Tuesday, May 9, 2017

శాంతి పర్వము షష్టమాశ్వాసము-ద్వితీయ భాగం


- సంశయరహితుడై శుకుడు వాయువేగ మనోవేగాలతో తండ్రి అయిన వ్యాసుని చేరడానికి హిమాలయాల వైపు బయలు దేరాడు. వ్యాసుడు తన శిష్యులైన సుమంతుడు, వైశంపాయనుడు, జైమిని, పైలుడు అనే వారితో వేదాధ్యాయనం చేయిస్తున్నాడు. శుకుని చూసిన వ్యాసుడు సంతోషించాడు. శుకుడు తండ్రి పాదములకు నమస్కరించి కూర్చున్నాడు. తనకు జనకుడికి జరిగిన సంభాషణ సారమును వివరించాడు. వ్యాసుడు శుకుని కూడా తన శిష్యులతో చేర్చి వేదాధ్యయనం చేస్తున్నాడు. ఒక రోజు వ్యాసుడి శిష్యులు వ్యాసుడితో " గురువర్యా ! వేదాధ్యయనంలో మేము అయిదుగురిమే ఈ లోకంలో అందరికన్నా మిన్నగా ముందుండాలి. మమ్మల్ని మించి ఇంకెవరికి వేదం చెప్పకూడదు. ఇలా మాకు వరం ప్రసాదించండి " అని కోరాడు. వ్యాసుడు " ఆసక్తి కలిగిన బ్రాహ్మణ కుమారులకు వేదవిద్య నేర్పిన వాడికి బ్రహ్మపదము కరతలామలకము. ఈ మాట మీరు వినలేదా ! ప్రతివాడు కష్టములు అనుభవించిన తరువాత సుఖము అనుభవిస్తాడు. మానవుడు ఎన్నటికీ స్వార్ధపూరితుడు కాకూడదు. కనుక ఇటువంటి కోరిక మీకు ధర్మంకాదు " అన్నాడు. ఆ మాటలు విన్న శిష్యులు ఒకరిని ఒకరు చూసుకుని " గురువర్యా ! మీరు మమ్ము ఇక్కడే ఉంచితే అది ఎలా సాధ్యం ఔతుంది. మేము పర్వతశిఖరం దిగి ఆసక్తులైన వారిని వెతికి పట్టుకుని వారితో వేదాధ్యయనం చేయించమంటారా ! వారితో యజ్ఞయాగములు చేయించమంటారా " అని అడిగారు. వ్యాసుడు " శిష్యులారా ! మీరు ఇది చెప్పడానికి ఇంత డొంక తిరుగుడుగా మాట్లాడడం అవసరమా ! మీరు పర్వతశిఖరములు దిగి జనావాసాలకు వెళ్ళి విద్యాదానం చేస్తానంటే నేను కాదనగలనా ! " అని వాత్సల్యంగా అన్నాడు. శిష్యులు వ్యాసుడి కాళ్ళ మీద సాంష్టాంగ పడ్డారు. వ్యాసుడు వారిని లేవనెత్తి దీవించి " ఈ మూడు లోకాలలో మీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళండి. మీరు జాగ్రత్తగా ఉంటూ వేదములను ప్రచారం చెయ్యండి " అన్నాడు. వ్యాసుడి నలుగురు శిష్యులు వెళ్ళగానే వ్యాసుడు తన కుమారుడితో ఆశ్రమంలో ఒంటరిగా మిగిలి పోయాడు.

వ్యాసాశ్రమమునకు నారదుడి ఆగమనము

ఒకనాడు నారదుడు వ్యాసాశ్రమమునకు వచ్చి అక్కడ వేదఘోష వినిపించక పోవడం చూసి ఆశ్చర్యపోయాడు. వ్యాసుడితో " వేదఘోష వినిపించక పోవడానికి ఏమి కారణం ? " అని అడిగాడు. వ్యాసుడు " నారదా ! శిష్యులంతా నన్ను విడిచి వెళ్ళారు " అని చెప్పాడు. నారదుడు " అయితే మాత్రం ఏమి ? నీవు నీ కుమారుడైన శుకునితో కలిసి వేదపఠనం చెయ్యవచ్చు కదా ! " అన్నాడు. వ్యాసుడికి తన పొరబాటు తెలిసి వచ్చింది. వెంటనే తన కుమారుడైన శుకుడితో కలిసి వేదాధ్యయనం చేయడం ప్రారంభించాడు. ఒక రోజు పెనుగాలి వీచింది. వెంటనే వ్యాసుడు వేదాధ్యయనం ఆపాడు. శుకుడు " తండ్రీ ! ఈ గాలి ఎందుకు వీస్తుంది " అని అడిగాడు. వ్యాసుడు " కుమారా ! దేవమార్గంలో విష్ణువు పితృమార్గంలో సూర్యుడు పైకి కిందికి పయనించడం వలన ఈ ఝంఝుమారుతం వీస్తున్నది. కుమారా ! నీకు వాయువుల గురించి చెప్తాను. సమానవాయువు దేవతలలో జన్మించాడు. సమానుడికి ఉదానవాయువు, ఉదానుడికి వ్యానము అను వాయువు జన్మించాడు. వ్యానుడికి అపానుడు, అపానుడికి అపానుడికి ప్రాణుడు జన్మించారు. ప్రపంచం అంతా ఈ ఐదు వాయువులతో నిండి ఉంది. ప్రవహుడు, ఆవాహుడు, ఉద్వహుడు, వివహుడు, పవహుడు, పరాహుడు అను ఏడుగురు వాయుదేవతలు. వీరు అదితి పుత్రులు. వీరు మొదట చెప్పిన పంచ వాయువులతో కలిసి ఉంటారు. వర్షములు రాకడకు పోకడకు ఈ వాయువులే కారణం. విష్ణువు నిట్టూర్పు వేగము అపరిమితము. దేవతలు విమానాలలో తిరుగుతున్నప్పుడు ఝుంఝుమారుతం వీస్తుంది. ఇలాంటి సమయంలో వేదాధ్యయనం చేసిన కీడు జరుగుతుంది కనుక ఆపి వేసాను " అని చెప్పిన వ్యాసుడు తరువాత స్నానం చెయ్యడానికి ఆకాశగంగ వద్దకు వెళ్ళాడు.

శుకుడికి నారదమహర్షి దివ్య బోధ


శుకదేవునికి ఉపదేశిస్తున్న నారదుడు
శుకుడు నారదుడు వింటుండగా వేద పఠనం చేసాడు. నారదుడు అందుకు మెచ్చుకుని ఏమి వరము కావాలో కోరుకో అని అడిగాడు. శుకుడు " నారద మహర్షి ! ఈ లోకంలో పుట్టిన వాడికి హితమైనది ఏది ? వివరించండి " అని కోరాడు. నారదుడు " కుమారా ! పూర్వము సనత్కుమారుడు మునీశ్వరులకు చెప్పిన మాటలే నీకూ చెప్తాను. సత్యవాక్పరిపాలనమే తపస్సు. మానవుడి నేర్చిన విద్య అతడికి కన్ను వంటిది. త్యాగమే సుఖదాయకము. కోరికలే దుఃఖహేతువు. మానవుడు ఇహ లోకబంధములలో చిక్కుకుంటే ఈ జన్మలో కాదు కదా ! పైజన్మలో కూడా ముక్తి లభించదు. కామము, క్రోధము ముక్తి సాధించడానికి శత్రువులు. ఈ రెండు వదిలిన వాడికి ముక్తి తధ్యం. ఇతరుల నుండి ఏమీ ఆశించక సమస్తకర్మలను త్యాగం చేసిన పండితుడికి దుఃఖము దరి చేరక ముక్తి సిద్ధిస్తుంది. ఇతరులను తాకకపోవడం, ఎమీ ఆసక్తితో చూడక పోవడం, ఇతరులతో మాట్లాడక పోవడము ఇవి కూడా ముక్తి మార్గములే. అహింసావ్రతం ఆచరిస్తూ ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ, చపలత్వం వదిలిన వాడికి ముక్తి కరతలామలకం. సనత్కుమారుడు మునులకు ఇలా బోధించాడు. భార్యాబిడ్డలు బంధుమిత్రుల మోహంలో పడిన మానవుడు ఊబిలో పడిన ఏనుగులా అటూ ఇటూ కొట్టుకుంటాడే కాని దాని నుండి బయటపడ లేడు. నిరంతర భోగములలో మునిగి తేలే వాడు వలలో చిక్కిన జింక వలె గిల గిలా కొట్టు కుంటూ ఉంటాడు. ధర్మము, అధర్మము, సత్యము, అసత్యము రెండింటినీ వదిలి పెట్టాలి. అది ఎలా సాధ్యపడుతుందంటే అహింసను పాటిస్తే అధర్మము విడిచి పెట్టవచ్చు. కర్మను వదిలినప్పుడు ధర్మమును వదలచ్చు. బుద్ధిని ఉపయోగించి సత్యమును అసత్యమును వదిలి పెట్టవచ్చు. ఆత్మసాక్షాత్కారం పొందిన వాడికి బుద్ధితో పనిలేదు. పండితుడు దైనందిక కార్యాలలో వస్తూపోతూ ఉండే శోకమును భయమును పట్టించుకోడు. కుమారా ! పంచభూతములు దశ ఇంద్రియములు, మనసును మూట కట్టుకుని ఉన్న ఈశరీరం కొరకు తాపత్రయ పడకూడదు. భార్యాబిడ్డలకు, బంధుమిత్రులకు, ఊరిలో జనాలకు కలిగే బాధలకు మనం విచలితులం కాకూడదు " అని నారదుడు శుకుడికి చెప్పగానే శుకుడికి ఉన్న కొంచం మాయకూడా తొలగి పూర్తి వైరాగ్యం కలిగి " మహర్షి ! నీ మాటలతో నా సందేహములన్నీ తీరి జ్ఞానోదయం అయింది. సూర్యుని దయపొంది సర్వము త్యజించి యోగసిద్ధి సాధిస్తాను " అని చెప్పి నారదమహర్షి వద్ద శలవు తీసుకుని తన తండ్రి అయిన వ్యాసుడి వద్దకు వెళ్ళి తన నిశ్చయం తెలియ చేసాడు. పుత్రుడి జ్ఞానసంపదకు వ్యాసుడు ఆనందించాడు. శుకుడు తండ్రికి నమస్కరించి బయలు దేరాడు. వ్యాసుడికి ఇంకా పుత్ర మమకారం తీరకు " నాయనా ! శుకా ! నిన్ను ఇంకా కనులార చూడాలని ఉంది కొంత సమయం నా వద్ద ఉండకూడదా ! " అని అడిగాడు. కాని శుకుడిలో ఇప్పుడు ఏ మమకారం లేదు అతడు మారుమాటాడక నిర్వికారంగా అలా వెళ్ళి కైలాస శిఖరం వరకు పోయాడు. శుకుడు అక్కడ ఒక సమతల ప్రదేశంలో తూర్పు ముఖంగా కూర్చుని ఆత్మావలోకనం చేసుకున్నాడు. సూర్యుడు ప్రత్యక్షం కాగానే శుకుడు సూర్యుడికి సాష్టాంగ నమస్కరించి సూర్యుని వలన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. అదేసమయంలో అక్కడకు చేరిన నారదుడితో " మహర్షి ! మీ దయవలన నాకు వైరాగ్యం కలిగింది. నాకు సరి అయిన మార్గం దొరికింది అని చెప్పి త్రిగుణాతీతుడై యోగశక్తితో శుకుడు ఆకాశ మార్గాన పోతూ దారిలో ఉన్న పర్వతాలను, చెట్లను చూసి నమస్కరించి " నన్ను వెతుకుతూ వచ్చే నాతండ్రి నన్ను పిలిచినప్పుడు మీరు నా కొరకు బదులు పలకండి " అని ప్రార్థించాడు. అవి శుకుడి ప్రార్థన మన్నించాయి.

