- వైశంపాయనుడు జనమేజయునకు చెప్పిన మహాభారతకథను సూతుడు శౌనకాది మహామునులకు చెప్పసాగాడు. మహాభారత కథను వింటున్న జనమేజయుడు వైశంపాయుడిని చూసి " మహాత్మా ! తన కుమారుడు సుయోధనుడు భీముని చేతిలో చనిపోయిన విషయం సంజయుడి ద్వారా తెలుసుకుని ధృతరాష్ట్రుడు ఏమి చేసాడు. హస్థినకు వెళ్ళిన రధికత్రయం ఎవరిని కలుసుకున్నారు. తరువాత ఎక్కడకు వెళ్ళారు. అశ్వత్థామ వ్యాసాశ్రమానికి వెళ్ళిన పిదప కృపాచార్యుడు, కృతవర్మ ఎక్కడకు వెళ్ళారు. మహావిజయమును సాధించిన పిదప కుమారుల బంధువుల మరణాన్ని ధర్మరాజు ఎలా తట్టుకున్నాడు "అని ఆడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పసాగాడు.
కుమారుల మరణానికి దుఃఖించిన దృతరాష్ట్రుడు
తన నూరుగురు కుమారులు యుద్ధములో మరణించారు అని తెలుసుకున్న ధృతరాష్ట్రుడు
మొదలు నరికిన వృక్షంలాగా కూలి పోయాడు. భరించరాని దుఃఖంలో మునిగి పోయాడు.
అతడి హృదయం కకావికలైంది. దుఃఖభారంతో తనలో తానే కుమిలి పోతున్న సంజయుడు
" ధృతరాష్ట్ర మహారాజా ! ఏమిటీ వెర్రి. ఎవరి కొరకు దుఃఖ పడుతున్నావు ?
నీశోకానికి అంతు లేదా ! దుఃఖాన్ని వదిలి నేను చెప్పేది విను. కురుక్షేత్ర
సంగ్రామంలో 18 అక్షౌహినుల సైన్యం మరణించారు. నీ తాతలు, తాండ్రులు, అన్నలు,
తమ్ములు, బంధువులు, మిత్రులు, మిత్ర రాజులు, సామంత రాజులు నీ కోసం
మరణించారు కదా ! వారికిదహన సంస్కారాలు చేయాలి కదా ! పద యుద్ధభూమికి వెళదాము
" అన్నాడు. కాని ధృతరాష్ట్రుడు
కదలలేదు తల బాదుకుంటున్నాడు. " సంజయా ! నా కొడుకులంతా చచ్చారయ్యా ! నా
వైభవమంతా నశించిందయ్యా ! అతిదీనంగా బ్రతుకుతున్న నాకు ఈ దేహం ఎందుకు. ఒకరి
దయాభిక్ష మీద ప్రతకడానికా ! నాదీ ఒక బ్రతుకేనా ! బ్రతికి నేను సాధించేది
ఏముంది?.
ధృతరాష్ట్రుడి పశ్చాత్తాపము
సంజయా ! కృష్ణుడు సంధి చేయడానికి వచ్చినప్పుడు నాకు ఎంతో నచ్చచెప్పాడు. భీష్ముడు, ద్రోణుడు
నా హితవు కోరి చెప్పారు. పరశురాముడు లాంటి మహా మునులు ఎందరో బుద్ధిమతి
చెప్పారు. నేను దుర్బుద్ధితో వారి మాటలు పెడచెవిన పెట్టాను. పాండవులకు
రాజ్యభాగం ఇవ్వ నిరాకరించి ఫలితం అనుభవిస్తున్నాను. కొడుకులను
పోగొట్టుకున్నాను. బంధుమిత్రులను పోగొట్టుకున్నాను. అందరూ మరణించారు.
దహనక్రియలు చేయడానికి నేను మాత్రం బ్రతికి ఉన్నాను. సంజయా ! రాబోయే ఆపద
తెలిసి కూడా పాండవులకు రాజ్యభాగం ఇవ్వ లేదు. కనుక నా అనే వారందరిని
పోగొట్టుకున్నాను. సంజయా ! నేను ఇలా కావడానికి నా పూర్వజన్మ సుకృతం కాక
వేరు కాదు. అయినా ధర్మరాజు
ఉండగా దహనక్రియలు చేయడానికి నేను ఎందుకు ? నా కుమారులను చంపి తమ
ప్రతిజ్ఞలు నెరవేర్చుకున్న పాండవులు ఈ పని కూడా చేస్తారులే " అన్నాడు.
ధృతరాష్ట్రుడికి సంజయుడి హితవు
అతడిని చూసి సంజయుడు
" ధృతరాష్ట్ర మహారాజా ! నీకు తెలియని శాస్త్రాలు లేవు అన్నీ తెలిసిన నీవే
ఇలా దుఃఖిస్తే లోకులు నవ్వరా ! ఇంతకు ముందు నీవు సృంజయుడి కథ విన్నావు
కదా ! అభిమన్యుడి మరణానికి ధర్మరాజు
దుఃఖిస్తుంటే నారదుడు ఈ కథ చెప్పాడు అది విని కూడా నీవు ఇలా
దుఃఖిస్తున్నావా ! నీ మంచికోరే మంత్రుల మాట వినలేదని అన్నావు కదా ! నీకూ,
నీ కుమారుడికీ శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు
వీరే కదా మంత్రులు ! వీరే మీకు మంత్రులు అయితే ఇక వినాశనం కాక మిగిలేది
మరేమిటి. నీ కొడుకు ఎదుటి వాడి మీద కత్తి దూసాడే కాని మంత్రాంగం మీద దృష్టి
మరల్చాడా ! విదురుడు
చెప్పింది విన్నాడా ! నీవు అతడికి బుద్ధిచెప్పి అతడిని కట్టడి చేసి అతడి
అకృత్యాలను ఆపగలిగావా ! నీకూ నీ కుమారుడికీ లోభత్వం బాగా వంటబట్టి ఎవరి
మాటా వినలేదు. కనుక నీ దు:ఖం మాను. నీ పని ఎలా ఉందంటే చుట్టూ మంట
పెట్టుకుని మధ్యలో కూర్చుని అయ్యో కాలిపోతున్నాను అని గొంతెండి పోయేలా
అరచినట్లు ఉంది. ఈ పరిస్థితిలో అందరూ నిన్ను నిందిస్తారే కాని జాలి
చూపుతారా ! నీ కుమారుడి పరుషవాక్యాలకు అర్జునుడి కోపాగ్నికి వారంతా దగ్ధం
అయ్యారు. ఇక విచారించడం ఎందుకు " అన్నాడు.
