Thursday, March 16, 2017

ఆది పర్వము ప్రథమాశ్వాసము -1


-ఆది పర్వం ఈ క్రింది సంస్కృత మంగళ శ్లోకంతో ప్రారంభం అవుతుంది. ఈ సంస్కృత శ్లోకం తెలుగు సాహిత్యానికే మంగళ శ్లోకం అనవచ్చును.
శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

ఆ తరువాత ఒక వచనం, తరువాత ఈ క్రింది ఉత్పలమాలతో ప్రారంభం అవుతుంది.

రాజకులైకభూషణుడు, రాజమనోహరు, డన్యరాజతే
జోజయశాలిశౌర్యుడు, విశుద్దయశశ్శరదిందు చంద్రికా
రాజితసర్వలోకు, డపరాజితభూరిభుజాకృపాణధా
రాజలశాంతశాత్రవపరాగుడు రాజమహేంద్రుడున్నతిన్

ఈ ఆదిపర్వంలో నన్నయ తాను ఎందుకు ఈ మహా భారతాన్ని తెలుగు సేయుచున్నాడో, అందుకు ఎవరు తోడ్పడుతున్నారో వివరించాడు. అంతే కాకుండా మహాభారత ప్రశస్తిని, అందులో ఏయే విభాగాలలో ఏ కథాంశం ఉన్నదో కూడా వివరించాడు. ఇది తరువాతి కవులకు, పరిశోధకులకు ఎంతో మార్గదర్శకంగా ఉంది.


ప్రథమాశ్వాసము

అవతారిక, శమంత పంచకాక్షౌహిణీ సంఖ్యా కథనము, ఉదంకుడు కుండలాలు తెచ్చి గురుపత్నికిచ్చు కథ, సర్పయాగముకై ఉద్ధవుడు జనమేజయుడిని ప్రోత్సహించుట మొదలగునవి కలవు.

ప్రవేశిక

పాండవ మధ్యముడు అర్జునుడు. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు. అభిమన్యుడు కురుంక్షేత్ర యుద్ధంలో మరణించాడు. అభిమన్య, ఉత్తరల కుమారుడు పరీక్షిత్తు. పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు. జనమేజయుడు మహాయజ్ఞం చేస్తున్న సమయంలో అక్కడకు దేవతల శునకం అయిన సరమ కుమారుడు సారమేయుడు వచ్చి ఆడుకోసాగాడు. అది చూసిన జనమేజయుని కుమారులు ఆ కుక్క పిల్లను కొట్టి తరిమారు. సారమేయుడు ఏడుస్తూ తల్లి వద్దకు పోయి ఈ విషయం చెప్పగా సరమ జనమేజయుని వద్దకు వచ్చి " జనమేజయా ! నీకుమారులు విచక్షణ కరుణ లేకుండా నా కుమారుడిని కొట్టారు. రాజా ! యుక్తా యుక్త విచక్షణ లేకుండా మంచి వారికి గాని సాధువులకు గాని అపకారం చేస్తే అనుకోని ఆపదలు వచ్చిపడతాయి." అని పలికి అక్కడి నుడి వెళ్ళిపోయింది. యజ్ఞం పూర్తిచేసి జనమేజయుడు హస్థినాపురం పోయిన తరువాత ఒక రోజు సరమ మాటలు గుర్తుకు వచ్చాయి. జరిగిన అపరాధానికి పరిహారం జరపక పోయినట్లైతే సమస్యలు ఎదురు కాగలవని భావించిన జనమేజయుడు తగిన శాంతి చేయడానికి తగిన ముని కొరకు అన్వేషిస్తూ సుతశ్రవణుడు అనే మునిని కలుసుకుని నమస్కరించి " మీ కుమారుడైన సోమశ్రవణుడిని నాకు ఋత్విక్కుగా పంపించండి" అని ప్రార్థించాడు. అందుకు సుతశ్రవణుడు అంగీకరించి తన కుమారుడిని జనమేజయుని వద్దకు పంపాడు. జనమేజయుడు అతడి సాయంతో అనేక పుణ్యకార్యాలు చేసాడు. 

