-శల్యవిరాటుల యుద్ధం
శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తూ విరాటుని అశ్వములను చంపాడు. శల్యుని
మీద విరాటుడు శరములు గుప్పించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు
సాయంగా వచ్చి విరాటుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు
వాడి అయిన బాణమును ప్రయోగించి శతానీకుని సంహరించాడు. తమ్ముని మరణం
విరాటునిలో భయం కలిగించినా పైకి ధైర్యంగా ఉండి శల్యుని ఎదుర్కొన్నాడు.
శల్యుడు పదునైన బాణమును ప్రయోగించి విరాటుని మూర్చిల్లేలా కొట్టాడు.
విరాటుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. విరాటుని సేనలు శల్యుని
ధాటికి ఆగ లేక పక్కకు తొలిగాయి. అది చూసి అర్జునుడు ఆ సైన్యములను ఆపి
శల్యునితో తలపడ్డాడు. అలంబసుడిని ఎదుర్కొన్న అర్జునుడు అతడి విల్లు కేతనమును విరిచి, హయములను చంపాడు. అలంబసుడు ఒక కత్తి తీసుకుని అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు
ఆ కత్తిని విరిచి నాలుగు భయంకరమైన బాణములతో ఆ రాక్షసుని కొట్టాడు.
అర్జునుడి ధాటికి ఆగ లేక అలంబసుడు పారి పోయాడు. నకులుడి కుమారుడు శతానీకుడు
సుయోధనుడి తమ్ముడైన చిత్రసేనుడిని ఎదుర్కొని చిత్రసేనుడి కవచమును చీల్చి,
కేతనము విరిచి, విల్లు విరిచాడు. చిత్రసేనుడు వేరొక విల్లందుకుని శతానీకుని
మీద బాణ ప్రయోగం చేసాడు. శతానీకుడు చిత్రసేనుడి రథాశ్వములను, సారథిని
చంపాడు. చిత్రసేనుడు శతానీకుని ఇరవై అయిదు బాణములతో శరీరం తూట్లు పడేలా
కొట్టాడు. శతానీకుడు ఒకే బాణంతో చిత్రసేనుడి విల్లు విరిచి రథమును
విరిచాడు. చిత్రసేనుడు రథము నుండి దూకి పక్కనే ఉన్న హార్దిక్యుడి రథము
ఎక్కి పారిపోయాడు. ద్రుపదుడు
కర్ణుని కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని మీద వృషసేనుడు
పైచేయిగా ఉన్నాడు. ద్రుపదుని నిస్సహాయత చూసి పాంచాల సేనలు వృషసేనుడితో
తలపడ్డాయి. కాని వృషసేనుడితో తలపడ లేక పారి పోయారు. దుశ్శాసనుడు ధర్మజుని
కుమారుడైన ప్రతి వింధ్యుని ఎదుర్కొని అతడి ధ్వజమును, విల్లును విరిచి,
సారథిని, హయములను చంపాడు. ప్రతివింధ్యుని సోదరులు అతడికి సాయంగా వచ్చి
పోరుతున్నారు. భీముని కుమారుడైన శ్రుతసేనుడు ప్రతి వింధ్యుని తన రథము మీద
ఎక్కించుకున్నాడు. ప్రతివింధ్యుడు మరొక విల్లందుకుని దుశ్శాసనుడితో
తలపడ్డాడు. నకులుడు శకునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని పదునైన బాణంతో నకులుని మూర్చపోయేలా కొట్టాడు. నకులుడు తేరుకుని శకుని విల్లు, కేతనమును విరిచి శకుని తొడలపై బాణములతో కొట్టి అతడిని కదలకుండా చేసాడు. నకులుని బాణధాటికి శకుని మూర్ఛపోయాడు. శకుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. కృపాచార్యుడు
శిఖండితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి కృపాచార్యుని విల్లు విరిచాడు.
కృపాచార్యుడు వేరొక విల్లందుకుని శిఖండి మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు.
శిఖండి
దానిని నిర్వీర్యం చేసాడు. కృపాచార్యుడు మరొక దృఢమైన బాణంతో శిఖండిని
మూర్చిల్లచేసాడు. కృపాచార్యుడు శిఖండిని చంపడానికి వేరొక బాణం తీయగానే
పాంచాలవీరులు అడ్డుకుని కృపాచార్యునితో యుద్ధానికి దిగారు. రథసారథి శిఖండి రథమును పక్కకు తప్పించాడు. కాగడాల వెలుతురులో ఆ నాటి యుద్ధం రసవత్తరంగా సాగింది. ధృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని అయిదు బాణాలతో కొట్టాడు. ద్రోణుడు ధృష్టద్యుమ్నుని విల్లు విరిచాడు. ధృష్టద్యుమ్నుడు వేరొక విల్లందుకుని అగ్ని బాణమును ప్రయోగించాడు. కర్ణుడు అది చూసి దానిని మధ్యలోనే తుంచాడు. సుయోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు అక్కడకు చేరి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు వారితో ఒంటరిగా పోరు సాగించాడు. కర్ణుడినితో తలపడిన ద్రుమసేనుడిని ఒకే బాణంతో కర్ణుడు సంహరించాడు. అది చూసిన ధృష్టద్యుమ్నుడు కోపించి కర్ణుని విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లందుకుని ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి నిర్వీర్యం చేసి కర్ణుని ఎదుర్కొన్నాడు. ఇంతలో వృషసేనుడు మధ్యలో వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి ఒకే బాణంతో వృషసేనుని మూర్ఛిల్లజేసాడు. కర్ణుడు తన కుమారుడు మృతిచెందాడనుకుని సాత్యకి మీద శరవర్షం కురిపించాడు. వృషసేనుడు తేరుకుని కర్ణుడితో చేరి సాత్యకిని ఎదుర్కొన్నాడు.
సుయోధనుడికి కర్ణుడి సలహా
అర్జునుడు దేవదత్తము పూరించాడు. ఇది విని కర్ణుడు " రారాజా ! అర్జునుడు ఇటు వైపు వస్తున్నాడు. అతడిని సాత్యకిని చేరకుండా ఆపగలిగితే మనము సాత్యకిని వధించ వచ్చు. ఇలా చేస్తేనే సాత్యకిని అభిమన్యుని చంపినట్లు చంపగలము. మన విజయానికి అదే నాంది. సాత్యకి మరణం తెలిసిన అర్జునుడు ఇక్కడకు వస్తాడు కనుక అతడికి సాత్యకి
మరణం తెలియకుండా మన మహాయోధులను పంపి అర్జునుడిని ఇక్కడకు రాకుండా
నిలువరించు " అన్నాడు. సుయోధనుడికి కర్ణుడి ఆలోచన నచ్చింది పక్కనే ఉన్న శకుని
చూసి " మామా ! నీవు పదివేల ఏనుగులను, పదివేల రధములను తీసుకుని అర్జునుడిని
ఎదుర్కొని అతడు ఇక్కడకు రాకుండా ఆపు. నీకు తోడుగా నా తమ్ములు దుశ్శాసనుడు, సుబాహుడు, దుష్ప్రదర్షణుడు, దుర్విషహుడు తోడుగా వస్తారు. నీవు అర్జునుడు, భీముడు, ధర్మరాజులను ఎదుర్కొని విజయం సాధించు " అన్నాడు. సుయోధనుడి మాటను అనుసరించి శకుని మేనల్లుళ్ళను తీసుకుని అర్జునుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు. కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు కాని సాత్యకి యుద్ధ కౌశలానికి కౌరవ సేన నిలువలేక పోయింది. సుయోధనుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. సాత్యకి
సుయోధనుడి సారథిని, రథాశ్వములను చంపి, విల్లు విరిచాడు. సుయోధనుడు కిందకు
దూకి పక్కనే ఉన్న రథమును ఎక్కి తప్పించుకున్నాడు. సుయోధనుడి పరాజయం చూసి
కౌరవసేన పారిపోయింది. శకుని తన కుమారుడైన ఉలూకునితో చేరి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. ఉలూకుడు అర్జునుడి మీద శరములు గుప్పించాడు. అర్జునుడు శకుని
సారథిని, రథాశ్వములను చంపి, అతడి వింటిని, రథమును విరిచాడు. శకుని
కుమారుని రథము ఎక్కి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. కాని వారు అర్జునుడి
గాండీవం నుండి వెలువడుతున్న శరముల ధాటికి తాళలేక పోయారు. శకునికి సాయంగా వచ్చిన రథికులు యుద్ధం చేయలేక పారి పోయారు. శకుని అతడి కుమారుడు దిక్కు తోచకుండా నిలబడ్డారు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొని అతడి వింటి నారిని విరిచాడు. ద్రోణుడు మరొక విల్లందుకుని శరప్రయోగం చేసాడు. అర్జునుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు కౌరవ సేనలను తనుమాడుతున్నారు. విజయ సూచకంగా అర్జునుడు దేవదత్తమును శ్రీకృష్ణుడు పాంచజన్యము, ధృష్టద్యుమ్నాది యోధులు తమతమ శంఖములు పూరించారు.
కర్ణుని విజృంభణ
కర్ణుడు పాడవుల విజయోత్సాహానికి క్రుద్ధుడై విజృంభించి పాండవసేనలను తరుముతూ దొరికిన వారిని దొరికినట్లు చంపసాగాడు. అది చూసిన ధర్మరాజు
అర్జునుడితో " అర్జునా ! చూసావా మధ్యందిన మార్తాండునిలా ఉన్న కర్ణుని
విజృంభణ చూస్తే మనం ఊరకున్న ఈ రోజే పాండవ సేనను నాశనం చేసేలా ఉన్నాడు. నీవు
అతడిని ఆపే మార్గం ఆలోచించు " అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి "
కృష్ణా ! అన్నయ్య ధర్మజుడు మన సేనలు పారి పోవడం చూసి భయపడుతున్నాడు. ఒక
వైపు కర్ణుడు, మరొక వైపు ద్రోణుడు
మన సైన్యాలను తరుముతున్నారు. ద్రోణుడిని తరువాత చూడవచ్చు ముందు కర్ణుని
ఆపాలి మన రథం కర్ణుని ముందు నిలుపు " అన్నాడు. కృష్ణుడు " అర్జునా !
రాత్రులందు రాక్షసులకు బలం ఎక్కువ కనుక నీవు ఇప్పుడు ఘటోత్కచుడిని పంపి
కర్ణుడిని నిలువరించుట ఉత్తమం. మాయా విద్యా ప్రవీణ్యుడు దివ్యాస్త్ర
సంపన్నుడైన ఘటోత్కచుడు కర్ణుడిని నిలువరించగల సమర్ధుడు. మనం ద్రోణుని ఎదుర్కొంటాము " అన్నాడు. కృష్ణుని మాట విన్న అర్జునుడు
ఘటోత్కచుడిని పిలిచి " కుమారా ఘటోత్కచా ! కర్ణుడి పరాక్రమానికి పాండవ సేన
చెదిరి పోతుంది. నీవు నీ పరాక్రమాన్ని చూపి అతడిని నిలువరింపుము. రాత్రి
సమయంలో కర్ణుడు నీ అంత సమర్ధవంతంగా యుద్ధం చేయలేడు కనుక నీవు అతడిని కట్టడి
చేయగలవు కనుక కర్ణుడిని ఎదుర్కొని నీ తండ్రుల పేరు నిలుపు " అన్నాడు. ఘటోత్కచుడు అర్జునుడికి నమస్కరించి కర్ణుడిని ఎదుర్కొనుటకు వెళ్ళాడు.
ఘతోత్కచాలంబసుల యుద్ధం
ఆసమయంలో జటాసురుడి కుమారుడైన అలంబసుడు సుయోధనుడి వద్దకు వచ్చి "
రారాజా ! నాకు ఎప్పటి నుండో పాండవుల మీద పగ ఉన్నది. మీరు అనుజ్ఞ ఇస్తే
పాండవులను సంహరించగలను " అన్నాడు. సుయోధనుడు ఆనందపరవశుడై అందుకు
అంగీకరించాడు. అలంబసుడు కర్ణుడిని దాటి ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు.
ఇరువురు మొదట విల్లంబులతో యుద్ధం మొదలు పెట్టారు. ఆ తరువాత రాక్షస మాయలు
ప్రయోగించి యుద్ధం చేయసాగారు. ఒకరు సర్పంగా మారితే ఒకరు గరుడునిగా మారారు.
