సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు
భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలసి విరాటనగరం వైపు
బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను
ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్ది పాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ
సైన్యాన్ని ఎదిరించ లేక పోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం
తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే
ఉన్నాడు. గవాధ్యక్షుడు " ఉత్తరకుమారా ! కురు సైన్యములు మన ఆవుల మందల మీద
విరుచుకు పడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి మీరు వెంటనే వచ్చి
వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి " అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు
తమపరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్యపరాక్రమాల గురించి
చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి
పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను
రక్షించండి " అని ప్రార్ధించాడు.
ఉత్తరకుమారుని ప్రగల్భాలు
గవాధ్యక్షుని
పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగి పోయాడు. " గవాధ్యక్షా! నిజం పలికావు. నేను
కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు
తగిన సారథి లేడు కదా! అందుకని బాధగా ఉంది. సమర్ధుడైన సారథి దొరికితే కౌరవ
సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వద్దామలను నేను
చీసే యుద్ధంతో అర్జునిని తలపింప చేసి ఆలమందలను విడిపించకుంటే నాతండ్రి నా
పరివారం నన్ను మెచ్చుతారా. ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకు పోతారు. వెంటనే
తగిన సారథిని వెతకండి " అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తర
కుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే
అర్జునిని దగ్గరకు వెళ్ళి పరిస్థితి వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి
చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుక పరచుకొనే
సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి " నీవు పోయి మన బృహన్నలకు
సారథ్యం చేయు సామర్థ్యం ఉంది. పూర్వం అర్జునినికి సారథ్యం వహించి అతనికి
ఖాండవ వనదహనంలో సహాయం చేసి అతని ప్రశంశలందు కున్నాడు. అతని సహాయంతో కౌరవ
సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు " అన్నాడు.
ద్రౌపది వెంటనే వెళ్ళి ఉత్తరను కలుసుకుని " అమ్మా! మన రాకుమారుడు సారథి
కొరకు వెతుకు తున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రథం నడపడంలో
అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. ఖాండవ వన దహనంలోను ఇతర సమయాలలోను
అర్జునునికి సారథిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయం రాకుమారునికి
చెప్పు " అన్నది.
బృహన్నల సారధ్యమును ఒప్పించుట
ఉత్తర
మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్ళి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర
కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో " సైరంద్రీ ! నన్ను ఎగతాళి చేస్తావా !
నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు
సారథిని చేస్తావా. కౌరవుల సేనలు వచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై
యుద్ధానికి వెళ్ళి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారథ్యంలో వెళితే
నలుగురూ నవ్వరా? అయినా మనదేశంలో సారధులకు ఇంత కరువొచ్చిందా " అన్నాడు.
సైరంధ్రి " రాకుమారా! ఒక్క కౌరవ సైన్యం మాత్రమే కాదు ముల్లోకాలు ఒకటై
వచ్చినా బృహన్నల సారథిగా ఉన్నచో నువ్వు గెలువవచ్చు. కారణాంతరాల వలన పేడి
తనం వచ్చినంత మాత్రాన అతని సామర్థ్యం పోతుందా " అన్నది. ఉత్తర కుమారుడు
గత్యంతరం లేక బృహన్నలను సారధిగా అంగీకరించాడు.
బృహన్నలతో ఉత్తరకుమారుడు సమరానికి బయలుదేరుట
ఉత్తర
కుమారుడు బృహన్నల సారధ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు
పరుగెత్తింది. గురువు గారికి నమస్కరించు " మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో
మరణించాడు. మరల వేరే సమర్ధుడైన సారథి లభించ లేదు. ఈ రోజు కౌరవ సేన మా
గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారథి లేడని
బాధ పడుతున్నాడు. మీ సారథ్య సామర్థ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని
మా అన్నయ్యకు సారథిగా మిమ్మలిని తీసుకు పోవడానికి వచ్చాను నా మాట మన్నించి
నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి " అన్నది. బృహన్నల నవ్వి అమ్మా "
అమ్మా! ఉత్తరా నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట
ఎందుకు కాదనాలి. నువ్వు అడిగావు కనుక సారథ్యమే కాదు ఎంతటి కష్టమైన పని
అయినా చేసి పెడతాను " అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే ఉత్తరకుమారుడు "
నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారథిగా నా రథం నడపాలి. త్వరగా రథం
ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది " అన్నాడు. బృహన్నల ఉత్తరునితో "
రాకుమారా! ఏదో ఆట పాటలకు నన్ను పిలువ వచ్చు కాని యుద్ధం చేయుటకు సారథిగా
నన్ను పిలుచుట ఉచితమా. ఎక్కడైనా బలాఢ్యుడైన వాడిని సారథిగా నియమించు " అని
అన్నాడు బృహన్నల. " అదేమిటి బృహన్నలా! నాడు ఖాండవవన దహనాన సమయమున అర్జునిని
రథం నీవు నడిపావట కదా. అర్జునినికి విజయం చేకూర్చావట కదా మరి ఆచాతుర్యం
శౌర్యం నీలో తగ్గి పోయాయా. మరో మాట మాటాడక యుద్ధానికి సిద్ధంకా " అన్నాడు
ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల.