శుకుడి ఆకాశయానం

ఆ తరువాత శుకుడు ఉత్తరదిక్కుగా పయనమయ్యాడు. అతడు అతి తక్కువ ఎత్తులో గంగాతీరంలో ఆకాశమార్గాన వెళ్ళసాగాడు. ఆ సమయంలో వస్త్రాలను గట్టున విదిలి గంగానదిలో స్నానం చూస్తున్న అప్సరసలు శుకుడిని చూసి కూడా వికారము చెందక అలా స్నానమాడసాగారు. వ్యాసుడు కూడా తన యోగశక్తితో ఆకాశమార్గాన శుకుడిని పిలుస్తూ పోసాగాడు . అతడికి వృక్షాలు పర్వతాలు బదులు చెప్పసాగాయి. అప్పటికే శుకుడు సర్వభూతాత్మకుడయ్యాడు. గంగాతీరాన చేరిన వ్యాసుడిని చూసిని అప్సరసలు కంగారు పడి వస్త్రధారణ చేసి వ్యాసుడికి నమస్కరించారు. తన దివ్యశక్తితో అప్సరసల మనసులోని విషయం గ్రహించిన వ్యాసుడు కుమారుడి వైరాగ్య సంపదకు ఆనందించినా తనను తలచుకుని సిగ్గుపడ్డాడు. అప్పుడు మహాశివుడు వ్యాసుడి వద్దకు వచ్చి " వ్యాసామునీంద్రా ! నాడు నువ్వు నీ తపస్సుతో నన్ను మెప్పించి నా వద్ద నుండి పంచభూతములకు అతీతుడైన కుమారుడు కావాలని అడిగావు కదా ! నేను నీకు అలాంటి కుమారుడిని ప్రసాదించాను. నీ తపోవిశేషం, నా ప్రభావం కలిసి శుకుడికి పరమగతి లభించింది. నీవు దీనికి ఆనందించాలి కాని విచారించడమెందుకు. వ్యాసమహర్షీ ! నీ కుమారుడి కీర్తి ఆచంద్రార్కం వర్ధిల్లుతుంది " అని చెప్పి మహాశివుడు అంతర్ధానం అయ్యాడు " అని చెప్పిన భీష్ముడు ధర్మజా ! శుకచరిత్ర చదివిన వారికి విన్న వారికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు లభించడమే కాక తుదకు మోక్షం లభిస్తుంది " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

ఆరాధించవలసిన దైవం

ధర్మరాజు " పితామహా ! మీ వలన నేను నాలుగు వర్ణాల గురించి తెలుసుకున్నాను అలాగే వారు ఆరాధించవలసిన దైవము గురించి చెప్పండి " అని భీష్ముడిని అడిగాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు. వైశంపాయనుడు " జనమేజయా ! నేనిప్పుడు నీకు భీష్ముడి చేత ధర్మరాజు చెప్పబడిన విష్ణుకథను చెప్తాను. భీష్ముడు " ధర్మనందనా ! ఒక రోజు నా తండ్రి వలన నేను విన్న నారాయణ నారద సంవాదాన్ని వివరించి నీకు చెపితే నీకు కలిగిన సందేహం తీరగలదు. అవ్యయుడు, సనాతనుడు, విశ్వాత్ముడు అయిన నారాయణుడు అనే మహాముని బదరికావనంలో తపస్సు చేసుకుంటున్నాడు. నారదుడు ఆయనకు భక్తితో నమస్కరించి " మహర్షీ ! మోక్షసిద్ధికి ఆరాధించవలసిన దైవము గురించి వివరించండి " అని కోరగా నారాయణుడు " నారదా ! ధృవము, అచలము, ఇంద్రియములకు గోచరము కానిది, సూక్ష్మమైనది, సాటిలేని ఏకైక శక్తి, సకల ప్రాంణులలో అంతరాత్మగా వెలుగొందేది పరమాత్మ ఒక్కడే " అన్నాడు. నారదుడు " మహర్షీ ! నీవు లోకరక్షణార్ధమై మీరీ అవతారమెత్తారు అని విద్వాంసులు చెప్తారు కదా ! అప్పుడు నీ మూల ఆకృతి ఎలా ఉంటుంది నాకు చెప్పు మహర్షీ ! నాకు గురుభక్తి, వేదముల అందు ఆసక్తి ఉంది. నీ మూల స్వరూపము గురించి తెలుసుకోవడానికి నాకు అర్హత ఉంది అని నీవు అనుకున్నట్టైన నాకు తెలుపుము " అని అడిగాడు. నారాయణుడు " నారదా ! ముందు ఏకాగ్రత సాధించు. అప్పుడు నీకు పరమాత్మను దర్శించే శక్తిని నీకు ప్రసాదిస్తాను " అన్నాడు. ఆ మాటలకు తృప్తి చెందిన నారదుడు నారాయణుడికి నమస్కరించి నారదుడు ఆకాశమార్గాన మేరుపర్వత సమీపానికి వెళ్ళాడు. అక్కడ క్షీరసాగరానికి ఉత్తరదిక్కున ఉన్న శ్వేతద్వీపములో ఆహారము తీసుకోకుండా, ఇంద్రియ నిగ్రహము కలిగి, చెమటపట్టని, శరీరము నుండి సుగంధములను వెదజల్లుతున్న మునీశ్వరులను చూసాడు " అని చెప్పగానే ధర్మరాజు " పితామహా ! ఆ మహానుభావులు ఎవరు వివరించండి " అని ఆసక్తితో అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! ఆ మహాపురుషుల గురించి పూర్వము కొంత మంది నా తండ్రికి మునులు చెపుతున్నప్పుడు విన్నది నేను నీకు చెప్తాను.

ఉపరిచర మనువు

పూర్వము ఉపరిచరమనువు అనే విశిష్టమైన ఆచారసంపన్నుడు ఉన్నాడు. అతడు సత్యము, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, విష్ణుభక్తి, నైతికబలము కలవాడు. ఈ భూమినంతా పాలించిన ఉపరిచరమనువు భ్రాహ్మణుల అందు భక్తి, యజ్ఞయాగముల అందు ప్రీతి ఉన్నాయి. ఉపరిచరమనువు రాజ్యమును వదిలి అడవులకు వెళ్ళి తపస్సు చేయసాగాడు. దేవేంద్రుడు ఉపరిచరమనువును చూసి " మహారాజా ! నీకీ తపసు ఎందుకు నేను నీతో సఖ్యము చేయదలిచాను కనుక నీవు నీ రాజ్యముకు వెళ్ళి పరిపాలన చేస్తూ నీవు కోరినప్పుడల్లా అమరావతికి వస్తూ పోతూ ఉండు. నీవు ఆ విమానము ఎక్కి నీకు ఇష్టము వచ్చిన చోటికి వెళ్ళ వచ్చు " అన్నాడు. ఇంద్రుడి మాట కాదన లేక ఆ విమానాన్ని స్వీకరించాడు. ఆ విమానాన్ని ఇంతకు పూర్వము వసువు ఎక్కి తిరిగాడు కనుక అతడు ఉపరిచరమనువు అని కారణ నామధేయుడయ్యాడు.

సప్తఋషులు ధర్మశాస్త్రాలు

కల్పాదిలో మరీచి, అంగీరసుడు, అత్రి, పులహుడు, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అనే మహామునులూ చిత్రుడు, శిఖండి అను వార స్వాయంభువమనువు తో చేరి విష్ణువు గురించి అనేక సంవత్సరాలు తపస్సు చేసారు. విష్ణువు వారికి ప్రత్యక్షం అదృశ్యరూపంలో గోచరించి వారితో " మీరంతా ధర్మశాస్త్రాలు రచించే శక్తి కొరకు నా గురించి తపస్సు చేసారు. నేను మీలో సరస్వతీదేవిని నియోగించాను. మీరు రచించు ధర్మశాస్త్రములు సకల జగములకు హితవును, గౌరవమును కలిగిస్తాయి. అంగీరసుడు అనే మహామునికి బృహస్పతి అనే కుమారుడు జన్మిస్తాడు. అతడు మహాత్ముడు వ్రాసిన ధర్మశాస్త్రములను చదవి అధ్యయనం చేయడానికి అర్హుడు కనుక మీరు అతడికి ధర్మశాస్త్రములను భోదించండి. బృహస్పతి ఉపరిచరమనువుకు ఆ ధర్మశాస్త్రములు బోధిస్తాడు. అతడు ధర్మశాస్త్రములు అధ్యయనం చేయగల సమర్ధుడు. ఉపరిచరమనువు బృహస్పతి వలన భోదించబడిన ధర్మశాస్త్రాలను లోకముకు అందిస్తాడు. ఉపరిచర మనువు యజ్ఞయాగముల అందు ఆస్కడు, నా భక్తుడు. అతడి వలన ధర్మశాస్త్రములు లోకములో ప్రచారమౌతాయి " అని చెప్పాడు.

ఉపరిచరమనువు అశ్వమేధయాగము

ఉపరిచరమనువు అశ్వమేధయాగము చేయసాగాడు. ఆయాగముకు సప్తరుషులు ఋత్విక్కులుగా విచ్చేసారు. ఆ యాగముకు బృహస్పతి ప్రధానఋత్విక్కుగా ఉన్నాడు. ప్రజాపతి పుత్రులైన ఏకతుడు, ద్వితుడు, త్రితుడు అను మునులు సదస్యులుగా వ్యవహరించారు. ఆ ఆశ్వమేధయాగము జరుగుతున్న సమయంలో అహింసావ్రతుడైన మహారాజు మనువు ఆ యజ్ఞములో జంతుబలికి అంగీకరించ లేదు. జంతువులకు బదులుగా అరణ్యకములో చెప్పబడిన మంత్రములను పఠించి విష్ణువును ప్రసన్నం చేసుకున్నాడు. అతడి నిష్ఠకు మెచ్చిన విష్ణువు అదృశ్యరూపంలో వచ్చి తన హవిర్భాగమును స్వీకరించాడు. అది చూసిన బృహస్పతికి కోపము దుఃఖము ఒక్కటిగా వచ్చి ఉపరిచరమనువుతో బృహస్పతి " మనుమహారాజా ! యజ్ఞములో పురోడాశము సమర్పించినప్పుడు దేవతలు స్వయంగా వచ్చి హవిస్సును స్వీకరించాలి. కాని విష్ణువు అదృశ్యరూపంలో వచ్చి స్వీకరించాడు. అది నాకు బాధ అన్పించింది " అన్నాడు. మహారాజు బృహస్పతిని అనునయించాడు. అక్కడ ఉన్న సదస్యులు " దేవగురూ ! మీరు అలకమానండి. హరికి సమర్పించిన హవిర్భాగము హరి స్వీకరించాడు. అందుకు మీరు ఎందుకు బాధపడతారు ? అసలు విష్ణువును ప్రత్యక్షంగా చూడటము ఎవరికి సాధ్యము. బ్రహ్మమానస పుత్రులమైన మేము విష్ణు దర్శనం కోరి ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినప్పుడు " అశరీరవాణి " పాల సముద్రములో ఒక దీవి ఉన్నది. అందు తెల్లటి వారు, ఇంద్రియనిగ్రహం కల వారు, దివ్యదేహం కలవారు, ఆకలి లేనివారు అయిన విష్ణుభక్తులు ఉన్నారు. వారికి మాత్రమే విష్ణువు తన స్వస్వరూపముతో దర్శించే భాగ్యమును కలిగించాడు. ఆ సమయంలో మీరు అక్కడకు చేరగలిగితే మీకు విష్ణుదర్శనం ఔతుంది " అని పలికింది.