ఒకడు ఏనుగుగా మారిన వేరొకరు సింహంగా మారారు. ఒకరికి ఒకరు తీసి పోకుండా
యుద్ధం చేయసాగారు. చివరికి ముష్టి యుద్ధానికి దిగారు. చివరకు ఘటోత్కచుడు
అలంబసుడిని కిందకు తోసి గొండెల మీద కాలు పెట్టి అలంబసుడి తల గుండ్రంగా
తిప్పి అతడి తల తెంచాడు. ఆ తలను తీసి సుయోధనుడి రథము మీద విసిరాడు. అది
చూసి ఆశ్చర్య పోతున్న సుయోధనుడితో " ఓ సుయోధనా! ఇది నీ స్నేహితుడి అలంబసుడి
తల ఇంకొంచెం సేపటికి కర్ణుడి తల నీ రథం మీదకు వేస్తాను నీ వంతు
వచ్చినప్పుడు నీ తల విసరగలను. నేను భీమసేనుడి కుమారుడినని తెలుసు కదా !
జాగర్త " అని గర్జించాడు.
ఘటోత్కచ కర్ణుల పోరు
భయంకరాకారంతో తన వైపు వస్తున్న ఘటోత్కచుడిని చూసి కర్ణుడు అతడి మీద పదునైన బాణములు గుప్పించాడు. ఇరువురు ఒకరికి ఒకరు తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు ప్రయోగించిన దివ్యాస్త్రములను ఘటోత్కచుడు తిప్పికొట్టాడు. ఘటోత్కచుడు ప్రయోగించిన అస్త్రములు కర్ణుడు
తిప్పి కొడుతున్నాడు. ఘటోత్కచుడు మాయా యుద్ధం ప్రకటించి మాయా సైన్యం
సృష్టించాడు. ఆ మాయా సైన్యం కౌరవులు అది వరకు చూడని వివిధ ఆయుధములను
కౌరవసేన మీద ప్రయోగించారు. ఆ ఆయుధ ధాటికి కౌరవ సేన పారిపోయింది. ఘటోత్కచుడు
కర్ణుడి మీద చక్రాయుధమును ప్రయోగించాడు. కర్ణుడు దానిని ఖండించాడు.
ఘటోత్కచుడు తన గధాయుదాన్ని కర్ణుడి పై విసిరాడు. కర్ణుడు దానిని ముక్కలు
చేసాడు. ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి రాళ్ళను చెట్లను వర్షంలా కురిపించాడు. కర్ణుడు వాట్ని నుగ్గు నుగ్గు చేస్తున్నాడు. ఘటోత్కచుడు కిందికి దిగి తన రథము అధిరోహించి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వెంటనే ఘటోత్కచుడి సారథిని, హయములను చంపి రథమును ముక్కలు చేసి ఘటోత్కచుడి శరీరం నిండా నిశితమైన శరములు నాటాడు. ఘటోత్కచుడు నోరు గుహలా తెరిచి కర్ణుడు వేసే బాణములు అన్నీ మింగాడు. కర్ణుడు
అతడి ముఖం నిండా బాణములతో నింపాడు. ఘటోత్కచుడు మరణించాడని అందరూ
అనుకుంటున్న తరుణంలో ఘటోత్కచుడు తేరుకుని కర్ణుడి రథాశ్వములను చంపి అతడి
విల్లు ముక్కుల చేసాడు.
ఘటోత్కచుడు అలాయుధునితో పోరుట
కర్ణుడు మీద ఘటోత్కచుడు
పైచేయిగా ఉన్న సమయంలో బకాసురుడి తమ్ముడు అలాయుధుడు సుయోధనుడి వద్దకు వచ్చి
" సుయోధనా ! మా అన్న బకాసురుడిని చంపిన భీముని మీద ప్రతీకారం
తీర్చుకోవాలని అనుకుంటున్నాను. నాకు అనుమతి ఇవ్వు " అన్నాడు. సుయోధనుడు
ఆలోచించాడు. ఘటోత్కచుడు
కర్ణుని మీద పైచేయిగా ఉన్నాడు. కృపాచార్యుడు, అశ్వత్థామ ఆశ్చర్యంగా
యుద్ధాన్ని తిలకిస్తున్నారు. అందరూ కర్ణుని మీద ఆశలు వదులుకున్న తరుణంలో
అలాయుధునికి అనుజ్ఞ ఇవ్వడం మంచిదని అనుకుని " అలాయుధా ! నీవు వెంటనే నీ
శత్రువైన భీముని కుమారుడైన ఘటోత్కచుడితో యుద్ధం చేసి ఓడించి తరువాత భీముని
మీద అతడి అన్నదమ్ముల మీద ప్రతీకారం తీర్చుకో " అన్నాడు. ఆ మాటకు సంతోషించిన
అలాయుధుడు తన రాక్షస సైన్యంతో ఘటోత్కచుడిని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు
అలాయుధుల మధ్య యుద్ధం మొదలైంది. సమ ఉజ్జీలైన ఇరు రాక్షస వీరులు ఒకరికి ఒకరు
తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. కర్ణుడు అక్కడ నుండి తప్పుకుని భీమునితో యుద్ధము చేయుటకు వెళ్ళాడు. భీముడు
కర్ణుని దాటుకుని తన కుమారుడైన ఘటోత్కచుడి వద్దకు వెళ్ళాడు. అలాయుధుని
అనుచరులైన రాక్షస వీరులు ఒక్కొక్కరుగా భీమసేనుడిని చుట్టుముట్టారు.
భీమసేనుడు వారందరిని ఒక్కసారిగా చంపాడు. అలాయుధుడు ఒంటరిగా యుద్ధం చేస్తూ
తన సేనలను పాంచాలసేనలతో యుద్ధానికి ప్రేరేపించాడు. అది చూసిన కృష్ణుడు "
అర్జునా ! రాత్రి పూట రాక్షసులకు బలం ఎక్కువ కనుక సాత్యకి, నకులసహదేవులను వారితో యుద్ధం చేయడానికి పంపు. కర్ణుని మీదకు ధృష్టద్యుమ్న శిఖండులను పంపి నీవు ద్రోణునితో పోరాడు " అన్నాడు. భీముడు అలసి పోవడం గమనించిన కృష్ణుడు
ఘటోత్కచుడిని పిలిచి " నాయనా ! ఘటోత్కచా! నీ తండ్రి భీమసేనుడు అలాయుధుడితో
పోరాడి అలసి పోయాడు. ఇక నీవు వెళ్ళి అలాయుధుని ఎదుర్కో " అని పంపాడు.
వెంటనే ఘటోత్కచుడు కర్ణుడిని వదిలి అలాయుధుని ఎదుర్కొన్నాడు. అతడితో నకులుడు మొదలైన పాండవయోధులు చేరి రాక్షస సేనను తరిమారు. కర్ణుడు పాంచాల సేనలతో పోరుతున్నాడు. అది చూసి భీముడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు.
ఘటోత్కచుడు అలాయుధుని చంపుట
అలాయుధుడు ఘటోత్కచుడి మీద ఒక పరిఘను విసిరి అతడిని మూర్ఛిల్లజేసాడు. ఘటోత్కచుడు
వెంటనే తేరుకుని తన గదను గిరిగిరా తిప్పి అలాయుధుని మీద విసిరాడు. ఆ గద
అలాయుధుని సారథిని, అతడి రథాశ్వములను, ధ్వజమును, రథమును నుగ్గు చేసాయి.
వెంటనే అలాయుధుడు ఒక మేఘంగా మారి ఆకాశం నుండి నెత్తురు కురిపించాడు. ఘటోత్కచుడు
కూడా ఆకాశానికి ఎగిరి అలాయుధుని మాయను తిప్పి కొట్టాడు. తరువాత రాక్షస
వీరులు భూమికి దిగి రాళ్ళతో చెట్లతో యుద్ధం చేయసాగారు. అలాయుధుడు కత్తి
తీసుకుని ఘటోత్కచుని ఎదుర్కొన్నాడు. ఘటోత్కచుడు కూడా కత్తి తీసుకుని
అలాయుధుని ఎదుర్కొన్నాడు. చివరికి ఘటోత్కచుడు అలాయుధుడిని కింద పడవేసి అతడి
కంఠము తెగనరికి సింహనాదం చేసాడు. పాండవ సైన్యం ఆనందోత్సాహాలతో మిన్నంటేలా
భేరీ నాదాలు చేసారు. ఘటోత్కచుడు అలాయుధుని తల తీసుకుని సుయోధనుడి రథము మీదకు విసిరాడు. అది చూసి సుయోధనుడు చింతాక్రాంతుడైయ్యాడు. తరువాత ఘటోత్కచుడు పాండవ సేనలను నాశనం చేస్తున్న కర్ణుడిని ఎదుర్కొన్నాడు.
ఘతోత్కచ మరణం
కర్ణుడు తనను ఎదుర్కొన్న ఘటోత్కచుని రథాశ్వములను చంపాడు. వెంటనే ఘటోత్కచుడు రథంతో సహా మాయం అయ్యాడు. ఘటోత్కచుడు ఎవరి ముందు ప్రత్యక్షమై ఎవరిని చంపుతాడో అని కౌరవ సేనలో భయాందోళనలు మొదలైయ్యాయి. ఘటోత్కచుడు
మేఘంలాగా మారి ఆకాశంలో నుండి కౌరవ సేన మీద పెద్ద పెద్ద బండరాళ్ళు విసరి
కౌరవ సేన రథములను నుగ్గు చేస్తున్నాడు. కురుసేన ఏవైపు నుండి బండరాళ్ళు
పడతాయోనని బెదిరి పోతున్నారు. కాని కర్ణుడు మాత్రం ధైర్యంగా నిలబడి తన దివ్యాస్త్రములతో రాక్షస మాయను విచ్ఛిన్నం చేస్తున్నాడు. కర్ణుడు
రాళ్ళ వాన కురిపిస్తున్న మేఘమును విచ్ఛిన్నం చేయడంతో కౌరవసేనలో ధైర్యం
వచ్చింది. వారు కర్ణుడితో " కర్ణా ! నీవు మహా వీరుడవు లేకున్న రాక్షస మాయను
విచ్చిన్నం చేయలేవు. కాని నిన్ను నీవు కాపాడుకోవాలంటే ఘటోత్కచుడిని
సంహరించక తప్పదు. కనుక ఇంద్రుడు నీ కవచకుండలములు దానంగా పరిగ్రహించిన
తరుణంలో ప్రసాదించిన అమోఘమైన శక్తిని అతడి మీద ప్రయోగించి అతడిని సంహరించు.
దానిని ఎప్పుడో భీమార్జునులను చంపడానికి దాచి ఏమి ప్రయోజనం మనం అప్పటి
వరకు ఘటోత్కచుడి ధాటీకి ప్రాణాలతో ఉంటే కదా! కనుక ఆ శక్తిని ఘటోత్కచుడి మీద
ప్రయోగించు " అని కర్ణుడిని వత్తిడి చేసారు. ఆ సమయంలో ఘటోత్కచుడు
గధతో కర్ణుని మీద కలబడి అతడి రథమును విరిచాడు. రథవీహీనుడై నిలబడిన
కర్ణుడిని చంపడానికి గధ ఎత్తి నిలబడిన ఘటోత్కచుడి చేతిలో చావు తప్పదనుకుని
గత్యంతరం లేని పరిస్థిలో మీద ఇంద్రుడు
ప్రసాదించిన శక్తి ఆయుధమును ఘటోత్కచుడి మీద ప్రయోగించదలిచాడు.
ఇంద్రదత్తమైన ఆ ఆయుధము మహా భయంకరమైంది. దానిని ప్రయోగించన తరువాత ఒక్కరిని
మాత్రమే సంహరించి తిరిగి ఇంద్రుని వద్దకు చేరుతుంది. అర్జునుడి మీద
ప్రయోగించాలని భద్రంగా ఉంచిన ఆ ఆయుధాన్ని కర్ణుడు ఘటోత్కచుడిని లక్ష్యంగా
చేసి ప్రయోగించాడు. తన మీదకు దూసుకు వస్తున్న ఆ శక్తి ఆయుధాన్ని చూసి
ఘటోత్కచుడు భయపడ్డాడు. ఆ శక్తి ఆయుధం ఘటోత్కచుడి మాయశక్తులను హరించి అతడి
గుండెను చీల్చుకుంటూ బయటకు వెళ్ళింది. ఆ దెబ్బకు ఒక మహావీరుని ప్రాణాలు
అనంతవాయువులలో కలిసాయి. కౌరవసేన ఆనందోత్సాహాలతో సింహనాదాలు చేస్తూ
హర్ష్యధ్వానాలు చేసారు. అందరూ కర్ణుడిని పలు విధముల శ్లాఘించారు. సుయోధనుడు
పరుగు పరుగున వచ్చి కర్ణుని కౌగలించుకున్నాడు.
ఘటోత్కచుని మరణానికి పాండవసేనలో స్పందన
ఘటోత్కచుడి
మరణ వార్త వన్న పాండవులు కన్నీరు మున్నీరుగా విలపించారు. భీమసేనుడి
దుఃఖముకు అంతు లేదు. కాని కృష్ణుడు రథము మీద నిలబడి నాట్యమాడసాగాడు.