యుద్ధానికి బయలుదేరుట
తరువాత
ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి
తొడుక్కోమన్నాడు. దానిని తల క్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు
బృహన్నల. ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. " బృహన్నలా త్వరగా
రథమునకు హయములను పూన్చుము. ధ్వజమును ఎత్తుము. మనం త్వరగా పోయి గోవులను
విడిపించ వలెను " అన్నాడు. బృహన్నల " నీవు ఏమి చెప్పిన అది చేయ వలెను. నీవు
రమ్మన్న రావలయును, పొమ్మన్న చోటికి పోవలెను. నా బలం తెలుసుకుని నా చేత పని
చేయించుకుని విజయం సాధించు " అన్నాడు. బృహన్నల రథం సిద్ధం చేసాడు. కేతనం
ఎగురవేసాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర " అన్నయ్యా! నీవు
కౌరవ వీరులను గెలిచినపుడు వారి తల పాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా
తీసుకు రావా " అన్నది. బృహన్నల " ఉత్తరా! అదెంత పని రాకుమారుడు విజయంతో
తిరిగి వస్తాడు. నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు " అన్నాడు. బృహన్నల వివిధ
రకముల ఆయుధములు రథంలో పెట్టించి రథం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను
అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్ళారో తెలుసుకుని ఆ దిక్కుగా
రథం పోనివ్వమన్నాడు. బ్రాహ్మణుల, పుణ్యాంగనల దీవెనలందుకుని ఉత్తరకు మారుడు
ఊరి వలుపలికి వచ్చాడు.
కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట
అల్లంత
దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను
తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు. " బృహన్నలా! భీస్ముడు, ద్రోణుడు,
కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవ సేన
భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా. నాకు విలు విద్యలో అంత
ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రధ, దుర్ముఖ,
వికర్ణ, కర్ణ మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను. ఇక్కడ పరిస్థితి ఇలా
ఉంటుందని వచ్చాను. నీవేమో నీపాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో
యుద్ధం చేయలేను. రథమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికితీపి కదా.
నా శరీరం వణుకుతుంది " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా ! అసంఖ్యాకంగా
ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను. కొద్ది పాటి సైన్యాల రక్షణలో
ఉన్న గోసమూహాల వైపు రథాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను
మళ్ళిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్ళించి తీసుకువస్తాను అని
చెప్పావు కదా ఇప్పుడు ఇలా బెదిరి పోవడం తగునా " అన్నాడు. ఉత్తరుడు " అమ్మో!
గోవుల మాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని " అన్నాడు.
అర్జునుడు " అధికాదు ఉత్తరకుమారా! నీ బలం ఎదిరి బలం చూసుకుని కొంచం సేపు
యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవసేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలి పోవడం
యుక్తము కాదు వీరులిది మెచ్చరు " అన్నాడు అర్జునుడు. " బృహన్నలా ! సుశర్మ
మనగోవులను తరలించుకు వెళ్ళాడు కనుక మా తండ్రిగారు సైన్యాలతో అతనిని
ఎదిరించడానికి వెళ్ళారు. నాకు సాయంగా సైన్యం లేరు కౌరవ సైన్యామో అసంఖ్యాకం
దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్ళు మనలిని చూడక మునుపే రథం
మళ్ళించుట మంచిది వెనుదిరుగుము " అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు " అధికాదు
రాకుమారా ! ఇలా ఆవులను వదిలి వెళితే నగరిలో అప్రదిష్ట కాదా. పిరికి వాళ్ళను
లోకం మెచ్చదు. నీకు సారథి లేడని సైరంధ్రి చెపితే నీకు నేను సారథిగా
వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులక్లు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు మనసు
చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు " అన్నాడు. ఉత్తరుడు
" బృహన్నలా! నలుగురు నవ్వితే నాకేమి? నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం
చెయ్యి " అంటూ ధనుర్భాణాలను రథం పై వదిలి వెను తిరిగి పరుగెత్త సాగాడు.
బృహన్నల కూడా ఉత్తరకుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు
నవ్వుకున్నాయి. బృహన్నల ఉత్తరుని పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని నోరు,
ఎండిపోతూ ఉంది, కాళ్ళూ చేతులు గడగడ లాడుతున్నాయి, నోరు ఎండి పోయింది, మొహం
వెలవెల పోయింది గొంతు పూడుకు పోయి పరిస్థితి దారుణంగా ఉంది.
ఉత్తరకుమారుని అనునయించి అర్జునుడు యుద్ధానికి సిద్ధపడుట
ఉత్తర
కుమారుడు " బృహన్నలా! నీకు అనేక బహుమతులు ఇస్తాను నన్ను వదిలి పెట్టు. మా
అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది ఆమెను చూడాలి " అన్నాడు. అర్జునుడు ఉత్తర
కుమారుని చూసి అనునయంగా " ఉత్తర కుమారా! భయపడకుము నీవు యుద్ధం చెయ్యలేకపోతే
నా రథానికి సారథిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను "
అంటూ అర్జునుడు ఉత్తర కుమారుని తీసుకుని రథం వైపు వచ్చాడు. తాను కూడా రథం
ఎక్కి రధాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన
కౌరవసేనలు కలవర పడ్డాయి. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు
ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు.
