఆయన
సభకు వచ్చింది. జనకమహారాజు ఆమెకు కడుపార భోజనం పెట్టించాడు. సులభ ఆయనను
పరీక్షించాలని తన అందచందాలతో ఆకర్షించాలని ప్రయత్నించింది. జనకుడు
నవ్వుకుని " అమ్మా ! నీవు ఎవరు ? ఎక్కడ నుడి వచ్చావు ? ఇక్కడకు
వెళుతున్నావు ? నీ భర్త ఎవరు ? నీవు ఏమి చేస్తుంటావు ? అని అడిగాడు "
అందుకు సులభ మౌనం వహించింది. జనకుడు " సరే నేను చెప్పేది విను. అమ్మా నేను పంచశిఖుడు
అనే మహర్షి శిష్యుడను. ఆయనద్వారా నేను సాంఖ్యము, యోగము, రాజ్యపాలన అనే
మూడు దీక్షలు అభ్యసించాను. పైన చెప్పిన మూడు మోక్షమార్గములు కనుక
పరతత్వాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నాను. మోక్షముకు వైరాగ్యము మూలము.
వైరాగ్యమును దృఢమైన జ్ఞానముతో లభిస్తుంది. నేను వైరాగ్యమును అందువలన
జ్ఞానమును పొందాను. రాజ్యపాలన చేస్తూ రాజ్య సుఖముల మధ్య ఉండి కూడా
నిస్సంగుడనై తిరుగుతున్నాను. ఎవరైనా నా కుడి భుజానికి చందనము రాస్తూ ఎడమ
భుజము నరికినా నేను కోపించను నాకు మట్టి బంగారము రెండూ సమమే. మోక్షగాములు
జ్ఞానము, కర్మ రెండింటిని గురించి అత్యంత నిష్టతో ఆచరించాలని చెప్తారు.
నాకు మాత్రం మా గురువుగారి శాసనమే అత్యంత నిష్ట. కొందరు గృహస్థధర్మము
సన్యాసానికి ఆడ్డు అని అనుకుని సన్యాసం స్వీకరించినా మనసు గృహస్థజీవితాన్ని
మరువ లేదు. మనసులో కోరికలు పెట్టుకుని సన్యాసం స్వీకరించినా ఫలితం లేదు.
కేవలము దండము కమండలము ధరించి తల గొరిగించుకుని కాషాయము కట్టినంత మాత్రాన
మోక్షము రాదు. ఆత్మజ్ఞానము పొందాలి. గృహస్థాశ్రమంలో ఉండి కూడా ఆత్మజ్ఞానము
పొంద వచ్చు. అలాంటి వారికి చివరకు మోక్షము లభిస్తుంది.
సన్యాసము
సన్యాసం
స్వీకరిస్తే గృహస్థాశ్రమంలో ఉన్న దుఃఖములు తొలగి పోతాయని చాలా మంది
సన్యాసం స్వీకరిస్తారు. కాషాయం ధరిస్తారు. రాజుగా నాకు పట్టే ఛత్రం వంటిదే
కాషాయము ధరించడము. సుఖాన్నిచ్చినా దుఃఖాన్ని ఇచ్చినా నాకు రాజలాంఛనాలు
తప్పవు. సన్యాసులకు కాషాయం మోక్షం ఇచ్చినట్లు నాకు ఛత్రమూ మోక్షం ఇస్తుంది.
కనుక మోక్షము జ్ఞానము వలన వస్తుంది కాని కాషాయ వస్త్రధారణా కమండలము
ఇవ్వదు. నేను రాజునైనా ఈ ప్రాపంచిక సుఖములను త్యజించి మోక్షమార్గాన్ని
అవలింబించాను. కనుక నాకీ రాజలాంఛనాలు అడ్డురావు కాని నీవు ఎవరు ? ఎందుకు
నన్ను పరీక్షించ వచ్చావు. దాని వలన నీకు కలిగే ప్రయోజనము ఏమిటి ? ఓ మగువా !
నీవు బ్రాహ్మణ స్త్రీవి, యోగినివి, పరుల భార్యవు ప్రస్తుతము నీవు భర్త
వద్ద లేనట్లుంది. నేను క్షత్రియుడను రాజును గృహస్థాశ్రంలో ఉన్న వాడిని.
నిష్టగా ఆచార వ్యవహారములు పాటించు వాడిని. నీవు నా మీద మరులు కొనడం
అపకీర్తి హేతువు ఇందుకు బాధ్యురాలవు నీవే. ఇందుకు ఫలితము నీదే. నన్ను కోరి
నీవిలా సుందర రూపంలో వచ్చావు. యోగశక్తిని ఉపయోగించి అధర్మంగా కోరిక
తీర్చుకోవడానికి మలినమైన బుద్ధితో నీ స్వస్వరూపము దాచి నా వద్దకు వచ్చావు.