కేరింతలు కొట్టి సింహనాదం చేసి ఆనందంతో పాంచజన్యం పూరించారు. కృష్ణుడి
విపరీత ప్రవర్తన చూసి అర్జునుడు ఆశ్చర్యపోతూ " కృష్ణా ! ఆపు ఏమిటిది మేమంతా
ఘటోత్కచుడి మరణానికి విలపిస్తుంటే నీవు ఆనందంతో గంతులు వేస్తున్నావు. ఇక
చాలు ఆపు ఎవరన్నా చూస్తే నవ్వుతారు " అన్నాడు ఈసడింపుగా. కాని కృష్ణుడు తన
ఆనంద హేల ఆపక అలా పాడుతూ ఆనందంతో గెంతుతూ ఉన్నాడు. కాని అంతలో అర్జునుడు
తెలివి తెచ్చుకుని కృష్ణునితో " కృష్ణా! నీవు అన్నీ తెలిసిన వాడివి.
మహానుభావుడివి నీ వింత ప్రవర్తనకు ఏదో కారణం ఉంటుంది నాకు చెప్పవా "
అన్నాడు. అని అనునయంగా అన్నాడు. కృష్ణుడు " అర్జునా! నీ తండ్రి నీ క్షేమము
కోరి కర్ణుడి వద్ద నుండి కవచకుండలములు దానంగా పరిగ్రహించాడు. ఆ సమయంలో
కర్ణుడికి ప్రతిగా ఒక మహత్తర శక్తిని కానుకగా ఇచ్చాడు. అది ఒక సారి
ప్రయోగిస్తే ఒకరిని మాత్రమే చంపి తిరిగి ఇంద్రుని చేరగలదు. దానిని కర్ణుడు నిన్ను చంపడానికి మాత్రమే దాచాడు. కాని గత్యంతరం లేని పరిస్థితిలో దానిని కర్ణుడు ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. కనుక ఇక కర్ణుడు నిన్ను ఏమీ చేయ లేడు. అర్జునా! కర్ణుడు
దైవాంశ సంభూతుడు సామాన్యుడు కాదు. అతడి వద్ద ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఉన్నంత
వరకు నా సుదర్శన చక్రము కాని నీ గాండీవం కాని ఏమి చేయలేదు. నీ తండ్రి
కర్ణుడి కవచ కుండలములు పరగ్రహించకున్న అతడిని నీవే కాదు ముల్లోకాలలో ఎవరూ
ఏమీ చేయ లేరు. అతడిప్పుడు సాధారణ మానవుడయ్యాడు కనుక అతడిని ఇక నీవు సులభంగా
జయించ వచ్చు . ఇది నాకు సంతోషం కాదా! " అన్నాడు. నేను జరాసంధుని,
శిశుపాలుని నీ కొరకు చంపించాను. వారు బ్రతికి ఉన్న సుయోధనుడితో చేరి నిన్ను
ఎదుర్కొనేవారు. వారందరూ కర్ణుడితో కలిస్తే జయించుట అసాధ్యం. ఇక ఘటోత్కచుడు
ఎంత భీముడి కుమారుడైనా రాక్షసవంశ సంజాతుడు. ధర్మద్వేషము, హరిద్వేషము అతడి
నరనరాలలో జీర్ణించుకుని ఉంది. అతడు బ్రతికి ఉన్నా ఎప్పటికైనా నా మీద
తిరగబడగలడు. అప్పుడు నేను చేయవలసిన పని ఇప్పుడు కర్ణుడు పూర్తి చేసాడు. నీవు నాకు అత్యంత ఆప్తుడవు నీ క్షేమమే నాకు ముఖ్యము. ఇక నీకు కర్ణుడు హాని చేయజాలడు. మన సైన్యములు అలసి ఉన్నాయి. వారికి కొంత విశ్రాంతినిచ్చి తిరిగి యుద్ధానికి ఉపక్రమించ వచ్చు " అన్నాడు.
ధృతరాష్ట్రుని సందేహం
సంజయుడు
ఘటోత్కచుడు మరణించిన వృత్తాంతం చెప్పగానే ధృతరాష్ట్రునికి ఒక అనుమానం
వచ్చింది. " సంజయా ! మరి అంతప్రభావం కలిగిన శక్తిని తన వద్ద పెట్టుకున్న కర్ణుడు
ఇంత కాలము అర్జునుడిని చంపకుండా ఎందుకు వదిలాడు. ఒక్కరిని మాత్రమే
చంపగలిగిన శక్తి ఆయుధాన్ని అర్జునుడి మీద వేసి చంపితే యుద్ధం ఎప్పుడో
ముగింపుకు వచ్చేది కదా! పాండవులు ఎప్పుడో యుద్ధం నుండి విరమించే వారు.
మనలనువిజయలక్ష్మి వరించేది. ఇంత జన నష్టం తప్పి పోయేది కదా! యుద్ధానికి
పిలిస్తే అర్జునుడు కర్ణునితో యుద్ధం చేయకపోతాడా ! కర్ణుడు
ఇంత బుద్ధిహీనుడుగా ఎందుకు ఉన్నాడు. నా కుమారుడు కర్ణునికి ఎరందుకు గుర్తు
చేయ లేదు అన్నాడు. అక్కడే ఉన్న నీవు కూడా ఎందుకు గుర్తు చేయ లేదు. చేతిలో
ఉన్న మామిడి పండు తినడం మరచినట్లు ఉంది కదా! దీనికి మరేదైనా కారణము ఉందా "
అని ధృతరాష్ట్రుడు ఆత్రంగా సంజయుని అడిగాడు. సంజయుడు
" మహారాజా ! మేము గుర్తు చేయకుండా ఎందుకు ఉంటాము. ప్రతి రోజు మేమంతా
సుయోధనుడితో కలసి మరునాడు నీవు శక్తి ఆయుధమును ప్రయోగించి అర్జునుడిని
చంపాలి అని చెప్తూనే ఉన్నాము. కర్ణుడు
కూడా అలాగే చంపుతానని అంటుండే వాడు. కాని మరునాడు యుద్ధ భూమిలో
ప్రవేశించగానే కర్ణుడితో సహా మేమంతా ఆవిషయం మరచి పోతుంటాము. తిరిగి రాత్రి
సమయంలో శిబిరాలకు చేరిన తరువాతగాని మాకు గుర్తుకు వచ్చేది కాదు. అది దైవమాయ
కాక మరేమిటి చెప్పు అంతే కాదు. సుయోధనుడు " కర్ణా ! అర్జునుడిని మాత్రమే
చంపితే కృష్ణుడు మనలనందరిని చంపి పాండునందనుడికి పట్టం కడతాడు. ఆ శక్తితో కృష్ణుడిని చంపితే మనం ఈ ధరాతలాన్ని ఏకచ్ఛత్రంగా పాలించ వచ్చు " అనే వాడు. కర్ణుడు అలాగే చంపుతాను అనే వాడు. కాని మరునాడు అంతా మరిచిపోయే వాడు అదేమి చిత్రమో. మరొక విషయము వినండి. ఘటోత్కచుడి మరణసమయాన శ్రీకృష్ణుడు
రథము మీద నాట్యం చేసాడు కదా ! పాండవ శిబిరానికి వెళ్ళి చాటుగా ఉండి వారి
మాటలు విన్నాను. కృష్ణుడు ప్రవర్తనకు కారణమేమిటని అర్జునుడు అడిగిన విషయం
పక్కనే ఉన్న సాత్యకి విని " అన్నయ్యా ! కర్ణుడు ఇంత కాలము మహా శక్తిని ప్రయోగించి అర్జునుడిని ఎందుకు చంప లేదు " అన్నాడు. కృష్ణుడు " సాత్యకి ! సుయోధనాదులు ప్రతి రోజు ఆ శక్తి ఆయుధంతో అర్జునుడిని చంపమని చెప్తుండే వారు. నేను కర్ణుడు యుద్ధరంగమున ప్రవేశించగానే నా మాయలో పడవేసి అతడికి ఆసక్తి ఆయుధం గుర్తుకు రాకుండా చేసేవాడిని. ఆ కారణంగా కర్ణుడు అర్జునుడి
మీద ఆ శక్తి ప్రయోగించ లేక పోయాడు. సాత్యకీ ! నీ కంటే, ధృష్టద్యుమ్నుడి
కంటే మిగిలిన పాడుసుతుల కంటే నాకు అర్జునుడంటే వల్లమాలిన ప్రేమ. అర్జునుడు
నా బహిర్ప్రాణం ఇంత కాలం కర్ణుడి వద్ద ఉన్న శక్తి కారణంగా అర్జునుడికి
ప్రమాదం పొంచి ఉన్నదని భయపడుతునే ఉన్నాను. నిద్రలేని రాత్రులు గడిపాను. ఇక
నేను సుఖంగా నిద్రిస్తాను " అన్నాడని సంజయుడు ధృతరాష్ట్రునుకి చెప్పాడు.
ధృతరాష్ట్రుడు " సంజయా ! దురదృష్టం సుయోధనుడిని వెన్నంటి ఉన్నప్పుడు మనమేమి
చేయగలము " అన్నాడు.
ఘటోత్కచుని మరణానికి ధర్మజుడు విలపించుట
ఘటోత్కచుడి
మరణానికి దుఃఖంతో ధర్మరాజు రథము మీద కూలబడి రోదిస్తున్నాడు. కృష్ణుడు
దగ్గరకు వెళ్ళి " ధర్మనందనా! ఏమిటీ వెర్రి. యుద్ధమున వీరులు మరణించరా !
అందుకు ఇంత చింతించ తగునా ! నీవిలా చింతించిన సైన్యమును నడుపగల వాడేవడు. నీ
సోదరులను ఓదార్చగలవారెవరు లే వారిని ఓదార్చి యుద్ధసన్నద్ధులను చేయి "
అన్నాడు. నీకు తెలియనిది ఏముంది ఘటోత్కచుడికి మేమంటే ఎంత
ప్రేమాభిమానాలున్నాయో మమ్ము ఎంత గౌరవిస్తాడో. అరణ్యవాస సమయంలో మాకు ఎంత
సహకరించాడు. నాకు ఘటోత్కచుని మీద సహదేవునికన్నా ప్రేమ ఎక్కువ. అటువంటి
ఘటోత్కచుడు మరణుస్తే దుఃఖించక ఎలా ఉండగలను " అన్నాడు. అంతలోనే ఉగ్రుడై
కృష్ణా ! దీనికంతటికి కారణం కర్ణుడు
నాడు అభిమన్యుని విల్లు విరిచి అతడి మరణానికి కారణం అయ్యాడు. నేడు
ఘటోత్కచుడిని స్వయంగా చంపాడు. కర్ణుడి మీద ప్రతీకారం చేయాలి. కర్ణుడికి
సాయం చేసిన వాడు ద్రోణుడు
నేను కర్ణుడిని చంపుతాను భీముడు ద్రోణుడిని చంపుతాడు " అంటూ తన రథమును
వేగంగా ముందుకు నడిపాడు. కృష్ణుడు కలవరపడి అర్జునా ! అటు చూడు మీ అన్నయ్య
కర్ణుడి మీద యుద్ధానికి పోతున్నాడు అతడిని అనుసరించు అన్నాడు. అలా వేగంగా
పోతున్న ధర్మరాజు ఎదుటికి వ్యాసమహర్షి వచ్చాడు. ధర్మరాజు వ్యాసుడికి
నమస్కరించాడు. వ్యాసుడు " ధర్మనందనా ! కర్ణుడు
శక్తి ఆయుధాన్ని అర్జునుడిని చంపడానికి ఉంచాడు. అది ఇప్పుడు ఘటోత్కచుడి
మీద ఉపయోగించబడింది లేకున్న అర్జునుడిని చంపి ఉండే వాడు. అది జరిగి ఉంటే నీ
దుఃఖం వర్ణించనలవి కాదు. ఇప్పుడు నీవు కొద్ది ధుఃఖంతో బయటపడటం మంచికే
జరిగింది. కనుక అకారణంగా కోపం తెచ్చుకొనక వివేకంగా ఆలోచించి నీ వారినందరిని
కలుపుకొని యుద్ధం కొనసాగించు. ఇకొంక విషయం చెప్తాను. నేటికి సరిగా అయిదవ
నాటికి నిన్ను విజయలక్ష్మి వరిస్తుణంది. దీనిలో సందేహం లేదు " అన్నాడు.
ధర్మరాజు ద్రోణుని వధించమని సైన్యాలను పురికొల్పుట
వ్యాసుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు మనసును కుదుటపరచుకుని ధృష్టద్యుమ్నుడితో " భీముడు
ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ద్రోణుడితో యుద్ధము చెయ్యి.