కౌరవ సేనలో ప్రముఖుల వాదోపవాదాలు
ద్రోణుడు
భీష్ముని చూసి " వీడు ఎవరో మహా గర్విష్టి వలె ఉన్నాడు. వీడు ఎవరో
తెలుసుకోవాలి " అన్నాడు. భీష్ముడు దుర్యోధనునితో " సుయోధనా ! మనం
శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంక మనం శత్రువలకు భయపడ వలసిన
పని లేదు " అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాప దేశంగా
బదులిచ్చాడు. ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాత వాసం ముగిసింది ఇక వారు బయటికి
రావచ్చు అన్న విషయం గ్రహించిన ద్రోణుడు ఉత్సాహ భరితుడై సుయోధనుని చూసి "
సుయోధనా ! ఆకలితో నకనక లాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు
అర్జునుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి
వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరుడు మనలో ఎవరు ఉన్నారు. అర్జునుడు
గోవులను తరలించుకు వెళ్ళటం తధ్యం " అన్నాడు. ఆ మాటలను విన్న కర్ణుడు కోపంగా
" పాండవ పక్షపాతంతో మాట్లాడు తున్నావు. కౌరవ సేనలలో నీవు ఒక్కడివే
వీరుడివా. అర్జునుడు అంతటి జయించలేని వీరుడా. అతడితో నేను ఒక్కడినే యుద్ధం
చేసి ఓడించగలను. పెద్దలని మన్నించి ఇంతకంటే మాటాడలేక పోతున్నాను " అన్నాడు.
సుయోధనుడు కర్ణుని చూసి " కర్ణా! నీవు తప్పు పలికావు. అతడు నిజంగా
అర్జునుడైతే మరల అరణ్య, అజ్ఞాతవాసాలు చేస్తాడు. కాకుంటే వాడిని నేనే
జయిస్తాను " అన్నాడు. సుయోధనుని మాటలకు అంగీకరించినట్లు తలూపుతోనే
భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు.
అర్జునుడు ఉత్తరకుమారునకు తనను తాను వెల్లడించుట
బృహన్నల రధాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకు వెళ్ళి " ఉత్తర కుమారా !
ఇవి మామూలు ధనస్సులు ఇవి నా ప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి
అక్కడ ఉన్న గాండీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు "
అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు. ఉత్తరకు మారుడు " బృహన్నలా !
రాజ కుమారుడైనైన నన్ను శవాన్ని తాకమని చెప్పుట తగునా " అన్నాడు. అర్జునుడు "
ఉత్తరకుమారా ! అది శవము కాదు. పాండవుల ఆయుధములు. వారు ఇతరులు చేపట్టకుండా
వాటిని శవాకారంలో శ్మశానంలో ఈ జమ్మి చెట్టుపై దాచారు " అన్నాడు. బృహన్నల
మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి
అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసి ఉత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు
ప్రార్ధించగానే అవి ఉత్తరునుకి ఆయుధముల వలె కనిపించాయి. ఉత్తరుడు వాటిలో
ఉన్న గాండీవమును చూసి " బృహన్నలా ! ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే దీనిని
పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు " అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో "
ఉత్తరకుమారా ! అది గాండీవము దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో
అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ లక్ష సంవత్సరాలు ధరించాడు.
తరువాత ప్రజాపతి అరవైనాలుగు వేల సంవత్సరాలు ధరించాడు. తరువాత ఇంద్రుడు ఎనభై
ఐదేండ్లు ధరించాడు. తరువాత చంద్రుడు ఐదు వందల సంవత్సరాలు ధరించాడు. తరువాత
అగ్ని దేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి ఖాండవ వన దహనం
సమయంలో ఇచ్చాడు. ఈ గాడీవాన్ని అర్జునుడు అరవై ఐదేళ్ళు ధరిస్తాడు " అని
చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు. ఉత్తరకుమారుడు
సందేహంగా " బృహన్నలా! పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్ళారో.
వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో ఆ ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో.
వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో. అర్జునుడు ఎక్కడ దాగాడో. కవలలు
ఎన్ని తిప్పలు పడుతున్నారో. మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో
" అంటూ ఆవేదన పడ్డాడు. అర్జునుడు అనునయంగా ఉత్తరునితో " ఉత్తరకుమారా!
చింతించ వలదు. పాడవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాత వాసాన్ని మన
నగరంలోనే గడుపుతున్నారు. కానికి భట్టు ధర్మరాజు, వలలుడే భీమసేనుడు,
దామ్రగంధి, తంత్రీ పాలుడు నకుల సహదేవులు. ఇక దాచడమేల అర్జునడను నేనే.
మాలిని పేరొతో సైరంధ్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు
కీచకుని, ఉపకీచకులను చంపాడు " అని అన్నాడు.
అర్జునుడి దశనామాలు
ఆ
మాటలు విన్న ఉత్తరకుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా " బృహన్నలా!
