- ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు భీష్ముని సంరక్షణలో పెరుగుతున్నారు. భీష్ముడు
వారికి ఉపనయనం చేయించాడు. ముగ్గురు అన్ని విద్యలలో ఆరితేరిన తరువాత
దృతరాష్ట్రునికి యువరాజ పట్టాభిషేకం చేయించాడు. విదురుని బుద్ధి బలంతో తన
పరాక్రమంతో కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలిస్తూ వచ్చాడు. భీష్ముడు ధృతరాష్ట్రునికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నాడు. గాంధారదేశ రాజకుమారి గాంధారి దృతరాష్ట్రునికి తగిన కన్యగా నిర్ణయించాడు . గాంధారికి
నూరుగురు పుత్రులు కలుగుతారని వరం ఉంది కనుక వంశం చక్కగా అభివృద్ధి
చెందుతుందని విదురుని అభిప్రాయం. పురోహితులను గాంధార దేశానికి పంపి గాంధారిని దృతరాష్ట్రునికి ఇమ్మని కోరాడు. గాంధార రాజు బంధువులు ఈ వివాహానికి అంగీకారం తెలుపక పోయినా సుబలుడు గాంధారి మాత్రం ఈ వివాహానికి అంగీకరించారు. గాంధారి తండ్రి మాటిచ్చాడు కనుక ధృతరాష్ట్రుని భర్తగా ఎంచి అతనికి కళ్ళు లేవు కనుక తాను కూడా కళ్ళకు గంతలు కట్టుకుంది. గాంధారరాజు సుబలుడు గాంధారిని ఆమె సోదరుడైన శకునిని హస్థినా పురానికి పంపాడు. భీష్ముడు గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం జరిపాడు. అదే సమయంలో భీష్ముడు గాంధారి పది మంది చెల్లెళ్ళతోనూ మరొక నూరు మంది కన్యలతోనూ ధృతరాష్ట్రునికి వివాహం జరిపించాడు. నూట పదకొండు మంది భార్యలతో ధృతరాష్ట్రుడు సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ధృతరాష్ట్రుని తమ్ముడైన పాండురాజు కూడా సకల విద్యలలో ఆరి తేరాడు. వేదాలూ, శాస్త్రాలూ, యుద్ధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. భీష్ముడు పాండురాజుకు వివాహంచేయ నిశ్చయించుకున్నాడు.
కుంతీ దేవి
పాండురాజుతో కుంతీదేవి |
యాదవ రాజైన శూరుడు తన కుమార్తె పృధను తన మేనత్త కుమారుడైన కుంతి భోజునకు
సంతానం లేని కారణంగా పెంచు కునేందుకు ఇచ్చాడు. ఒక రోజు కుంతి భోజుని
ఇంటికి దుర్వాసుడు
వచ్చి కొంత కాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని అన్నాడు. కోపిష్టి అయిన
దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతి భోజుడు కుంతిని నియమించాడు.
ఆమె అతి శ్రద్ధగా అతనిని సేవించింది. దుర్వాసుడు వెళుతూ కుంతి సేవలకు
మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్ర బలంతో కోరిన దేవతలు వచ్చి
కుమారులను ఇవ్వగలరని చెప్పాడు. ఒక రోజు కుంతి గంగా స్నానం చేసి సూర్యునికి
అర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు రాగా ఆ మంత్రాన్ని
పరీక్షించాలని అనిపించింది. వెంటనే ఆమె మంత్రం పఠించి సూర్యుని పిలిచి దేవా
నీవంటి కుమారుని ప్రసాదించు అని వేడుకుంది. కుంతికి ప్రత్యక్షమైన సూర్యుడు
ఆమె తాను కన్యనని వారించినా వినక తన దర్శనం మంత్ర మహిమ ఊరికే పోదని చెప్పి
ఆమె కన్యాత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచకుండలాలతో కుమారుని ప్రసాదించాడు.