అవతారిక

శౌనకుడు నైమశారణ్యంలో సత్రయాగం చూస్తున్న సమయంలో అక్కడకు రోమహర్షుని కుమారుడైన ఉగశ్రవసుడు అను సూతుడు వచ్చాడు. సూతుడు తనను తాను మునులకు పరిచయం చేసుకుని తాను పురాణకథలు చెప్పటంలో సిద్ధహస్థుడినని చెప్పాడు. అక్కడ ఉన్న మునులు పుణ్యకథను వినాలని కోరికను ఉగ్రశ్రవసువునకు తెలిపారు. ఉగ్రశ్రవసువు వారికి ఒక కథ చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కృష్ణద్వైపాయనుడు అను మహర్షి ఒకటిగా ఉన్న వేదాలను ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించాడు. తర్వాత బ్రహ్మదేవుని అనుమతి పొంది అష్టాదశ పురాణాలను, భాగవతకథ, అణు, ధర్మశాస్త్రాలను, రాజవంశ చరిత్రలను, ఇతిహాసాలు మొదలైన రచనలను చేసాడు. ఈ మహా భారతం గ్రంథాన్ని ధర్మజ్ఞులు ధర్మశాస్త్రమని, ఆత్మ జ్ఞానులు వేదాంతమని, నీతి కోవిదులు నీతి శాస్త్రమని, కవులు మహాకావ్యమని, ఇతిహాసికులు ఇతిహాసమని, పౌరాణికులు పురాణమని, లాక్షణికులు సర్వ లక్షణ గ్రంథమని అంటారు. ఈ మహాభారతాన్ని చెప్పుటకు దేవలోకంలో నారదుని, పితృలోకంలో దేవలుడిని, గరుడ, గంధర్వ, యక్ష, రాక్షస లోకాలలో చెప్పుటకు శుకమహర్షిని, మనుష్యలోకంలో వైశంపాయుని నియమించాడు. వైశంపాయుడు జనమేజయునికి చెప్తుండగా నేను విని అది మీకు చెప్తున్నాను.


శౌనకాది మునులు ఉగ్రశ్రవసువునితో " అయ్యా మాకు శమంతక పంచకం గురించి వివరించండి. మహా భారత కథకు మూలమేమిటో వివరించండి భీష్మాది కురువీరుల గురించి సవివరంగా వినాలని ఉంది " అన్నారు. కృతయుగాంతంలో దేవదానవ యుద్ధం జరిగింది. త్రేతాయుగాంతంలో రామరావణ యుద్ధం జరిగింది. ద్వారపరయుగాంతంలో పాండవులకు కౌరవులకు యుద్ధం జరిగింది. త్రేతాయుగ ద్వారపర యుగ సంధిలో జమదగ్ని కుమారుడు పరశురామునికి క్షత్రియుల పట్ల ఏర్పడిన వైరం కారణంగా ఇరవై ఒక్కసార్లు భూ ప్రదక్షిణ చేసి క్షత్రియులను చంపి ఆ రక్తంతో ఐదు మడుగులు ఏర్పరిచాడు. వాటిని శమంతక పంచకం అంటారు. ఆ శమంతక పంచకంలో పాండవులు కౌరవులు యుద్ధం చేసారు కనుక అది ఇప్పుడు కురుక్షేత్రం అయింది.


అర్జునుని ముని మనుమడైన జనమేజయుడు యజ్ఞం చేస్తున్న ప్రదేశంలో సరమ అనే దేవ శునకం కొడుకు ఆడుకుంటూ ఉండగా జన మేజయుని తమ్ములు శ్రుత సేనుడు, భీమ సేనుడు, ఉగ్ర సేనుడును వారు వచ్చి సారమేయుడిని కొట్టారు. సారమేయుడు ఏడుస్తూ తల్లికి చెప్పాడు. సరమ జనమేజయునితో " నీ తమ్ములు నా కుమారుని అకారణంగా కొట్టారు ఇది అధర్మం. ఇలాంటి పనులు చేసే వారికి ఆపదలు వస్తుంటాయి " అని చెప్పినది. జనమేజయుడు దేవశునకం అయిన సరమ పలుకులు విని శాంతి కర్మలు చేయింటానికి సంకల్పించాడు. అందుకు శోమశ్రవుడు అనే మహా మునిని పురోహితునిగా నియమించుకున్నాడు.