విష్ణు లోకము

ఆ మాటలను విని మేము శ్వేతద్వీపముకు వెళ్ళాము. అశరీరవాణి చెప్పినట్లు అక్కడ ప్రకాశవంతమైన దివ్యదేహము కలవారు అయిన విష్ణుభక్తులు కనిపించారు. ఇంతవరకు ముల్లోకాలలో అటువంటి వారిని మేము చూడ లేదు. వారి ముందు సహస్ర భానుప్రకాశంతో సమానమైన రూపము వారి ముందు ప్రత్యక్షం అయింది. అప్పుడు వారు జయీభవ, విజయీ భవ, జయ హృషీకేశ, పుండరీకాక్ష అని అని జయధ్వానాలు చేసారు. మేము ఎంత ప్రయత్నించినా మా కన్నులతో ఆ తేజో రూపము చూడలేక పోయాము. అప్పుడు అశరీర వాణి " బ్రహ్మమానస పుత్రులారా ! మీరు విష్ణుమూర్తిని చూడలేదని దిగులు చెందకండి. విష్ణుభక్తులను చూసిన విష్ణువును దర్శించినట్లే. అయినా మీరు చేసిన తపస్సు, నియమ నిష్ఠలు మీకు విష్ణుదర్శనం చేస్తాయి. కాని మీ తపస్సు విష్ణుదర్శనముకు చాలదు. అనేక సంవత్సరాలు అత్యంత భక్తితో తపస్సు చేసిన కాని విష్ణుదర్శనం లభించదు " అని వినిపించింది. ఆ మాటలు విని మేము వెను తిరిగాము. కనుక బృహస్పతీ నీవు విష్ణుదర్శనం గురించి ఆలోచించక మిగిలిన యజ్ఞకార్యము సమాప్తము చెయ్యి " అని చెప్పారు. ఆ మాటలు విన్న బృహస్పతి యోగమును శ్రద్ధగా పరిసమాప్తము చేసాడు. అలా ఉపరిచరమనువు జనరంజకముగా పాలన సాగించాడు.

దేవతలకు మునులకు మధ్య జరిగిన చర్చ

ఒక సారి దేవలోకములో దేవతలకు మునులకు మధ్య యజ్ఞయాగములను గురించిన చర్చ జరుగుతుంది. దేవతలు అందరూ యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్మానించారు. మునులు దానికి వ్యతిరేకించి అజములకు యుగములు మారినప్పుడు అర్ధము మారుతుందని చెప్పారు. కృతయుగములో అజములంటే ఔషధులు అని అంటారు. ఇంతలో అక్కడకు వచ్చిన ఉపరిచరమనువును చూసి దేవతలు మునులు వారి వివాదము పరిష్కరించమని కోరాడు. ఉపరిచరమనువు దేవతల పక్షం వహించి యజ్ఞములో అజములను బలి ఇవ్వాలని తీర్పు చెప్పాడు. వేదార్ధమును పక్షపాతము వహించి వక్రీకరించినందుకు మునులు కోపించి ఉపరిచరమనువును శపించారు. ముని శాపప్రభావము వలన మనువు భూమిలోని ఒక లోయలో పడి పోయాడు. దేవతలు అతడి వద్దకు వచ్చి అతడికి ఆకలిదప్పులు లేకుండా చేసి మహా విష్ణువు అనుగ్రహంతో తిరిగి పూర్వ స్థితిని పొందగలవు. అని ఊరడించి వెళ్ళారు. ఉపరిచరమనువు విష్ణువును గురించి ధ్యానించడం మొదలు పెట్టాడు. అతడి భక్తికి మెచ్చి గరుత్మంతుడిని పంపి ఉపరిచరమనువుని బ్రహ్మలోకం పంపాడు. ఉపరిచరమనువు విష్ణుమూర్తి మహిమకు కరుణకు ఆనందించాడు.

మహానుభావులు


విష్ణువుని దర్శించిన నారదుడు
భీష్ముడు ధర్మరాజుతో " ధర్మనందనా ! నేను నీకు శ్వేతద్వీపంలో ఉండే మహా పురుషులగురించి చెబుతుండగా ప్రసంగవశాత్తు ఉపరిచరమనువు గురించి చెప్పాను. ఇక ఆ మహానుభావుల గురించి చెప్తాను. నారదుడు శ్వేతద్వీపముకు వెళ్ళి అక్కడ ఉన్న అద్భుత శరీరాలతో ప్రకాశిస్తున్న మహాపురుషులను చూసి వారికి నమస్కరించాడు. వారుకూడా నారదుడిని ఆదరించారు. అప్పుడు నారదుడు విష్ణువును గురించి స్తోత్రం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు నారదుడి ముందు విష్ణుమూర్తి ప్రత్యక్షం అయ్యాడు. విష్ణువు అనేక శిరస్సులు, అనేక బాహువులు, అనేక పాదములు, అనేక రంగులతో కమండలంతో ఓంకారము గాయత్రిని జపిస్తూ చతుర్వేదములు పారాయణం చేస్తూ నారదుడి ముందు ప్రత్యక్షం అయ్యాడు. నారదుడు వినయంతో విష్ణుమూర్తికి నమస్కరించాడు. అప్పుడు విష్ణుమూర్తి " నారదా ! నన్ను చూడడం అందరికీ సాధ్యం కాదు. లేశమాత్రమైనా అహంకారము లేనంత మాత్రాన అనన్య భక్తివలన నీవు నన్ను చూడగలిగావు. నీకు కావలసిన వరము కోరుకో " అన్నాడు. నారదుడు " పరాత్పరా ! నీ దివ్యదర్శనం కంటే నా కేమీ వద్దు " అన్నాడు. విష్ణువు " ఎవరు ఇంద్రియనిగ్రహము కలిగి త్రిగుణాతీతుడై ప్రళయకాలంలో కూడా నిశ్చలంగా వెలుగుతుంటాడో అతడే ఆత్మసాక్షి, అజుడు, నిష్కళంకుడుగా వెలుగుతుండే అతడు క్షేత్రజ్ఞుడు, జీవుడు అనబడే వాసుదేవుడు అతడే, సంకర్షుణుడు అతడే. మనస్సు , అహంకారమే ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు అని అంటారు. ఇది నామాయ నేను 24 తత్వములకు అధినాధుడనైన 25వ తత్వమును. పరపురుషుడను నాకంటే వేరు పరము లేదు. మహామునులు సతతము ఎవరి కొరకు తపస్సు చేస్తుంటారో ఆ వాసుదేవుడను నేనే. ఈ చరాచర జగత్తులో ఉన్న సకలభూతములలో ఉన్న ధాతుశక్తి వేరుగా లేదు ఆ శక్తిని నేనే. ఆ జీవశక్తి సర్వవ్యాప్తంగా సకల లోకములలో విస్తరించి ఉంది. లేని ఎడల ఈ లోకలో చైతన్యము లేదు. జీవుడు వేరు శరీరము వేరు జీవుడిని గురించి నేను తెలుసుకున్నాను అనుకోవడము నా మాయవిలాసము. ఆ మాయ నేను కల్పించినదే. జీవుడికి నాకు భేదము లేదు రెండూ ఒకటే. అచంచలమైన భక్తితో నన్ను కొలిచిన వారికి నేను ముక్తి ప్రసాదిస్తాను. అదిత్యులు, మరుత్తులు, రుద్రులు మొదలైన దేవతా గణములు, బ్రహ్మదేవుడు, చతుర్వేదములు నా స్వరూపములే. నేనే బ్రహ్మదేవుడిని సృష్టించి ఈ సృష్టి కార్యము అప్పగించి నేను నిర్వికారంగా, నిమిత్త మాత్రంగా, ఏకాకిగా కోరిన వారికి సహకరిస్తాను.

లోకరక్షణ

ఒక్కోసారి జగత్రక్షణార్ధమై అవతారం ఎత్తుతుంటాను. వరాహరూపంలో హిరణ్యాక్షుడిని, నరసింహరూపంలో హిరణ్యకశిపుని, పరశురాముడిగా క్షత్రియకులాన్ని, ధశరధపుత్రుడిగా రావణుడిని సంహరించాను. యాదవకుల సంజాతుడనై ఇంద్రకుమారుడి సాయంతో భూభారాన్ని తగ్గించాను. పూర్వము నేను నరుడు, నారాయణుడు అనే రెండు రూపాలతో మునులుగా అవతరించి లోకరక్షణ చేసాను. తరువాతి కాలంలో మానవరూపంలో అవతరించి లోకకంటకులైన కాలయనుడిని, కంసుడిని, మురాసురుడిని, నరకాసురుడిని, బాణాసురుడిని సంహరించాను. బాణాసుర వధసమయంలో నన్ను ఎదిరించి నిలిచిన దేవసేనాని కుమారస్వామితో, మహాశివుడితో పోరాడి బాణాసురుడి గర్వము అణిచాను. అంతకు ముందు మత్సత్వము, కూర్మత్వము పొంది దేవతలను వేదములను రక్షించాను. ధర్మరక్షణ కొరకు నేను చేయవలసినది చేసాను. నేను చేయవలసిన కార్యము పూర్తికాగానే నేను తిరిగి నా మూల ప్రకృతిలో చేరిపోతాను. నారదా ! నీవు ఏకాగ్రచిత్తుడవై నన్ను ధ్యానించినందున ఇది నీకు చెప్పాను " అని విష్ణువు బోధించాడు. తరువాత నారదుడుకి శ్వేతద్వీపంలోని మహాపురుషులను చూపి నారదా కాంతి దేహధారులై నిరంతరం నన్నే ధ్యానించే ఈ మహాపురుషులకు నీ ఉనికి భంగము కలిగిస్తుంది కనుక నీవు ఇక ఇక్కడ నుండి వెళ్ళు " అని చెప్పాడు.

బదరికావనము

విష్ణుమూర్తి ఆదేశంతో నారదుడు శ్వేతద్వీపము నుండి బదరికావనము వెళ్ళి అక్కడ ఉన్న నరనారాయణులను దర్శించుకున్నాడు. అక్కడ తాను సాక్షాత్తు విష్ణుమూర్తి ముఖతః విన్న వేదార్ధసారమును, యోగము, సాంఖ్యముల సారమును మునులందరికీ ఉపదేశించాడు. అక్కడి నుండి బ్రహ్మసభకు వెళ్ళి అక్కడి వారికి విస్ష్ణుమూర్తి సందేశం వినిపించాడు. అలా ఆ ఉపదేశం క్రమంగా ముల్లోకాలలో వ్యాపించింది. దానిని నేను నా తండ్రి శంతనుడి ద్వారా విని ఇప్పుడది నేను నీకు చెప్పాను. ఈ ఉపదేశమును దేవతలు మునులు ఎంతో శ్లాఘిస్తారు. వారు విష్ణుమూర్తిని భక్తితో పూజిస్తారు, శ్రద్ధతో జపిస్తారు, ఏకాగ్రతతో ధ్యానిస్తారు. ధర్మనందనా ! నీవు కూడా విష్ణుమూర్తిని అనన్య భక్తితో పూజించి తరించు. నీవు దీనిని విష్ణుభక్తులకు, నీతిపరులకు, ఇంద్రియ నిగ్రహము కల వారికి మాత్రమే ఉపదేశించు. నీవిప్పటి వరకు విన్న కథలేవి ఈ ఉపదేశముకు సాటి రావు. ఇది విన్న వారికి, తెలుసుకున్న వారికి ఆయురారోగ్య ఐశ్వర్యములు తప్పక సిద్ధిస్తాయి. అని భీష్ముడు నారదుడికి స్వయంగా విష్ణుమూర్తి ఉపదేశించిన ఉపదేశమును ధర్మరాజుకు ఉపదేశించాడు. ఈ పవిత్రమైన ఉపాఖ్యానమును పఠించుతూ పాండవులు విష్ణుమూర్తిని భజిస్తూ కాలంగడిపారు " అని వైశంపాయనుడు జనమే జయుడికి చెప్పాడు.