ఏమి చేయాలో తోచని సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి
నదిపై తేలుతూ వచ్చింది. లోకోపవాదుకు భయపడిన కుంతి
అమితమైన వేదనతో ఆకుమారుని ఆ పేటికకలో పెట్టి గంగా నదిలో ఒదలి వేసింది. సహజ
కవచకుండలాలతో పుట్టాడు కనుక అతనికి కర్ణుడు అనే నామధేయం కలిగింది. నదిలో
తేలుతూ పోతున్న ఆపేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది అతనికి సంతానం లేని
కారణంగా అతడు ఆబాలుని భార్య రాధకు ఇచ్చి పెంచమన్నాడు. బంగారము మణులతో
దొరికినందు వలన అతనికి వశుషేణుడు అని పేరు పెట్టి పెంచు కుంటున్నారు.
కుంతీ మాద్రి పాండురాజుల వివాహం
కుంతిభోజుడు తన కుమార్తె కుంతికి స్వయం వరం ప్రకటించాడు. స్వయంవరంలో పృధ
పాండురాజుని వరించింది. వారిద్దరికి వివాహం అయింది. ఆతరువాత పాండురాజు
భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రి
వివాహం చేసుకున్నాడు. వివాహం తరువాత పాండురాజు ద్విగిజయ యాత్ర చేసి నాలుగు
దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులను చేసాడు. పాండురాజు
నూరు అశ్వమేధ యాగాలు చేసాడు.
పాండురాజుకు శాపం
ఒక
రోజు పాండురాజు వేట నిమిత్తం అడవికి వెళ్ళాడు.ఆయనతో కుంతి మాద్రి కూడా
వెళ్ళారు.ఒకరోజు ఎంత వెతికినా ఒక్క జంతువు కనపడక విసిగి చివరకు
ప్రణయకలాపంలో ఉన్న జింకలపై బాణం వేసాడు. అందులో ఆడుజింక చనిపోగా మగజింక పాండురాజుని
చూసి " రాజా వేటాడుట రాజుల ధర్మం అయినా పరుగెత్త లేనివి, రోగంతో బాధపడేవి,
ప్రణయకలాపంలో ఉన్నవి అయిన జంతువులను వేటగాడు కూడా కొట్టడు. అన్ని ధర్మాలు
తెలిసిన రాజువు ఇలా కొట్టావు కనుక నీవు భార్యలను చేరిన మరుక్షణం మరణిస్తావు
" అని శపించి మరణించింది. ఆ శాపం విన్న పాండురాజు దుఃఖించి తనదగ్గర ఉన్నవి
అన్నీ దానం చేసి భార్యలను చూసి మీరు కూడా హస్థినాపురం వెళ్ళండి అన్నాడు.
వారు వెళ్ళటానికి నిరాకరించి భర్తతోనే ఉండి పోయారు. పాండు రాజు ఉత్తర
దిక్కుగా ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకుని ముని వృత్తిని అవలంబించి తపసు
చేసుకోవడం మొదలు పెట్టాడు. ఒక రోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం
చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు. ఋషులు వారిని చూసి ఇవి దేవ
మార్గాలు వీటి వెంట మీరు రాలేరు అన్నారు. పుత్రులు లేరు కనుక తను
వెళ్ళడానికి తగనివాడని పాండురాజు గ్రహించి మునులతో ఆ విషయం అన్నాడు. వారు
దివ్యదృష్టితో చూసి " పాండురాజా నీకు సంతాన యోగం ఉన్నది సంతానం కోసం
ప్రయత్నించు " అని చెప్పారు.