ఉదంకోపాఖ్యానము

వ్యాసమహర్షి శిష్యుడైన పైలుడి శిష్యుడు ఉదంకుడు. ఉదంకుడు అను మునికుమారుడు గురుకులంలో విద్యను అభ్యసించాడు. ఉదంకుడు గురువులను భక్తితో సేవించి అణిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, మహిమ, ఈశత్వం, వశిత్వం, కామనసాయిత అనే అణిమాది అష్టసిద్ధులు వంటి విద్యలను పోందాడు. ఒకరోజు అతడు తన వయసు మీరి పోయిందని గ్రహించి చితించి గురువుకు చెప్పి బాధ పడగా గురువు అతడిని ఊరడించి తన కహమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని మాట ఇచ్చాడు. ఉదంకుడు గురువుకు గురుదక్షిణ ఇవ్వాడానికి సంకల్పించగా గురుపత్ని అతడిని గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు కావాలని అడిగింది. . ఉదంకుడు అందుకు అంగీకరించి పౌష్య మహారాజు వద్దకు బయలుదేరాడు. ఉదంకుడు గురుదక్షిణగా పౌష్యుని భార్య కుండలాలు తీసుకురావడానికి బయలుదారి వెళుతున్న సమయంలో ఒక దివ్యపురుషుడు కనిపించి అతడిని గోమయం తినమని సూచించాడు. ఉదంకుడు మారుమాటాడక అలాగే చేసాడు. ఉదంకుడు పౌష్యుని వద్దకు పోయి " నేను నా గురుపత్నికి గురుదక్షిణగా మీ భార్య కుండలాలను తెచ్చి ఇస్తానని మాట ఇచ్చాను. అవి నాకు ఇప్పించారంటే నేను పోతాను " అని అడిగాడు. ఉదంకుడు కోరికను మహారాజు మన్నించిన మహారాజు " మహాత్మా ! నాభార్య వద్దకు వెళ్ళి ఆమెను అడిగి కుండలాలను తీసుకు వెళ్ళండి " అని బదులిచ్చాడు.
ఉదంకుడు అలాగే పౌష్యమహారాణి వద్దకు పోయి అక్కడ ఆమె కనిపించక తిరిగి మహారాజు " వద్దకు వచ్చి " మహారాజా ! నాకు ఆమెకనిపించ లేదు. కనుక మీరు వెళ్ళి తెచ్చి ఇవ్వండి. " అన్నాడు. మహారాజు ఆమె మహాత్మా ! ఆమె మహా పతివ్రత, చాలా పవిత్రురాలు, ఆమె కనిపించాలంటే శౌచం పాటించాలి." అని చెప్పాడు. ఉదంకుడు అప్పుడు తాను గామయం తినిన తరువాత స్నానం ఆచరించని వి, యం గుర్తుకు తెచ్చుకుని కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనం చేసి తిరిగి వెళ్ళగా అప్పుడు అతడికి పౌష్యా దేవి కనిపించింది. ఆమె ఉదంకుడి కోరిక మీద కుండలములను ఇస్తూ " ముని కుమారా ! ఈ కుండలములు " కొరకు మాయలమారి అయిన తక్షకుడు ఎదురు చూస్తున్నాడు. నీవు ఈ కుండలములు అతడి కంట బడకుండా జాగ్రత్తగా తీసుకుని పో" అని చెప్పింది.