ఇది యోగినులు అవలంబించే పద్ధతి కాదు. నీ కుటిల ప్రయత్నము మాను. ఇంతటి చిన్న
వయసులో నీకీ యోగవిద్య ఎలా అబ్బింది " అని అడిగాడు. అందుకు బదులుగా సులభ "
మహారాజా ! చెప్పే వాడికి వినే వాడికి ఇంపైన మాటలే మంచి మాటలు ఔతాయి కాని
మిగిలినవన్నీ మూర్ఖపు మాటలే. ఈ ప్రపంచం పంచ భూతాత్మకము. పంచ భూతములు
కలిసినట్లే కనిపించినా వేటికి అవి స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉంటాయి ఒక
దాని మీద ఒకటి ఏదీ ఆధారపడదు. శరీరంలో పంచ భూతములు, పది ఇంద్రియములు మనసు
ఇవన్నీ కలిసినట్లు ఉన్నా వేటికి అవే ప్రత్యేకత కలిగి ఉంటాయి. అలాగే
మానవులందరూ పైగుణాలు కలిగి కలిసినట్లు కనిపించినా ఎవరికి వారే ప్రత్యేకత
కలిగి ఉంటారు. ఈ చైతన్యము జవనాశ్వము వలె పరుగులు తీస్తూ ఉంటుంది కనుక ఎవరు
ఎక్కడ ఉంటారో ఎక్కడి నుండి వచ్చారో ఎవరికి తెలుసు. మహారాజా ! నిన్ను నీవు
ఎలా దర్శిస్తావో లోకంలోని ప్రజలందరిని అలాగే దర్శించాలి కదా ! అటువంటి నీవు
నన్ను చూసి నీవు ఎవరు ? అలా వచ్చావు ? అని అడగవచ్చునా ! క్షత్రియుడవైన
నీవు నీ పాలనలో ఉన్న ప్రజలను మంచివారు, మధ్యస్థులు, చెడ్డవారని విభజించి
వారిని సామ, దాన, బేధ, దండోపాయాలతో పాలిస్తుంటావు అలాగే శత్రువులను
జయిస్తావు.అటువంటి నీవు ముక్తి మార్గంలో పయనించే యోగివి ఎలా ఔతావు ? ముక్తి
మార్గం అంటే ఇదేనా ? రాజా ! విషయవాంఛలకు, జయాభిలాషకు లోబడిన నీవు యోగివి
కావు" అన్నాడు.
పరిక్షార్ధం సులభ వాదన పొడిగించడం
సులభ
" మహారాజా ! నీకు నువ్వు జ్ఞానివి అనుకుంటున్నావు. అది ఒక మానసికరుగ్మత
కనుక నీ బంధువులకు చెప్పి వైద్యం చేయించు. లేకున్న నాకిలా నీతులు చెప్పవు.
ఇవన్నీ విన్న తరువాత కూడా నీవు నేను ఎందుకు ముక్తుడను కాను అని అడిగిన నేను
చెప్పే సమాధానము విను. రాజువైన నీవు సదా ధర్మార్ధ కామాల గురించి ఆలోచిస్తూ
రాజ్య తంత్రముల గురించి ఆలోచిస్తూ ఉంటావు. మేలుకొనమని, స్నానాదులు
చెయ్యమని, భోజనం చెయ్యమని సేవకులు చెప్పిన కాని వినవు. నీ చుట్టూ ఉన్న
మంత్రులు, సామంతులు, సుందరీ మణులు నీ మెప్పును ఆశిస్తూ నీ పనులను నిన్ను
చేసుకోనివ్వరు. నీకు ఏ పని చెయ్యడానికి స్వతంత్రం ఉండదు నీకు నచ్చిన భోజనం
కూడా నీ అంతట నిన్ను తిననివ్వరు. నీవు అర్హత అనర్హత తెలుసుకుని దానం
చెయ్యాలి. కనుక ధనం ఎలా కూడబెట్టాలో ఆలోచన చేస్తూ ఉండాలి. నీ పక్కనే ఉంటూ
గోతులు తవ్వే వారిని సదా ఒక కంట కనిపెట్టే ఉండాలి. కనుక రాజా ! రాజులకు
సుఖాలు తక్కువ దుఃఖాలు తక్కువ. అలాంటి రాజులు ముక్తి మార్గంలో ఎలా
ప్రయణించగలరు. కనుక నువ్వు ముక్తి మార్గంలో పయనిస్తున్నానని చెప్పడం
అబద్ధం. రాజా ! పంఛశిఖ మహర్షి వద్ద ఉపదేశం పొందిన నీవు నేను నీ దగ్గరకు
రాగానే అసహ్యించుకున్నావు. ఇదేనా ద్వందమును వదిలి ముక్తి మార్గంలో
ప్రవర్తించే యోగులు ఆచరించే విధానం. మోక్షాసక్తుడు ద్వందమును వదలాలి,
దేనియందు ఆపేక్ష లేక నిర్వికారంగా, చెలించని మనసుతో ఉండాలి. యతులు
జనావాసాలను వదిలి అరణ్యవాసం చేయాలి. నీవు ముక్తుడవని పొరపాటు పడి
నిర్వికారుడవని అనుకుని నీ మనస్సులో ప్రవేశించాను. నేను నిన్ను నా అవయములతో
ముట్టుకోలేదు అయినా నీవు నన్ను చూసి భయపడి దూషించావు. అలా ఎందుకు చేసావు ?