పాండురాజు కోరిక
పాండురాజు
తనలో పురుషునికి ఈ లోకంలో దేవఋణం, ఋషి ఋణం, పితృఋణం, మనుష్య ఋణం ఉంటాయి. ఆ
ఋణాలు తీర్చకపోతే పుణ్యలోకాలు ఉండవు యజ్ఞముల వలన దేవఋణం, వేదాధ్యయనం వలన
ఋషి ఋణం, దయాగుణంతో మనుష్య ఋణం తీర్చుకున్నాను. కుమారులు లేనందున పితృ ఋణం
తీరదు. శాపం వలన పుత్రుల యోగం లేదు కదా అని చింతించాడు.కుంతీ దేవిని పిలిచి
సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడం మేలు.కుంతీ నాకు ధర్మ మార్గంలో
కుమారులను కని ఇవ్వవా అని అడిగాడు." కుంతీ పుత్రులు ఆరు రకాలు ఔరసుడు,
సహోఢుడు,
క్షేత్రజ్ఞుడు , పౌనర్భవుడు, స్వయందత్తుడు, జ్ఞాతుడు. వారిలో ఔరసుడు
క్షేత్రజ్ఞుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కనుక
క్షేత్రజ్ఞుడు మేలు . దేవరన్యాయంతో పుట్టిన పుత్రుడు ఉత్తముడు.పూర్వం కేకయ
రాజుకు సంతానం లేని కారణంగా ఆయన భార్యను ఆకార్యానికి నియోగించగా ఆమె పుంసవన
హోమం చేయించి ఋత్విజ్ఞుల ద్వారా ముగ్గురు కుమారులను పొందింది. కాబట్టి
క్షేత్రజ్ఞులను కని ఇవ్వు" అని వేడుకున్నాడు. బదులుగా కుంతీ దేవి " రాజా మీ
ధర్మపత్నులమైన మేము వేరెవరిని తలపలేము.పూర్వం పూరు వంశంలోని
వ్యుతితాష్వుడు అనే రాజు నూరు అశ్వమేధ యాగాలు చాసాడు. ఆయన విపరీతమైన
భోగలాలసతో క్షయరోగం వచ్చి మరణించగా అతని భార్య అతనిని స్మరించి సంతానవతి
అయింది. కనుక పాండురాజా నువ్వు కూడా అలా సంతానాన్ని పొందవచ్చు" అన్నది.
పాండురాజు కుంతీ చెప్పిన మార్గం ఆచరణ సాధ్యం కాదని అనుకున్నాడు. పాండు రాజు
కుంతితో పూర్వం స్త్రీలు సర్వస్వతంత్రులు వారు భర్త అనుమతితో కానీ భర్త
అనుమతి లేకుండా కానీ సంతానవతులయ్యేవారు. ఒకరోజు ఉద్దాలకుని భార్య ఋతుమతి
అయిన తరుణంలో ఇంటికి అతిధిగా వచ్చిన ఒక వృద్ద బ్రాహ్మణుడు ఆమెయందు సంతానం
పొందాలని అనుకున్నాడు. అది చూసిన ఉద్దాలకుని కుమారుడు కోపించి అది ధర్మ
విరుద్ధమని భావించాడు. ఆరోజు నుండి అతడు స్త్రీలు పరపుషులను
కోరకూడదని అలా చేస్తే పాపం వస్తుందని కట్టడి చేసాడు. అప్పటి నుండి స్త్రీలు
భర్త అనుమతి లేకుండా పర పురుషుని చేరడం లేదు కానీ భర్త అనుమతితో
పొందవచ్చు. కల్మషపాదుడు
తన భార్య దమయంతిని దేవరన్యాయం ప్రకారం సంతానాన్ని ఇవ్వమని నియోగించగా ఆమె
వశిష్టుని వలన అశ్మకుడు అనే కుమారుని పొందింది. అలాగే నీవు కూడా దేవర
న్యాయంతో నాకు పుత్రులను పొంది ఇవ్వు నీకు చేతు లెత్తి నమస్కరిస్తాను.అని
దీనంగా వేడుకున్నాడు.
పాండవ కౌరవ జననం
పాండురాజు
ఆవేదనకు విచలిత అయిన కుంతీ దేవి పాండురాజుకు తనకు దుర్వాసముని ఇచ్చిన వరం
గురించి చెప్పింది. కాని కర్ణుని జననం తప్ప అంతా వివరించింది. కుంతి ఆ
మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏదేవత సాయంతో సంతానం పొందాలో
ఆనతివ్వమని పాండురాజుని అడిగింది. పాండురాజు ధర్మదేవతకు మించిన దైవం లేదు
కనుక అతనిని స్మరించి పుత్రుని పొందుము . అలా భర్తచేత నియోగించబడిన కుంతి యమధర్మరాజుని
స్మరించి కుమారుని కన్నది. అతనికి యుధిష్టురుడు అని నామకరణం చేసాడు. ఋషులు
అతను కురు వంశానికి రాజై ధర్మ బద్దంగా రాజ్యం చేస్తాడు అని పలికారు.