ఉదంకుడు పౌష్యుడు శాపప్రతిశాపాలు ఇచ్చుకొనుట

కుడలములు తీసుకుని రాజు వద్దకు వెళ్ళగా రాజు ఉదంకుని భోజనం చేసిన తరువాత వెళ్ళమని చెప్పాడు. రాజు కోరిక మేరకు ఉదంకుడు పౌష్యుని ఇంటిలో భోజనం చేస్తుండగా అన్నంలో ఒక వెంట్రుక వచ్చింది. అందుకు ఉదంకుడు కోపించి చూడకుండా భోజనం పెట్టినందుకు గుడ్డి వాడివి కమ్మని శపించాడు. పౌష్యుడు కోపించి " ఇంత చిన్న దోషానికి అంత పెద్ద శిక్షా. నేను నీకు ప్రతి శాపం ఇస్తున్నాను. నీవు సంతాన హీనుడవు కమ్ము" అన్నాడు. . తన అపరాధం గ్రహించిన ఉదంకుడు మహారాజుతో అయ్యా ! నాకు సంతానం కావాలి కనుక నా శాపాన్ని ఉపసంహరించు " అని కోరగా పౌష్యుడు " మనసు నవనీతం మాట వజ్రాయుధం ఇది బ్రాహ్మణ స్వభావం. క్షత్రియులకు ఇవి రెండు విపరీతములే కనుక నా శాపం ఉపసంహరించ లేను కనుక నీవు ఉపసంహరించు" అన్నాడు. అందుకు ఉదంకుడు " కొంతకాలం తరువాత నా శాపం ఉపసంహరింపబడుతుంది " అని చెప్పి అక్కడి నుండి వెళ్ళాడు.

తక్షకుడు కుండలములు తస్కరించుట

అలాగే అని చెప్పి ఉదకుండు సకాలంలో గురుపత్నికి కుండలాలను అందచేయాలని బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉదకుండు అనుష్టానం చేసుకోవడానికి కుండలాలను ఒక ప్రదాశంలో దాచి స్నానం చేస్తున్న సమయంలో తక్షకుడు గట్టున ఉన్న కుండలాలను అపహరించి నాగలోకానికి వెళ్ళాడు. అతనిని వెన్నంటి వెళ్ళిన ఉదంకుడు అతడు ఒక రంధ్రంలో దూరడం గ్రహించి తానూ ఆ దారిలో ప్రవేశించి నాగలోకం చేరాడు. నాగ ప్రముఖులకు నమస్కరించి భక్తితో స్తుతిస్తూ " వేయి పడగలతో భూమిని భరిస్తూ నారాయణుడికి శయ్యగా సేవలు చేస్తున్న అనంతా ! నీకు నమస్కారం. సమస్త నాగలోకమును రాక్షసుల బారినుండి రక్షిస్తూ పరమశివుడి మెడలో ఆభరణంగా వెలుగొందుతున్న వాసుకికి వందనం. సమస్త దేవతలతోనూ మానవులతోనూ పూజలందుకొంటున్న నాగదేవతలారా నన్ను అనుగ్రహించండి. కుమారుడైన అశ్వసేనుడితో భూలోకం అంతా సంచరిస్తున్న తక్షకా నన్ను అనుగ్రహించు" అని ప్రార్థించాడు. అప్పుడు నలుపు తెలుపు దారాలతో వస్త్రములు నేయుచున్న ఇద్దరు స్త్రీలు, పన్నెండు ఆకులుగల చక్రమును తిప్పుతున్న ఆ ఇద్దరు స్త్రీల ఆరుగురు కుమారులు. మహోన్నత గుర్రం మీద ఉన్న ఒక పురుషుడు కనిపించారు. ఆ దివ్యపురుషుడు అతని వద్దకు వచ్చి " ఉదంకా నీ భక్తికి మెచ్చాను. ఏమి కావాలో కోరుకో " అన్నాడు. ఉదంకుడు " ఈ నాగలోకం నాకు వశం కావాలి " అని కోరాడు. అలాగే అని వరమిచ్చిఆ దివ్యపురుషుడు గుర్రం చెవిలో ఊదమన్నాడు. ఉదంకుడు ఆ గుర్రము చెవిలో ఊదాడు వెంటనే ఆ గుర్రం చెవి నుండి భయంకర అగ్ని జ్వాలలు నాగలోకాన్ని చుట్టుముట్టాయి. నాగులంతా ప్రళయం వచ్చిందని తల్లడిల్లి పోయారు. తక్షకుడు భయపడి కుండలాలను ఉదంకుడికి ఇచ్చాడు. అక్కడి నుడి బయటపడే మార్గం లేక ఉదంకుడు అయోమయంలో పడగా దివ్యపురుషుడు " ఉదంకా ! ఈ గుర్రాన్ని ఎక్కి నీవు కోరిన ప్రదేశానికి చేరగలవు " వెంటనే ఉదంకుడు ఈ గుర్రం మీద గురువు ఆశ్రమానికి చేరి కుడలాలను గురుపత్నికి సమర్పించాడు.