వ్యాసమహర్షి ఆకాశగమనం

జనమేజయమహారాజా వ్యాసుడు కూడా విష్ణుమూర్తిని తలచుకుంటూ ఆకాశమార్గాన ప్రయాణిస్తున్నాడు " అని వైశంపాయనుడు చెప్పగా జనమేజయుడు " మహర్షీ ! నీవు మోక్షము అత్యంత సుఖప్రథము చెప్పావు. కాని సదా ప్రాపంచిక సుఖములలో మునిగితేలే ప్రజలు వారే కాక దేవతలు కూడా హవిర్భాగాలు పొందడానికి చూపించే ఉత్సుకత మోక్షసాధన అందు చూపరు కదా ! ఇలా ఎందుకు జరుగుతుంది అని నా మనసు సదా మధనపడుతుంది. మానవులే కాక దేవతలు సహితము ఇలా మోక్షమార్గమును వదిలి కర్మబంధాలలో చిక్కుకు పోవడానికి కారణమేమిటి ? నాకు వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వ్యాసభగవానుడు తన శిష్యులకు నాలుగు వేదములను భారతమును బోధించాడు. ఆ సమయంలో సుమంతుడు, పైలుడు, జైమిని నీవు అడిగిన విధంగా మేము మా గురువు గారిని అడిగాము. అప్పుడు మా గురువైన వ్యాసుడు " నేను ఒకప్పుడు భూతభవిష్యత్తు వర్తమానం తెలుసుకోవడానికి క్షీరసాగరంలో తపస్సు చేసాను. ఆ నారాయణుడి దయ వలన నాకు భూత, భవిష్యత్తు వర్తమానం తెలుసుకునే దివ్యజ్ఞానం లభించింది. దాని ప్రభావంతో నేను ఈ కల్పంలో బ్రహ్మదేవుడు మొదలైన వారు చేసిన పనులు చూడగలిగాను. వాటిని మీకు చెప్తాను. మరుత్తులు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు మొదలగు దేవతా గణములు, మునులు, బ్రహ్మదేవుడిని చూసి మాకర్తవ్యము బోధించండి అని అడిగారు. బ్రహ్మదేవుడు " నా మనసులో మెదిలే విషయమే మీరు నాకు గుర్తుచేసారు. మనమందరం విష్ణుమూర్తిని అడిగి మన కర్తవ్యం తెలుకుందాము రండి " అని వారిని విష్ణులోకము తీసుకు వెళ్ళి అక్కడ వారంతా కలి విష్ణువును గురించి తపస్సు చేయగా వారికి అప్పుడు ఒక దివ్యమైన వాక్కు వినిపించింది.

పరమాత్మ వాణి

దివ్యవాణి " దేవతలారా ! మునులారా ! మీరు వచ్చిన పని నాకు తెలుసు. బ్రహ్మదేవుడు ఈ లోకములకు గురువు. ఆయన చెప్పినదే వేదవాక్కు. నాకు కూడా ఆయన చెప్పినదే వేదవాక్కు. మీరందరూ కలిసి వేదోక్తంగా యజ్ఞము చేసి అందు నాకు హవిర్భాగం కల్పించండి " అని పలికింది. ఆ మాటలకు ఆనందించిన బ్రహ్మదేవుడు ఒక యాగముకు ఏర్పాటు చేయమని దేవతలకు ఆదేశం ఇచ్చాడు. దేవతలందరూ వేదోక్తంగా యాగం చెయ్యడానికి పూనుకున్నారు. ఆ యాగమునందు విష్ణుమూర్తికి హవిర్భాగము కల్పించారు. విష్ణుమూర్తి అదృశ్యరూపంలో ఆకాశంలో నిలబడి " దేవతలారా ! మునులారా ! మీరు నేను చెప్పినట్లు యజ్ఞము చేసారు. మీరు చేసిన పుణ్యముకు తగిన ప్రతిఫలం ఇస్తాను. మరీచి, పులహుడు, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, క్రతువు, వశిష్ఠుడు అను బ్రహ్మమానసపుత్రులు వేదములకు ఆచార్యులు. వీరు ఏర్పరిచిన నియమాలు, ఆచారములు, పద్ధతుల ప్రకారం మానవులు యజ్ఞములు చేస్తారు. అందులో మీకందరికి హవిర్భాగములు సమర్పిస్తారు. దానితో వారు తృప్తి పొందుతారు. బ్రహ్మమానస పుత్రులైన సన, సనక, సనంద, కపిల, సనత్కుమారులు సహజమైన జ్ఞానసంపద కలిగి ముక్తి గురించే సదా చింతిస్తుంటారు. వీరు మోక్షధర్మములను జగములకు వివరిస్తారు. మీ అందరికి తల్లి, తండ్రి, గురువు బ్రహ్మదేవుడే. అతడు నా అభీష్టము మేరకు లోకాలను శాసిస్తాడు. నా నుండి పుట్టిన రుద్రుడు లోకాలకు ఆరాధనీయుడు, పూజ్యుడు, సకల వరములను ప్రసాదించు కరుణామయుడు. ఇక మీరు వెళ్ళి మీ విధించిన వేదోక్త కర్మలను బ్రహ్మ, మరీచి, ప్రజాపతులు చెప్పినట్లు విని ఆచరించండి. ఇది కృతయుగము అను పేరుతో ఉత్తమమైన కాలంగా వర్ధిల్లుతుంది. యజ్ఞయాగములలో పశువధ చేయరాదు. ఇందు ఏమాత్రము సందేహము లేదు " అన్నాడు. దేవతలు, మునులు విష్ణుమూర్తికి నమస్కరించి వెళ్ళారు.

హయగ్రీవుడు

దేవతలు, మునులు వెళ్ళినా అక్కడే ఉన్న బ్రహ్మదేవుడి ముందు హయగ్రీవరూపంలో వేదాధ్యయనం చేస్తూ దండ కమండలములతో ఎదుటకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మదేవుడిని కౌగలించుకుని బ్రహ్మదేవా ! నీవు సర్వ లోకములకు విధాతవు, గురుడవు, అధిపతివి అందుకే నేను ఈ జగముల భారం నీ అందు ఉంచి నేను సుఖంగా ఉన్నాను. ఈ లోకమును సక్రమంగా నడపడం నీ బాధ్యత. ఈ లోకమును నడపడంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు నేను కల్పించుకుని తీర్చుతుంటాను " అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. ఇలా యజ్ఞయాగములలో అగ్రభాగమునకు అర్హుడు, యజ్ఞధారి అయిన అయిన మహావిష్ణువు ప్రవృత్తి ధర్మమును నిర్వహించడానికి బ్రహ్మదేవుని, దేవతలను నియమించి తాను మాత్రం నివృత్తి ధర్మమును నిర్వర్తిస్తూ జ్ఞానమూర్తి అయి సర్వత్రా సంచరిస్తున్నాడు. అని వ్యాసుడు వైశంపాయనుడికి చెప్పాడు.

విష్ణుతత్వము

వ్యాసుడు ఇంకా ఇలా " వైశంపాయనా ! ఈ సమస్త లోకములను వాటిని పదిలంగా రక్షిస్తూ తిరిగి వాటిని తనలో లీనం చేసుకునే విష్ణుమూర్తిని నేను కొలుస్తాను. అజుని, విశ్వమే తన రూపముగా కలవాడిని, మృత్యంజయుడిని, దేవతలకు అధినాధుడిని, ఆది అయిన వాడిని, నాలుగు వేదములను అధ్యయనం చేసిన వాడిని, ఆత్మతో కాని ఎరుగ లేని వాడిని, ఈశానుడిని, నాశనం లేని వాడిని, అన్ని తపములకు కర్మఫలదాతను నేను ఆశ్రయిస్తాను. ఈ విధంగా వ్యాసుడు నారాయణుడిని స్తుతించాడు. వ్యాసుడు మమ్ము చూసి నా పూర్వ వృత్తాంతము మీకు చెప్పాను. మీరు కూడా నాకు విష్ణుమూర్తి చెప్పిన ఉపదేశములను ఆచరించండి. ఆ పరమేశ్వరుడిని కొలవండి. వేదముల చెప్పిన ప్రకారము నడవండి " అమ్ని మాకు చెప్పాడు. మేము వ్యాసుడు చెప్పిన విధముగా ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదముల ప్రకారము ఈ త్రిలోకాధిపతిని స్తుతించాము. మనసులో ఆరాధించాము " అని వైశంపాయనుడు జనమేజయునకు చెప్పాడు. జనమేజయ మహారాజా ! వ్యాసుడు మాకు బోధించిన పుణ్యప్రథమైన విష్ణుతత్వము చదినను విన్న విప్రుడు వేదవేదాంగములను చదివిన ఫలమును పొందుతాడు, క్షత్రియుడు సర్వత్రా విజయము పొందుతాడు, వైశ్యుడు ధనలాభము పొందుతాడు, శూద్రుడు అత్యంత సుఖములను పొందుతాడు. పెళ్ళికాని వారికి పెళ్ళి జరుగుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం జరుగి మంచి పుత్రుడిని పొందుతుంది. గొడ్రాలు సంతానవతి ఔతుంది " అని వైశంపాయనుడు ఫలశృతి చెప్పాడు.