నీవు ద్రోణుడిని చంపడానికే పుట్టావు. శిఖండిని పాంచాల సైన్యాలను వెంట
తీసుకుని ద్రోణుడిని ఎదిరించు " అని చెప్పి మిగిలిన వారిని చూసి చూసి "
విరాటరాజా ! ద్రుపద మహారాజా! సాత్యకీ ! నకుల సహదేవులారా! ఉపపాండవులారా! మన
ముందున్న ఏకైక లక్ష్యం ద్రోణ వధ. పార్ధుని నాయకత్వంలో మీరంతా ద్రోణుడిని
ఎదుర్కొనండి " అన్నాడు. అప్పటికే ఇరుపక్షముల సేనలు ఒక పగలు ఒకరాత్రి యుద్ధం
చేసి అలసి పోయాయి. నిద్రమత్తులో క్షణం ఒక యుగంగాఊవస్థ పడుతున్నారు. నిద్ర
మత్తులో తూలుతున్నారు. ఇది గమనించిన అర్జునుడు ఇరుపక్షముల యోధులను
ఉద్దేశించి " సైనికులారా! మీరంతా బాగా అలసి పోయి ఉన్నారు. నిద్రావస్థతో
జోగుతున్నారు. కనుక మీరంతా కొంతసేపు నిద్రపొండి. మరొక ఝాములో చంద్రోదయం
ఔతుంది. చంద్రుడు వచ్చిన తరువాత వెన్నెల వెలుగులో మన్ము తిరిగి యుద్ధము
చేస్తాము " అన్నాడు. ఈ సూచనకు ఇరుపక్షముల సైనికులు సంతోషంగా అంగీకరించారు.
కౌరవ సైనికులు సహితము అర్జునుడి దయాగుణానికి శ్లాఘించారు. సైనికులంతా
ఎక్కడి వారక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలా నిద్రిస్తుండగా చంద్రోదయం
అయింది. పండు వెన్నెల కాయగానే పాండవ కౌరవ సేనలు నిద్ర మేల్కొని యుద్ధానికి
సిద్ధం అయ్యాయి.
సుయోధనుడు ద్రోణుని నిందించుట
సుయోధనుడు
ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నీవు చాలా గొప్పవాడవు,
మహావీరుడవ నీముందు నిలువగలవారెవరు లేరు. కాని నీవు నీ శిష్యులైన పాండవులను
చంపక వదిలి పెట్టడం నా దురదృష్టం కాక మరేమిటి ? " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు కోపించి " సుయోధనా ! నీ ఉద్దేశం నేను పాండవులను నా శిష్యులని వదిలి వేస్తున్నాననే కదా ! ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు
అగ్నిదేవునికి సాయంగా ఉన్నప్పుడు. ఇంద్రుడు నా శిష్యుడనే అతడిని వదిలి
వేసాడా ? నాడు ఘోషయాత్రా సమయాన చిత్రసేనుడు నిన్ను బంధీగా పట్టుకున్న సమయాన
నీ కొరకు యుద్ధము చేసిన అర్జునుడిని చిత్రసేనుడు నా శిష్యుడనే వదిలాడా?
కాలకేయులనే రాక్షసులు అర్జునుడు
నా శిష్యుడనే అతడి చేతిలో మరణించారా ? అర్జునుడి పరాక్రమం తెలిసీ నన్ను
నిందించడం తగదు " అన్నాడు. సుయోధనుడు " ఆచార్యా ! మీరు అవకాశం
వచ్చినప్పుడల్లా అర్జునుడిని పొగుడుతూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ
పాండవులను అర్జునుడిని నాకు వదలండి. నేను కర్ణ, దుశ్శాసన, శకుని సాయంతో
పాండవులను అంత మొందిస్తాను. మీరు మీకిష్టమైన వారితో యుద్ధము చేయండి "
అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు నవ్వి " సుయోధనా ! అలాగే మీరు అర్జునిడి ని
ఎదుర్కొనండి మీరే గెలుస్తారేమో ! నాకు మాత్రం అర్జునుడి చేతిలో మరణించే భయం
పోగొట్టావు అంతే చాలు " అన్నాడు.
ద్రోణుడు పాంచాల సేనను ఎదుర్కొనుట
తరువాత ద్రోణుడు పాంచాల సైన్యాంతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారు ఝాము అయింది. సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించారు. మహా వీరుడైన ద్రోణుడు
అతిరధ మహారధులతో యుద్ధం చేయక తమలాంటి సామాన్య సైనికులుతో యుద్ధం
చెయ్యడమేమిటని పాంచాల సైనికులు ఆశ్చర్య పోతున్నారు. అంతటి మహావీరునితో
యుద్ధము చేసి చచ్చినా పరవాలేదని కొందరు అతడిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో
విరాటరాజు, ద్రుపదుడు, అతడి మనుమలు, కేకయ రాజులు తమ సైన్యాలతో ద్రోణుడిని
ఎదుర్కొన్నారు. ద్రోణుడు
తన వాడి అయిన బాణాలతో పాంచాల మత్స్య సేనలను హతమార్చడమే కాక ద్రుపదుని
మనుమలను ముగ్గురిని హతమార్చాడు. కేకయ రాజుల తలలను పండ్లు రాల్చినట్లు నేమీద
పడ వేసాడు. అది చూసి విరాటుడు, ద్రుపదుడు వీరావేశంతో ద్రోణుడిని
ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వారిద్దరినీ అమిత పరాక్రమంతో ఎదుర్కొని వారిద్దరినీ చెరి ఒక బాణంతో నేల కూల్చాడు. తన తండ్రి మరణం కళ్ళారా చూసిన ధృష్టద్యుమ్నుడు
" నేను కనుక ద్రోణుడిని చంపకపోతే నా కులాచారాన్ని ధర్మాలను తప్పిన వాడిని
ఔతాను. అని ఘోర ప్రత్నిజ్ఞ చేసి పాంచాల సేనను తీసుకుని ద్రోణుడిని
ఎదుర్కొన్నాడు. అది చూసి సుయోధనుడు కర్ణుడితో వచ్చి ధృష్టద్యుమ్నుడిని
అడ్డుకున్నాడు. అంతలో భీమసేనుడు వచ్చి ధృష్టద్యుమ్నుడికి తోడుగా ద్రోణుడిని
ఎదుర్కొన్నాడు.
కురు పాండవ యోధుల సమరం
అప్పటికి
సూర్యోదయం అయింది. ఇరు పక్షముల వారు కొంతసేపు యుద్ధము ఆపి కాలకృత్యములు
తీర్చుకుని కొంత విశ్రాంతి తీసుకుని మరలా యుద్ధము చేయుటకు ఉపక్రమించారు.
సుయోధనుడు నకులుడిని, దుశ్శాసనుడు సహదేవుడిని, ద్రోణుడు అర్జునుడిని,
భీముడు కర్ణుడిని ఎదుర్కొని పోరాడుతున్నారు. సహదేవుడి సారథిని దుశ్శాసనుడు
చంపాడు. సహదేవుడు తానే రథము తోలుకుంటూ దుశ్శాసనుడి హయములను గాయపరిచాడు. ఆ దెబ్బకు దుశ్శాసనుడి హయములు దుశ్శాసనుడిని రథముతో సహా ఎటో లాక్కెళ్ళాయి. భీముడు కర్ణుడు పదునైన బాణములతో ఒకరిని ఒకరు ఎదుర్కొన్నారు. తరువాత గధాయుద్ధము చేసారు. తిరిగి కర్ణుడు తన విల్లు తీసుకుని భయంకరమైన బాణములతో భీముని రథమును విరిచాడు. భీముడు సహదేవుడి రథము మీదకు దూకాడు. ద్రోణుడు
అర్జునుడు ఒకరి మీద ఒకరు బాణ ప్రయోగం చేసుకుంటున్నారు. ఒకరు ప్రయోగించిన
అస్త్రముకు వేరొకరు ప్రత్యస్త్రము ప్రయోగించుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు ఏ
అస్త్రము ప్రయోగించారో తెలియక చూసే వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ విధంగా
గురుశిష్యులు ఘోరయుద్ధము సాగిస్తున్నారు. ఆకాశం నుండి వీరి యుద్ధం
చూస్తున్న దేవతలకు పరమేశ్వరుడు రెండు రూపాలుగా విడి పోయి ఒకరితో ఒకరు తలపడి వినోదిస్తున్నాడా ! అన్నట్లు ఉంది. ద్రోణుడు
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి నియమ నిష్టలతో మంత్రజపం చేసాడు. దేవతలు
భయంతో వణికి పోయారు. దిక్కులు కంపించాయి. సముద్రాలు పొంగాయి. అది ఏమీ
లక్ష్యపెట్టని ద్రోణుడు
బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు బెదరక బ్రహ్మాస్త్రాన్ని
ప్రయోగించి దానిని ఉపసంహరించాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఒకదానిని ఒకటి
ఢీకొని నిర్వీర్యం అయిపోయాయి. ఒకరితో ఒకరు యుద్ధము సేసి ప్రయోజనము కవిపించక
అర్జునుడు కౌరవ సేనల వైపు ద్రోణుడు పాంచాల సేనల వైపు వెళ్ళి పోయారు. అప్పుడు దుశ్శాసనుడు ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని అతడి అస్త్రధాటికి తట్టుకొన లేక పారి పోయాడు. నకుల సహదేవులు వెంట రాగా ధృష్టద్యుమ్నుడు
ద్రోణుడి వైపు వెళ్ళాడు. సుయోధనుడు సాత్యకి ఎదురుపడ్డారు. వారిరువురు
చిన్ననాటి స్నేహితులు. కొంతసేపు విరోధము మరచి రథములు పక్కపక్కన నిలిపి
చిన్న నాటి చిలిపి పనులు ఆనాటి కబుర్లు బాల్యం గుర్తు తెచ్చుకుని
పొంగిపోయారు. ఒకరితో ఒకరు యుద్ధం చేయవలసిన పరిస్థితి తీసుకు వచ్చిన
క్షత్రియ ధర్మం గురించి తలచుకుని బాధపడి తప్పదు కనుక కొంతసేపు యుద్ధము
చేద్దాము అనుకుని యుద్ధము చేయసాగారు. మిత్రత్వము మరచి శత్రువుల వలె యుద్ధము
చేయసాగారు. సాత్యకి సుయోధనుడి విల్లు విరిచి అతడి శరీరాన్ని తూట్లు
పొడిచాడు. సుయోధనుడు అలసి పోయి యుద్ధరంగం నుండి తొలగి పోయి కొంతసేపు
విశ్రాంతి తీసుకుని తిరిగి వచ్చి సాత్యకిని ఎదుర్కొన్నాడు. సుయోధనుడికి సాయంగా కర్ణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అది చూసి భీముడు కర్ణుడితో పోరు సాగించాడు. కర్ణుడు భీముని సారథిని మూర్ఛిల్లజేసి భీముని విల్లు విరిచాడు. భీముడు
తన గధ గిరగిరా తిప్పి కర్ణుడి రథము మీద విసిరాడు. ఆ గధ పోయి కర్ణుడి సారథి
తల పగుల గొట్టి కర్ణుడి రథాన్ని ముక్కలు చేసింది. కర్ణుడు మరొక రథము ఎక్కి
యుద్ధము చేయసాగాడు.
ద్రోణుడి మరణం
ధర్మరాజు
మత్స్య పాంచాలసేనలు వెంటరాగ ద్రోణుడి మీదకు యుద్ధానికి సన్నద్ధం అయ్యాడు.
అప్పటికి రెండు ఝాముల పొద్దు ఎక్కింది. నకుల సహదేవులు భీముడు అర్జునుడిని
చూసి " అర్జునా ! ఇక్కడ ద్రోణుడు మన సేనలను అంతమొందిస్తున్నాడు. నీవు
అతడికి సాయంగా ఉన్న కౌరవ సేనలను తరుముతుండు. అప్పుడు ద్రోణుడు ఒంటరిగా చిక్కుతాడు. పాంచాల సేన అతడిని అంతమొందిస్తుంది " అని అరుస్తూ ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తనకు అడ్డం వచ్చిన సైనికులను హతమారుస్తూ వేలాది సైనికులను చంపుతున్నాడు. ధర్మరాజు భీముడు నకుల సహదేవులు నిస్సహాయంగా చూస్తూ " ద్రోణుడు
ఈ రోజు చెలరేగి పోతున్నాడు. ఇలా వదిలేస్తే ఈ రోజు పాండవసేనలను అంతమొందించి
మనలను కూడా అంతమొందించి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నాడు. ఇతడిని
నిలువరించడం మన తరం కాదు. నిలువరించ తగిన అర్జునుడు గురువును చంపుట పాపమని ఉపేక్షిస్తున్నాడు " అనుకున్నారు.