రాజా ఈ సభలోని పెద్దలు వింటూ ఉండగా నీవిలా మాట్లాడడం న్యాయమా ! ఎదుటి
వారిని ఇలా కించపరచడం ధర్మమా ! అత్యంత గోప్యమైన స్త్రీ పురుష సంబంధాల
గురించి బహిరంగంగా మాట్లాడటం మీ కీర్తికి, గొప్పతనానికి హాని కదా ! ఇది
ధూర్తలక్షణం కాదా ! మహారాజువైన నీకు ఇలాంటి నికృష్టులకు కూడా తగని మాటలు
తగునా ! తామరాకు మీద నీటి బొట్టులా జీవిస్తున్న నా వంటి యోగిని గురించి
తెలుసుకోలేని నువ్వు పంఛశిఖమహర్షి శిస్యుడని చెప్పుకోవడం అబద్ధం కాదా !
రాజా ! నీవు గృహస్థ ధర్మానికి, మోక్షమార్గానికి కూడా దూరం అయ్యి రెండింటికి
చెడిన రేవడివి అయ్యావు. అన్ని తెలుసును అనుకుని భ్రమలో పడి బ్రతుకుతూ
ఉన్నావు. ముక్తులు ముక్తులు కలవడం సాధారణం. ఆకాశంలో ఆకాశం కలిసినట్లు
శూన్యంలో శూన్యం కలిసినట్లు ముక్తి మార్గంలో ఉన్న వారిని చూసినప్పుడు
ముక్తిమార్గులు కలిసి పోతారు. యోగినిని అయిన నన్ను నీవు చూసినప్పుడు
చలించావు కనుక నీవు ముక్తి మార్గమున చరించడం అబద్ధము. మనము ముక్తులము కాదని
అనుకున్నా మన కలయిక అధర్మం కాదు. నేను ప్రశస్తమైన చరిత్ర కలిగిన ప్రధన
మహారాజు వంశ సంజాతని. నేను క్షత్రియ కాంతను. నా పేరు సులభ. నా పూర్వీకులు
శతశృంగ పర్వతముల మీద ఎన్నో యజ్ఞ యాగములు చేసారు. సాక్షాత్తు దేవేంద్రుడే
వారి వద్దకు వచ్చి పరమార్ధము గురించి సద్గోష్ఠి చేసేవాడు. నాకు వివాహం
చేసుకోదగ్గ పురుషుడు లభించక మోక్షమార్గంలో పయనిస్తున్నాను. నాను క్షత్రియ
వనితను కనుక మన కలయిక అధర్మం కాదు. ఇక దాపరికం ఎందుకు నేను నిన్ను
పరీక్షించ వచ్చాను. కాని నీవు ముక్తి మార్గంలో పయనించడం లేదని
తెలుసుకున్నాను " అని అనర్గళంగా చెప్పిన సులభ జనకుడి ముఖం చూసి నవ్వుతూ "
జనక మహారాజా ! నీవు ముక్తి మార్గంలో పయనిస్తున్నావా లేదా అని పరీక్షించడం
అగ్ని వేడిగా ఉంటుందా చల్లగా ఉంటుందా అని పరీక్షించడం వంటిది. నేను కేవలం
అజ్ఞానంతో ఇలా ప్రవర్తించానని అనుకో ! జనకమహారాజా ! నీ మాటలలో ఇసుమంతైనా
అసత్యం, దోషము లేదు. మునులతో కూడా కీర్తింపతగిన నీకు మోక్షము కరతలామలకం.