అర్జునికి పది పేర్లున్నాయి వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని
నమ్ముతాను " అన్నాడు. బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుని చూసి " కుమారా!
అర్జునుడు, పల్గుణుడు, పార్ధుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభస్తుడు,
విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశ నామాలు ఉన్నాయి " అన్నాడు.
అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక " బృహన్నలా ! ఆ దశనామాలు వివరిస్తే
నువ్వే అర్జునుడవని నమ్ముతాను " అన్నాడు. అర్జునుడు " కుమారా! నేను ధరణి
అంతటిని జయించి ధనమును సముపార్జింతిని కనుక ధనుంజయుడ నయ్యాను. ఎవ్వరితోనైనా
పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడి నయ్యాను. నేను ఎల్లప్పుడూ నా
రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూన్చుతాను కనుక శ్వేత వాహనుడిని
అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రాకాసిస్తుంటుంది
కనుక కిరీటి నయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన
పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగ్గుస్సాకరమైన, బీభత్సమైన పనులు
చెయ్యను కనుక బీభత్సుడి నయ్యాను. నేను గాండీవాన్ని ఉపయోగించే సమయంలో రెండు
చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్ధంగా నారిని
సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కవ తెల్లగా ఉంటాను కనుక నన్ను
అర్జునుడు అంటారు. నేను ఉత్తర పల్గుణీ నక్షత్రంలో జన్మించాను కనుక
ఫల్గుణుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు. నా కంటి ముందర ఆయనను ఎవరైనా
ఏదైనా హాని కలిగించిన దేవతలు అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక
జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృధ. కుంతి భోజుని కుమార్తె
కనుక కుంతీదేవి అయింది. పృధపుతృడిని కనుక పార్ధుడిని అయ్యాను. అయినా ఉత్తర
కుమారా! నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని నేను అసత్యం
చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనదహనంలో అగ్ని దేవునికి సాయపడి
నందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు
కృష్ణుడు అనే పదకొండవ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన
సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును
ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు
సుయోధనుని బంధీని చేసినపుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు
భపడ వలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం "
అన్నాడు.
ఉత్తరకుమారుడు స్వస్థుడగుట
ఉత్తర
కుమారుడు చెట్టుదిగి సంభ్రమాశ్చర్యాలతో అర్జునినికి నమస్కరించాడు. ఉత్తర
కుమారుడు " అర్జునా ! నా అదృష్ట దేవతలా నువ్వు నాకు కనిపించావు. చాపల్యంతో
నేను ఏదైనా నిన్ను అని ఉంటే నన్ను మన్నించు. నీ అండ దొరికి నందుకు నా
ఆనందానికిక అవధులు లేవు నన్ను కనికరించు " అన్నాడు. అర్జునుడు రథం దిగి
ఉత్తరుని ప్రియమార కౌగలించు కున్నాడు. ఉత్తరుడు రథం ఎక్కి అర్జునా ఇప్పుడు
నా భయం తొలగి పోయింది. అర్జునినికి సారధిని కావలెనన్న నా కోరిక ఈడేరింది.
నీవు నన్ను ఆజ్ఞాపించి సారధ్యం చేయించుకుని కౌరవులను జయించి గోవులను
మరల్పుము " అన్నాడు. అర్జునుడు వాత్సల్యంతో " కుమారా! భయపడకుము నీ మీద గాలి
కూడా సోకనివ్వను. నీకు రక్షణ కల్పించడమే నా కర్తవ్యం " అన్నాడు. ఉత్తరుడు "
అర్జునా! నీ నిజరూపం తెలిసిన వెంటనే నా భయం పటాపంచలైంది. ఈ పేడి రూపం ఎలా
వచ్చిందో తెలుసు కోవాలని ఉంది " అన్నాడు. అర్జునుడు " ఉత్తరకుమారా ! మా
అన్నగారి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సమయంలో
దేవేంద్రుని ఆహ్వానంపై ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ ఊర్వశి కోరికను
నిరాకరించిన నన్ను పేడి రూపం ధరించమని శపించింది. అజ్ఞాతవాస సమయంలో అది
నాకు వరంలా పరిణమించింది. అజ్ఞాత వాసం ముగియగానే పేడి రూపం పోయింది ఇప్పుడు
నేను అర్జునుడను " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా ఇప్పుడు నన్ను ఏమి
చెయ్యమటావు " అని అడిగాడు. అర్జునుడు " నీవు గాండీ వమును తుణీరములను ఇతర
ఆయుధములను తీసుకుని మిగిలిన ఆయుధములను అలాగే ఉంచు " అన్నాడు. ఉత్తర
కుమారుడు అలాగే చేసాడు. అర్జునుడు వాటిని ధరించి గాండీవాన్ని ఎక్కు పెట్టి
అల్లె త్రాటిని మ్రోగించి అగ్ని దేవుని తలచగానే అమోఘమైన కపిధ్వజం
సాక్షాత్కరించింది. ఉత్తర కుమారుని సింహపతాకమున్న ధ్వజం శమీవృక్షం మీద
పెట్టి కపిధ్వజాన్ని రథమునకు కట్టాడు. మనమున తలవగానే చేతికి దేవదత్తము
వచ్చింది.