ధృతరాష్ట్రుడిని విదురుడు మందలించుట
ఇంతలో అక్కడకు విదురుడు
వచ్చి ధృతరాష్ట్రుని చూసి " చేసింది చాలక ఇంకా నేల మీద పడి దొర్లిదొర్లి
ఏడుస్తున్నావా ! ఏడిచింది చాలు కాని ఇక లే ! " అన్నాడు. విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు
లేచి కూర్చున్నాడు. దుఃఖమును ఆపుకున్న ధృతరాష్ట్రుడిని చూసి విదురుడు "
ధృతరాష్ట్ర మహారాజా ! పెరుగుట విరుగుట కొరకే కొత్తకొత్త రుచుల కొరకు
అర్రులు చాస్తే ఉన్న రుచే పోతుంది పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదు. ఎంత
దగ్గరైతే అంత దూరం కావడమే ప్రకృతి సహజం. దీనిని తప్పుకొనుట ఎవరికైనా
సాధ్యమా ! యమధర్మరాజు తన పాశముతో ప్రాణుల ప్రాణమును హరించునప్పుడు వీడు
మంచి వాడా, చెడ్డ వాడా, ధనికుడా, పేద వాడా, వీరుడా పిరికి వాడా అని చూడడు
ఎలాంటి వాడైనా చావు తప్పదు. యుద్ధం చేస్తేనే మనిషి చస్తాడా ! ఎక్కడ ఉన్నా
చావును తప్పించుకో లేడు. కనుక చావును గురించి చచ్చినవారి గురించి దుఃఖించడం
దండగ. నీ కుమారులందరూ యుద్ధంలో మరణించి వీరస్వర్గం పొంది స్వర్గసుఖాలు
అనుభవిస్తున్నారు. నువ్వు వారికొరకు దుఃఖిస్తున్నావు. అయినా ! పండితుడవు
జ్ఞానివి అయిన నీకు తెలియనిది ఏముంది. మనిషి పుట్టిన తరువాత బాల్యము,
యవ్వనము, అందచందాలు, ఈ ప్రకృతి, అందున్న పదార్ధములు అన్నీ మిద్య,
అశాశ్వితమైన స్థిరము కాని వాటి కొరకు దుఃఖించుట తగదు. తెలివి కలిగిన వారు
దుఃఖించరు. దుఃఖం సర్వ అనర్ధములకు హేతువు. కాగల కార్యము మీద మనసు నిలుపు.
మహారాజా ! మామూలు మనుషుల ఆలోచనాపరిధి చిన్నది. కనుక వారు చిన్న దుఃఖమునకు,
కూడా తట్టుకోలేరు. తమకు ప్రియమైనది దూరమైనా కోల్పోయినా వారి జ్ఞానం నశించి
దుఃఖిస్తారు. చెయ్యకూడని పనులు చేస్తారు. కాని జ్ఞానులకు పండితులకు ప్రియము
అప్రియము ఉండదు. అన్నీ సమానంగా చూస్తారు.
ధృతరాష్ట్రుడు దుఃఖోపశమనం పొందుట
విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు
దుఃఖోపశమనం పొంది " విదురా ! నీ మాటలు నా దుఃఖాన్ని ఉపశమింప చేసాయి.
విదురా ! నీవు చెప్పినట్లు జ్ఞానులకు పండితులకు అప్రియములు ప్రియములు అనేవి
లేకుండా అంతా సమానంగా చూస్తారని చెప్పావు కదా ! వారు అలా ఎలా ఉండగలరు "
అని అడిగాడు. విదురుడు
" ఓ ధృతరాష్ట్ర మహారాజా ! సంసారమనే వృక్షము అరటి చెట్టు వలె దుర్బలమైంది,
నిస్సారమైనది. కాని మానవుడు ఈ సంసారం అందే అనురక్తుడై నిరంతర వ్యధకు గురి
ఔతున్నాడు. ప్రస్థుతం మనకు లభించిన ఈ శరీరం పతనమై మరొక శరీరం లభిస్తుంది
అంతేకాని ఈ శరీరం శాశ్వతం కాదుకదా ! అది తెలుసుకున్న వాడు నీ మాదిరి
వ్యధచెందడు. ఒక ఇంటి నుండి మరొక ఇంటికి పోయిన మాదిరి జీర్ణమైన ఒక
వస్త్రమును వదిలి నూతనమైన వేరొక వస్త్రమును ధరించిన మాదిరి ఒక శరీరం వదిలి
వేరొక శరారాన్ని ధరిస్తాడు. కుమ్మరి వాడు కుండను చేసే సమయంలో మధ్యలోనే
విరుగ వచ్చు, లేకున్న కుండగా తయారైన తరువాత విరుగవచ్చు, దానిని కాల్చే
సమయాన విరిగి పోవచ్చు, వాడుకునే సమయాన కింద పడి విరిగి పోవచ్చు. కనుక ఈ
మట్టి కుండ ఏ దశలో విరుగుతుందో చెప్ప లేము కదా ! మానవుడూ అంతే ! పురుషుడి
తేజస్సు స్త్రీ అండముతో కలిసిన పిండోత్పత్తి జరుగుతుంది అది అండ దశలో
విచ్ఛిత్తి కావచ్చు, ఆ పిండం శిశువుగా రూపుదిద్దుకునే సమయంలో కాని ప్రసవ
సమయంలో కాని, శిశువుగా జన్మించిన తరువాత గాని, బాల్యంలో కాని, యవ్వనంలో
కాని, వృద్ధాప్యంలోగాని ఎప్పుడైనా సంభవించ వచ్చు. కనుక ఈ శరీరం ఎప్పుడైనా
మరణించ వచ్చు. కనుక మరణానంతరం మనం చేసే సుకృత, దుష్కృత ఫలితంగా
స్వర్గనరకములు ప్రాప్తిస్తాయి. కనుక మరణించిన వారి కొరకు దుఃఖించడం
అవివేకం. వివేకం కల వారు ఈ సంసారం దుఃఖభూయిష్టం అని ఎరిగి దాని అందు
చిక్కుకొనరు. కనుక నీవూ చచ్చిన పుత్రులకొరకు విచారించక నీవు ముక్తి పొందే
మార్గం ఆలోచించు " అని చెప్పాడు విదురుడు.
ధృతరాష్ట్రుడు దుఃఖం నివృత్తి గురించి తెలుసుకొనుట
విదురుడి మాటలకు ధృతరాష్ట్రుడు మరికొంత శాంతించిన మనసుతో " విదురా ! అసలు సంసారంలో దుఃఖం ఎందుకు ఉంటుంది. దానిని మనం ఎలా నివృత్తి చేసుకోవాలి " అని అడిగాడు. విదురుడు
" మహారాజా ! పురుషుడి తేజస్సు స్త్రీ అండంతో కలిసిన పిండోత్పత్తి
జరుగుతుంది అని నీకు ముందే చెప్పాను. క్రమక్రమంగా అవయవ నిర్మాణం జరుగి
శిశువుగా రూపుదిద్దుకుంటుంది. ఆశిశువులోనికి ప్రాణవాయువు ప్రవేశించి ఆ
శిశువు గిరగిరా తిరుగుతూ బాధను అనుభ విస్తుంది. ఆ శిశువు వేదనను భరించ లేక
గర్భముఖద్వారం చేరుకున్న సమయంలో ఆ శిశువును గ్రహములు భూతములు ఆవహిస్తాయి. ఆ
తరువాత శిశువు జన్మించడానికి సిద్ధమై గర్భము నుండి బయటకు వస్తుంది.
ఆశిశువు బాలుడిగా ఉన్నప్పుడు శుచి, అశుచి తెలియదు. వివేకము తెలియదు. ఆట
పాటలతో తెలియక పొరబాటుగా అనేక దుష్టకార్యాలు చేస్తాడు. బాల్య చేష్టలతో
బాల్యావస్థ దాటగానే యవ్వనంలోకి ప్రవేశిసించగానే కామపరమైన ఆసక్తి
జనిస్తుంది. స్త్రీ సౌఖ్యం కొరకు పాకులాడుతాడు. ఆ సమయంలో అధికంగాడే ఇంద్రియ
లోలత్వం వలన సుఖము, దుఃఖము అనుభవిస్తాడు. కోరికలతో వేగిపోతూ అనేక
దుష్కార్యములు చేస్తాడు. బాల్యంలాగే యవ్వనమూ గడిచి పోతుంది. వృద్ధాప్యంలోకి
ప్రవేశిస్తాడు. అప్పుడు శరీరంలోని బలము శక్తి ఉడిగి పోయి వ్యాధి పీడితుడు
ఔతాడు. అయినా ఉచితానుచితాలు తెలియక అనుచిత కార్యములను చేస్తాడు.