ద్రోణుడు అస్త్రసన్యాసం చేయుటకు శ్రీకృష్ణుడు మార్గం చెప్పుట
వారు పడుతున్న మధన గమనించిన కృష్ణుడు రథమును వారి వైపు మళ్ళించి ధర్మరాజాదులు వినేలా " అర్జునా ! ద్రోణుడు తన చేత ధనస్సు ఉన్నంత వరకు అతడిని మానవ మాతృలే కాదు దేవదానవులు కూడా ఎదుర్కొన లేరు. ద్రోణుడు అస్త్రసన్యాసం చేయాలంటే ఒకటే మార్గం " అశ్వత్థామ చని పోయాడు " అని చెపితే ద్రోణుడు అస్త్రసన్యాసం చేస్తాడు. అప్పుడు ద్రోణుడు
అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు మీరు అతడిని సులభంగా చంపవచ్చు. కనుక
అశ్వత్థామ చపోయాడని ఎవరైనా అతడికి చెప్పాలి " అన్నాడు. అది విని భీముడు
వెంటనే పోయి మాళవరాజు ఏనుగైన అశ్వత్థామను చంపి వెనక్కు వచ్చి " ఆచార్యా !
అశ్వత్థామ చనిపోయాడు " అని చెప్పాడు. ద్రోణుడి మనస్సు ఒక్కసారి ఝల్లు మంది.
అయినా తన కుమారుడి బలపరాక్రమాలు తలచుకుని భీముడి మాట నిర్లక్ష్యం చేసాడు.
అయినా మనస్సులో అనుమానం వేదిస్తూనే ఉన్నా ధృష్టద్యుమ్నుడి మీద శరవర్షం
కురిపించసాగాడు. అయినా భరించరాని వ్యధతో పది వేల మంది పాంచాల సైన్యాలను
వధించాడు. మత్స్యదేశ సైన్యంలో అయిదు వందల రథములను విరిచి పదివేల గజములను,
పదివేల హయములను విరిచాడు. ద్రోణుడు మధ్యందిన మార్తాండునిలా వెలుగ సాగాడు.
మహామునులు ద్రోణునికి శాంతించమని చెప్పుట
ఇంతలో విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు, వశిష్ఠుడు
ఇంకా ఇతర మునులు తమ దివ్య రూపాలతో వచ్చి " ఓ భరధ్వాజా! నీవు బ్రాహ్మణ వంశ
సంజాతకుడవు. వేదవేదాంగ విదుడవు ఇలా క్షాత్ర ధర్మం వహించి యుద్ధము చేయుట
తగునా ! ఇప్పటి వరకు చేసిన సంహారం చాలు నీకు కాలం పూర్ణంగా తీరిపోయింది. మా
మాట మన్నించి యుద్ధము చేయుట ఆపి శాంతి వహించు " అన్నారు. ద్రోణుడికి ఒక్క
సారిగా భీముడు అశ్వత్థామ మరణించాడని చెప్పిన మాట గుర్తుకు వచ్చింది. అవకాశం
కొరకు ఎదురు చూస్తున్న ధృష్టద్యుమ్నుడిని చూసాడు. మనసు వికలమైంది. దుఃఖం
ముంచుకు వచ్చింది. అయినా సంశయం తీర్చుకోవడానికి అశ్వత్థామ మరణం నిజమేనా అని
ధర్మజుని అడిగాడు. ధర్మజుడు అసత్యం పలుకడని ద్రోణుడి నమ్మకం. కృష్ణుడు
ధర్మజునితో " మనం ద్రోణుడిని ఇలా వదిలితే సాయంత్రానికి మన సైన్యాలను
ద్రోణుడు అంతమొందించడం ఖాయం. మమ్ము ద్రోణుని అస్త్రధాటి నుండి
రక్షించడానికి నీవు అసత్యం ఆడక తప్పదు. ప్రాణరక్షణకసత్యమాడటం అధర్మము
కాదని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి " అన్నాడు. భీముడు " అన్నయ్యా ! నీవు
అసత్యం పలుక పని లేదు. కృష్ణుని మాట వినగానే నేను మాళవరాజు ఏనుగైన
అశ్వత్థామను చంపి ఆ మాట ద్రోణుడికి చెప్పాను. కాని ద్రోణుడు నా మాట నమ్మ
లేదు. నీవు కూడా అదే చెప్పు నీవు చెప్పిన ద్రోణుడు అస్త్రసన్యాసం చేయగలడు.
మన హితవు కోరి కృష్ణుడు చెప్పిన మాట మన్నించు " అన్నాడు. కృష్ణుడు, భీముడు
చెప్పిన మాటలు ధర్మజుని మీద ప్రభావం చూపాయి. వెంటనే ద్రోణుడి వద్దకు వెళ్ళి
" ఆచార్యా! అశ్వత్థామ మరణించాడు " అని పెద్దగా చెప్పి అది ఒక ఏనుగు అని
మెల్లగా చెప్పాడు. ధర్మరాజు నోట అశ్వత్థామ మరణించాడు అన్న మాట విన్న తరువాత ద్రోణుడికి మరొక మాట వినిపించ లేదు.
ద్రోణుడిలో పరివర్తన
ద్రోణుడు
అలాగే రథము మీద వాలి పోయాడు. ద్రోణునిలో పరివర్తన మొదలైంది. తాను పాండవుల
చేసిన పాపాం తలచుకుని కుమిలి పోయాడు. ఋషులు మాటలు చెవుల్లో మారు
మోగుతున్నాయి. తాను ఎంతో మంది అమాయకులైన సైనికులను నిర్దాక్షిణ్యంగా
చంపాడు. తన పాపానికి నిష్కృతి లేదు. ఇలా అనుకుని పైకి చూడగానే ఎదురుగా
ధృష్టద్యుమ్నుడు అవకాశం కొరకు ఎదురు చూస్తుండటం చూసి అతడితో యుద్ధము
చేయాలను ఉన్నా చేతులు రాలేదు. ధనుర్భాణాలు చేతి నుండి జారాయి. అతడిలో ఉన్న
యుద్ధనిష్ఠ, శౌర్యము, గర్వము నశించాయి. తన కుమారుడు మరణించాడు అన్న దుఃఖం
అతడిని కుంగదీసింది. అతడి అవయవములు ముడుచుకు పోయి అలాగే రథము మీద కూర్చుండి
పోయాడు. ద్రోణవధ కొరకు అగ్ని నుండి జన్మించిన ధృష్టద్యుమ్నునికి
ద్రోణుడిని వధించాలి అన్న కోరిక బలీయంగా కలిగి అతడి మీద శరవర్షం
కురిపించాడు. ద్రోణుడికి యుద్ధం చేయాలని ఉన్నా దివ్యాస్త్రములు స్పురణకు
రాక మామూలు బాణాలతో ధృష్టద్యుమ్నుడి బాణాలు ఖండిస్తూ ధృష్టద్యుమ్నుడి
రథమును, ధ్వజమును ఖండించి, సారథిని చంపాడు. ధృష్టద్యుమ్నుడు రథము నుండి దిగి గధను తీసుకున్నాడు. ద్రోణుడు ఆ గధను తన బాణములతో ఖండించాడు. ధృష్టద్యుమ్నుడు కత్తి డాలు తీసుకుని ద్రోణుని మీదకు ఉరికి అతడి హయములను, సారథిని చంపాడు ద్రోణుడు తన బాణములతో ధృష్టద్యుమ్నుడి కత్తిని ఖండించాడు. ఆ సమయంలో సాత్యకి కర్ణుడు, కృపాచార్యుడు, కృతవర్మలతో యుద్ధము చేస్తున్నాడు. దూరం నుండి ఇది గమనించి పది బాణము ద్రోణుడి మీద వేసాడు. భీముడు తన రథము మీద వచ్చి ధృష్టద్యుమ్నుడిని తన రథము మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. ద్రోణుడు అతడిని పోనేలే అని వెంబడించక వదిలాడు.
ద్రోణుడు ప్రశాంతిని పొందుట
ఇప్పుడు ద్రోణుడి మనస్సు ప్రశాంతమైంది. తన రథము మీద కూర్చుని యోగ
నిమగ్నుడయ్యాడు. మనసులో శాంతి పొంది చుట్టూ చూసాడు. " ఓ కర్ణా! ఓ
కృతవర్మా ! ఓ సుయోధనా ! మీరు నన్ను యుద్ధం చేయడం లేదని ఎత్తి పొడుస్తూనే
ఉన్నారు. అయినా నేను నా చేతనైనంత యుద్ధం చేసాను. ఇంక నిశ్చింతగా పైలోకాలు
చేరుకుంటాను. నేను నా ధనుర్భాణాలు విడిచి అస్త్రసన్యాసం చేస్తున్నాను.
మీరంతా ఇకనైనా తెలివిగా ప్రవర్తించండి " అని ఎలుగెత్తి అరిచాడు. ద్రోణుడు
తన ధనుర్భాణాలు రథము మీద వదిలి తేజోమయమైన ఆత్మతో వెలుగొందు తున్నాడు. ఆ
సమయంలో ధృష్టద్యుమ్నుడు
కత్తి తీసుకుని ద్రోణుడి వైపు నడిచాడు. అది చూసి ఉభయసైన్యాలు హాహాకారాలు
చేసాయి. కాని అప్పటికే ద్రోణుడి ప్రాణాలు అనంతవాయువులలో కలిసి పోయాయి. అతడి
ఆత్మ జ్యోతి రూపంలో పైకెగసి పరమాత్మను చేరుకుంది. అతడి ఆత్మ తేజో రూపంతో
పకి వెళ్ళడం నేను, కృపాచార్యుడు, కృష్ణుడు, అర్జునుడు, ధర్మరాజు మాత్రమే చూసాము. మిగిలిన వారికి అది గోచరించ లేదు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు
కత్తి తీసుకుని ద్రోణుని రథము ఎక్కి అతడి జుట్టు పట్టుకుని మెడ నరకడానికి
కత్తి పైకి ఎత్తాడు. వద్దు, వద్దు అని అర్జునుడు అరుస్తున్నా, అది
ధర్మవిరుద్ధమని ధర్మజుడు ఎంత అరచినా వినక అతడి తలను నరికి మొండెమును నుండి
తలను వేరుచేసి నేల మీదికి వేసాడు.
అశ్వత్థామకు తండ్రి మరణం ఎరిగించుట
కౌరవ
సైన్యము సైన్యాధ్యక్షుడి మరణంతో కలత చెంది ఉన్న తరుణంలో పాండవసేన
విజృంభించి కౌరవసేనలను ఎదుర్కొని తరిమింది. పాండవ సేనల ధాటికి ఆగలేని కౌరవ
సేనలు పారిపోసాగాయి. నీ కుమారులు వారిని వెంబడించారు. కృతవర్మ, కృపాచార్యుడు, కర్ణుడు, శకుని
మొదలైన వారంతా వెనుతిరిగి చూస్తూ పోతూ పోతూ వారు " ఎంత ఘోరం జరిగింది. ఏమి
చేయాలో తోచక ఉంది. ఈ నరమేధం ఇక ఆగదా " అనుకున్నారు. వేరొక చోట యుద్ధము
చేస్తున్న అశ్వత్థామ
కౌరవ యోధులు వెనుదిరుగుతూ తిరోగమించడం చూసి సుయోధనుడిని సమీపించి "
సుయోధనా ! మన సైన్యాలకు ఏమైంది ఇలా వెనుకకు చూసుకుంటూ పరుగెడుతున్నారు? కృపాచార్యుడు, కర్ణుడు
ఎందుకింత మ్లానవదనులై ఉన్నారు " అని అడిగాడు. సుయోధనుడు బదులు పలుక లేక
పోయాడు. దుఃఖంతో మాట రాక అశ్వత్థామకు తండ్రి మరణం గురించి ఎలా చెప్పాలి
అనుకుంటున్నాడు.
కృపాచార్యుడు అశ్వత్థామకు తండ్రి మరణ వార్త ఎరిగించుట
కృపాచార్యుడు అశ్వత్థామకు
తండ్రి మరణ వార్తను ఇలా చెప్పాడు. " కుమారా ! నీ తండ్రి పాంచాలసేనలో చాలా
పెద్ద మొత్తాన్ని చంపుతున్నాడు. పాండవులు ఎలాగైనా నీ తండ్రిని
చంపాలనుకున్నారు. భీముడు
నీ తండ్రి వద్దకు పోయి అశ్వత్థామ మరణించాడు అని అబద్ధం చెప్పాడు. నీ
తండ్రి అతడి మాట నమ్మక యుద్ధం చేస్తూనే ఉన్నా సందేహం తీర్చుకోవడానికి
ధర్మజుడు అబద్ధం చెప్పడని నమ్మకంతో అతడిని నిజం చెప్పమని అడిగాడు. అంతకు
ముందే భీముడు అశ్వత్థామ అనే ఏనుగును చంపడం వలన ధర్మరాజు కూడా అశ్వత్థామ చనిపోయునట్లు చెప్పాడు. ఆ మాట వినగానే నీ తండ్రి అస్త్రసన్యాసం చేసి యోగసమాధిలోకి వెళ్ళాడు. అప్పుడు ధృష్టద్యుమ్నుడు నీ తండ్రి రధము మీదకు దూకి నీ తండ్రి తల తెగనరికాడు. అర్జునుడు ధర్మరాజు
వద్దని అది ధర్మము కాదని ఎంత అరచినా వినలేదు. నీ తండ్రి మరణించగానే మాకు
కాళ్ళు చేతులు ఆడలేదు. మనసైన్యాలు భయపడి పారిపోతున్నాయి. కాని నాకు ఇదంతా కృష్ణుడు ఆడించిన నాటకం అనిపిస్తుంది. లేకున్న భీముడికి ఇన్ని తెలివితేటలు లేవు. ధర్మరాజు ఇంతటి అధర్మానికి ఒడిగట్టడు " అన్నాడు.