ఉదంకుడు గురుదక్షిణ సమర్పించుట

 గురువు ఉదంకునితో " ఉదంకా ! సమీపంలో ఉన్న పౌష్యమహారాజు నుండి కుండలాలు తీసుకురావడానికి ఇంత సమయం ఎదుకు అయ్యింది " అని అడిగాడు. ఉదంకుడు జరిగిన విషయాలు వివరంగా గురువుకు చెప్పాడు. గురువు " ఉదంకా ! నీవు ధన్యుడివి. ఎద్దును ఎక్కి వచ్చిన వాడు ఇంద్రుడు. ఆ ఎద్దు ఐరావతం. గోమయం అమృతం. అది సేవించడం వలనే నీవు అనుకునిన పని చేయగలిగావు. నాగలోకంలో నీవు చూసిన స్త్రీలు దాత, విధాత. నలుపు తెలుపు దారాలే రాత్రి పగలు. పన్నెండు ఆకులు కలిగిన చక్రం పన్నెండు మాసమపలకు ప్రతీక అయిన కాల చక్రం. వారి ఆరుగురు కుమారులు ఆరు ఋతువులు. గుర్రం మీద వచ్చిన దివ్యపురుషుడు ఇంద్రుడి మిత్రుడైన పర్జన్యుడు. గురుపత్ని కోరిక నెరవేర్చి నీవు గురుదక్షిణ సమర్పించున్నావు. ఇక నీ విద్యాభ్యాసం పూర్తి అయింది " అని పలికాడు.

తక్షకుని మీద ఉదంకుని ప్రతీకారం

  అనుకున్న కార్యం నెరవేరినా ఉదంకునికి తక్షకునిపై ప్రతీకారాగ్ని తీరలేదు. అందు కొరకు అతడు జనమేజయుని వద్దకు వెళ్ళాడు. ఉదంకుడు జనమేజయునితో తక్షకుడు తనకు చేసిన అపకారం గురించి చెప్పాడు. " జనమేజయ మహారాజా ! నీకు శుభం కలుగుగాక. నా పేరు ఉదంకుడు. నేను గురువు గారి కార్యం మీద వెళ్ళిన సమయంలో తక్షకుడు కుటిల బుద్ధితో నాకు అపకారం చేసాడు. నాకే కాదు నీకు కూడా తక్షకుడు మహాపరాధం చేసాడు. శృంగి శాపాన్ని మిషగా తీసుకుని మీ తండ్రైన పరీక్షిత్తు మహారాజును అతి క్రూరంగా కాటు వేసి తన ఘోర విషాగ్ని కీలలకు నీ తండ్రిని బలి చేసి చంపాడు. మహా బలవంతుడైన తక్షకుడు ఆ బ్రాహ్మణుడితో పరీక్షిత్తు మహారాజు అని నచ్చ చెప్పక అది మిషగా తీసుకుని దారుణంగా డంపాడు కదా ! నీ తండ్రిని చంపిన వాడి మీద నీవు ప్రతీకారం తీర్చుకోవడానికి నీవు వెంటనే సర్పయాగం చేసి ఈ తక్షకుడిని యాగాగ్నిలో భస్మం చేసి నీ పగ తీర్చుకో. మహారాజా ! ఒక్కడు తప్పు చేసిన అతడి కులమంతా తప్పు చేసి నట్లే కనుక ఇందులో అపరాధం ఏమీ లేదు. కనుక వెంటనే మీరు సర్పయాగం చేసి నాగలోకాన్ని సమూలంగా నాశనం చేయండి " అని జనమేజయుని రెచ్చకొట్టాడు.

Next - ఆది పర్వము ప్రథమాశ్వాసము -2

No comments:

Post a Comment

Featured Post

RAMAYANAM - రామాయణము