వ్యాధిప్రాబల్యంతో వయోభారంతో కృంగి కృశించి పోతాడు. అప్పుడు యముడు
వచ్చి తన పాశముతో ప్రాణములను హరిస్తాడు. ఈ జీవుడు పోలేక పోలేక యాతన
అనుభవిస్తాడు. అంతటితో ఈ జన్మ ముగుస్తుంది. కనుక ఈ లోకం నిరంతర దుఃఖ
భూయిష్టమైంది అన్నది స్పష్టము. ఈ మానవులు కామ, క్రోధ, మదోన్మత్తులై లోభంతో
అనేక దుష్కృత్యములు ఆచరిస్తారు. కాస్తంత సుఖం ఆశించి ఒకరి జీవితం ఒకరు
నాశనం చేసుకుంటూ ఒకరిని ఒకరు చంపుకుంటూ అధర్మపరులౌతారు. చివరకు యమలోక
ప్రాప్తిని పొందుతారు. వివేకం కలిగిన వారు పెద్దలను ఆశ్రయించి సన్మార్గమున
పయనిస్తారు.
సంసారమును అధిగమించుట
విదురుడు
తన మాటలను కొన సాగిస్తూ ధృతరాష్ట్రమహారాజా ! నేను ఈ సంసారమును ఎలా
అధిగమించాలో పెద్దలవలన విని యున్నాను అది నీకు వివరిస్తాను. శ్రద్ధగా విను.
దుర్గమైన అడవిలో ఒక బ్రాహ్మణుడు వెళుతున్నాడు. అప్పుడు పులులు, సింహాలు,
ఏనుగులు మొదలైన అడవి జంతువులు అతడిని వెన్నాంటాయి. ఆ బ్రాహ్మణుడు ప్రాణ
భయంతో ఆడ్డదారిలో పరుగెడగా ఆ కౄర జంతువులు అతడిని వదిలి వెళ్ళి పోయాయి.
ఇంతక్లో ఒక దొంగల గుంపు అతడిని అడ్డగించింది. ఆ బ్రాహ్మహ్మణుడు ప్రాణ భయంతో
కాళ్ళు గజగజ వణుకుతుండగా చలన రహితంగా నిలబడ్డాడు. చుట్టూ పరికించి చూసి
తనను రక్షించడానికి ఎవరూ లేనందున వెనక్కి తిరిగి పారి పోసాగాడు. వెనుక
నుండి దొంగలు ముందు నుండి కౄరజంతువులు ఎంత పరుగిడినా అడవికి అంతు దొరకడం
లేదు. ఇంతలో భయంకరాకారంతో ఉన్న ఒకస్త్రీ అతడిని కౌగలించుకుంది. అతడిలో భయం
ఇనుమడించింది. అయిదు తలలు కలిగిన ఏనుగులను చూసాడు. ఆస్త్రీని విడిపించుకుని
పరుగెడుతూ లతలతో నిండి పైకి కనిపించని బావిలో పడ్డాడు. పడుతూ పడుతూ బలమైన
తీగను ఒక దానిని పట్టుకుని తల కిందులుగా వేలాడ సాగాడు. కిందికి చూడగా ఒక
పెద్ద పాము నాలుకలు భయంరంగా చాస్తూ అతడి వైపు రాసాగింది. పైకి చూడగా 6 తలలు
12 కాళ్ళతో ఒక ఏనుగు బావి చెంత ఉన్న ఒక చెట్టు వద్దకు వచ్చింది. ఆ చెట్టు
చిత్ర విచిత్ర రంగులతో వెలిగి పోతుంది. తుమ్మెదలు ఆ చెట్టులోని మకరందం
తాగుతున్నాయి. కాని నల్లని తెల్లని ఎలుకలు ఆ చెట్టు మొదలును
కొరుకుతున్నాయి. ఆ చెట్ల పూల నుండి బొట్టు బొట్టుగా మధువు ఆ బ్రాహ్మణుడి
నోట్లో పడుతుంటే అతడు దానిని త్రాగి ఆనందిస్తున్నాడు. ఆ మధువు ఎంత త్రాగినా
తృప్తి తీరక తాను ఉన్న దుస్థితిని మరచి ఆనందిస్తున్నాడు. ఈ విధంగా ఆ
బ్రాహ్మణుడికి కింద ఉన్న పాము, పైన ఉన్న భయంకరాకార స్త్రీ, క్రూర మృగములు,
ఎలుకలు కొరకడంతో ఏనిముషమైనా పాడడానికి సిద్ధంగా ఉన్న చెట్టు, వేచి ఉన్న
దొంగలు, ఝూంకారం చేస్తున్న తుమ్మెదలు వీటితో మనసు కకావికలు ఔతున్నా అతడికి
జీవితం మీద వ్యామోహం పోలేదు. ప్రాణముల మీద తీపి చావ లేదు " అన్నాడు
విదురుడు. ధృతరాష్ట్రుడు " విదురా ! ఈ కథ నాకు అర్ధం కాలేదు. వివరంగా చెప్పు " అన్నాడు.
సన్మార్గ బోధన
విదురుడు
" మహారాజా ! ఈ ప్రపంచంలో పెద్దలు మనుషులకు సన్మార్గ బోధన చేయడానికి ఈ కథ
చెప్తారు. ఈ కథ మన జీవితంలాంటిది. ఈ కథని వివరిస్తే కాని అర్ధంకాదు. ఆ
బ్రాహ్మణుడు పయనిస్తున్న అడవి సంసారం. అందు ఉన్న క్రూరమృగములు, దొంగలు,
మృగముల కొరకు పన్ని ఉచ్చులు రోగములు, భయంకరాకారంతో పయనిస్తున్న స్త్రీ
ముసలి తనము, అయిదు తలల ఏనుగు పంచేంద్రియాలు, బావిలో ఉన్న పాము యమధర్మరాజు, ఆ
బ్రాహ్మణుడు పట్టుకున్న తీగ బ్రతకాలన్న ఆశ, ఆ ఒడ్డున ఉన్న చెట్టు ఆయుషు,
దాని వైపు వచ్చిన ఏనుగు ఒక సంవత్సర కాలం దాని ఆరు తలలు ఆరు ఋతువులు,
పన్నెండు కాళ్ళు పన్నెండు నెలలు. ఆచెట్టును కొరుకుతున్న నల్లని తెల్లని
ఎలుకలు రాత్రి పగలు, ఆ బ్రాహ్మణుడి చుట్టూ ఝోంకారం చేస్తున్న తుమ్మెదలు
కోరికలు. పూలనుండి స్రవిస్తున్న మకరందం సుఖసంతోషాలు. తన చుట్టూ ఇన్ని బాధలు
ఉన్నా జీవుడు ఆ సుఖసంతోషాల కొరకు పాకులాడుతుంటాడు. కలకాలం బ్రతకాలని
అనుకుంటాడు. బ్రాహ్మణుడే జీవుడు. ఇదే సంసార చక్రం. వివేకవంతులైన వారు ఈ
సంసారచక్రంలో బంధించ బడక వెలుపలి నుండి చూస్తూ శాశ్వితమైన ఆనందాన్ని
పొందుతారు. .
విదురుని జ్ఞానబోధ
ఓ
ధృతరాష్ట్ర మహారాజా ! నిరంతరం ప్రాపంచిక సుఖాల కొరకు పరితపిస్తూ ఈ బురద
గుంటలో మునుగుతూ తేలుతూ తననుతాను మరచి పోతాడు మానవుడు. శరీరబలం తగ్గగానే
రోగాలు ఆవహిస్తాయి. ముసలితనం మీద పడి అందం అంతరించి దైన్యం ఆవహిస్తుంది.