నేను రాగానే మీరు నన్ను ఎంతో గౌరవించారు. అందుకని మీతో ఇలా మాట్లాడితే ఎలా
ఉంటుందో అని హాస్యముకు ఇలామాట్లాడాను. నేను చెప్పినవన్నీ అబద్ధములు నేను
నిన్ను పరీక్షించడానికి వచ్చానన్నది మాత్రమే నిజం. సౌజన్య మూర్తులైన మీరంతా
నన్ను మన్నించండి " అన్నది సులభ. ఆ మాటలకు జనకుడు మంత్రులు ఇతర సభికులు
తేకగా ఊపిరి తీసుకున్నారు. సులభ వాఖ్చాతుర్యానికి అభినందించారు. ఆరోజుకు
సులభ అక్కడే ఉండి మరునాటికి తన దోవన తాను పోయింది " అని చెప్పిన భీష్ముడు " ధర్మనందనా ! జనక సులభల సంవాదనతో నీ సందేహం తీరింది కదా ! " అని అడిగాడు.
శుకుడు వైరాగ్యము
ధర్మరాజు " పితామహా ! వ్యాసపుత్రుడైన శుకునకు వైరాగ్యము ఎలా కలిగింది " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! వ్యాసుడి కుమారుడైన శుకుడు
మొదట సాధారణంగానే ఉన్నాడు. అందరితో కలిసి పోయి శరీరము శాశ్వతం అనుకుని
తనకు వ్యాధులు, మరణం ఉంటాయన్న విషయం మరచి విషయవాంఛలలో మునిగి పోయాడు. అది
చూసిన వ్యాసుడు
తన కుమారుడికి వైరాగ్యం బోధిస్తూ " కుమారా ! శుకా ! నీవు ఇంద్రియములను,
మనసును తప్పుమార్గమున పోనీయక అదుపులో ఉంచుకుని వాటిని సరి అయిన మార్గములో
పెట్టు. కోపరాహిత్యం, సత్యం పలకడం, ఇంద్రియములను అదుపులో పెట్టుకోవడం,
ధర్మమార్గంలో నడవడం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, తపస్సు చేయడం, అహింసామార్గము
అవలంబించడం ఇవి ధర్మమార్గమాలు. వీటిని అవలంబిస్తూ ఆకలి దప్పులను అదుపులో
పెట్టుకో. నీవు సంపాదించిన బిక్ష ముందు దేవతలకు సమర్పించి తరువాత అతిథులకు
పెట్టి తరువాత నీవు భుజించు. పంజరంలో పిట్టలా శరీరంలో ఉన్న జీవుడిని మరిచి
నీ ఇచ్ఛ వచ్చిన రీతిలో చరించడం ధర్మము కాదు. ఒక్కోరోజు గడిచే కొద్దీ కొంత
ఆయుస్షు లెక్కన నీ ఆయుస్షు తరుగుతూ ఉంటుంది. చివరకు మృత్యువు నిన్ను
కబళిస్తుంది. ఆ విషయం ఎరుగక నిద్రావస్థలో ఉండటం నీకు ధర్మమా ! ఈ శరీరం రక్త
మాంసమయం. జగతిన ఉన్న ప్రాణులన్నీ అంతే. శరీరక సుఖములకు అలవడిన మానవుడు
పెద్దల మాటను పెడచెవిన పెట్టి లోకము గురించి తలపక తామనుకున్నదే నిజమని
భ్రమిస్తుంటారు. శారీరక సుఖమే ప్రధానమని అనుకోవడంలో ముందుగా సుఖం ఉన్నా
తరువాత ఆపద కలిగిస్తుంది. కనుక బుద్ధిమంతులు నడిచే తోవను వదిలి
దుర్మార్గులు నడచు తోవను నడవడం నీకు ధర్మంకాదు. ధర్మమార్గాన నడిచే సజ్జనుల
బాటలో నడుస్తూ వారి ఉపదేశములను విను. సాలెపురుగువలె నీ చుట్టూ బంధనం
కలిగించుకోవడం అజ్ఞానుల లక్షణం. సంసారంలో ఇంద్రియములే జలం, కామ, క్రోధ,
లోభములే మొసళ్ళు. ఆ సాగరం దాటడానికి జ్ఞానం ఒక్కటే మార్గం. మూఢునిలా
కోరికలతో మనసుని తృప్తి పరుస్తూ ఉంటే నీకు తెలవకుండా మృత్యువు నిన్ను
కబళిస్తుంది. నీవలా ఉండ వద్దు. బ్రాహ్మణత్వం పొందడం చాలా కష్టం. నీ
పూర్వజన్మ సృకృతం వలన నీకీ జన్మ లభించింది. నీవు దానిని వృధా చేస్తున్నావు.