అర్జునుడు యుద్ధానికి సిద్ధం అగుట
అర్జునుడు " ఉత్తరకుమారా! నీవు రధమును జమ్మిచెట్టుకు ప్రదక్షిణ చేయించి
ముందుకు పొమ్ము ఇప్పటికే ఆలస్యం అయినది. పశువులు చాలా దూరం వెళ్ళి ఉంటాయి "
అన్నాడు. ఉత్తరుడు రథం మరల్చగానే అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ ధ్వని
భూన భోనాంతరాలలో వ్యాపించింది. రథమునకు కట్టిన గుర్రాలు మూర్చిల్లాయి.
అర్జునుడు గుర్రాలను నిమిరి వాటికి చైతన్యం కలిగించి " కుమారా! యుద్ధసమయంలో
ఇది సహజం కలత చెందకు " అన్నాడు. ఉత్తరుడు " అర్జునా! యుద్ధ సమయంలో అనేక
శంఖారావాల విన్నాను. కాని ఈ శభ్దానికి నా గుండెలు అవిసి పోయాయి, దిక్కులు
తిరిగి పోయాయి, చెవులు బద్దలయ్యాయి నా మనసు నీరు కారింది. ఈ కపిధ్వజాన్ని
చూస్తుంటేనే నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీ తేజము చూసి నేను వివశుడిని
అయ్యాను " అన్నాడు.
భీష్ముడు వాదోపవాదాలను నివారించుట
అర్జునుడు
నవ్వి మరలా శఖాన్నిపూరించాడు. ద్రోణుడు " సుయోధనా! ఆ ధ్వని విన్నావా. ఆ
ధనుష్టంకారం గాండీవం కాదూ, వచ్చేది అర్జునుడు కాదూ, ఉజ్వలంగా
ప్రకాశిస్తున్న ఆ కిరీటం అర్జునికి ఇంద్రుడు ప్రసాదించినది కదూ,
సమరోత్సాహంతో అర్జునుడు కాక మరెవ్వరు. అతనిని ఎదుర్కోడానికి సన్నాహాలు
చెయ్యండి " అంటూ కృపాచార్య అశ్వద్దామలను చూసి ముందు మనం రారాజు సుయోధనుని
పంపుదాము. ఆ వెనుక గో సమూహాలను పంపుదాం. ఆ వెనుక మనం ఉంటాము. అర్జునుడు
వచ్చిన అతనితో మనం యుద్ధం చేస్తాము " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు
భీష్మ, కర్ణ, వికర్ణుల వంక చూసి నేను మీకు ఇదివరకే చెప్పాను. పాండవులు
జూదంలో ఓడి పోయి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాత వాసం
ఒప్పందం చేసుకూన్నారు. ఇంకా ఆ సమయం పూర్తి కాకుండా పార్ధుడు భయట పడ్డాడు
కనుక పాండవులు అరణ్య, అజ్ఞాత వాసములు చేయాలి. ఈ విషయం మనం మోహంతో కాని
పాండవులు లోభంతో కాని గమనించ లేదు. తాత భీష్ముడే దానిని నిర్ణయించటానికి
అర్హులు " అన్నాడు. " వచ్చునది ఉత్తర కుమారుడు కాకుండా గాండీవి అయితే మన
పని సఫలం అయినట్లే. అసలు సుశర్మ దక్షిణ దిక్కుగా మనం ఉత్తర దిక్కుగా
గోవులను పట్టుకోవడానికి వచ్చింది మత్స్యదేశంలో ఉన్న పాండవులను బయట
పెట్టడానికే గదా. ఆ వచ్చిన వాడు అర్జునుడైతేనేమి దేవతలైతేనేమి మనం గోవులను
పట్టుకున్నాం. వాటి కోసం యుద్ధం చేస్తాము కాని వెరువనేల కనుక ముందు మనమే
యుద్ధం చేస్తాము. అయినా అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాలతో ఎలా
యుద్ధం చేస్తాడు. విన్న వారు నవ్వుతారని కూడా అనుకోకుండా శత్రువును నందుల
వలె పొగడుట ఈ ద్రోణునికి తగునా. అయినా ఆచార్యుల వారు దూరంగా నిలిచి
పర్యవేక్షిస్తుంటారు. భోజన సమయాలలో, విద్యగరిపే సమయాలలో, నీతిని భోదించే
సమయాలలో గురువులను సంప్రదించాలి కాని యుద్ధ విషయాలు వారికేం తెలుస్తాయి
అడగటానికి. అయినా వారు యుద్ధం చేయరు వెనుక ఉండి మన విజయం కాంక్షిస్తుంటారు "
అన్నాడు సుయోధనుడు.