తండ్రి మరణానికి అశ్వత్థామ ప్రతి స్పందన
కృపాచార్యుడు చెప్పినది ప్రశాంత చిత్తతంతో విన్న అశ్వత్థామ
" మామా ! కృపాచార్యా ! జాతస్య మరణం ధృవం. పుట్టిన వానికి మరణం తప్పదు.
పైగా యుద్ధం చేస్తుంటే మరణం వెన్నంటి ఉంటుంది. కాని లోకారాధ్యుడైన నా
తండ్రిని నీరాయుధుడై యోగసమాధిలో ఉన్న సమయాన జుట్టు పట్టుకుని మెడ నరకడమే
బాధాకరంగా అవమానకరంగా ఉంది. సుయోధనా నాకు నా తండ్రి ప్రసాదించిన
దివ్యాస్త్రాలు, నా అస్త్ర విద్య నాతండ్రిని కాపాడు కోవడానికి పనికి
రాలేదు. నా గురువు, నా దైవం , నా పితృదేవుడు అలా దిక్కు మాలిన చావు
చస్తుంటే ఆపలేక పోయాను. సుయోధనా ! దీనికి కారణం ధర్మరాజు పేరుకు ధర్మరాజు
చెప్పినది అసత్యం. అతడిని అంతమొందించిన కాని నా మనస్సు శాంతించదు. సుయోధనా
నా తండ్రి కుమారుని కన్నది అవసానదశలో ఇలా అవమానం పొందడానికా ! ఇదిగో ఇదే నా
ప్రతిజ్బ. దేవతలు అడ్డుపడినా సరే ఆ కృష్ణుడే అడ్డుపడినా నేను పాండవులను
సంహరిస్తాను " అన్నాడు. సుయోధనా ! నా పరాక్రమం నేను చెప్పుకో కూడదు. నా
తండ్రికి జరిగిన అవమానం తట్టుకోలేక ఇలా అన్నాను. ఇప్పుడు కాకున్న ఎప్పుడైనా
ఎలాగైనా నేను పాండవులను వధించి తీరతాను " అన్నాడు. తిరిగి అశ్వత్థామ
" సుయోధనా ! నా తండ్రి శ్రీమన్నారాయణుడిని ఆరాధించి నారాయణాస్త్రం
పొందాడు. దానిని నా తండ్రి నాకు ప్రసాదించాడు. ఆ అస్త్రం వారు వీరు అన్న
తేడా లేకుండా అందరిని హతమార్చి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. నేను ఇప్పుడు
నారాయణాస్త్రం ప్రయోగించి శత్రువులను గెలుస్తాను " అన్నాడు. అది విన్న
సుయోధనుడు ఆనంద పడి తన వారినందరిని సమాయత్త పరచి శంఖం పూరించాడు. అది చూసి
ధర్మరాజాదులు యుద్ధానికి సమాయత్తమయ్యారు.
పాండవ సేనలో కలకలం
ధర్మరాజు అర్జునుడితో " అర్జునా ! ద్రోణుడు
మరణించగానే చెదిరి పోయిన కౌరవసేన తిరిగి యుద్ధానికి సమాయత్తం కావడం
ఆశ్చర్యంగా ఉంది. ఇందుకు కారణం ఏమిటి. కౌరవసేనలో ఆనందం మిక్కుటంగా ఉంది.
మనము ద్రోణుడిని చంపామని ఆగ్రహించి నీ తండ్రి ఇంద్రుడు దేవసైన్యంతో మనమీదకు యుద్ధానికి వచ్చాడా ! " అన్నాడు.
అర్జునుడు ధర్మరాజాదులకు అశ్వత్థామ గొప్పదనాన్ని తెలుపుట
అర్జునుడు ధర్మరాజుతో " అన్నయ్యా ! అస్త్రసన్యాసం చేసిన ఆచార్యుని అధర్మంగా వధించిన వారిని అశ్వత్థామ
వదిలుతాడా ! అతడి వద్ద దివ్యాస్త్ర సంపద ఉంది. అతడు సహజంగా మహాద్భుత శౌర్య
సంపన్నుడు. ఈ సమయంలో అతడిని ఎదుర్కొనుట చాలా కష్టం. అన్నయ్యా ! అశ్వత్థామ పుట్టగానే ఉచ్చైశ్రవము మాదిరి సకిలించాడట. అప్పుడు ఆశరీరవాణి అందరూ వింటుండగా ఆ బాలుడు అశ్వత్థామ
అనే పేరొతో వర్ధిల్లగలడు అని పలికిందట. ఇప్పుడు కౌరవ సేన విజృంభణకు
అశ్వత్థామయే కారణం. ఎప్పుడూ పాపం చేసి ఎరగని ఓ ధర్మరాజా ! నిన్ను తన
శిష్యుడని, సత్యం పలుకుతావని, ధర్మం తప్పని వాడివని అత్యంత ఆదరంతో ద్రోణుడు
తన కుమారుడి మరణం గురించి అడిగాడు. కాని నీవు ధర్మహానికి తలపడి అశ్వత్థామ
మరణించాడని అసత్యం పలికావు. అది నమ్మి ద్రోణుడు అస్త్రసన్యాసం చేసాడు. ఇంత
అధర్మానికి పాల్పడి రాజ్యం సంపాదించడం అవసరమా ! లోకం దూషించదా ! ఇందు వలన
పొందిన సంపద మనకు ఆనందాన్ని ఇస్తుందా ! అది అధర్మము, వద్దు అని మనం
అరుస్తున్నా వినక ఆ ధృష్టద్యుమ్నుడు ద్రోణుడి జుట్టు పట్టుకుని తల నరకవచ్చా ! అది అధర్మం కాదా ! మనం ఇలా ధర్మ విరుద్ధమైన పనులు చేసిన అతడి కుమారుడు అశ్వత్థామ
మనపై ఆగ్రహించి యుద్ధం చేయక మానుతాడా ! మన సేనలను సర్వనాశనం చేయడానికి
అశ్వత్థామ ఉగ్రుడై వస్తున్నాడు సిద్ధం ఉండండి. అయినా అతడి బారి నుండి
ధృష్టద్యుమ్నుడిని కాపాడటం నీకూ నాకే కాదు మరెవరి తరం కాదు " అన్నాడు.
పాండవ యోధుల మధ్య వాద ప్రతివాదాలు
అర్జునుడి మాటలను విని భీముడు
కోపంతో ఊగిపోతూ " అర్జునా ! నీవు వీరుడివా ! లేక ఋషిపుంగవుడివా! ఏమిటీ
పిరికి మాటలు. గురువును చంపడం మహాపాపమని మన సైన్యాలను ధ్వంశం చేస్తున్న
ద్రోణుడిని నీవు వదలడం న్యాయమా ! యుద్ధరంగమున ప్రవేశించిన పిదప గురుశిష్య
సంబంధాలు, బంధు మిత్ర అభిమానాలు వదిలి నిష్పక్షపాతంగా యుద్ధము చేయాలని
రాజనీతి ఘోషిస్తున్నా నీవు రాజధర్మాన్ని తప్పి ద్రోణుడిని వదలడం ధర్మమా !
కౌరవులు అధర్మవర్తనులు కారా! నిండు కొలువులో శీలవతి అయిన ద్రౌపదిని
వలువలు ఊడ్చి అవమానించిన నీతి బాహ్యులకు వారికి సహకరించి యుద్ధము
చేస్తున్న వారికి ఇలాంటి ఎన్ని అధర్మములు చేసినా మనకు పాపం అంటదు.
అర్జునా ! మనలను ఎదుర్కోడానికి వస్తున్న శత్రువులను జయించడం ఎలా అని మేము
ఆలోచిస్తుంటే నీవిలా పిరికి మాటలు మాట్లాడటం ధర్మమా ! అర్జునా ! నేనేమిటో
నా పరాక్రమము ఏమిటో సుయోధనుడికి తెలుసు. మన మీదకు వస్తున్న వారిని సర్వ
నాశనం చేయక వదలను " అని భీముడు రోషంతో పలికాడు.
ధృష్టద్యుమ్నుడి వాదం
అప్పుడు ధృష్టద్యుమ్నుడు
అర్జునుడితో " అర్జునా ! నీ గురువు ద్రోణుడు మాత్రం అధర్మం చేయలేదా !
కేవలం చేత ఉన్న ఆయుధములు తప్ప ఇతర ఆయుధ ప్రయోగం తెలియని, యుద్ధ ప్రక్రియలు
తెలియని వారు, అస్త్రశస్త్రములు ఎరుగగని వారు, బలహీనులు అయిన సాధారణ పాంచాల
సైనికుల మీద దివ్యాస్త్ర ప్రయోగం చేసి వేలకొలది సైనికులను క్షణకాలంలో
హతమార్చుట ధర్మమా !. అది క్రూరత్వము కాదా ! నిర్ధయ కాదా ! అర్జునా ! నేను
ద్రోణుడిని చంపుటకు అగ్ని నుండి ఉద్భవించాను. చంపాను ఇందు పాప పుణ్యముల
ప్రసక్తి లేదు అంతే. అర్జునా ! నీవు చేసినదేమిటి ? నీ తండ్రికి మిత్రుడైన
భగదత్తుని చంపలేదా ! శిఖండిని అడ్డుపెట్టుకుని తాతను పడగొట్ట లేదా ! నీ మీద
యుద్ధము చేయని వారిని చంపుట ధర్మమా ! నా తండ్రిని చంపి నా పాంచాల సేనలను
చంపి నన్ను ఎదుర్కొన్న ద్రోణుడిని చంపుట అధర్మమా ! ఇదెక్కడి ధర్మమయ్యా !
ధర్మరాజు చేసినది అధర్మం కాదు. అతడు చేసినది పాపం కాదు. అతడి పలికినది
అసత్యము కాదు. అశ్వత్థామ అనే ఏనుగును భీముడు
చంపాడు. ఆ విషయం చెప్పి తన సైన్యమును రక్షించుకున్నాడు. నేను తన శిష్యులను
వంచించిన ద్రోణుడిని చంపి నా సైన్యాలను రక్షించుకున్నాను. ద్రోణుని వధతో
నీ మార్గం నిష్కంటకం అయింది. శత్రువులను జయించి విజయలక్ష్మిని వరించు " అని
నిర్ధ్వందంగా పలికాడు. ధృష్టద్యుమ్నుని మాటలకు ద్రోణుని వధ కలిగించిన
దుఃఖంతో పెల్లుబుకుతున్న అశ్రువులతో అర్జునుడు " ధృష్టద్యుమ్నా! చాలు ఇక
ఇలాంటి అసహ్యకరమైన మాటలు కట్టి పెట్టు. చేసింది చాలక ఇంకా దానిని
సమర్ధించుకుంటున్నావా ! " అన్నాడు.
సాత్యకి ధృష్టద్యుమ్నుల రోషావేశాలు
ధృష్టద్యుమ్నుని
మాటలకు సాత్యకి కోపించి " ఔను ధృష్టద్యుమ్నా! నీవు చేసింది ముమ్మాటికీ
అధర్మమే ! నీవు ఇన్ని మాటలు అన్నా నీ నాలుక చీలక నీ తల పగలక ఉంది అంటే అది
ధర్మరాజు నీ పక్కన ఉండుటయే ! ఇక ఒక్క మాట అన్నా నేను అన్నది జరుగుతుంది.