సుఖాలు అనుభవించడానికి పనికిరాక దిక్కులేని చావు చస్తాడు. మహారాజా ! ఈ
దేహమే ఒక రథము. బుద్ధి రథ సారథి. పంచేంద్రియములే గుర్రములు. మన ఆలోచనలే
పగ్గాలు. పంచేంద్రియాలు అనే గుర్రాలు అదుపు తప్పి ప్రవర్తించినప్పుడు
బుద్ధి అనే పగ్గాలు పఠిష్టంగా లేని ఎడల గుర్రాలు ఇచ్ఛవచ్చిన రీతిలో
ప్రవర్తిస్తాయి. కనుక బుద్ధిని ఉపయోగించి ఆలోచనలు అనే పగ్గాలతో వాటిని
నియంత్రించిన మానవుడు దుఃఖభాజనుడు కాడు. పుట్టినప్పటి నుండి ఈ జీవితం
యమధర్మరాజు ఆధీనంలో ఉంటుంది. ఈ జీవితం అనేక దుఃఖాలకు మూలము. వివేకవంతులు
వివేకము అనే మందును ఉపయోగించి తమ దుఃఖాలను తొలగించుకుంటారు. వివేక వంతులు
తమ బుద్ధిని ఉపయోగించి గుర్రములను అదుపులో పెట్టి రథమును సక్రమ మార్గమున
నడిపించి ముక్తిని పొందుతారు. కనుక ధృతరాష్ట్ర మహారాజా ! నీ కుమారుల
మరణానికి దుఃఖించుట మాని నీ కుమారులు, బంధుమిత్రులకు దహనసంస్కారం జరిపించు "
అని అన్నాడు విదురుడు.
వ్యాసుడి రాక
విదురుడి మాటలతో తిరిగి కుమారులు గుర్తుకు రాగా ధృతరాష్ట్రుడు ఏడుస్తూ మూర్చిల్లాడు. పరిచారికలు అతడి ముఖము మీద చల్లని నీళ్ళు చిలకరించి సేద తీర్చారు. ఇంతలో వ్యాసుడు అక్కడకు వచ్చాడు. అనుకోకుండా వచ్చిన వ్యాసుడికి విదురుడు, సంజయుడు నమస్కరించారు. మూర్ఛనుండి తేరుకున్న ధృతరాష్ట్రుడికి వ్యాసుడి రాక ఎరిగించారు. ధృతరాష్ట్రుడు
చేతులు వణుకుతుండగా వ్యాసుడికి నమస్కరించి " మహామునీ ! చూసితివా ! నా
దుర్గతి. నేను ఇంకా ఎందుకు బ్రతికి ఉన్నానో తెలియడం లేదు. ఈ జన్మ ఎంత
దుర్బరమో ఇప్పుడు తెలిసింది. నా దుస్థితి చూసారా ! కుమారులంతా మరణించారు
బంధుమిత్రులు నశించారు. సంపదలంతా ఊడ్చుకు పోయాయి. అయినా నా ప్రాణములు నన్ను
అంటి పెట్టుకునే ఉన్నాయి. ఇది నా దౌర్భాగ్యం కాక మరేమిటి " అని
దుఃఖించాడు. ధృతరాష్ట్రుడి దుఃఖం చూసి వ్యాసుడు
" కుమారా ! నీ దుఃఖం పోగొట్టడానికే నేను వచ్చాను. సకల శాస్త్రములను
తెలిసిన వాడివి, నీతి శాస్త్ర కోవిదుడివి చనిపోయిన కుమారుల కొరకు దుఃఖించుట
సమంజసం కాదు. పుట్టిన వాడు మరణించక తప్పదు. ఈ జీవితం ఎవరికి శాశ్వతం
కాదన్న జ్ఞానం ఎరిగి దుఃఖం పోగొట్టుకుని నీ తరువాతి కర్తవ్యం నెరవేర్చు.
కుమారా ! అసలు నీకుమారులకూ పాండుసుతులకు నీకు తెలియకనే వైరం సంభవించిందా !
కురువంశనాశన కారకుడు నీ కుమారుడు కాదా ! ఇక నీవు దుఃఖించడం తగునా ! జూద
క్రీడా సమయమున విదురుడు నీకు అనేక విధముల చెప్పినా నీవు వినక ఫలితం
అనుభవిస్తున్నావు. ఇదంతా ఈశ్వర సంకల్పమే పోనీలే బాధపడకు దుఃఖం పోగొట్టుకో
బాధపడకు. నీకు మేలు కోరి నీకు ఒక దేవరహస్యం చెప్తాను విను.
ధృతరాష్ట్రుడికి వ్యాసుడు దేవరహస్యం చెప్పుట
ఒకసారి
నేను దేవసభకు వెళ్ళాను. అక్కడ ఇంద్రాది దేవతలు నారదాది మహా మునులు ఉండగా
భూదేవి అక్కడకు వచ్చి దేవతలను చూసి ఇలా అన్నది " దేవతలారా ! ఇదివరకు మీరు
నాకు పెరిగిన భూభారం తగ్గించడానికి ఉత్సుకత చూపారు. ఎందుకనో ఆ మాట మరిచారు.
నాకు రోజు రోజుకు భారం పెరిగి పోతుంది. దీనిని తగ్గించే ఉపాయం ఆలోచించండి "
అని అడిగింది. అప్పుడు శ్రీమహావిష్ణువు చిరు నవ్వుతో " భూదేవీ ! నీవడిగిన
దానికి తగు సమయం ఆసన్నమైంది. ధృతరాష్ట్రుడు అనే మహారాజుకు నూరుగురు కుమారులు కలుగుతారు. అందులోని జ్యేష్టుడైన దుర్యోధనుడు
నీ కోరికను తీరుస్తాడు. ఇది త్వరలో సంభవించగలదు. అతడి కారణంగా కురుక్షేత్ర
సంగ్రామం జరుగుతుంది. అతడికి ఈ భూమిలోని రాజులంతా సాయానికి వచ్చి నశించి
పోతారు. సోదరసమేతంగా దుర్యోధనుడు మరణిస్తాడు. నీ భారం తగ్గ కలదు " అని
పలికాడు. ఆ మాటలకు భూదేవి సంతసించి అక్కడ నుండి వెళ్ళి పోయింది. విష్ణువు
ఆదేశానుసారం కలి పురుషుడు దుర్యోధనుడిగా జన్మించాడు. అతడు మహా బలిష్టుడు,
కోపిష్టి పరుల ఉన్నతిని సహించ లేడు. అతడు ఎవరిని లక్ష్యపెట్టక అందరితో
వైరము పెట్టుకుని అతడికి తోడుగా అతడి మేన మామ శకుని, తమ్ముడు దుశ్శాసనుడు, అంగరాజు కర్ణుడు
అనుచరులుగా ఉంటారు. అనేక దుష్కర్మలు ఆచరించి వాటి కారణంగా సోదర, బంధు
మిత్ర సమేతంగా నశిస్తాడు. ఇది దేవతల అభీష్టం కనుక నీవు దుఃఖించ పని లేదు.