విష్ణు నామములు నిర్వచనాలు

జనమేజయుడు వైశంపాయనుడిని " మునివరా ! నిర్వచింప వీలుకాని గూఢమైన విష్ణునామాలను నాకు వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! పూర్వము అర్జునుడు శ్రీకృష్ణుడిని ఇదే అడిగాడు. అందుకు కృష్ణుడు అర్జునునికి వివరించిన విష్ణునామప్రాశస్తము గురించి చెప్పాడు. " అర్జునా ! నీవు నేను సనాతులమైన నరనారాయణులము. ఈ ప్రపంచాన్ని ఉద్దరించడానికి ఈ భూమి మీద అవతరించాము. నీకు నేను గూఢమైన నా నామములు వాటి అర్ధములు వివరిస్తాను. అర్జునా ! నారములు అనగా జలములు. ఆయనము అనగా నివసించు స్థలము. నేను సదా జలములో నివసిస్తాను కనుక నాకు నారాయణుడు అనే నామము వచ్చింది. ఈ జగములన్నీ నాలో నివసిస్తాయి. నేను జగమంతా ఉంటాను కనుక నన్ను వాసుదేవుడు అంటారు. ఇంద్రియములను నిగ్రహించడము కంటే ఉత్తమమైన ధర్మము లేదు. అట్టి జనులు సదా నన్ను కొలుస్తుంటారు. జగములన్నీ నా ఉదరములో ఉన్నాయి కనుక నన్ను దామోదరుడు అంటారు. అన్నము, జలము, ఆహారము, అమృతము, వేదములు, పృశ్ని పేరుతో పిలువబడుతూ ఉంటాయి. అవి నా గర్భంలో ఉన్నాయి కనుక నన్ను పృశ్నిగర్భుడు అంటారు. సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని శిఖలు, నాకు తల వెంట్రుకల వంటివి. అందుకని నన్ను కేశవుడు అంటారు. లోకరక్షణార్ధము నేను బ్రాహ్మణతత్వము, క్షాత్రము అవలంభిస్తుంటాను. బ్రాహ్మము బ్రాహ్మణులకు, క్షాత్రము క్షత్రియులకు పరమ ధర్మములు. కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు తమ ధర్మములు తప్పక నెరవేరుస్తూ ముల్లోకముల విరాజిల్లుతుంటారు. బోధించడం, స్థాపించడం అగ్నికి చంద్రునికి కర్తవ్యములు. అఖిల లోకములను ఆనందింపచేసే సూర్యచంద్రులు నా రూపమే. సూర్యచంద్రుల రూపంలో లోకములకు మేలు చేసినందు వలన వరదుడు, లోకభావనుడు, ఈశ్వరుడు, హృషీకేశుడు మొదలైన నామములు నాకు వచ్చాయి. యజ్ఞములో హవిర్భాగమును హరిస్తాను కనుక నాకు హరి అనే నామము వచ్చింది. గోవులను రక్షించడానికి గుహలో పడకుండా కొండను ఎత్తి పట్టుకున్నాను కనుక నాకు గోవర్ధనుడు అనే నామము వచ్చింది. నేను రోమరహితుడనై అందంగా ఉంటాను కనుక నాకు శిపివిష్టుడుఅనే పేరు వచ్చింది. నేను భూమిని దున్నుతుంటాను కనుక నా వర్ణము నలుపు కనుక నన్ను కృష్ణుడు అంటారు. నేను సత్వగుణ ప్రధానుడను నన్ను సత్వగుణము వీడదు, సత్వగుణమును ఆచరిస్తాను. నా జన్మ సత్వగుణ ప్రధానము కనుక నాకు సాత్వతుడు అన్న పేరు వచ్చింది. నాకు చ్యుతి లేదు కనుక నాకు అచ్యుతుడు అన్న పేరు వచ్చింది. మానవశరీరములో మూడు ధాతువుల రూపములో ఉంటాను కనుక నాకు త్రిధాతువు అన్న పేరు వచ్చింది. నా తేజస్సు వలన ఘృతము ఏర్పడింది కనుక నాకు ఘృతార్చి అనే పేరు వచ్చింది. ధర్మములలో వృషము అత్యుత్తమము. ఆ ధర్మమును నేనే కనుక నాకు వృషుడు అన్న పేరు వచ్చింది. ఆది, మద్యము, అంతము లేని వాడను కనుక నాకు అనాది, అమధ్యుడు, అనంతుడు అని కూడా పులుస్తారు. సదా శుచి అయిన మాటలు వింటాను కనుక నాకుశుచిశ్రవుడు అన్న పేరు వచ్చింది. వరాహావతార సమయముంలో నేను ఒకే కొమ్ముతో భూమిని పైకెత్తి పట్టుకున్నందున నాకు ఏకశృంగుడు అనే పేరు వచ్చింది. నేను ఎల్లప్పుడు ఈ లోకమును చైతన్యవంతము చేస్తాను కనుక నన్ను విరించి అంటారు. నేను విద్య రూపంలో అశరీరంగా సూర్యుడిలో లీనమై ఉంటాను కనుక నన్ను కపిలుడు అంటారు. యోగమును హిరణ్యము అంటారు కనుక అటువంటి యోగము నా కుక్షిలో ఉంది కనుక నన్ను హిరణ్యగర్భుడు అంటారు. ధర్మరక్షణార్ధము నరుడిగా నారాయణుడిగా ఈ లోకములో ఉధ్భవించాను కనుక నన్ను ధర్మజుడు అంటారు. నేను నరనారాయణులుగా గంధమాధన పర్వతము మీద తపస్సు చేసుకుంటున్న సమయాన పరమశివుడు దక్షయజ్ఞము ధ్వంశం చేయపూనగా ఆ యజ్ఞము నావక్షస్థలంలో దాగింది. అప్పుడు నా వక్షస్థలము మీద ఉన్న కేశములు ముంజముల (గడ్డిపోచల) వలె మారినవి. అందుకని నాకు ముంజకేశుడు అని పేరు వచ్చింది. అప్పుడు యజ్ఞమును తరుముతూ వచ్చిన మహాశివుడు నాతో కలియబడ్డాడు. అప్పుడు నేను ఒక బాణమును అభిమంత్రించి పరశువు రూపంలో శివుని మీదకు విసిరాను. అప్పుడు మహాశివుడు ఆ పరశువును ఖండించాడు కనుక నాకు ఖండపరశువు అని పేరు వచ్చింది.

శివకేశవుల యుద్ధము

అనిచెప్పిన కృష్ణుడితో అర్జునుడు " కృష్ణా ! నీవు మహాశివుడు చేసిన యుద్ధంలో ఎవరు గెలిచారు. నాకు చెప్పవా ! " అని అడిగాడు.కృష్ణుడు " అర్జునా ! ఆ సమయంలో రుద్రుడు నారాయణుడు ఒండొరులతో యుద్ధంచేయ సంకల్పించారు. రుద్రుడు తన త్రిశూలంతో నారాయణుడి వక్షస్థలం తాకాడు. నారాయణుడు తన చేత్తో రుద్రుడి మెడ పట్టుకున్నాడు. అది తెలిసి అక్కడకు బ్రహ్మదేవుడు అక్కడకు వచ్చి ఇద్దరినీ సమాధానపరిచాడు. బ్రహ్మదేవుడు " మహాశివా ! నీవు ఈ జగములంతకూ శివుడవు. శివుడంటే శుభంకరుడు. కనుక నీవు నీ కోపమును ఉపసంహరించు. జ్ఞానులందరికి శివుడు కేశవుడికి మధ్య భేదములేదని తెలుసు. వేదములతో తెలుకొనతగినది, నిర్గుణమైనది, ద్వందములకు అతీతమైంది, అరూపమైంది అయిన ఒకే మూల తత్వము రెండు రూపములతో విరాజిల్లుతుంది. శివకేశవ తత్వము అంటే అదే. నిజానికి శివకేశవులకు భేదము లేదు. నరనారాయణులు ఈ జగత్తుకు ఆది పురుషులు. నీ దివ్యబుద్ధితో చూస్తే అది నిజమని మనమంతా ఆయన నుండి ఉద్భవించామని అవగతమౌతుంది. కనుక మహాశివా వెంటనే నీవు నారాయణుడిని ప్రసన్నం చేసుకో " అని శివుడిని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై తన కోపమును విడిచిపెట్టి నారాయణుడికి నమస్కరించాడు. నారాయణుడు " మహాశివా ! ఎవరైతే నిన్ను తెలుసుకుంటాడో వారు నన్ను తెలుసుకున్నట్లే ! నిన్ను సేవిస్తే నన్ను సేవించినట్లే. మహాశివా ! శివకేశవులకు భేదము లేదు. మహాశివా ! ఈ రోజు నుండి నా గుండెల మీద ఉన్న శ్రీవత్సము నీ త్రిశూలముకు గుర్తుగా ఉంటుంది. నీ కంఠము మీద ఉన్న నలుపు ఈ రోజు నుండి నా గుర్తుగా నా చేతిముద్రతో శ్రీకంఠముగా పిలువబడుతుంది " అని విష్ణువు చెప్పి " అర్జునా ! ఆ విధంగా నాకూ మహాశివుడికి మధ్య సఖ్యత కుదిరింది. ఇది చూసి బ్రహ్మ మొదలైన దేవతా సమూహములు ఆనందించారు. కనుక అర్జునా ! నేను వివిధ రూపములతో ఈ లోకములో ప్రవర్తిస్తుంటాను. నీవు కూడా అభవుడు, అమృత్యుడు అయిన శివుని పూజించి తరించు. నేను పక్కన ఉండి సదా రక్షించాను కనుక మహా భారత సంగ్రామంలో నీకు విజయము లభించింది. నీవు యుద్ధం చేసే సమయంలో మహాశివుడు త్రిశూలధారి అయి నీరధము ముందు నిలిచి శత్రు సంహారంచేసాడు. ఆ కారణంగానే నీవు విజయుడివి అయ్యావు. నీవు ఈ విషయం తెలుసుకోవడం మంచిది " అని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు " అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు.

నరనారాయణులు

జనమేజయుడు " మునీంద్రా ! అటు మహాశివుడు ఇటు విష్ణువు తోడుగా ఉండగా అర్జునుడికి విజయం లభించండంలో ఆశ్చర్యం ఏముంది. నారదుడు శ్వేతద్వీపంలో మహావిష్ణుదర్శనం చేసుకుని వచ్చిన తరువాత నరనారాయణుడికి నారదుడికి మధ్య జరిగిన సంభాషణా వివరములు చెప్పండి " అని అడిగాడు. వైశంపాయనుడు " నరనారాయణులు నారదుడికి అతిథి సత్కారములు చేసి శ్వేతద్వీప విశేషణాలు వివరించండి " అని అడిగారు. నారదుడు " మీ కృపాకటాక్షంతో నేను శ్వేతద్వీపంలో మహావిష్ణువును దర్శించాను. ఆయన రూపముకు మీ రూపముకు ఏమీ తేడా లేదు. అక్కడ తెల్లని శరీరము కలవారు, ఆకలిదప్పులు లేని వారు, ఇంద్రియనిగ్రహము లేని వారు, మౌనంగా ఉండే వారు అయిన మానవులను చూశాను. వారు విష్ణుమూర్తిని భక్తిశద్ధలతో కొలుస్తున్నాడు. విష్ణుమూర్తి కూడా వారితో విహరిస్తున్నాడు. నన్ను కృప చేసి నాకు క్షేత్రజ్ఞుడు, తన రాబోవు జన్మల గురించి, అవతారముల గురించి తెలియజేసాడు. ఆ శ్వేతద్వీపము చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ సూర్యచంద్రులు గాలిలేదు . మహావిష్ణువుకు ఏకాంత చిత్తముతో ధ్యానించే వారంటే ఇష్టమని తెలిసి నేను విష్ణువును ఏకాంతచిత్తంతో ధ్యానించాను. తరువాత విష్ణువు వద్ద శలవు తీసుకుని మీ వద్దకు వచ్చాను. నేను కూడా ఇక్కడే ఉండి మీదయకు పాత్రుడనౌతాను అన్నాడు. నరనారాయణుల అనుమతి పొంది నారదుడు బదరికావనంలో వేయి దివ్య సంవత్సరాలు తపస్సు చేసి తరువాత నరనారాయణుల వద్ద శలవు తీసుకుని హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ తన శిష్యబృందంతో పూజలంకుంటున్నాడు.