నీవు ఇకనైనా దుష్టసాంగత్యం వదిలి త్పస్సు, ఇంద్రియ నిగ్రహం, నిశ్చలత్వం,
వివేకము మొదలైన మంచి గుణములను అలవరచుకో. కుమారా ! నీవు బ్రాహ్మణ జన్మ
ఎత్తింది శారీరక సుఖము అనుభవించడానికి కాదు. నియమ నిష్టలతో జీవితము గడిపి
పరలోక సుఖములు అనుభవించడానికి కదా ! ఇహలోక కామ సుఖములు అనుభవించడం తన మెడకు
తాను ఉరి వేసుకోవడమే కదా ! వివేకవంతులు ఆపని ఎన్నటికి చెయ్యరు. ఒక వేళ
చేసినా ఆ ఉరిత్రాడు తెంచుకుని జ్ఞానమార్గంలో నడవడం అలవర్చుకోవాలి. మూర్ఖులు
మాత్రమే ఈ విషయము గ్రహించ లేక ఉరిత్రాడుకు వ్రేలాడుతూ ఉంటారు. కుమారా !
శరీరంలో ప్రాణం ఉన్నంత వరకే నిన్ను భార్యాబిడ్డలు, మిత్రులు అనుగమిస్తారు. ఆ
తరువాత నిన్ను మరచి పోతారు. కనుక వారితో పొద్దుపుచ్చక వైరాగ్యం
అలవరుచుకుని నిన్ను నీవు తెలుసుకుని ఆత్మసాక్షార్కారం చేసుకో. ముసలితనము,
మరణము పుట్టినప్పటి నుండి నిన్ను వెన్నంటుతూ ఉంటాయి. కనుక మృత్యువు నీ
కొరకు వేచి ఉండక ఎప్పుడైనా కబళించ వచ్చు మంచి పనులు చేయడానికి ముహూర్తం
కొరకు ఎదురుచూడ వద్దు. కుమారా ! భార్యా బిడ్డలు నీ వెంట రారు. నిన్ను
శ్మశానానికి మోసుకు వెళ్ళి అక్కడ కాల్చి వారిదారిన వారు పోతారు. ఇన్ని
రోజుల నుండి వెంట ఉన్న నిన్ను అనుగమించని వారి కొరకు తాపత్రయపడుతూ
వల్లమాలిన మమకారం పెంచుకోవడం ఎందుకు ? కాలం ఈ లోకాన్ని అతలాకుతలం చేస్తుంది
కనుక ధైర్యంతో ప్రాపంచిక విషయములను వదిలి అంతర్ముఖుడవు కా ! కుమారా ! నీవు
ఈ జన్మకు ముందు ఎన్నో జన్మలు ఎత్తావు. ఆ జన్మలో భార్యా బిడ్డలు, మిత్రులు
ఉన్నారు వారూ మరణించారు. అలాగే ఈ జన్మలోని వారూ మరణించే వారే ! కనుక నీవూ,
నీ భార్యా బిడ్డలు, బంధు మిత్రులు నిరంతరం పుడ్తూ చస్తూనే ఉంటారు. ఈ సత్యం
తెలుసుకో . వివేక వంతులు" నేను ఎవరిని ? ఎవరి వాడను ? ఎక్కడ నుండి
వచ్చాను ? ఎక్కడకు పోతాను ? పుట్టక పూర్వము ఎవరి వాడనో తెలియదు. మరణించిన
తరువాత ఎవరి వాడనో తెలియదు. ఎక్కడ నుండి వచ్చానో తెలియదు. ఎక్కడకు పోతానో
తెలియదు. అని తలచిన నీకిక బంధనాలు ఉండవు. కష్టాలు భార్యమీద వ్యామోహంతో
మొదలై పరలోకం వరకు వెన్నంటి ఉంటాయి. కనుక వివేకవంతులు భార్యా వ్యామోహంలో
పడరు. అనుభవించకుండా, దానం చెయ్యకుండా దాచుకున్న ధనం ఎందుకు ? ఇంద్రియములను
జయించలేని ధనం, దర్పం ఎందుకు. ధర్మప్రవర్తన లేని వేదాధ్యనం లేని
శాస్త్రవిజ్ఞానం నిష్ప్రయోజనం. ఇంద్రియములను జయించ లేని ఆత్మ దర్శనం
ఎందుకు. కనుక కుమారా ! సంసారం త్యజించి జితేంద్రియుడవు కమ్ము " అని
ఉపదేశించాడు. ధర్మనందనా ! ఇలా తండ్రి వలన బోధింపబడిన వాడై శుకుడు వైరాగ్యం
పొందాడు " అని భీష్ముడు చెప్పాడు.