వ్యాసుడు ధృతరాష్ట్రుడికి ధైర్యంచెప్పుట
కానీ
నీ మనసులో ఒక సందేహం ఉంది. పాండుసుతులు నిన్ను ఆదరిస్తారో లేదో అని
శంకిస్తున్నావు. పాండవుల వలన నీకు కీడు జరుగదు. నీ కుమారుడికి భూమిని అంతా
పాలించాలని దుర్భుద్ధి పుట్టి పాండవుల రాజ్యమును అన్యాయంగా అపహరించి వారి
రాజ్యాన్ని వారికి ఇవ్వక వారికి కీడు తలపెట్టినా వారు నీ ఎడల ఇంచుక
అపకారబుద్ధిని ప్రదర్శించ లేదు. సంధి కొరకు ప్రయత్నించారు. నేను కూడా అనేక
విధముల సంధి చేసుకొనుట మంచిదని నీకుమారునకు చెప్పాను నీ కుమారుడు ఎవరి
మాటలు లక్ష్య పెట్టక ఇప్పుడు ఫలితం అనుభవించాడు. ఇదంతా దైవనిర్ణయం ఎవరూ
తప్పించ లేరుకనుక కనుక నీ కుమారుల కొరకు నీవు చింతించపని లేదు. నీ తమ్ముని
కుమారుడు ధర్మరాజు అజాతశత్రువు. అతడు సాటి మనుష్యుల అందే కాదు పశుపక్షులందు జాలి కలిగి ఉంటాడు. ఈ విషయము నీకూ తెలుసు. ధర్మరాజుకు
నీ అందు విముఖత లేదు. కనుక పాడవులను నీ కుమారుల వలె ఆదరించు. మహాజ్ఞావివైన
నీవు నీ శోకాన్ని జ్ఞానాగ్నిలో దగ్ధంచెయ్యి. ప్రశాంతిని పొందు " అని
పలికాడు వ్యాసుడు. ధృతరాష్ట్రుడు
వ్యాసుడితో " మహానుభావా ! అమృతతుల్యమైన నీ మాటలు నాకు దుఃఖోపశమనం
కలిగింది. నేను పాండవులను నా కుమారుల వలె ఆదరిస్తాను " అని పలికాడు. ఆమాటలు
విని వ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఆశీర్వదించి వెళ్ళాడు ధృతరాష్ట్రుడు
సంజయుడిని చూసి " సంజయా ! మనం యుద్ధ భూమికి వెళదాము అందుకు కావలసిన
సన్నాహములు కావించండి. గాంధారిని అంతఃపుర స్త్రీలను ప్రయాణముకు సిద్ధం
కమ్మని చెప్పు " అన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రాదులు యుద్ధ భూమికి పోవడానికి సన్నాహాలు పూర్తి చేసాడు.
ధృతరాష్ట్రుడు గాంధారి యుద్ధ భూమికి వెళ్ళుట
పుత్రశోకంతో
గాంధారికి అడుగులు తడబడుతున్నాయి. గాంధారికోడళ్ళు కంటికిమంటికి ఏకథారగా
ఏడుస్తున్నారు. దుఃఖభారంతో నడుస్తున్న వారు పైట తొలగినా జుట్టు విడివడినా
పట్టించికునే స్థితిలో లేరు. కుంతీదేవి వారిని ఓదారుస్తుంది. అందరూ
ఓదారుస్తున్నారు. హస్థినాపరంలో ఉన్న సాధారణ స్త్రీలపని అలాగే ఉంది. వారిని
ఓదార్చే వారే కరువైయ్యారు. పురుషులంతా యుద్ధ భూమిలో మరణించగా భార్యాబిడ్డలు
అనాధలవలె మిగిలారు. వాళ్ళలో వాళ్ళు ఒకరిని ఒకరు ఓదార్చుకుంటున్నారు. అందరి
ఇళ్ళు అర్తనాదాలతో నిండి పోయాయి. ఇదంతా చూసి విదురుడికి మనసు కలత
చెందింది. యుద్ధపరిణామం ఇంత భయంకరంగా ఉంటుందా ! ఎంత మందిని అని ఓదార్చగలడు.
కొంత దూరం నడిచేసరికి రధికత్రయం ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళి " మహారాజా !
నీ కుమారుడు సుయోధనుడు దేవతలు మెచ్చేలా యుద్ధం చేసి వీరమరణం చెందాడు. మేము
ముగ్గురం తప్ప మిగిలిన కురుసైన్యమంతా మరణించింది " అన్నారు.
కృపాచార్యుడు భీమసుయోధన యుద్ధం వర్ణించుట
గాంధారిని చూసిన కృపాచార్యుడు
దుఃఖం ఆగక " అమ్మా గాంధారీ ! నీ కుమారులు యుద్ధ భూమిలో వీరోచితంగా పోరాడి
తమ ప్రాణాలు సమర్పించి వీరస్వర్గం అలంకరించారు. కనుక నీవు దుఃఖించకమ్మా !
నీ కొడుకుల్లో ఒక్కడూ యుద్ధ భూమిలో వెన్నిచ్చి పారి పోలేదు. యుద్ధముకు జంక
లేదు. అమ్మా ! పాండవులకు జయించినా సంతోషం లేదు. భీముడు
సుయోధనుడిని అధర్మంగా నాభి కిందభాగాన కొట్టి పడగొట్టింది చాలక తలను కాలితో
తన్నాడు. అది విని మాకు కోపం ఆగలేదు. మేము ముగ్గురం పాండవ శిబిరంలో
ప్రవేశించి వారి కుమారులను, బంధువులను పాంచాల రాకుమారులను, వారి సైన్యమును
గజములను హయములను దారుణంగా చంపాము. కనుక పాండవులవిజయం వ్యర్ధమైంది. ఆ సమయంలో
పాండవులు శ్రీకృష్ణుడు సాత్యకి
అక్కడ లేరు కనుక బ్రతికి పోయారు. లేకున్న అపాండవమై సుయోధనుడి ఆఖరి కోరిక
నెరవేరేది. మేము అర్ధరాత్రి పాడవుల కుమారులను, బంధువులను ససైన్యంతో
చంపినవిషయం తెలుసుకున్న పాండవులు క్రోధంతో మమ్ము వెతుకుతుంటారు. కనుక మాకు
శలవిప్పించండి వెళతాము " అని శలవు తీసుకుని తమ తమ రధముల మీద వెళ్ళారు. కొంత
దూరం పోయిన కృపాచార్యుడు వెనక్కు తిరిగి హస్థినకు వెళ్ళాడు. కృతవర్మ ద్వారకకు వెళ్ళాడు. అశ్వత్థామ గంగా తీరమున ఉన్న వ్యాసాశ్రమానికి వెళ్ళాడు. ఓ జనమేజయ మహారాజా ! వ్యాశ్రమంలో జరిగిన విషయం నీకు ముందే చెప్పాను కదా ! తరువాత ధృతరాష్ట్రుడు అంతః పుర స్త్రీలతో సహా యుద్ధభూమికి వెళ్ళాడు.
ధర్మరాజు ధృతరాష్ట్రుడికి ఎదురేగుట
ధృతరాష్ట్రుడు యుద్ధభూమికి వస్తున్నాడు అని తెలిసి ధర్మరాజు
తన తమ్ములతోనూ కృష్ణుడితోనూ ధృతరాష్ట్రుడికి ఎదురేగాడు. కాని తన కుమారులను
అంరదినీ పోగొట్టుకుని మనసంతా దహించుకు పోతున్న మనసుతో వస్తున్న
ధృతరాష్ట్రుడిని చూడడానికి ధర్మరాజు మనసులో కలవర పడ్డాడు. ధర్మరాజు వడివడిగా ధృతరాష్ట్రుడికి ఎదురు వెళ్ళాడు. అతడి వెంట సాత్యకి, భీముడు, అర్జునుడు, నకులసహదేవులు, ద్రౌపది వెళ్ళారు.
కురుసామ్రాజ్య ప్రజలు ధర్మరాజును నిందించుట
ధర్మరాజును
చూసి కౌరవ వనితలు హాహాకారాలు చేసారు. మరి కొంత మంది ధర్మరాజును తిట్ట
సాగారు " ఇతడు ధర్మరాజట ! ఇతడికి ధర్మం తెలుసా ! ఇతడికి జాలి దయా ఉన్నాయా !