హరిమహిమ


బ్రహ్మకు వేదాలను తిరిగి ఇస్తున్న హయగ్రీవుడు
జనమేజయ మహారాజా ! సమస్త పాపహరమైన హరికథను భక్తిశ్రద్ధలతో విన్నావు. నీవు ఎల్లప్పుడూ విష్ణుమూర్తిని భక్తితో కొలుచిన నీకు మహోన్నతి కలుగుతుంది. హరిని ద్వేషించే వారు ఇహలోక సుఖాలకు పరలోక సుఖాలకు దూరము కావడమే కాక వారి పితరులకు కూడా నరకము ప్రాప్తిస్తుంది. ముల్లోకములలో ఉన్నవారందరికి హరియే ఆత్మ. హరిని ద్వేషించడం అంటే వారిని వారు ద్వేషించుకున్నట్లే అలాంటి వారికి ఆపదలు తధ్యము. మా గురువైన వ్యాసమహర్షి కూడా విష్ణువు అవతారమే. ఆయన చేత రచింపబడిన లోక పూజనీయమైన భారతము మనకు అందరికి తెలుసు. అటువంటి భారతమును అధ్యయనం చేసే శక్తి సాక్షాత్తు విష్ణుమూర్తికి తప్ప వేరెవరికి సాధ్యం కాదు. భారతంలో చెప్పబడిన ధర్మములు చెప్పడం మా గురుదేవులకే సాధ్యం " అని చెప్తున్న వైంశంపాయనుడిని చూసి జనమేజయుడు " మహాత్మా ! మహావిష్ణువు హయగ్రీవుడిగా బ్రహ్మలోకం వెళ్ళాడు అన్నారు కదా ! పురుషోత్తముడైన విష్ణుమూర్తికి హయగ్రీవ అవతారం ఎత్తవలసిన అవసరం ఏమి ఉన్నది ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! ప్రళయకాలంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండి ప్రళయము అంతరించిన తరువాత మేలుకొని తిరిగి సృష్టి చేయాలని సంకల్పించాడు. వెంటనే అహంకారం ఆవిర్భవించింది. విష్ణునాభి నుండి కమలంలో ఆవిర్భవించిన ఆ అహంకారముకు బ్రహ్మ అన్న నామధేయము జరిగింది. బ్రహ్మ ముందుగా వేదములను సృష్టించాడు. ప్రళయ కాలములో లయమైన సత్వ, రజో, తమో గుణాలలో మొదటిది అయిన సత్వ గుణము ముందుగా పుట్టింది. బ్రహ్మ సత్వగుణ సంపన్నుడయ్యాడు. రజో తమో గుణాలు రాక్షసగుణాలు అయ్యాయి ! వారిలో ముఖ్యులు మధు కైటభుడు. వారు తొలుతగా పుట్టిన వేదములను తీసుకుని పోయి పాతాళంలో దాచి పెట్టారు. " సృష్టికి మూలము వేదములే, అవి లేకుండా సృష్టి చేయలేను, నన్ను ఈ ఆపద నుండి ఎవరు రక్షిస్తారు " అనుకుని బ్రహ్మదేవుడు విష్ణువుని అనేక విధముల స్తుతించాడు. జలములలో శయనించి ఉన్న విష్ణువు హయగ్రీవ రూపంతో వేదములను వెదుకుతూ పాతాళముకు వెళ్ళి భయంకరంగా ప్రణవ నాదం చేసాడు. ఆ నాదం విన్న మధు కైటబులు ఆ ప్రణవ నాదం వినవచ్చిన దిక్కుకు పరుగెత్తారు. ఇంతలో హయగ్రీవుడు వేదముల బంధనములు ఊడదీసి తీసుకు వెళ్ళి బ్రహ్మదేవుడికి ఇచ్చి తిరిగి యధావిధిగా శయనించాడు.

మధు కైటబులు

ప్రణవధ్వని వచ్చిన దిక్కుకు పరుగెత్తిన మధుకైటభులకు అక్కడ ఎవరూ కనపడక వేదములు పెట్టిన చోటుకు వెళ్ళి చూసి అక్కడ వేదములు కనిపించక పోవడంతో వారికి భయంకరమైన కోపము వచ్చింది. నానారభస చేస్తూ అటూఇటూ తిరుగుతూ ఉండగా యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి వారికి కనిపించాడు. వారు విష్ణువును యుద్ధముకు ఆహ్వానించగా విష్ణువు యుద్ధోన్మాదులైన మధుకైటబులను సంహరించాడు. అలాసృష్టి జరగడానికి సాయం చేసాడు. బ్రహ్మదేవుడు సృష్టిచేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి హయగ్రీవుడు అన్ని అవతారముల కంటే మహిమాన్వితుడయ్యాడు. వేదములను రక్షించిన హయగ్రీవుడిని వేదములు సదా ఆశ్రయించి ఉంటాయి. జనమేజయమహారాజా ! హరి త్రిగుణములలో హెచ్చుతగ్గులను కలిగిస్తుంటాడు కనుక మానవులలో కూడా త్రిగుణములు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అందుకే మానవులలో ఒకరు గుణవంతులు మరొకరు గుణరహితులు ఔతారు. మానవులలో త్రిగుణాలకు కారణం అయిన శ్రీహరి త్రిగుణాలను నాశనంచేసే శక్తి ఆయనకే ఉంది. వేదములు, యజ్ఞములు, పుణ్యకార్యములు, పంచభూతములు శ్రీహరి రూపాలే " అని వైశంపాయనుడు చెప్పాడు.

ఏకాగ్రత

జనమేజయుడు " మహాత్మా ! ఏకాగ్రచిత్తులు గొప్ప వారు అన్నావు కదా ! అసలు ఏకాగ్రత అంటే ఏమిటి ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయా ! పూర్వము శ్రీకృష్ణుడు మీ తాతగారైన అర్జునుడికి భారతయుద్ధ ఆరంభంలో సాంఖ్యము, యోగముల సారము బోధించారు. దానినే భగవద్గీత అంటారు. అది నేను ఎప్పుడో విన్నాను ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను. ఏకాగ్రత ధర్మమును పూర్వము నారాయణుడికి ఉపదేశించాడు. దానిని బ్రహ్మ దక్షుడికి ఉపదేశించాడు. దక్షప్రజాపతి తన మనుమడైన సూర్యుడికి ఉపదేశించాడు. సూర్యుడు దానిని మనువుకు ఉపదేశించాడు. మనువు ఇక్ష్వాకుడికి ఉపదేశించాడు. ఇక్ష్వాకుడి నుండి ఆ ఏకాంతిక ధర్మము యోగ్యులైన వారికి పరంపరగా అందజేయబడింది. ఈ ఏకాంతిక ధర్మమును మహావిష్ణువు నుండి ఉపదేశం పొందిన నారదుడు తన శిష్యులకు ఉపదేశించాడు. వారి నుండి వారి శిస్యులకు అలా పరంపరగా సకల జనులకు చేరింది. ఏగాగ్రత ధర్మము దుర్మార్గులకు మాత్రము అవగతము కాదు. ఈ ఏకాగ్రత ధర్మము అహింసకు మూలము. ఈ అహింసా వ్రతముతో శ్రీహరి ప్రీతి చెందుతాడు. హరి అన్నా క్షేత్ర్తజ్ఞుడు అన్నా ఒకటే. శ్రీహరి తన భక్తులకు వాసుదేవాది నాలగు రూపములలో దర్శనం ఇస్తాడు. ఈ నలుగురిలో వాసుదేవుడు ప్రధముడు, రెండవ వాడు సంకర్షుణుడు, మూడవ రూపము ప్రద్యుమ్నుడు, నాల్గవ రూపము అనిరుద్ధుడు. ఎన్ని రూపములలో దర్శనం ఇచ్చినప్పటికీ అంతర్లీనంగా ఉండే రూపము ఒక్కటే. ఆ దైవస్వరూపము మన ఇంద్రియములకు గోచరం కాదు. అనన్య భక్తి, తపస్సు, మనో నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కలవారికి మాత్రమే ఆ దైవస్వరూపము గోచరమౌతుంది. ఏకాంతధర్మము శాంత మనస్కుడికి కరతలామలకం. ఈ ఏకాగ్ర ధర్మము మనలోని అన్ని చింతలను తుడిచి వేయు ఆయుధము " అని వైశంపాయనుడు చెప్పాడు.

నోములు వ్రతాలు

జనమేజయుడు" మహాత్మా ! ప్రజలు అత్యున్నతమైన ఏకాగ్రతావ్రతం ఆచరించక ఏవోవో పూజలు నోములు వ్రతాలు ఏ ప్రయోజనాన్ని ఆచరిస్తున్నారు ? వివరించండి " అని అడిగాడు. వైశంపాయనుడు " మహారాజా ! మనస్సు త్రిగుణముల వలన ప్రభావితమౌతుంది. అందులో ఉత్తమమైన సాత్వికగుణము కలవారి యోగక్షేమములు శ్రీ మహావిష్ణువే చూసుకుంటాడు. వారే ఏకాగ్రచిత్తం కలిగిన ఏకాంతికులు. వారికి దైవచింత తప్ప వేరే వ్యాపకం లేదు. రాజసము తామసము అవలంబించిన వారు ప్రాపంచిక విషయాలలో మునిగి భోగలాలసలో నిమజ్ఞులై ఉంటారు. అలాంటి వారు శ్రీహరికృపకు పాత్రులు కాలేరు. ఏకాంతికులు ఏకాంతచిత్తంతో సేవించే వారు విష్ణుమూర్తి మనసులో చోటుచేసుకుంటారు. ఈ విషయాన్ని వేదాలు కూడా ఉద్ఘాటిస్తున్నాయి. మా గురువుగారు దయతో నాకు ఉపదేశించిన ఈ ఉపదేశము విని నేను పవిత్రుడనైనాను. జనమేజయా ! నీవు కూడా ఆచరించగలిగిన ఏకాగ్రవ్రతము ఆచరించి ఏకాగ్రతతో శ్రీహరిని ధ్యానించి తరించి శాశ్వతత్వాన్ని పొందు " అని వైశంపాయనుడు. జనమేజయుడు" ఓ మహర్షీ ! లోకములో యోగము, సాంఖ్యము, వేదములు, పాశుపతము, పంచరాత్రము, ఇంకా అనేక సాధనాలు ఉన్నాయి కదా! అన్నిటికీ నిష్టలు ఒకే విధంగా ఉంటాయా ! లేక వేరువేరుగా ఉంటాయా ! అసలు వీటిని ఎవరు ఉపదేశించారు ? " అని అడిగాడు. వైశంపాయనుడు " జనమేజయమహారాజా ! వేదములకు, సాంఖ్యముకు, యోగముకు, ఇతర శాస్త్రాలకు మూలకర్త శ్రీహరే ! అన్నీ ఆయనను చేరడానికి ఉన్న మార్గాలే ! వేదములను నారాయణ పుత్రుడు అయిన వ్యాసుడి చేత ఉపదేశించబడింది. సాంఖ్యమును కపిలుడు ఉపదేశించాడు, యోగమును హిరణ్యగర్భుడు ఉపదేశించాడు, పాశుపతమును శివుడు ఉపదేశించాడు, వైష్ణవము అను పంచరాత్రమును సాక్షాత్తు విష్ణుమూర్తి చేత ఉపదేశింపబడింది " అని వైశంపాయనుడు చెప్పాడు.