శుకజననం
ధర్మరాజు " పితామహా ! శుకుడు వ్యాసుడి కుమారుడని చెప్పారు కదా ! శుకుడి జన్మవృత్తాంతం ఏమిటి ? అతడి తల్లి ఎవరు ? వివరించండి " అని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! పూర్వము మేరు పర్వతంలో కర్ణికార వనము అని ఒక వనము ఉంది. ఆ ప్రాంతంలో వ్యాసుడు పుత్రుడి కొరకు శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు. శివుడు
ప్రత్యక్షమై ఏమి వరం కావాలని అడిగాడు. అప్పుడు వ్యాసుడు జలము, వాయువు,
ఆకాశము, భూమి, అగ్నితో సమానుడైన పుత్రుడు కావాలని శివుని కోరాడు. అలాగే
ఇస్తాను అని శివుడు వరమిచ్చి అంతర్ధానం అయ్యాడు. అలా వరమును పొందిన
వ్యాసుడు హోమము చెయ్యడానికి అరణిని మధించ సాగాడు. అప్పుడు ఘృతాచి
అనే అప్సరస అక్కడకు వచ్చింది. ఆమెను చూసిన వ్యాసుడు మోహపరవశుడైయ్యాడని
గ్రహించిన ఘృతాచి చిలుకరూపం దల్చింది. తిరిగి వ్యాసుడు అరణిని మధిస్తున్నా
మనసులో ఘృతాచి రూపం నిలిచి పోయింది. అప్పుడు వ్యాసుడి తేజస్సు వెలుపలికి
వచ్చి అరణిలో పడింది. వ్యాసుడు ఇది గ్రహించకనే అరణిని మధించడంతో అరణి నుండి
వ్యాసుడి శుక్లము సంయోగంతో ఒక బాలుడు జన్మించాడు. అతడే శుకుడు. అతడు
పుడుతూనే అగ్నివలె వెలిగిపోసాగాడు. అప్పుడు మందాకిని స్త్రీ రూపం ధరించి
శుకుడికి పురిటి స్నానం చేయించింది. ఆకాశం నుండి కమండలం, జింక చర్మము
శుకుడి ముందు పడ్డాయి. దేవ దుంధుభులు మ్రోగాయి. దేవతలు పూల వానలు
కురిపించారు. ఇంద్రాది దేవతలు, పార్వతి సమేతంగా శివుడు అక్కడికి వచ్చి అందరూ కలిసి శుకునకు ఉపనయనము చేయించారు. దేవేంద్రుడు
శుకుడికి దివ్యకమండలం ఇచ్చాడు. దేవతలు మాసిపోని దుస్తులను ఇచ్చారు.
వేదములు తమకు తాముగా శుకుడిలో చేరాయి. శుకుడు బృహస్పతిని తన గురువుగా
ఎంచుకున్నాడు. బృహస్పతి
వద్ద వేదాధ్యనం చేస్తున్నా ఆశ్రమంలో ఉన్న సహోద్యాయులతోటి ఆటపాటల వలన చదువు
మీద శ్రద్ధ చూపలేక పోయాడు. అప్పుడు శుకుడు తండ్రి అయిన వ్యాసుడి వద్ద
సాంఖ్యము, యోగమును ఉపదేశం పొంది వైరాగ్యం పొందాడు. ఆ తరువాత శుకుడు
బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం అందు శ్రద్ధ చూపక మోక్ష మార్గం
చూపమని తండ్రిని కోరాడు. వ్యాసుడు " కుమారా ! నీవు విదేహరాజైన జనకుడి
వద్దకు వెళ్ళి అడిగిన అతడు నీకు మోక్షమార్గం చూపగలడు. నీవు సర్వశక్తి
సమన్వితుడవైనా నీవు జనకుడి వద్దకు పాదచారివై వెళ్ళు. అతడి ముందు అహంకారం
ప్రదర్శించక వినయం చూపించు " అని వ్యాసుడు చెప్పాడు.