ఉంటే తాతలను, తమ్ములను, బంధువులను, మిత్రులను, గురువులను, కుమారులనూ
చంపాడు. వీడికి కనికరమేమిటి ! " అని ఈసడించుకొనగా ! మరి కొంత మంది
ధర్మరాజుకు వెళ్ళి " ఓ ధర్మరాజా ! చదువులు చెప్పిన గురువునే చంపడానికి నీకు
మనసెలా ఒప్పింది " అని అడిగాడు. మరికొంత మంది " ఓయీ ధర్మరాజా ! చెల్లెలి
భర్త అని చూడక జయధ్రధుడిని చంపించావే ! శ్మశానం లాగా మారిన ఈ రాజ్యం అంతా
కట్టకట్టుకుని ఊరేగు " అన్నారు. ఎవరేమన్నా ! పాండవులు ఒక్క మాట కూడా
మాట్లాడ లేదు. అయినా వారు తిట్టడం ఆపలేదు. ఇంకొంత మంది పాండవులకు అడ్డంగా
వచ్చి " ఒయీ ! ధర్మరాజా ! నీ వలన కాదా ! అభిమన్యుడు మరణించింది, ద్రౌపది కొడుకులంతా వధించబడింది. నీ మరుదులందరినీ వధించినా నీ రక్త దాహం తీరలేదా ! " అన్నారు. అందరి తిట్లను భరిస్తూ ధర్మరాజు
ధృతరాష్ట్రుడి వద్దకు వెళ్ళాడు. పక్కన ఉన్న వారు ధర్మరాజు వచ్చాడని
చెప్పగానే ధృతరాష్ట్రుడిలో కోపం ముంచుకు వచ్చి భోరున ఏడుస్తూ ధర్మరాజును
కౌగలించుకున్నాడు.
ధృతరాష్ట్ర హృదయం
తరువాత ధృతరాష్ట్రుడికి పక్కన ఉన్న వారు వలన భీమార్జున, నకుల సహదేవులు కూడా వచ్చారని వినగానే భీముడు
అన్న మాట ధృతరాష్ట్రుడిలో కోపాగ్నిని రగిల్చింది. అతడి ముఖం వికృతంగా
మారింది దహించుకు పోతున్న హృదయంతో అతడిని కౌగలించుకోబోయాడు. ఏదో ప్రమాదం
జరుగుతుందని ముందుగా ఊహించిన కృష్ణుడు తాను ముందే సిద్ధంగా ఉంచిన భీముని విగ్రహాన్ని అతడి ముందుకు తోసాడు. లోహవిగ్రహమే భీముడు అనుకుని ధృతరాష్ట్రుడు
ఘాఢకౌగిలిలో బంధించి దానిని ముక్కలు చేసాడు. ఆ ముక్కలు గుచ్చుకుని
ధృతరాష్ట్రుడి శరీరానికి గాయాలు అయ్యాయి. ముఖం నుండి రక్తం స్రవించగా !
అతడు మూర్చిల్లాడు. తరువాత " నా కుమారులను చంపిన వాడిని చంపి నా పగ
తీర్చుకున్నాను " అంటూ లేచాడు. అతడి ముఖంలో సంతోషం వెల్లి విరిసినా పక్కన
ఉన్న వారు ఏదైనా అనుకుంటారన్న జంకుతో దుఃఖాన్ని అభినయిస్తూ భీముడి మరణానికి
ఏడవసాగాడు. పక్కన ఉన్న శ్రీకృష్ణుడు
ధృతరాష్ట్రుడి భుజం తట్టి ధృతరాష్ట్ర మహారాజా ! భీముడు జీవించే ఉన్నాడు.
నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. భీముని మీద నీకు ఉన్న క్రోధం ముందుగా ఊహించి
అతడికి బదులుగా భీముని వంటి విగ్రహాన్ని నీ ముందుంచాను. నీవు నలిపింది
భీముని విగ్రహాన్నే కాని భీముడిని కాదు. ధృతరాష్ట్ర మహారాజా ! నీ బలం ముందు
ఈ భీముడెంత ! ఈ మూడు లోకాలలో నీకు సాటి రాగల బలాఢ్యుడెవ్వడు ! కొడుకులు
పోయారన్న దుఃఖంతో భీముని చంపాలనుకున్నా భీముడికి నీ చేతిలో చావు లేదు కదా !
అయినా మహారాజా ! భీముడే కాదు పాండవులు అందరిని చంపినా నీ కుమారులు తిరిగి
వస్తారా ! అనవసరంగా అపవాదు మూట కట్టుకోవడం తప్ప " అన్నాడు.
శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి దోషం ఎత్తి చూపుట
ధృతరాష్ట్రుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. తనవంటికి అంటుకున్న రక్తం గాయాల నుండి స్రవిస్తున్న రక్తం కడుక్కున్నాడు. తిరిగి కృష్ణుడు
" ధృతరాష్ట్ర మహారాజా ! వేద వేదాంగ పారంగతుడవు ఎన్నో శాస్త్రములను
పురాణములను విని వాటి సారం గ్రహించిన నీవు నీ తప్పు తెలుసుకోకుండా ఇతరులను
నిందిస్తూ నీలో నీవే దుఃఖిస్తున్నావు. నాడు నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు,
మహామునులు నీకు పరి పరి విధముల చెప్పినా లక్ష్యపెట్టక కోరి యుద్ధం కొని
తెచ్చుకుని ఇప్పుడు ఫలితం అనుభవిస్తున్నావు. స్వయంకృతాపరాధముకు చింతించిన
ఫలమేమి ! భీమార్జునులను ఎదుర్కొని గెలువగల వీరులు ఈ ఉర్విలో ఉన్నారా ! అది
నీవు ఎరుగవా ! నీ మనస్సును నీవు నియంత్రించ లేక పోయావు. నీకుమారుడి
చెడునడతను అదుపులో పెట్టడం నీకు చేతకాలేదు. జూదంలో గెలిచామన్న నెపంతో నీవు
పాండవ పత్ని నీ కోడలు అయిన ద్రౌపదిని కొప్పు పట్టి సభకు ఈడ్చి దుర్భాషలు ఆడి వలువలు ఊడదీస్తున్నప్పుడు వారిని మందలించి అదుపులో పెట్ట లేని అసమర్ధుడవయ్యావు. కాని భీముడు
నాడు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటూ నీకుమారులను చంపినందుకు అతడిని
నిందిస్తున్నావు. ఇది న్యాయమా ధర్మమా ! నీ కుమారుల అవినీతిని
దుష్ప్రవర్తనను తలచుకొని నీ కోపాన్ని విడిచి పెట్టు " అని హితవు పలికాడు. ధృతరాష్ట్రుడు
" కృష్ణా ! నీవు పలికినదంతా నిజమే. కాని కొడుకులను పోగొట్టుకున్న దుఃఖం
భరించలేక అనుచితంగా ప్రవర్తించినందుకు సిగ్గుపడుతున్నాను. నీ మాటలతో నాకు
జ్ఞానోదయం అయింది. ఇక మీద పాండుకుమారులను నా కుమారులుగా భావిస్తాను " అని
పలికి. తరువాత భీమార్జున నకుల సహదేవులను కౌగలించుకున్నాడు. తరువాత
యుయుత్సుడు వచ్చాడని విని కనీసం ఒక్క కొడుకైనా మిగిలాడని అనుకుని సంతోషంగా
యుయుత్సుడిని కౌగలించుకున్నాడు.
వ్యాసుడు గాంధారి శాపం నుండి రక్షించుట
ధృతరాష్ట్రుడు
పాండవులతో " పాండుకుమారులారా ! మీ తల్లి గాంధారి వద్దకు వెళ్ళి ఆమెను
ఓదార్చండి " అన్నాడు. ధర్మరాజాదులు తమ పెదతల్లి గాంధారి వద్దకు వెళ్ళారు.