వ్యాసుడు

జనమేజయుడు " మహర్షీ ! తమరు వ్యాసుడు పరాశరుడి పుత్రుడని అన్నారు కదా ! మహావిష్ణువుకు కుమారుడు ఎలా అయ్యాడు " అని అడిగాడు. వైశంపాయనుడు " మహాభారతకథను రచించి అలసి పోయిన వ్యాసుడు అలసి పోయి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడ వ్యాసుడు శిష్యుల చేత పరచర్యలు అందుకుంటూ వారికి వేదములను భారతమును దాని అర్ధములను బోధిస్తున్నాడు. ఆ సమయంలో నేను మరి కొందరు శిష్యులు వ్యాసుడికి పాదాభివందనం చేసి " గురువుగారూ ! తమరిని నారాయణుడి పుత్రుడు అంటారు కదా ! అది ఎలా సంభవించింది " అని అడిగాము. వ్యాసుడు " ఆది కాలములో సృష్టి చేయ సంకల్పించిన నారాయణుడు ముందుగా నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. బ్రహ్మ సకల జీవకోటిని సృష్టించాడు. బ్రహ్మముఖము నుండి వేదములు పుట్టాయి. ఆ వేదములు అధ్యయనం చేయడానికి శ్రీమన్నారాయణుడు అపాంతరతముడు అనే వాడిని మనసంకల్పం చేత సృష్టించాడు. అతడు నారాయణుడిని తన కర్తవ్యము ఏమిటని అడిగాడు. నారాయణుడు నీవు వేదములను అధ్యయనం చేసి వాటిని వ్యాసం చెయ్యి అని చెప్పగా వేదవ్యాసుడు అందుకు అంగీకరించాడు. అప్పటికి కలగాపులగంగా ఉన్న వేదములను అధ్యయనం చేసిన అపాంతరతముడు వాటిని నాలుగు వేదములుగా విభజించాడు. దానికి ప్రీతి చెందిన నారాయణుడు " ఇలారా వేదవ్యాసా ! నీవు నా కుమారుడవు . నీవు అన్ని మన్వంతరములలో ఉంటావు. నీకు త్రికాలజ్ఞానము ప్రసాదిస్తున్నాను. నీకు నా కథలు, ధర్మములు, ఈ లోకములో చేయతగిన అన్ని కార్యములు గోచరిస్తాయి. నీవు రాబోవు కాలములో పరాశరకుమారుడిగా జన్మిస్తావు. నీకు పుట్టిన కుమారులు కురుసామ్రాజ్యాన్ని పాలిస్తారు. వారు వారి కుమారులు రాజ్యకాంక్షతో ఒకరితో ఒకరు కలహించి యుద్ధములు చేసి సర్వనాశనం ఔతారు. అపాంతరతమా ! కాలక్రమేణా ! మరలా వేదములు ఒకదానితో ఒకటి కలిసి పోతాయి. ఈ లోకములకు కలిగిన ధర్మసందేహములను తీర్చగలిగిన వాడివి నీవే. నీవు సాంఖ్యమును , యోగమును అభ్యసించి లోక పూజితుడవు ఔతావు. కుమారా ! ఇన్ని చేసినా నీకు వైరాగ్యము సిద్ధించదు కాని నీకు విరాగి అయిన పుత్రుడు జన్మిస్తాడు. అతడికి వైరాగ్యము సిద్ధిస్తుంది వెళ్ళు " అని చెప్పి విష్ణుమూర్తి అంతర్ధానం అయ్యాడు " అని చెప్పిన వ్యాసుడు నాకు త్రికాలజ్ఞం లభించింది కనుక నాకు పూర్వ జన్మలలో జరిగినది అన్నీ అవగతమయ్యింది. నేను నారాయణుడి మానసపుత్రుడను. నేను ప్రతిజన్మలో నారాయణుడి గురించి తపస్సు చేసి ఆయన దయకు పాత్రుడను ఔతాను " అని నా గురువు వ్యాసుడు తన పూర్వజన్మ వృత్తాంతమును మాకు వివరించావు " అని వైశంపాయనుడు చెప్పాడు.

నారద నారాయణ సంవాదము

వైశంపాయనుడు " జనమేజయా ! నారద నారాయణ సంవాదము, నారదుడు బదరికాశ్రమంలో నరనారాయణులను కలుసుకుని శ్వేతద్వీపము విశేషాలు గురించివివరించడం, నారాయణుడి అనుమతి తీసుకుని నారదుడు బదరికావనంలో తపస్సు చేయడం, తిరిగి హిమవత్పర్వతాలకు వెళ్ళి తపస్సు చేయడం, హయగ్రీవుడి వృత్తాంతం అన్నీ మాకు మా గురువువుగారు చెప్పే సమయంలో అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు, ధర్మరాజాదులు విన్నారు, అర్జునుడి కోరిక మేరకు శ్రీకృష్ణుడు తన నామార్ధములను వివరించాడు. వేదములు, సాంఖ్యము, యోగము, పాశుపతము, పంచరాత్రము, ఏకాంతిక ధర్మము వాటి గురించి మా గురువుగారు వివరించగా ధర్మరాజాదులు విన్నారు. ఇప్పుడు నీ కోరిక మీద నేను నేను నీకు చెప్పాను. ఈ లోకంలో ఏకాంతిక ధర్మముకు మించినది మరొకటి లేదు " అని జనమే జయుడికి చెప్పాడు.

ఉత్తమ ధర్మము

ధర్మరాజు " పితామహా ! ఈ లోకములో ధర్మములన్నీ చెప్పారు కదా ! వాటిలో ఆచరించతగిన ఉత్తమధర్మము ఏది ? " అని భీష్ముడిని అడిగాడు. భీష్ముడు " ధర్మనందనా ! అన్ని ధర్మములు ఉత్తమమైనవే పనికిరాని ధర్మము ఏదీ లేదు. వాటిలో వారివారికి నచ్చిన ధర్మాలు వారు ఆచరిస్తారు. తమకు నచ్చిన ధర్మాలను ఆచరించే జనులను అనేకులు మన జీవితంలో తారసపడతారు. ఒక సారి నారదుడు లోక సంచారము చేస్తూ దేవేంద్రుడి వద్దకు వెళ్ళాడు. దేవేంద్రుడు నారదమునిని తగురీతిని సత్కరించి ఉచితాసనమున కూర్చుండ పెట్టి " నారద మునీంద్రా ! నీవు అన్ని లోకములను సంచరిస్తుంటావు కదా ! నీకు ఎక్కడైనా అత్యంత ఆశ్చర్యకరమైనది కనిపించిందా ! " అని అడిగాడు. నారదుడు " గంగానదికి దక్షిణ తీరంలో మహాపద్మము అనే నగరములో భృగుడు అనే భ్రాహ్మణుడు నివసిసిస్తున్నాడు. అతడు ధర్మపరుడు, సత్యవాది, అహంసా వాది, ఇంద్రియనిగ్రహము కలవాడు, తనకు ఉన్న దానితో తృప్తిచెందే వాడు. కోపము అసలే లేని వాడు, తాను న్యాయంగా సంపాదించిన ధనముతో దేవ కార్యములు, పితృ కార్యములు, అతిథి సత్కారములు చేసే వాడు. అతడికి తగినట్లు వినయ సంపన్నులైన కుమారులు కలిగారు. అయినా అతడు సదా ఏ కార్యము చేస్తే మేలు కలుగుతుంది, ధర్మకార్యాలు ఏవి ఆలోచిస్తూ ఉండే వాడు. ఒకరోజు వారి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు.

ఆత్మదర్శనం

భృగుడు అతడికి అతిథి సకారాలు చేసి " అనఘా ! నేను ప్రతిరోజు ఆత్మ దర్శనం చేయడానికి ప్రత్నిస్తాను కాని నా మనసును ప్రాపంచిక విషయముల నుండి మరల్చలేక పోతున్నాను. కనుక నాకు ఆత్మదర్శనం సాధ్యం కావడం లేదు. నాకు మార్గము ఉపదేశించండి " అని అడిగాడు. భ్రాహ్మణుడు " భృగూ ! నేను కూడా ! నీ మాదిరి ఆత్మదర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసి ప్రాపంచక విషయాలలో పడి పొంద లేక పోయాను. నాకూ సరి అయిన దారి కనపడ లేదు. నాకు సరి అయిన మార్గము గోచరించ లేదు. కొందరు బ్రహ్మచర్యము వలన, కొందరు గృహస్థాశ్రమంలో ఉండి, మరి కొందరు తపమాచరించి, కొందరు యజ్ఞయాగములు చేసి, మరి కొందరు నిష్కామ కర్మలు చేసి మరి కొందరు ఆత్మదర్శనం పొందారు. కొంత మంది తల్లి తండ్రులను సేవించి, మరి కొందరు భక్తితో భవంతుడిని కొలిచి, కొందరు మంచి నడవడి ప్రవర్తనతో, కొందరు ఇంద్రియ నిగ్రహముతో ప్రఆశాంత జీవితము గడుపుతూ, కొంరౌ సత్యము, అహింస పాటించి ఆత్మ దర్శనం పొందుతారు. ఆత్మ దర్శనానికి అనేక కార్యములు ఉన్నా అది అంత సులువైనది మాత్రం కాదు. నైశారణ్యములో ఉన్న గోమతినదీ తీరాన మహాపద్మతటాకము తీరాన ఒక మహాసర్పము నివసిస్తుంది. ఆ మహాపద్మతటాక తీరంలో పూర్వము మాంధాత తపమాచరించాడని ప్రతీతి. అక్కడ ఉన్న నాగరాజు పేరు పద్ముడు. అతడు మహా ధర్మాత్ముడు, దయకల వాడు. అతడికి అతిథులంటే ప్రేమ ఎక్కువ. నీవు పద్ముడిని దర్శించి అతడి వద్ద ఉపదేశం పొంద వచ్చు " అన్నాడు.