అశ్వథ్థామ ఆగ్రహం
తండ్రిని
అలా తూలనాడటం విన్న అశ్వత్థామ " సుయోధనా! పశువులను కాచేవారిని బెదిరించి
ఆవులను పట్టుకున్నంతా మాత్రాన ఇలా మాట్లాడటం తగదు. మనమింకా యుద్ధం చేయ
లేదు, శత్రువులను జయించ లేదు, నగరం చేర లేదు యుద్ధసంలో గెలిచిన వారు కూడా
ఇలా మాట్లాడరు. యుద్ధమంటే జూదంలో రాజ్యాన్ని అపహరించటం కాదు, యుద్ధభూమిలో
జూదం ఆడటం కుదరదు. పాండవుల జయించేనా ద్రౌపదిని సభకు పిలిపించింది? ఈడ్చుకు
రమ్మని ఆజ్ఞాపించింది. శకుని మాట వినేగా అవన్నీ చేసింది ఇప్పుడు ఆ శకుని
యుద్ధం చేస్తాడులే . సభలో నీచే అవమానించ బడిన కపికేతనుడు నీపై యుద్ధానికి
వస్తున్నాడు. గురువును అధిక్షేపించావు కాని దేవదానవులను జయించిన అర్జునుని
నీవు ఒక్కడివే ఎదుర్కొన గలవా? వీరుని పొగడటం సహజం. పుత్ర సమానుడైన ప్రియ
శిష్యుడైన అర్జునిని పొగడటం నేరమా. ఇంత జరిగిన తరువాత సిగ్గు లేకుండా నా
తండ్రి యుద్ధం చేయ వచ్చు కాని నేను చేయను. సుయోధనా! యముడు చెలరేగినా, అగ్ని
ఆగ్రహించినా, మృత్యు దేవత పురులు విప్పినా కొంత అయినా మిగులుతుంది.
అర్జునుడు బాణాలు సర్వనాశనం చేస్తాయి. నీ కుటిల బుద్ధులు ఇక్కడ పని చేయవు.
అర్జునుడు గాండీవంతో శరసంధానం చేసి బాణాలు విసురుతాడు కాని పాచికలు విసరడు.
మనం మత్స్య దేశాధీశుని గోవులను పట్టుకున్నందుకు మత్స్యదేశాధీశుడు
ససైన్యంతో వస్తే ఎదిరిస్తాము కాని అర్జునిని ఎదిరించ లేము " అన్నాడు.
కర్ణుడి ఆగ్రహం
ఆ
మాటలకు కర్ణుడు ఊగిపోయాడు " మనం వచ్చింది పాండవులను పట్టు కోవడానికి.
పాండవులను గుర్తించడానికి. అర్జునిని చూసి బెదరడం భావ్యమా. సుయోధనుని
పిచ్చివాడిని చేయటం తగునా? మీకు భయంగా ఉంటే మీరు ఊరుకోండి. ఒక్కని
ఎదిరించడానికి ఎంత మంది కావాలి. నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని
విరగొట్టి, దాని చుట్టూ ఉన్న పిశాచాలను తరిమి కొడతాను. సారధిని చంపి
అర్జునిని శరీరాన్ని నా బాణాలతో తూట్లు చేస్తాను. నా బాహు బలాన్ని చూడండి.
అర్జునుడు పమూడేళ్ళ అరణ్యాజ్ఞాత వాసాలు ముగించుకొని యుద్ధ భూమిలో అడుగు
పెడుతున్నాడు. కౌరవసేనలో మహా వీరుడనైన నేను అతనిని ఎదుర్కొంటాను. రారాజు
ఋణం తీర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్రప్రయోగం చేయడానికి
కర్ణార్జునులలో ఎవరు గొప్పో తేలడానికి ఇది సమయం. అర్జునిని గెలిచి
సుయోధనునికి ముదము చేకూర్చెదను. ఇష్టం ఉన్న వారు మా ద్వంద యుద్ధం చూడండి
లేని ఎడల ఆవుల వెంట నగరానికి పొండి " అన్నాడు.
కృపాచార్యుని వాదం
కర్ణుని
మాటలు విన్న కృతవర్మ " కర్ణా! నీవు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావు.
కార్యసిద్ధి గురించి నీకు పట్టదు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ
అని రాజనీతిజ్ఞులైన పెద్దలు చెప్తారు. దేశ, కాల, పరిస్థితిని అర్ధం
చేసుకుని తన బలాన్ని ఎదిరి బలాన్ని బేరీజు వేసుకుని యుద్ధం చేయాలి కాని
మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరి
వాడని నువ్వు అంటున్నావు. ఖాండవవన దహన సమయంలో ఇంద్రునితో యుద్ధం చేసింది
అర్జునుడు ఒక్కడే, యాదవ సైన్యంతో పోరాడి సుభద్రను చేపట్టింది అర్జునుడు
ఒక్కడే, రాజసూయ యాగమున దిగ్విజయం చేసింది అర్జునుడొక్కడే, నివాతకవచులను
సంహరించి దేవతలకు మేలొనరించించింది అర్జునుడొక్కడే, దేవేంద్రునికి అజేయులైన
కాలకేయులను సంహరించింది అర్జునుడొక్కడే. అంతెందుకు ద్రౌపది స్వయవరంలో
అబేధ్యమైన మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టడమే కాక అనంతరం
తిరగబడిన రాజులను జయించినది అర్జునుడు ఒక్కడే. నువ్వూ అక్కడే ఉన్నావు కదా.