శుకుడు జనకుడు
తండ్రి మాటప్రకారం శుకుడు
కాలినడకన మిధిలానగముకు చేరాడు. రాజభవనంలోకి ప్రవేశించబోతుంటే భటులు
అడ్డగించారు. కాని శుకుడు కోపించక ప్రశాంతంగా నిలబడిన శుకుడిని చూసి భటులు
కంగారుపడి లోపలకు వర్తమానం పంపాడు. తరువాత అతడిని భటులు సగౌరవంగా శుకుడిని
లోపలకు తీసుకు వెళ్ళారు. జనకుడు
పురోహితులను ఎదురు పంపి శుకుడిని ఆహ్వానించి అతడి అతడి కాళ్ళు కడిగి
సింహాసనం మీద కూర్చుండజేసాడు. ఇది చూసి మంత్రులు ఆశ్చర్యచకితులు కాగా
అత్యంత సౌందర్యవంతులైన స్త్రీలు వచ్చి నాట్యంచేయసాగారు. శుకుడు ఎలాంటి
వికారానికి లోనుకాక వారిని చూడసాగాడు. జనకుడు శుకుడికి అన్నపానములు ఏర్పాటు
చేయమని బ్రాహ్మణులకు చెప్పాడు. అలా జనకుడు అతడి వెంట ఉండి అతడికి అన్ను
సదుపాయములు చేస్తూ అనేక మాటలు చెప్తూ
ఆరోజు గడిపాడు. మరునాడు జనకుడు శుకుడి వద్దకు వచ్చి " వచ్చిన
కారణమేమిటి ? " అని అడిగాడు. శుకుడు " మా తండ్రిగారు చెప్పగా ! నేను మీ
వద్దకు మోక్షమార్గ ఆసక్తుడనై వచ్చాను. విప్రుడి కర్తవ్యం ఏమిటి ? మోక్షం
ఎలా పొంద వచ్చు వివరించండి " అని అడిగాడు. జనకుడు " లోక పూజ్యుడైన చరిత్ర
కలవాడా ! బ్రాహ్మణుడు ఉపనయనం చేసుకుని యజ్ఞోపవీతం ధరించి, బ్రహ్మచర్యం
పాటిస్తూ వేదములు అభ్యసించాలి. తరువాత వివాహము చేసుకుని భార్య వలన సంతానం
పొందాలి. యజ్ఞ యాగములు చెయ్యాలి. దేవతలను, పితృదేవతలను తృప్తిపరచాలి.
అతిథులను సత్కరించాలి. తరువాత వానప్రస్థ ఆశ్రమం స్వీకరించి అడవులకు
వెళ్ళాలి. అక్కడ కాషాయాంబర ధారణ చేసి అతిథి సత్కారం చేసి వైరాగ్యం పొందాలి.
తన ఆత్మ అందు అగ్నిని వ్రేల్చి అందు కోరికలను వేల్చాలి. తుదకు పరమపదమైన
బ్రహ్మపదం చేరాలి " అన్నాడు జనకుడు.
ఆశ్రమధర్మాల అవసరం
శుకుడు
" జనకమహారాజా ! మీరు చెప్పినది సాధారణ బ్రాహ్మణుడికి వర్తిస్తుంది.
ప్రజ్ఞకలిగి జ్ఞానోదయమైన వాడికి ఈ మూడు ఆశ్రమములతో పని ఏమిటి ?
జ్ఞానదృష్టితో బ్రహ్మపదము గురంచి ఎరిగిన వానికి ఈ మూడు ఆశ్రమధర్మాచరణ
అవసరమా ! ఈ విషయమై వేదములు ఏమి వివరిస్తున్నాయి ! " అని అడిగాడు. జనకుడు "
నీవన్నట్లు జ్ఞానము విజ్ఞానము మోక్షసాధనములు. వాట్ని గురుముఖతః
నేర్చుకోవాలి. వాటి వలన ముక్తి పొంద వచ్చు. జీవుడు చివరిగా
జ్ఞానవిజ్ఞానాలను కూడా వదిలి వేస్తాడు. పూర్వము ఋషులు, మనుజులు,
ధర్మభ్రష్టులు, కర్మభ్రష్టులు కాకుండా సన్మార్గంలో నడవడానికే ఈ నాలుగు
ఆశ్రమాలు ఉన్నాయి. ఈ నాలుగు ఆశ్రమాలు సక్రమంగా పాటించిన వాడు ముక్తి పొందడం
తధ్యం. అలా కాకుండా పూర్వజన్మ పుణ్యము వలన జ్ఞానోదయమైన వాడు ఈ మూడు
ఆశ్రమాలు వదిలి బ్రహ్మచర్యం వలన ముక్తిని పొంద వచ్చు. అతడు త్రిగుణాతీతుడై
కలిగి బ్రహ్మచర్యంలో ముక్తి పొందకలిగిన వాడికి ఈ మూడు ఆశ్రమాలతో పని లేదు.