భీష్ముడిని చంపటానికి శిఖండి జన్మించాడు. చంపాడు అతడికి అర్జునుడు తోడున్నాడు అంతే ! భీష్ముడు తనను పడగొట్టమని అది అర్జునుడే చేయాలని ధర్మరాజుకు చెప్పాడు. అదే విధంగా ధర్మరాజు
అర్జునుడిని, శిఖండిని ఆదేశించాడు. ఆది భీష్ముని ఇష్టానుసారం జరిగింది. ఓ
ధృష్టద్యుమ్నా! నీవు, శిఖండి పాంచాల వంశాన పుట్టి ఆ వంశానికి కళంకం
తెచ్చారు " అన్నాడు. ఆ మాటలకు ధృష్టద్యుమ్నుడు నవ్వి " ఓ సాత్యకీ ! నీవా
నాకు నీతులు చెప్పేది. అర్జునుడు
భూరిశ్రవసుడి చేతిని నరికిన తరువాత నీవు ప్రయోపవేశం చేసిన అతడిని చంప
లేదా ! మహావీరుడవైన నీకిది ధర్మమా ! వివేక హీనుడా ! భూరిశ్రవసుడు నీ మీద
నిలిచి చంపడానికి కత్తి దూసినప్పుడు నీ వీరత్వము ఏమైంది. ప్రాయోపవేశం చేసిన
భూరిశ్రవసుడి తల నరకడం అధర్మము కాదా ! నీ తప్పు తెలుసుకుని ఎదుటి వారి
తప్పులు ఎంచు. ద్రోణుడు
ఎన్ని సార్లు మనలను ఎదుర్కొన్నాడు. అప్పుడు నీవు ఎక్కడ ఉన్నావు ? ఏమి
చేస్తున్నావు? ఎందుకు ఎదిరించ లేదు ? నీవు భూరిశ్రవసుడిని చంపిన పరిస్థిలో
నేను ద్రోణుడిని చంపాను. నీకు అంటని పాపాపం నాకు అంటదు. అంతటి పరాక్రమశాలి
ద్రోణుడిని చంపినందుకు అభినందించవలసినది పోయి తప్పు పట్టడం న్యాయమా! ఓ
సాత్యకీ ! నీవు అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకుని నాకు కోపం
తెప్పిస్తున్నావు. ఇంకొక్క మాట మాట్లాడితే నీ తల పగుల కొడతాను. మనం పాండవుల
తరఫున యుద్ధం చేయ వచ్చాము. మన ధర్మం మాత్రం నిర్వర్తిస్తాము రా " అన్నాడు.
ఆ మాటలకు సాత్యకి రోషావేశ భరితుడై రధము మీద ఉన్న గధను చేతబట్టాడు. ఇది
అంతా వినోదంగా చూస్తున్న కృష్ణుడు సాత్యకిని ఆపడానికి భీముని పంపాడు. వెంటనే భీముడు రధము దిగి వెళ్ళి సాత్యకిని కదల కుండా పట్టుకున్నాడు. ఇంతలో సహదేవుడు
అక్కడకు వచ్చి " యాదవులు పాంచాలురు మాకు బంధువులు. మాకు కావలసిన వారే.
మీలో మీరు ఇలా తగవులాడితే శత్రువులు మనలను చూసి హేళన చేస్తారు. తగవులు
మానండి " అన్నాడు. ధృష్టద్యుమ్నుడు
" భీమా ! సాత్యకిని ఆపపద్దు రానివ్వు ఏమి చేస్తాడో చూస్తాను. అతడి పొగరు
అణుస్తాను నేనేమి చెయ్యి తెగిన భూశ్రవసుడిని కాదు అతడి చేతిలో చావడానికి "
అన్నాడు. ఇక కొనసాగించడం మంచిది కాదని భావించిన కృష్ణుడు, ధర్మరాజు
పోయి వారికి సర్ది చెప్పారు. ఇంతలో ఇరుపక్షముల యుద్ధభేరీలు మ్రోగాయి. ఇరు
పక్షాలు యుద్ధసన్నద్ధమైయ్యాయి. ద్రోణుడిని జయించిన ధైర్యంతో పాండవ సేనలు,
అశ్వత్థామ ఇచ్చిన ధైర్యంతో కౌరవసేన తలపడ్డాయి.
అశ్వత్థామ నారాయణాస్త్రం ప్రయోగించుట
అశ్వత్థామ
నారయణాస్త్రాన్ని ధ్యానించి విల్లు సంధించాడు. నారయాణాస్త్రాన్ని
పాండవసేనల మీద ప్రయోగించాడు. ఆ అస్త్రధాటికి భూమి దద్దరిల్లింది. దిక్కులు
పిక్కటిల్లాయి. సముద్రములు పొంగాయి. ఆ దివ్యాస్త్రం నుండి అనేక ఆయుధములు
పుట్టి పాండవ సేన మీదకు వస్తున్నాయి. పాండవ సేన దానిని శాయశక్తులా
ఎదుర్కొంటున్నారు. కాని దాని ధాటికి తాళ లేక పోతున్నారు. నారయణాస్త్రం
పాండవ సేనను నాశనం చేస్తుంది. అది చూసి ధర్మరాజు అర్జునుడి వంక చూసాడు. అర్జునుడు మాటాడ లేదు. ధర్మరాజు అర్జునుడు, కృష్ణుడు వినేలా ధృష్టద్యుమ్నుడు సాత్యకులతో ఇలా అన్నాడు. " ఆ ద్రోణుడు
ఎంత క్రూరుడంటే నాడు నిండు కొలువులో ద్రౌపదిని అవమానిస్తుంటే చూస్తూ
ఉఉరుకున్నాడు కాని ఒక్క మాట అన లేదు. బాలుడైన అభిమన్యుని మరణానికి
కారణమయ్యాడు. సూర్యాస్తమయం అయితే అర్జునుడు
అగ్ని ప్రవేశం చేయాలని తెలిసీ మనలను అర్జునుడికి సాయంగా వెళ్ళ నీయక
అడ్డుకున్నాడు. మరి అలాంటి ధర్మపరునితో మనం సరి తూగగలమా ! ఈ నారాయణాస్త్ర
సాక్షిగా చెప్తున్నాను. మీరంతా పారి పోయి మీ ప్రాణాలను దక్కించుకొండి.
అప్పుడు అర్జునుడు
కోరిక నెరవేరుతుంది. శ్రీకృష్ణుడేమి చేస్తాడో ఆయన ఇష్టం " అని నిష్టూరంగా
అన్నాడు. ఇక కృష్ణుడు ఊరక ఉండలేక రధము మీద నిలబడి " ఓ సైనికులారా ! పాండవ
వీరులారా ! భయపడకండి. మీరంతా మీ మీ రథములు వాహనములు గజములు హయములు దిగి
ఆయుధములు కింద పడవేయండి. నారాయణాస్త్రానికి ఇదే విరుగుడు. వేరు ఉపసంహారం
లేదు " అన్నాడు.
నారాయణాస్త్రాన్ని భీముడు ఎదుర్కొనుట
శ్రీకృష్ణుడి
మాటలకు సైనికులు తమ తమ వాహనములు దిగుతుండగా భీముడు " మహా వీరులారా ఆగండి
వాహనములు దిగకండి వీరోచితంగా పోరాడండి. నేను ఉన్నాను, మహాస్త్రాలను
ప్రయోగిస్తాను, నా గధతో అందరిని గెలుస్తాను " అని ఎలుగెత్తి అరచి తన గధ
తీసుకుని అశ్వత్థామ మీదకు ఉరికాడు. అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని భీముని
మీదకు మళ్ళించాడు. భీముని మాట వినక అందరూ తమతమ వాహనములు దిగి ఆయుధములు కింద
పెట్టారు. ఆ నారాయణాస్త్రము వారిని విడిచి ఆయుధధారి అయిన భీముని
వెంటబడింది. అది చూసి భీముడు వారుణాస్త్రాన్ని ప్రయోగించాడు. వారుణాస్త్ర
ప్రభావానికి నారాయణాస్త్రం శక్తి కొంత తగ్గింది. వెంటనే అశ్వత్థామ దాని
శక్తిని పెంచాడు. ఆ నారాయణాస్త్రం భీముడిని భీకర అగ్నిజ్వాలలను విరజిమ్ముతూ
చుట్టుముట్టింది. అది గమనించిన కృష్ణార్జునులు తమ ఆయుధములను రధము మీద ఉంచి
రధము దిగి భీముని రధము వద్దకు పరుగెత్తి అతడిని రధము మీద నుండి కిందకు
దించుటకు ప్రయత్నించారు. భీముడు రధము దిగక మూర్ఖంగా అలాగే ఉన్నాడు. అప్పుడు
కృష్ణుడు " భీమసేనా ! మహా వీరా! ఈ అస్త్రమును ఉపసంహంరించే శక్తి
అశ్వత్థామకు కూడా లేదు. దీనికి ఆయుధములు కింద పెట్టడమే విరుగుడు. నా మాట
విని ఆయుధములు విడిచి రథము దిగవయ్యా " అంటూ కృష్ణుడు బతిమాలుతూ భీముని చేతి
నుండి ఆయుధములు లాగాడు. అర్జునుడు, కృష్ణుడు కలసి ఒక్క తోపుతో రధము నుండి
కిందకు తోసారు. ఇక పాండవ సైన్యంలో ఎవరి చేతా ఆయుధములు లేక పోయే సరికి ఆ
ఆయుధము శాంతించి వెను తిరిగింది. వెంటనే అందరిని ఆయుధములు ధరించి యుద్ధముకు
సిద్ధం కమ్మని కృష్ణుడు ఆదేశించడంతో పాండవసైన్యం తిరిగి కౌరవ సైన్యంపై
విజృంభించింది.
సుయోధనుడు నారాయణాస్త్రాన్ని తిరిగి ప్రయోగించమని అశ్వత్థామకు చెప్పుట
అప్పుడు
సుయోధనుడు " గురు పుత్రా ! నారాయణాస్త్రమును తిరిగి ప్రయోగింపుము "
అన్నాడు. అశ్వత్థామ సుయోధనా ! రారాజా ! ఈ నారాయణాస్త్రం ఒక్క సారే
ప్రయోగించాలి రెండవ సారి ప్రయోగిస్తే ప్రయోగించిన వారిని సంహరిస్తుంది.
నారాయణుడు నా తండ్రికి ఈ అస్త్రమును ఇచ్చినప్పుడు అలాగే ఆదేశించాడు.
యుద్ధములో వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టడం మరణించుటతో సమమే కదా!
అందుకని వాహనములు దిగి ఆయుధములు కింద పెట్టిన వారిని ఆ అస్త్రం ఏమీ చేయదు.
శ్రీకృష్ణుడికి ఆ విషయం తెలుసు కనుక తన వారిని రక్షించుకున్నాడు. ఇక మనమేమి
చేయగలము చెప్పు " అన్నాడు. సుయోధనుడు " అశ్వత్థామా ! పోనీలే.
నారాయణాస్త్రం నిరుపయోగమైనంత మాత్రాన నిరుత్సాహపడవలసిన పని లేదు. మన వద్ద
ఇంకా దివ్యాస్త్రాలు ఉన్నాయి కదా! వాటిని ఉపయోగించి పాండవులను గెలుస్తాము "
అన్నాడు. అశ్వత్థామ అవును సుయోధనా ! అలాగే చేద్దాము.
అశ్వత్థామ పాండవులను ఎదుర్కొనుట
అని పాండవుల మీదకు యుద్ధానికి బయలుదేరాడు. యుద్ధభూమిలో అశ్వత్థామకు ధృష్టద్యుమ్నుడు
కనపడగానే కోపంతో ఊగిపోయాడు. తన నిశిత బాణాలతో ధృష్టద్యుమ్నుడి రథమును
కూల్చి, అశ్వాలను చంపాడు. అతడి విల్లు తుంచి, కేతనమును విరిచాడు. ఇంతలో సాత్యకి
ధృష్టద్యుమ్నుడికి సాయం వచ్చాడు. అశ్వథ్థామ ఒకే బాణంతో సాత్యకిని
మూర్ఛపోయేలా కొట్టాడు. తరువాత ధృష్టద్యుమ్నుడిని మూర్ఛిల్లజేసి
విజయోత్సాహంతో సింహనాదం చేసాడు. అది చూసి భీమార్జునులు అశ్వత్థామను
ఎదుర్కొన్నారు. వారికి తోడుగా చేది దేశపురాజు సుదర్శనుడు, వృద్ధక్షత్రుడు
వారికి సాయంగా వచ్చారు. అశ్వత్థామ తన పదునైన బాణాలతో వృద్ధక్షత్రుడిని,
సుదర్శనుడిని తలలు నరికివేసాడు. అశ్వథ్థామ ఎక్కడ చూసినా తానే అయి యుద్ధము
చేస్తున్నాడు. అశ్వత్థామ పరాక్రమానికి పాండవ సేనలు పారిపోతున్నాయి.
భీమార్జునులు తమ శాయశక్తులా పాండవ సేనలకు ధైర్యం చెప్తున్నారు. అర్జునుడు
అశ్వత్థామ మీద నిశిత శరములు ప్రయోగించాడు. అశ్వత్థామ కోపించి
ఆగ్నేయాస్త్రాన్ని అర్జునుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రం అగ్ని జ్వాలలను
విరజిమ్ముతూ అర్జునుడి మీదకు వచ్చి త్రుటికాలంలో పాండవుల సైన్యం ఒక
అక్షౌహినిని నాశనం చేసింది. కౌరవ ప్రముఖులంతా కృష్ణార్జునులతో సహా
ఆగ్నేయాస్త్రానికి బలి కాగలరు అనుకుని జయజయధ్వానాలు చేసారు. కాని అర్జునుడు
తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఆగ్నేయాస్త్రాన్ని నిర్వీర్యం
చేసాడు. కృష్ణార్జునులు శంఖనాదం చేసారు. పాండవ సేనలు జయజయధ్వానాలు చేసారు.