పాండవులు అందరూ తమతమ శక్తి కొద్దీ దిగ్విజయం చేసారు. నీవేమో హస్థినా పురంలో
కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అర్జునుని గెలుస్తానని చెప్పడం
ఒంటి చేత్తో సముద్రం ఈదడం లాంటిది. కనుక దుస్సాహసం విడిచి మనమంతా రారాజును
కాపాడు కోవాలి కాని యుద్ధోన్మాదులం కాకూడదు. అందరం కలసి అర్జునిని
ఎదుర్కొందాం నువ్వొక్కడివే పోరాడతానని చెప్పడం అవివేకం " అన్నాడు.
కర్ణుడు కృపాచార్యుని తూలనాడుట
కర్ణుడు
కోపంగా " కృపాచార్యా! శత్రువుల మిత్రుడవని తెలిసీ నిన్ను తీసుకురావడం
సుయోధనుని అమాయకత్వం. బాలురు, బంధువులు రాజు సంపదను ఆరగిస్తారు కాని
సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నాలు ఆరగించు.
అనవసరంగా రాజు నిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు. మారు మాటాడక వెళ్ళు. నేను
ఒక్కడినే పదునాలుగు భువనాలను గెలుస్తాను. ఒక్క రధికుడు అర్జును డెంత "
అన్నాడు. భీష్ముడు కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ సముచితంగా
మాట్లాడాడు. కర్ణుడు వీరోచితంగా మాట్లాడాడు. కాని ఒకరిని ఒకరు నిందించు
కోవడం న్యాయం కాదు. అంత శక్తి ఉన్న వాడు యుద్ధం చేయాలి కాని ఇలా ఇతరులను
నిందించడం ఎందుకు? శత్రువులు ముట్టడించక ముందే ఉపాయం ఆలోచించాలి. శత్రువు
పరాక్రమ వంతుడైతే పొగడటం సజ్జనులకు ఉచితం. పెద్దలను గౌరవించాలి కాని
నిందించడం తగదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం. ఆచార్యా అర్జునుడు మన మీద
యుద్ధానికి వస్తున్నాడు. మనం అందరం కలసి ఎదిరిస్తాం. విభేదాలకు ఇది సమయం
కాదు. ఎవరో ఏదో అన్నారని మీరు కోపగించ డానికిది సమయం కాదు. నన్ను క్షమించి
ముందుకు పదండి ఆచార్యా " అన్నాడు. కృపాచార్యుడు " అయ్యో మీరు క్షమించంచ మని
అడుగ తగునా. నేనంతటి వాడనా. ద్రోణుడు శాంతిస్తే చాలు " అన్నాడు.
కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణునితో పోయి ద్రోణాచార్యుని అశ్వత్థామను
క్షమించమని కోరారు.
ద్రోణుడి వ్యూహ రచన
ద్రోణుడు
" భీష్ముని మాటలతో నా కోపం పోయింది. ముందుకు పదండి ముందు మనం రారాజును
కాపాడు కుంటాము. అర్జునుడు చాలా కసితో ఉంటాడు కనుక అందరం అర్జునిని
ఎదుర్కొందాము. అజ్ఞాత వాసం గురించి సుయోధనుడు అడిగిన దానికి భీష్ముడు వివరణ
ఇస్తాడు " అన్నాడు. ద్రోణుని ఆంతర్యం గ్రహించిన భీష్ముడు కాల నిర్ణయం
చేయవలసిన సమయం ఆసన్న మయినదని గ్రహించాడు. అతడు " సుయోధనా! మన ప్రస్తుత
కాలమానం ప్రకారం రెండు సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ పదమూడేళ్ళ
కాలంలో వచ్చిన అధికమాసాలను గణనలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాత
వాసం పూర్తి అయింది. ఈ విషయం తెలిసే అర్జునుడు నిజ రూపంతో మనముందుకు
వచ్చాడు. అతడు ధర్మం తప్పడు. అలా తప్పే వాడైతే జూదంలో ఓడి పోయిన నాడే
మూర్ఖత్వంతో మనతో యుద్ధానికి దిగే వాడు. ధర్మంకోసం కట్టుబడ్డారు కనుకనే ఇంత
కాలం వేచి ఉన్నారు. మనతో యుద్ధానికి వచ్చింది అర్జునుడని తెలిసి
పోరాటానికి దిగితే మనం గెలువ వచ్చు ఓడి పోవచ్చు. జయాపజయాలు దైవాధీనం కనుక
మనం సంధి చేసు కోవడం ఉత్తమం " అన్నాడు భీష్ముడు. సుయోధనుడు " మనకు
పాండవులతో సంధి ఎలా పొసగుతుంది. పాండవులకు నేను రాజ్యభాగం ఇవ్వను. యుద్ధం
నిశ్చయం ఇందులో తిరుగు లేదు " అన్నాడు. ఇది చూసిన ద్రోణుడు " యుద్ధ సమయంలో
నిర్ణయాధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. కనుక ఎవరూ రాజు మాట నిరాకరించ లేరు
కనుక మనం యుద్ధ వ్యూహాన్ని చేయాలి. సైన్యంలో నాల్గవ భాగాన్ని తీసుకుని
సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక నాల్గవభాగం గోవులతో నడుస్తుంది. మిగిలిన
సగం సైన్యంతో మనం వెనుక కదులుదాము. నేను మధ్యలో ఉంటాను. నా కుడి వైపు
కృపాచార్యుడు, ఎడమ వపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు.
దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని, జయద్రధుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు,
సోమదత్తుడూ అక్కడక్కడా మొహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే వారిని
మనంమంతా రక్షిస్తాము. ఇం, దుకు భీష్ముడు ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక
ఉండి సైన్యాలను నడిపించాడు.
యుద్ధారంభం
ఆ
యుద్ధం చూడటానికి దేవతలంతా విమానాలెక్కి ఆకాశ వీధిలో నిలబడ్డాఋ. అర్జునుడు
తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని
పరాక్రమానికి కురు సైన్యం బెదిరి పోయింది. అర్జునుడు ఉత్తర కుమారునితో "
కుమారా! సైన్యం రెండు భాగాలుగా పోతుంది ఇందులో సుయోధను డెక్కడ ఉన్నాడో
తెలుసుకుని యుద్ధం చేయాలి. రధాన్ని సేనకు ఎడమ వైపుగా పోనియ్యి. రాజును
పట్టుకుంటే కురు సైన్యం విచ్చిన్న మౌతుంది. మన పని సులభం ఔతుంది గోవులను
మళ్ళించడంతో పనౌతుంది. గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళితే వాట్ని
రక్షించడానికి సుయోధనుడు అక్కడకు వస్తాడు " అన్నాడు అర్జునుడు. అర్జునుడు
రథాన్ని ఎడమ వైపు నడిపిస్తూ సైన్యాన్ని కలయచూసి సుయోధనుడు లేడని తెలుసుకుని
ముందుకు సాగాడు. పోతూ కృపాచార్యునకు, ద్రోణాచార్యునకు, భీష్ముడికీ తగిలీ
తగలనట్లు నమస్కార బాణాలు వేసాడు. అర్జునిని గురు భక్తికి, పెద్దల ఎడ
భక్తికి భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఆనందించారు. " అచార్యా ! అర్జునుడు
మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడంటే సుయోధనుని కోసం వెతుకు తున్నాడు.
కనుక మనం సుయోధనుని రక్షించాలి " అంటూ భీష్ముడు సైన్యాలను ముందుకు
నడిపించాడు. ఇంతలో అర్జునుని రథం ఆవుల మందలను చేరుకుంది. అర్జునుడు " నేను
ఆలమందలకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను వారిని రక్షించడానికి
సుయోధనుడు వస్తాడు. మన చేతికి చిక్కుతాడు " అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు
దిక్కుకు నడప మన్నాడు. గోవులకు కాపలాగా ఉన్న సైన్యం అర్జునిని శరపరంపర
ధాటికి ఆగలేక చెల్లాచెదరైంది. అర్జునుడు గోవులను వెనుకకు మళ్ళించాడు.
గోవులు గోపాలురు వెంట రాగా వెనుకకు పరుగెత్తాయి. అర్జునుడు తనరధాన్ని
గోవులకు సైన్యాలకు మధ్యగా నిలిపి గోవులకు రక్షగా నిలిచి గోపాలురను చూసి "
మీరు గోవులను తీసుకు వెళ్ళండి " అన్నాడు. గోగణం మత్స్యదేశ పొలిమేరలో
చేరుకున్నాయి. కురు సేనలు అర్జునిని చుట్టుముట్టాయి.
విరాట పర్వము పంచమాశ్వాసము
- 1.1 ఉత్తరకుమారుడికి కురువీరులను పరిచయము చేయుట
- 1.2 అశ్వథ్థామ ఎత్తి పొడుపు
- 1.3 అర్జునుని వీరవిహారం
- 1.4 అర్జునుడు కర్ణునితో తలపడుట
- 1.5 అర్జునుడు ద్రోణునితో తలపడుట
- 1.6 అశ్వథ్థామ కృపాచార్యులతో అర్జునిని యుద్ధం
- 1.7 కురుసేనలను ఛేదిస్తూ అర్జునుడు భీష్మునితో తలపడుట
- 1.8 అర్జునుడు సుయోధనుని ఎదుర్కొనుట
- 1.9 అర్జునుని సమ్మోహన అస్త్రప్రయోగము
- 1.10 అర్జునుడు కురుసేనకు వీడ్కోలు పలుకుట
- 1.11 విజయవార్తను విరాటునికి తెలుపుట
- 1.12 విరాటుడు ధర్మరాజు మిదకు పాచికలు విసరుట
- 1.13 ఉత్తరకుమారునికి నగరం స్వాగతం పలుకుట
- 1.14 విరాటుడు ఉత్తరకుమారుని వద్ద యుద్ధవిశేషాలు వినకోరుట
- 1.15 ధర్మజుని మందిరంలో పాడవుల ద్రౌపది సహిత సమావేశం
- 1.16 పాండవులు తమను తాము బహిరంగ పరచుకొనుట
- 1.17 ఉత్తరకుమారుడు అర్జునిని గురించి వర్ణించుట
- 1.18 అర్జునుడు విరాటునితో వియ్యమందుటకు అంగీకరించుట
- 1.19 సుయోధనుని సందేహం
- 1.20 పాండవులు ఉపప్లావ్యం చేరుట బంధుమిత్రుల రాక
No comments:
Post a Comment