మానవుడు ముక్తి పొందాలంటే సత్వమార్గము అవలంబించాలి. లేకున్న అది అసాధ్యము. ఈ
విశ్వం తన అందు ఉన్నట్లు తాను విశ్వం అందు ఉన్నట్లు తలచిన వాడు ముక్తి
పొందుతాడు. యయాతిమహారాజు
" జ్యోతిస్వరూపుడైన పరమాత్మ మన ఆత్మలోనే ఉన్నాడు అని తెలుసుకుని ముక్తిని
పొందాడు. ఇది తెలుసుకున్న మునులు తమవలన పరులకు పరుల వలన తమకు భయంలేకుండా
బ్రతకగలడు. అప్పుడతడు ముక్తి పొందగలడు. నాకు అది కావాలి, ఇది వద్దు అని
తలపక సకల ప్రాణుల అందు సమదృష్టి కలిగి, కోరికలను వదిలి పెట్టి, పరులకు కీడు
తల పెట్టని మానవుడు ముక్తి పొందగలడు. దృశ్యములందు, శబ్ధములందు సమదృష్టి
కలిగి విషయములలో లీనం కాకుండా, రాగద్వేషములు, సుఖ దుఃఖముల అందు ప్రభావితం
కాకుండా జీవించ కలిగిన మానవుడు ముక్తిని పొందగలడు. ఇనుమును, బంగారమును,
నిందను, స్తుతిని సమంగా భావించేవాడికి తాబేలు తన డిప్పలోకి తాను
ముడుచుకున్నట్లు ఇంద్రియములను తనలోనికి లాగగలిగిన వాడికి ముక్తి తప్పక
లభిస్తుంది. నేను చెప్పిన విషయాలు నీ తండ్రి దయవలన నీకు ప్రాప్తించాయి.
నేను చెప్పినదాని కంటే నీకు తెలిసినది ఎక్కువ. బాల్యచాపల్యము వలన, నీ
భావనలో సందేహములు, భయములు ఉండటం వలన నీవు సర్వజ్ఞుడన్న విషయము నీవు ఎరుగక
ఉన్నావు. జ్ఞానము స్మగ్ర రూపం తాల్చినప్పుడే మోక్షము సిద్ధించగలదు. కనుక
నీవు దృఢసంకల్పంతో పరిపూర్ణత సాధించు. నీకిక కొరత లేదు. మోక్షం తప్పక
సిద్ధిస్తుంది. నీ సంశయములు వదిలి పెట్టు. పుట్టక ముందు నువ్వు ఎక్కడ
ఉన్నావో అదే నీ శాశ్వత స్థానం " అని జనకుడు శుకుడికి జ్ఞానబోధ చేసాడు. జనకుడి జ్ఞాన బోధలతో శుకుడు సంశయములు తీరి తానెవరో తెలుసుకుని తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళాడు.
శాంతి పర్వము షష్టమాశ్వాసము-ద్వితీయ భాగం
- 2.1 వ్యాసాశ్రమమునకు నారదుడి ఆగమనము
- 2.2 శుకుడికి నారదమహర్షి దివ్య బోధ
- 2.3 శుకుడి ఆకాశయానం
- 2.4 ఆరాధించవలసిన దైవం
- 2.5 ఉపరిచర మనువు
- 2.6 సప్తఋషులు ధర్మశాస్త్రాలు
- 2.7 ఉపరిచరమనువు అశ్వమేధయాగము
- 2.8 విష్ణు లోకము
- 2.9 దేవతలకు మునులకు మధ్య జరిగిన చర్చ
- 2.10 మహానుభావులు
- 2.11 లోకరక్షణ
- 2.12 బదరికావనము
- 2.13 వ్యాసమహర్షి ఆకాశగమనం
- 2.14 పరమాత్మ వాణి
- 2.15 హయగ్రీవుడు
- 2.15.1 విష్ణుతత్వము
- 2.16 విష్ణు నామములు నిర్వచనాలు
- 2.17 శివకేశవుల యుద్ధము
- 2.18 నరనారాయణులు
- 2.19 హరిమహిమ
- 2.19.1 మధు కైటబులు
- 2.20 ఏకాగ్రత
- 2.21 నోములు వ్రతాలు
- 2.22 వ్యాసుడు
- 2.22.1 నారద నారాయణ సంవాదము
- 2.23 ఉత్తమ ధర్మము
- 2.23.1 ఆత్మదర్శనం
- 2.24 సూర్యరధము
- 2.25 మహాపద్ముడు
- 2.26 అగంతకుడు
No comments:
Post a Comment