ఆమెకు నమస్కరించారు. కుమారుల మరణానికి రగిలిపోతున్న మనసుతో గాంధారి ధర్మరాజును శపించడానికి ఉద్యుక్తురాలైంది. అంతలో అక్కడకు వచ్చిన వ్యాసుడికి పాండవులు నమస్కరించారు. గాంధారి మనస్సు తెలుసుకున్న వ్యాసుడు ఆమెను వారిస్తూ " అమ్మా గాంధారీ ! ధర్మరాజును
శపించడం ధర్మం కాదు. ధర్మజుడి మీద కోపం మాని శాంతించు. నీకింత రజోగుణం
ఎందుకు. సాత్వికంగా ఉండు. నీ కుమారుడు సుయోధనుడు యుద్ధానికి పోతూ నీ
ఆశీర్వాదం కోరినప్పుడు నీవు ఏమని ఆశీర్వదించావో తెలుసా ! " ధర్మం ఎక్కడ
ఉంటుందో విజయం అక్కడ ఉంటుంది " అన్నావు. అదేనిజమైంది. ఈ మహా సంగ్రామంలో
ధర్మమూర్తులైన పాండవులకు విజయం లభించింది. నీ మాట ప్రకారం ధర్మం
జయించినట్లే కదా ! అసూయను వదిలి పాండవులలో ఉన్న ధర్మనిరతిని చూడు.
నిదానించి యోచించిన నీకే అర్ధం ఔతుంది. అమ్మా ! గాంధారి ! జరిగి పోయిన
విషయం తలచి బాధపడిన ఫలితమేమి ! కనుక పాండవుల మీద కోపం మాను " అన్నాడు. .
గాంధారి శాంతించుట
ఆ మాటలకు శాంతించిన గాంధారి
" మహర్షీ ! నాకు పాండవుల మీద కోపము అసూయ ఎన్నటికీ లేదు. వారికి ఎన్నడూ
కీడు తపపెట్ట లేదు. కుమారులను పోప్గొట్టుకున్న దుఃఖంతో అలా అనుకున్నానే
కాని పాండవులు కుంతికి ఎంతో నాకూ అంతే నా కుమారుడి దుర్బుద్ధి దుర్మార్గులైన శకుని, కర్ణ, దుశ్శాసనుల దొర్బోధలు కురు వంశ నాశనానినికి కారణమయ్యాయి కాని వేరు లేదు. కాని భీముడు
నా మారుడిని కృష్ణుడి సమక్షంలో నాభి కింద కొట్టి పడగొట్టాడు. అది తల్లినైన
నాకు క్షోభ కలిగించదా ! యుద్ధంలో చంపడం చావడం న్యాయమేకాని యుద్ధ నీతిని
తప్పి చంపడం అధర్మం కాదా ! ద్రోహం కాదా ! " అని పలికింది. ఆ మాటలు విన్న భీముడు
గడగడలాడుతూ గాంధారి వద్దకు వచ్చి ఇలా అన్నాడు " అమ్మా గంధారీ దేవీ ! నేను
చేసింది ధర్మమో అధర్మమో ప్రాణభయంతో అలా చేసానో జరిగి పోయింది. దయచేసి నన్ను
క్షమించమ్మా ! నా కంటే బలవంతుడు యుద్ధంలో నేర్పరి అతడిని ఓడించడం నాకు
వీలైనది కానందున అలా చేసాను. అయినా నీకు తెలియనిది ఏమున్నది. నీ కుమారుడు
ధర్మరాజుకు చేసినదంతా ధర్మమా ! ఏక వస్త్రగా ఉన్న ద్రౌపదిని
సభకు ఈడ్పించి వలువలు ఊడదీయమిని చెప్పడం ధర్మమా ! తల్లితో సమానమైన వదినకు
తొడలు చూపి కూర్చోమని సైగ చేయడం ధర్మమా ! ఆ సమయంలో ఆగ్రహించిన నేను చేసిన
ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి నీ కుమారుని తొడలు విరిచాను. చేసిన ప్రతిజ్ఞ
నెరవేర్చుకొనుట క్షత్రియ ధర్మమం కాదా ! నేను క్షత్రుయుడను కనుక నేను చేసిన
ప్రతిజ్ఞ నెరవేర్చి నా ధర్మం నెరవేర్చుకున్నాను. నాడు కురుసభలోనే ఆ పని
చేసి ఉంటే బాగుండేది. కాని ధర్మరాజు నన్ను ఆపాడు కనుక ఊరక ఉన్నాను. అన్న
మాట మీర లేక అడవులకు వెళ్ళి అష్టకష్టాలు పడ్డాము. మా అన్నయ్య ధర్మరాజు
శ్రీకృష్ణుడిని కురుసభకు రాయబారానికి పంపే సమయాన నా పలుకులు విని ఉంటే
నువ్వు నన్ను తప్పు పట్టి ఉండే దానివి కాదు. నేను " సుయోధనా !
అన్నదమ్ములమైన మనకు వైరము తగదు. నలుగురు వేలెత్తి చూపేలా నడుచుకోవడం తగదు
మా రాజ్యభాగం మాకిచ్చిన అందరం సుఖంగా ఉంటాము " అన్నాను. నీ కుమారుడు ఆ మాట
విని ఉంటే ఇలా జరిగి ఉండేదా ! ఎవరి మాటను లక్ష్యపెట్టక మాతో యుద్ధం కొని
తెచ్చుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యం కొరకు ధర్మరాజు,
చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకొనుటకు నేను యుద్ధం చేసాము. మా కర్తవ్యం మేము
నిర్వహించాము. సర్వం తెలిసిన నీవే ఏది ధర్మమో నిర్ణయించు " అన్నాడు.
గాంధారి దుశ్శాసనుడి మరణం గురించి భీముని ప్రశ్నించుట
గాంధారి
కొంత సేపు ఆలోచించింది " భీమసేనా ! నీవు చెప్పినది నిజమే అయినా నా
కుమారుని తోడలు విరుచుట ధమమా ! నీ ప్రతిజ్ఞ నీవు నెరవేర్చుకున్నావులే !
కాని భీమసేనా ! యుద్ధంలో శత్రువులను చంపవచ్చు కాని సాటి మానవుని గుండెలు
చీల్చి రక్తం తాగే క్రూరులు ఎక్కడైనా ఉంటారా ! రాక్షసులు మాత్రమే చేయగలిగిన
ఆపని నువ్వు చేసి వృకోదరుడనే నీ పేరు సార్ధకం చేసుకున్నావా ! ఇది ధర్మమా !
" అని అడిగింది. భీముడు
" సాటి మానవుడి నెత్తురు తాగడానికి నేను అంతటి క్రూరుడనా ! నాడు ద్రౌపది
కొప్పు పట్టి ఈడ్చినప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ చేసుకోవడానికి నేను అలా
చేసాను. కాని నెత్తురు నోటికి తాగించానే కాని తాగలేదమ్మా ! అలా చేయడానికి
నేను రాక్షసుడనా ! అమ్మా ! ఇంకొక విషయం నేను దుశ్శాసనుడిని చంపినప్పుడు
కురువీరులు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. స్వీయరక్షణ కొరకు అలా
భీకరాకారందాల్చాను కాని నేను అంతటి క్రూరుడను కాదమ్మా ! ఆ సమయంలో నేను అలా
చేయకుంటే కురు వీరులు నన్ను ముక్కలు చేసి ఉండే వాళ్ళు. సాటి మనుషుల
రక్తంతాగి వెర్రివాడిలా కరుణ లేకుండా తాగెపాతకం చేసేంత దుర్మార్గుడినా !
నేను అంత పాపాత్ముడను కాను నన్ను నమ్ము అమ్మా నేను రక్తం తాగ లేదు "
అన్నాడు.