అప్పటి వరకు జయధ్వానాలు చేసిన కౌరవసేనలు ఇది చూసి పారిపోయాయి. అశ్వత్థామ
పరాభవంతో తలదించుకున్నాడు. తన చేతిలోని దివ్యాస్త్రాలను కింద వేసి. నాకు
దివ్యాస్త్ర బలం లేదని తెలిసి పోయింది. సిగ్గు మాలి ఇంకా ఎందుకు యుద్ధం
చేయడము. వెంటనే యుద్ధం మాని వేస్తాను " అని మనసులో అనుకుని రధము దిగి
పాదచారి అయి యుద్ధభూమిని విడిచి పోతున్నాడు.
వ్యాసుడు అశ్వత్థామకు నరనారాయణుల గురించి వివరించుట
అశ్వథ్థామ కొంత దూరం పోగానే వ్యాసుడు ఎదురు వచ్చాడు. అశ్వత్థామ
వ్యాసమహామునికి వినయంగా నమస్కరించి " మునీంద్రా ! నాదొక సందేహం నేను
సంధించిన ఆగ్నేయాస్త్రం మహిమాన్వితమైంది. దేవదానవులు, గంధర్వులు కూడా దాని
ముందు నిలువలేరు. కాని సామాన్యమానవులైన కృష్ణార్జునులను అది ఏమీ చేయ లేక
పోయింది ఎందుకని " అని అడిగాడు. అందుకు వ్యాసుడు " ఓ అశ్వత్థామా ! పూర్వం
నారాయణుడు లోకములు రక్షించుటకు నారాయణ మునిగా అవతరించాడు. నారాయణ ముని
తపస్సు చేయుటకు మైనాక పర్వతానికి వెళ్ళాడు. అక్కడ శిఉవుని గురించి ఘోర
తపస్సు చేసాడు. ఆ తపస్సుకు మెచ్చి మహాశివుడు నారాయణునికి ప్రత్యక్షం
అయ్యాడు. నారాయణుడు మహాశివుని అనేక విధముల స్తోత్రం చేసి " మహేశ్వరా !
నిన్ను ఎల్లప్పుడూ భక్తితో భజించు నాకు అనన్య సులభమైన ప్రభావము నొసగుము "
అని అడిగాడు. అందుకు శివుడు సంతసించి నీవు, నర, సుర, గంధర్వ, గరుడ, కిన్నర,
ఉరగ మొదలైన భూతకోటిని అవలీలగా గెలువగలవు. పరమ తేజోవిరాజమానుడవై ఉండగలవు.
నీకు ఏ అస్త్రముతోగాని, శస్త్రముతోగాని, అగ్నితోగాని, జలముతోగాని, తడి
వస్తువుతోగాని, పొడి వస్తువుతోగాని, స్థావరజంగములతోగాని, వజ్రాయుధముతోగాని
బాధగాని చావుగాని ఉండవు. ఒక వేళ నేనే నీ మీదకు యుద్ధానికి వచ్చినా నన్ను
కూడా జయింపగలవు " అని వరము ఇచ్చాడు. కనుక నారాయణుడు అజేయుడు. అశ్వత్థామా !
నారాయణుడు తపస్సు చేసుకుంటున్న సమయమున అతడి తేజస్సు నుండి పుట్టిన వాడు
నరుడు. వారు నరనారాయణులుగా ప్రసిద్ధి చెందారు. వారిద్దరూ విష్వంశ సంభూతులు.
వారిరువురు మహాఋషులు. నారాయణుడు తన లీలతో జగన్మోహనుడై విహరిస్తూ
దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేస్తుంటాడు. ఈ మహాత్ములు ఇద్దరూ దానవులను
వధించుటకు ధర్మసంస్థాపనకు అవసరమనిపించినప్పుడల్లా అవతరిస్తుంటారు.
నారాయణుడే కృష్ణుడు, నరుడే అర్జునుడు.
అశ్వత్థామకు నరనారాయణులకు కల తారతమ్యము
ఓ
అశ్వత్థామా! నీవు కూడా తపస్సు , తేజస్సు, విద్య, విభవము కలిగిన దేవతా
మూర్తివే. నీకు నారాయణునికి కల అంతరమును చెప్తాను విను. నీవు మృత్తికతో ఒక
మూర్తిని చేసి పరమాత్మను ఆవహింపజేసి అత్యంత భక్తితో నిష్టతో పూజించావు.
కాని నారాయణుడు ఆ గౌరీపతిని లింగాకృతిలో పూజించారు. ఏవిధంగా పూజించినా
సర్వకామ్య సాధకమే అయినా లింగాకృతిలో పూజించుట ప్రతిమా కృతిలో పూజించుట కంటే
అనేక రెట్లు ఎక్కువ. కనుక పరమాత్ముని లింగాకృతిలో పూజించిన నరనారాయణులను
ప్రతిమాకృతిలో పూజించిన నీవు గెలువ లేవు. మీరు గతజన్మలో సేసిన అర్చనలో కల
తారతమ్యము వలన మీ మధ్య ఈ తేడా సంభవించింది కనుక అనుభవించక తప్పదు "
అన్నాడు. అశ్వత్థామ పులకాంకితుడై మనసులో పరమేశ్వరుడిని భక్తితో
ధ్యానించాడు. వ్యాసుడికి నమస్కరించి తిరిగి తన రథము వద్దకు వచ్చి రథము
ఎక్కాడు. కాని అప్పటికే సాయం సమయం అయింది కనుక ఆ రోజుకు యుద్ధము చాలించమని
సుయోధనుడికి చెప్పాడు. పాండవ సేనలు మంగళతూర్యములతో కౌరవసేనలు విషణ్ణవదనాలతో
తమతమ శిబిరాలకు వెళ్ళారు.
అర్జునుడు వ్యానుని తన సందేహం తీర్చని కోరుట
అశ్వత్థామను వదిలి వ్యాసుడు అర్జునుడి శిబిరానికి వెళ్ళాడు. సాక్షాత్తు ధర్మమూర్తి అయిన వ్యాసునికి అర్గ్యపాద్యాలు ఇచ్చి సత్కరించిన అర్జునుడు
భక్తితో నమస్కరించి తన మనస్సులో మెదులుతున్న సందేహం వ్యాసుని ముందు బయట
పెట్టాడు. " వ్యాస మునీంద్రా ! నేను రణరంగమున యుద్ధం చేస్తున్నప్పుడు నా
ముందు ఒక ఆకారం పాదములు నేలకంటకుండా అగ్నిదేవునిలా వెలుగుతూ తన చేతిలో ఉన్న
శూలముతో నేను చంపబోయే వారిని ముందుగా తానే చంపుతున్నాడు. ఆశూలము నుండి
అనేకనేక శూలములు ఉద్భవించి శత్రుసంహారం చేస్తున్నాయి. ఆ తేజోమూర్తి
చంపుతున్న వారిని నేను నామ మాత్రంగా నా బాణములతో చంపుతున్నాను. నేను
చంపుతున్నట్లే ఉన్నా నిజానికి నేను ఎవరిని చంప లేదు. కాని వారిని చంపిన
కీర్తి విజయం మాత్రమే నాకు దక్కాయి. ఆ మహానుభావుడు ఎవరు ? అలా ఎందుకు
చంపుతున్నాడు "అని అడిగాడు.
వ్యాసుడు అర్జునుడి సందేహం నివృత్తి చేయుట
అర్జునుడి మాట విన్న వ్యాసుడు
" అర్జునా ! అతడు ఆదిమధ్యాంత రహితుడు, సృష్టికి మూలకర్త, ఈ లోకములకు
అన్నింటికి ప్రభువు, అవ్యయుడు, వేదమూర్తి, భక్త పరాధీనుడు, త్రినేత్రుడు,
పార్వతీ పతి అతడే. యోగీశ్వర హృదయ విహారి, ప్రకృతీ అతడే, పురుషుడూ అతడే,
భక్త సులభుడు, నిరాకారుడు, నీలఖంటుడు, నిత్యుడు, సత్యస్వరూపుడు,
ప్రళయాగ్నిని తన చల్లని కిరణములతో చల్లార్చగల బాల చంద్రుని శితోభూషణముగా
కలవాడు. నిర్మలుడు, సర్వాంతర్యామి, శాంతి ప్రియుడు అయ్న రుద్రుడే నీ ముందు
నిలిచి నీకు బదులుగా ముందుగా సంహార క్రియ గావిస్తున్నాడు " అని ఇంకా తనివి
తీరక ఆ పరమేశ్వరుని లీలలు విపులంగా వర్ణించాడు. " ఓ అర్జునా ! ఆ పరమ శివుడు
నీ సన్నిధిలో ఉండి నిన్ను కరుణించాడు. పేదకు పెన్నిధి దొరికినట్లు నీకు
ఈశ్వరకటాక్షం లభించింది. నీవు ధన్యుడివి. ఆ పరమేశ్వర అనుగ్రహంతో నీవు
విజయుడివి ఔతావు. సాక్షాత్తు ఆ పరమశివుడే నీకు ముందుగా శత్రుసంహారం
చేస్తుంటే విజయం నీకు కాక వేరెవరికి లభిస్తుంది. నీ తపస్సుకు మెచ్చి
పాశుపతము ప్రసాదించిన పశుపతి తనివి తీరక తన భక్త పరాధీనతను
నిరూపించుకున్నాడు. నీవు పుణ్యాత్ముడవు. ఆ పరమేశ్వరుని ఆత్మలోనిలిపి
ధ్యానించిన నీకు సకల సౌభాగ్యములు ఆయురారోగ్యములు కలిగి సకల అభీష్టములు
నెరవేరగలవు " అన్నాడు. అర్జునుడు పరమేశ్వరునికి భక్తితో నమస్కరించి తరువాత
వ్యాసునికి ప్రమాణం చేసి భక్తితో అతడి ఆశీర్వచనములు పొందాడు. ఆ తరువాత
వ్యాసుడు అక్కడి నుండి వెల్లాడు.
కర్ణ పర్వము
కర్ణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఎనిమదవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
కర్ణుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం.
కర్ణ పర్వము ప్రథమాశ్వాసము
- 1.1 ధృతరాష్ట్రుడు కర్ణ దుశ్శాసనుల మరణం గురించి వినుట
- 1.1.1 దుశ్శాసనుడి మరణవార్త నిని ధృతరాష్ట్రుడు మూర్ఛిల్లుట
- 1.2 ధృతరాష్ట్రుడు ఇరుపక్షాలలో మరణించిన జీవించి ఉన్నవారి గురించి తెలుసుకొనుట
- 1.2.1 ధృతరాష్ట్రుని నిరాశ
- 1.2.2 దృతరాష్ట్రుడు కర్ణుడి మరణానికి ఆశ్చర్యపడుట
- 1.3 కౌరవ సైన్యాధ్యక్ష నిర్ణయం
- 1.3.1 కర్ణుని సైన్యాధ్యక్షుని చేయుట
- 1.4 ఇరుపక్షముల వ్యూహ రచన
- 1.5 యుద్ధారంభం
- 1.5.1 క్షేమధూర్తి భీముని ఎదుర్కొనుట
- 1.6 కురు పాండవ యోధుల సమరం
- 1.6.1 సాత్యకి విందానువిందులు
- 1.6.2 శ్రుతకర్మ చిత్రుడిని చంపుట
- 1.6.3 భీముడు, శ్రుతకీర్తిల యుద్ధము
- 1.6.4 దుశ్శాసనుడు సహదేవుడిని ఎదుర్కొనుట
- 1.6.5 నకులుని భంగపాటు
- 1.6.6 ఉపపాండవుల సమరం
- 1.6.7 కృపాచార్యుడు, కృతవర్మల శౌర్యం
- 1.7 త్రిగర్త మహారాజు అర్జునుడిని ఎదుర్కొనుట
- 1.8 సుయోధనుడు ధర్మజుడిని ఎదుర్కొనుట
- 1.9 ధృతరాష్ట్రుని సందేహం
- 1.10 కర్ణసారధ్యంలో రెండవరోజు యుద్ధము
- 1.10.1 కర్ణుడు శల్యుని తనకు సారధిని చెయ్యమని అడుగుట
- 1.11 శల్యుని కర్ణుడికి సారధ్యం వహించమని కోరుట
- 1.11.1 సుయోధనుడు శల్యుని నచ్చ చెప్పి ఒప్పించుట
- 1.12 త్రిపురాసుర వధ
- 1.12.1 హరి కోరిన వరం
- 1.12.2 దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట
- 1.12.3 పాశుపత వ్రతము
- 1.12.4 త్రిపురాసుర సంహారానికి కావలసిన రధము
- 1.13 భార్గవరాముని కథ
- 1.14 కర్ణ సుయోధనులు శల్యుని శ్లాఘించుట
No comments:
Post a Comment