సూర్యరధము

భృగువు బంధు మిత్రుల అనుమతి తీసుకుని మిత్రుల అనుమతి తీసుకుని భృగువు నైశారణ్యముకు వెళ్ళాడు. అక్కడ నాగేంద్రుడిని దర్శించగా అతడి భార్య భృగువును భక్తితో పూజించి " మహానుభావా ! తమరు ఇక్కడకు వచ్చిన కారణం ఏమిటి ? " అని అడిగింది. భృగువు " అమ్మా ! నేను నీ భర్తను దర్శించాలని వచ్చాను. నీ భర్త ఎక్కడ ? " అనీడిగాడు. అందుకు ఆమె " నా భర్త ఒక సంవత్సరానికి ఒక మాసము సూర్యరధానికి పగ్గంగా ఉంటాడు. ఈ మాసము అతడి వంతు కనుక వెళ్ళాడు. ఇంకా ఒక ఎనిమిది రోజుల అనంతరం వస్తాడు. మీరు వచ్చిన పని చెపితే నేను ఆపని చేయగలిగితే చేస్తాను " అన్నాడు. భృగువు " అమ్మా ! నేను నీ భర్తను చూడ వచ్చాను కనుక నేను అతడి కొరకు వేచి ఉంటాను. అతడు రాగానే నా గురించి చెప్పమ్మా " అని అడిగాడు. అలా ఆరు రోజులు గడిచే వరకు భృగువు ఆహారపానీయములు ముట్ట లేదు. నాగేంద్రుడి సేవకులు వచ్చి " అయ్యా ! మాకు అన్నిటి కంటే అతిథిసేవ ముఖ్యము. మీరు అన్యధా భావించ మా ఆతిథ్యము స్వీకరించి మేము తెచ్చిన అన్నము, ఫలములు, కందమూలములలో వాటిలో ఏవైనా మీకు ప్రీతికరమైనవి తినండి " అని వేడుకున్నారు. భృగువు " అయ్యా ! మీరు ఇంత చెప్పవలెనా ! నేను నాగరాజు దర్శనం చేసుకునే వరకు ఆహారం ముట్టను. నాకు ఆకలి దాహము కలగడము లేదు. మీకు ఎటువంటి మాట రానీయను. ఇక రెండుదినములలో నాగరాజు రాకున్న నేను మీ ఆతిథ్యము స్వీకరిస్తాను " అన్నాడు. వారు వెళ్ళి పోయారు. ఎనిమిదవ రోజుకు సూర్యుడి వద్ద నుండి నాగరాజు వచ్చాడు. నాగరాజు భార్యతో " అతివా అందరూ క్షేమంగా ఉన్నారు కదా ! దేవ కార్యములు, అతిథి పూజలు చక్కగా జరుగుతున్నాయా ! నేను లేనందున్న పొరపాట్లు జరుగ లేదు కదా ! " అన్నాడు. అందుకు ఆయన భార్య " నాధా ! మీరు ఇంతగా చెప్పాలా ! మీరు నాకిచ్చిన శిక్షణ వలన దేవతా పూజలు, అతిథి సత్కారాలు చక్కగా చేసాను. నాధా ! శిష్యులకు గురువు ఎడల భక్తి. భ్రాహ్మణులకు వేదముల ఎడ భక్తి, క్షత్రియులకు ప్రజారక్షణలో భక్తి, వైశ్యులకు ధనసంపాదనలో భక్తి, శూద్రులకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులను సేవించడంలో భక్తి, యజమాని ఎడల సేవకులకు భక్తి, సర్వులకు ఉపకారం చేస్తూ ఆదరించడం గృహస్థులకు భక్తి, ఏకాంతంలో తపస్సు చేయడం యోగులకు భక్తి, పతి ఎడల భార్యకు భక్తి ఇవి ప్రతివారు ఆచరించతగిన సువ్రతములు. అనేక ధర్మశాస్త్రాలు తెలిసిన మీ భార్యను నేను మీకు అయిష్టమైన పనులు చేస్తానా ! నాధా నాది ఒక మనవి మీ దర్శనార్ధమై మన ఇంటికి ఒక పావనుడైన బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చాడు. అతడు మీ దర్శనం ఆశించి నిరాహారి జపము చేస్తూ అయి ఎనిమిది రోజులుగా వేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయనను పరామర్శించండి " అన్నది. నాగరాజు " లలనా ! దేవతలు, అసురులు గౌరవించే నేను ఒక సామాన్య బ్రాహ్మణుడిని పరామర్శించడానికి వెళ్ళడమా ! " అన్నాడు. ఆమె " నాధా ! అలా కాదు. మీ దర్శనం కోరి ఎనిమిది దినముల నుండి నిరాహారి అయి వేచి ఉన్న బ్రాహ్మణుడి కోరిక తీర్చకపోవడం ధర్మమా ! ఆ బ్రాహ్మణుడిని నిరాశపరచిన పాపంలో ఇప్పటి వరకు నీవు సంపాదించిన పుణ్యము, ఉచితానుచిత జ్ఞానము, కృపాగుణము, ధర్మశాస్త్ర పాండిత్యము దగ్ధంచేస్తావా ! నీ ధర్మనిరతి ఇదేనా ! బ్రాహ్మణుడిని నిరాశపరచిన బ్రహ్మహత్యాపాతకము చుట్టుకుంటుంది. నాధా ! మౌనవ్రతముతో దృఢమైన జ్ఞానను, దానం చేసినందు వలన అభ్యుదయము, ఎదుటి వారి ఆశలు సఫలం చేసినందు వలన నరకబాధలు తొలగి పోతాయి స్వర్గసుఖాలు కలుగుతాయి అని పెద్దలు చెప్తారు కదా ! వర్షం కొరకు వేచిచూచే చాతక పక్షిలాగా ఆ బ్రాహ్మణుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు రోషము తగ్గించుకుని బ్రాహ్మణుడిని పరామర్శించండి " అని హిత బోధ చేసింది. నాగరాజు " తరుణీ ! ఎవరో అపరిచితుడిని చూడడానికి నాకు రోషము వచ్చినది నిజము. నాలో కలిగిన గర్వము, రోషం నీ బోధనతో తొలగించి నేను అధర్మవర్తనుడిని కాకుండా కాపాడావు. పూర్వము ఈ గర్వము కోపము చేతనే కార్తవీర్యార్జునుడు, రావణాసురుడు వరుసగా పరశురాముడి చేతిలో శ్రీరాముడి చేతిలో మరణించారు. కనుక కోపము వదలడం మేలు కలిగిస్తుంది. భృగువు ఆయన దర్శనం చేసుకుని నీ వంటి భార్య వలననే కదా ! నాకు ఇంతటి పాపములో కూరుకు పోవలసిన ఆపద తప్పింది కదా ! " అని చెప్పి నాగరాజు వడివడిగా బ్రాహ్మణుడిని చూడడానికి వెళ్ళాడు.

మహాపద్ముడు

నాగరాజును చూసిన భృగువు సంభ్రమంతో ఎదురువెళ్ళాడు. ఇద్దరూ ఒకరి క్షేమము ఒకరు తెలుసుకున్న తరువాత ఒక చెట్టు కింద కూర్చున్నారు. నాగరాజు " మహాత్మా ! తమరు ఎనిమిది దినముల నుండి నా కొరకు వేచి ఉన్నారు . మీ కోరిక ఏదైనా తప్పక నెరవేరుస్తాను " అన్నాడు. బ్రాహ్మణుడు " నాగరాజా ! నీ గురించి విని నీ వద్దకు వచ్చాను. నీవు సూర్యభగవానుడి వద్దకు వెళ్ళావని విన్నాను. అందుకని మీ కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు నా సందేహములు తీర్చండి " అని అడిగాడు. నాగరాజు " మీ వంటి వారి సందేహము తీర్చుడమే నా జన్మకు ధన్యత అడగండి " అన్నాడు. బ్రాహ్మణుడు " నాగరాజా ! నా సందేహములు తరువాత అడుగుతాను. ముందుగా మీరు సూర్యరధము వెంట వెళ్ళునప్పుడు జరిగిన అద్భుతముల గురించి వివరించండి " అని అడిగాడు. నాగరాజు " బ్రాహ్మణోత్తమా ! ఆశ్చర్యములలో ఆశ్చర్యము ఆదిత్యుడు. అతడి వలన ఈ లోకములోని జీవజాలము చైతన్యంతో జీవిస్తుంది. సూర్యకిరణ ప్రభావంతో దేవతలు, వాలఖిల్యులు, మహామునులు, సిద్ధులు, పక్షిజాతులు హాయిగా జీవిస్తున్నారు. సూర్యకిరణ వేడితో వేడిక్కిన జలములు మేఘముల రూపుచెంది వర్షిస్తున్నాయి. ఇంతకంటే అద్భుతము ఏమి కావాలి. బ్రాహ్మణోత్తమా ! సూర్యుడు వర్షములు కురిపిస్తున్నాడు. తిరిగి కిరణముల వేడిచేత ఆ నీటిని లాక్కుంటున్నాడు ఇంతకంటే వేరొక ఆశ్చర్యము ఏమి ? ఈ సూర్యుడి వలన బీజములు వృక్షములు ఔతాయి. ఇది అద్భుతము కదా ! ఇంత ఎందుకు ఆ నిరంజనుడు, అక్షరుడు, అజరుడు, అద్వయుడు, శాశ్వతుడు అయిన పురుషోత్తముడు సూర్యుడి ద్వారా వెలుగుతున్నాడు. ఇంత కంటే వేరొక అద్భుతము ఏమి ?

అగంతకుడు

ఒకరోజు మధ్యాహ్నము సూర్యుడిలా వెలిగిపోతున్న ఒకడు ఎదురు వచ్చాడు. అతడిని చూసి సూర్యుడు తన చేతిని అందివ్వగా అతడు సూర్యుడి చేతిని పట్టుకుని క్రమంగా అతడిలో లీనం అయ్యాడు. ఇంతవరకు రథము మీద కూర్చున్న వాడు సూర్యుడా ! లేక వచ్చిన వాడా సూర్యుడా ! అన్న సందేహము రథము లాగుతున్న నాగరాజులందరికీ కలిగినా ! నేను మాత్రము ధైర్యము చేసి సూర్యుడిని అడిగాను. సూర్యుడు ప్రేమగా నన్ను చూసి " వచ్చిన వాడు దేవతలు, యజుడు, గంధర్వుడు, నాగజాతి వాడు ఎవరూ కాదు. ఊంఛవృత్తితో జీవించు వాడు. అతడు నియమ నిష్టలతో జీవితము గడుపుతూ, కందమూలములు, ఫలములు, నీరు మాత్రమే స్వీకరించి జీవిస్తున్నాడు. అతడికి కోరికలు లేవు, తనకు ప్రాప్తము లేని దానికి అర్రులుచాచడు, సర్వభూతహితుడు అందుకే అతడు సిద్ధిపొంది సూర్యలోక ప్రవేశం చేసాడు " అని చెప్పాడు. బ్రాహ్మణోత్తమా ! ఇలాంటి అద్భుతాలు ఎన్నింటినో చూసాను " అని నాగరాజు చెప్పాడు. ఆ మాటలు విన్న భృగు నాగరాజుతో " నీ మాటలతో నా సందేహములన్నీ తీరిపోయాయి. ఇక నేను వెళ్ళి వస్తాను " అన్నాడు. నాగరాజు " అదేమిటి బ్రాహ్మణోత్తమా ! ఎంతో కష్టపడి ఇంత దూరము వచ్చావు. నీవు వచ్చిన పని చెప్ప లేదు. నీ కోరిక ఏమిటో అడుగు నేను తీరుస్తాను. నాయందు నీవు ఉన్నావు నీ అందు నేను ఉన్నాను మన ఇద్దరి అందు ఈ ప్రపంచం ఉంది. నిశ్చింతగా ఉండండి " అన్నాడు నాగరాజు. భృగు " నాగరాజా నీవు చెప్పినది నిజము. నీవు నేను ఈ సమస్త జీవరాశులు అంతా ఒకటే. ఎలాంటి భేదము లేదు. నేను ఏమి తెలుసుకోవడానికి వచ్చానో అది నాకు అవగతము అయినది. నాకు ఆత్మదర్శనం అయింది. అందరినీ సమ దృష్టితో చూడాలన్నది ఒక వ్రతముగా పెట్టుకుంటాను. ఇక నాకు శలవు ఇప్పించండి " అని చెప్పి భృగువు అక్కడ నుండి వెళ్ళి పోయాడు.

అనుశాసనిక పర్వము
అనుశాసనిక పర్వము, మహాభారతంలోని 13వ భాగం. భీష్ముడు యుధిష్ఠిరునకు చేసిన చివరి ఉపదేశాలు (అనుశాసనాలు) ఈ పర్వంలోని ప్రథాన ఇతివృత్తం.

అనుశాసనిక పర్వము ప్రథమాశ్వాసము

  • 1.1 బ్రాహ్మణ వనిత
  • 1.2 పామువాదన
  • 1.3 మృత్యుదేవతవాదన
  • 1.4 మృత్యుభయము
  • 1.5 అగ్నిదేవుడు సుదర్శన
  • 1.6 బ్రాహ్మణత్వము
  • 1.7 మతంగుడి తపసు
  • 1.8 విశ్వామిత్రుడి బ్రాహ్మణత్వము
  • 1.9 గాధి రుచీకులకు పుత్ర భాగ్యము
  • 1.10 వీతహవ్యుడు బ్రాహ్మణత్వము
  • 1.11 దైవము పురుషప్రయత్నను
  • 1.12 మంచి పనులు ఫలితము
  • 1.13 యజమానుడు సేవకుడు
  • 1.14 యజమానులు భ్రుత్యులు
  • 1.15 ధర్మము జ్ఞానము
  • 1.16 మాటతప్పుట
  • 1.17 కులము విద్య
  • 1.18 లక్ష్మీ నివాసము
  • 1.19 స్త్రీలు పురుషులు దాంపత్యము
    • 1.19.1 భగస్వనుడు మునిపుంగవుడిని వివాహమాడుట
  • 1.20 వైష్ణవము
  • 1.21 తత్వములు
    • 1.21.1 అధ్యాత్మము అదిభూతము అధిదైవతములు
    • 1.21.2 విష్ణుస్వరూపము
    • 1.21.3 మునులతో గరుత్మంతుడు
    • 1.21.4 గరుత్మంతుడు కశ్యపుడు
    • 1.21.5 గరుత్మంతుడు నారాయణుడిని వెంటవెళ్ళుట
    • 1.21.6 విష్ణు మహిమ

No comments:

Post a Comment

Featured Post

RAMAYANAM - రామాయణము