గాంధారి ఆగ్రహం
గాంధారి
అంతటితో ఊరుకోలేదు " భీమసేనా ! నాకు నూరుగురు కొడుకులు ఈ గుడ్డి వాళ్ళను
కడతేర్చడానికి ఒక్క కొడుకునైనా మిగల్చకుండా అందరినీ దయాదాక్షిణ్యం లేకుండా
చంపావే ! ఇది ధర్మమా ! నూరుగురు కుమారులలో నీకు అపకారం చెయ్యని వాడు
ఒక్కడైనా నీకు కనిపించ లేదా ! ఒక్క కుమారుడిని మిగిల్చిన నీ ప్రతిజ్ఞ
నెరవేరదా ! నీ అన్న ధర్మరాజు రాజ్యం చేయడానికి నా కుమారుడు అడ్డు వస్తాడని అలాచేసావా ! " అని పక్కకు తిరిగి " ఎక్కడ ఆ మహారాజు ధర్మరాజు " అని కోపంగా అరిచింది. ఆ అరుపుకు ధర్మరాజు గడగడ లాడుతూ " అమ్మా ! ఇక్కడ ఉన్నానమ్మా ! నేనమ్మా ! పాండవాగ్రజుడను ధర్మరాజును.
నీ నూరుగురు కుమారులను చంపిన క్రూరుడను, పాపాత్ముడను నన్ను క్షమించకమ్మా !
నీ ఇష్టం వచ్చినట్లు దూషించి నీ శాపాజ్ఞిలో నన్ను ధగ్ధం చెయ్యి. అమ్మా నీ
నూరుగురు కుమారులనే కాదు ఈ భూమండలం లోని రాజులందరిని యుద్ధ భూమికి బలి
ఇచ్చిన పాపాత్ముడికి నీవు ఏ శిక్ష విధించినా భరిస్తాను అనుభవిస్తాను. బంధు
మిత్రులను అందరినీ పోగొట్టుకున్న నాకు ఈ రాజ్యమేల ఈ శరీరంలో ప్రాణం
ఎందుకు ! నా లాంటి ద్రోహికి స్వర్గ సుఖాలు ఎందుకు " అని భోరున ఏడ్చాడు. ధర్మరాజు
మాటలకు గాంధారికి నోట మాట రాలేదు. ఒక్క నిట్టూర్పు విడిచి కిందకు చూసింది.
ఆమె కంటికి కట్టుకున్న బట్ట కిందకు జరిగి ఆమె చూపు ధర్మరాజు కాలి మీద పడి
అతడి కాలి గోళ్ళు ఎర్రగా అయ్యాయి. అది చూసి భీమార్జునులు పక్కకు
తప్పుకున్నారు. అంతలో గాంధారి శాంతించి ధర్మరాజు
తల నిమిరి " నాయనలారా ! మీ అమ్మ కుంతీ దేవిని కలిసి ఆమె దీవెనలు పొందండి "
అన్నది. హమ్మయ్య అని పాండవులు నిట్టూర్చి తల్లి కుంతీ దేవి దగ్గరకు
వెళ్ళారు.
పాండవులు కుంతీ దేవిని చూచుట
చాలా
కాలం తరువాత పాండవులను చూసి కుంతీ దేవికి దుఃఖము ఆనందమూ కలగలుపుగా
స్పందించింది. పాండవులు తాము అరణ్యవాసంలో పడిన బాధలు కుంతీదేవికి
చెప్పుకున్నారు. అది విని కుంతీదేవి తల్లడిల్లింది. జరిగిన యుద్ధంలో తన
మనుమలు మరణించినందుకు చాలా దుఃఖించింది. తనకు నమస్కరిస్తున్న పాడవులను చూసి
వారి తలలు నిమిరి భోరుమంది. " పాండు కుమారులార ఇన్ని రోజులకు మీకు అమ్మ
గుర్తుకు వచ్చిందా ! అని వారి శరీరాలు తడిమి కుమిలి పోయింది. పక్కనే శోక
మూర్తిలా ఉన్న ద్రౌపదిని
చూసి " అమ్మా ! ఏరమ్మా నా మనుమలు ! అభిమన్యుడు ఎక్కడమ్మా ! ఎక్కడికి
వెళ్ళారమ్మా ! నన్ను చూడడానికి ఎందుకు రాలేదు " అని అడిగుతూ పేరుపేరు
వరుసనా పిలిచింది.
గాంధారి ద్రౌపదిని ఓదార్చుట
ఆ మాటలకు ద్రౌపది దుఃఖభారం తాళ లేక మొదలు నరికిన చెట్టులా కుప్ప కూలింది. కుంతీదేవి కోడలిని పొదివి పట్టుకుని భోరుమంది. కొంత సేపటికి తేరుకుని ద్రౌపదిని
ఓదార్చి గాంధారి వద్దకు తీసుకు వెళ్ళింది. గాంధారి ద్రౌపదిని ఓదారుస్తూ "
అమ్మా ! ద్రౌపదీ ! ఊరుకోమ్మా. పాండవులకు మాత్రం కొడుకులను పోగొట్టుకున్న
బాధ లేదా ! మీ అత్త కుంతీదేవికి మాత్రం మనుమలను పోగొట్టుకున్న దుఃఖం లేదా !
అమ్మా ద్రౌపదీ ! నీవు నేను ఒకే మాదిరి శోకం అనుభవిస్తున్నాము. నీకూ
కొడుకులు పోయారు. నాకూ కొడుకులు పోయారు. ఇలా జరుగుతుందనే విదురుడు
కురు సభలో ఎంతగానో చెప్పి చూసాడు. నేను ఏమాత్రం నా కుమారుల దుశ్చర్యలు ఆప
లేక పోయాను కనుకనే ఫలితం అనుభవిస్తూ ఉన్నాను. అయినా అంతా విధివిలాసం కాల
మహిమ ఊరుకోమ్మా ! " అని ద్రౌపది ఓదార్చింది.
స్త్రీ పర్వము ద్వితీయాశ్వాసము
- 1.1 గాంధారి బాధ
- 1.2 గాంధారి కృష్ణుడితో చెప్పి విలపించుట
- 1.3 గాంధారి సుయోధనుడిని చూసి విలపించుట
- 1.4 గాంధారి వైరాగ్యంతో కోడళ్ళను చూసి దుఃఖించుట
- 1.5 గాంధారి దుశ్శాసనుడి కొరకు దుఃఖించుట
- 1.5.1 గాంధారి భీముని నిందించుట
- 1.5.2 గాంధారి వికర్ణుడి కొరకు దుఃఖించుట
- 1.5.3 గాంధారి అభిమన్యుని కొరకు విలపించుట
- 1.5.4 గాంధారి కర్ణుడి కొరకు దుఃఖించుట
- 1.5.5 గాంధారి సైంధవుడి కొరకు దుఃఖించుట
- 1.6 గాంధారి భీష్మ ద్రోణుల కొరకు రోదించుట
- 1.7 గాంధారి అర్జునసాత్యకులను నిందించుట
- 1.7.1 గాంధారి శకునిని నిందించుట
- 1.7.2 గాంధారి మిగిలిన వారి కొరకు రోదించుట
- 1.7.3 గాంధారి కృష్ణుడిని నిందించి శపించుట
- 1.7.4 గాంధారికి కృష్ణుడు సమాధానం చెప్పుట
- 1.8 ధృతరాష్ట్ర ధర్మరాజులు ఉత్తర క్రియలు గురించి చర్చించుట
- 1.8.1 యోధులకు దహన క్రియలు జరిపించుట
- 1.9 కుంతీ దేవి కర్ణుడు తన కుమారుడని చెప్పుట
- 1.9.1 ధర్మరాజు కర్ణుడి మరణానికి విలపించుట
No comments:
Post a Comment