హస్థినలో గాంధారి
కుంతిదేవి కంటే ముందే గర్భం ధరించినా ముందుగా ప్రసవించ లేక పోవడంతో అసూయ
చెంది తన గర్భాన్ని కొట్టుకుంది. అందువలన ఆమెకు గర్భస్రావం అయింది. అది
విని వ్యాసుడు
అక్కడకు వచ్చి ఆ మాసం ముక్కలను నూట ఒక్క నేతి కుండలలో భద్రపరిచి గాంధారితో
ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి నూరుగురు పుత్రులు ఒక కుమార్తె
కలుగుతుందని చెప్పాడు. పాండురాజుకు మరొక కుమారుడు కావాలని కోరిక కలిగి
వాయుదేవుని సాయంతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతి వాయుదేవుని సాయంతో
కుమారుని పొందింది. ఆకాశవాణి ఆ కుమారునికి భీమసేనుడు అని నామకరణం చేసింది.
హస్థినాపురంలో గాంధారికి కలి అంశతో దుర్యోధనుడు జన్మించాడు. ఒక్కోరోజుకు
ఒక్కో కుమారుడు కలిగారు. నూరుగురు కుమారులు జన్మించిన తరువాత దుస్సల
అనే కుమార్తె జన్మించింది. దుర్యోధనుని జనం తరువాత గోచరించిన దుశ్శకునాలను
చూసిన భీష్మ, విదుర, పురోహితాదులు కలత చెంది అతడు కులక్షయ కారకుడని అతనిని
వదిలి వేసి అందర్ని రక్షించమని మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్పారు.
కానీ పుత్రుని మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుని వదలడానికి
అనుమతించలేదు.
భీముని బలం
కుంతీ దేవి ఒకసారి భీముని ఎత్తుకుని దేవాలయానికి వెళుతున్న తరుణంలో ఒక పులి ఆమె మీదకు ఉరికింది.పాండురాజు
దానిని చంపేలోగాకుంతీ భీముని ఒక బండరాతిపై జారవిడిచింది కేవలం పది రోజుల
శిశువు పడగానే ఆ రాళ్ళు పొడి పొడి అయ్యాయి. భీముని బలానికి పాండురాజు
ఆశ్చర్య పడ్డాడు. దృతరాష్ట్రునికి నూరుగురు కుమారులు కలిగారని విని
పాండురాజుకు కూడా ఇంకొక కుమారుడు కావాలని కోరిక కలిగింది. అతడు దేవేంద్రుని
గురించి తపసు చేసాడు దేవేంద్రుడు ప్రత్యక్షమై ముల్లోకాలను జయించ కలిగిన
కుమారుడు కలుగుతాడని వరమిచ్చాడు. కుంతీ దేవితో దేవతల అధిపతి అయిన ఇంద్రుని
అంశతో ఒక కుమారుని పొందమని చెప్పాడు. కుంతీ దేవికి ఉత్తరఫల్గుణీ నక్షత్రంలో
తేజోవంతుడైన పుత్రుడు కలిగాడు. అప్పుడు ఆకాశవాణి " ఇతను
కార్తవవీరార్జ్యునికంటే వీరుడౌతాడు. కనుక అర్జునుడని పిలువబడుతాడు " అని
పలికింది. కుంతీదేవి గాంధారి సంతాన వతులైన తరువాత మాద్రి సంతానం కొరకు
చింతించడం చూసి పాండురాజు మంత్ర మహిమ ద్వారా మాద్రికి సంతానం కలిగించమని
అడిగాడు. కుంతీ మాద్రికి మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్వినీ దేవతల అంశతో నకులసహదేవులను పొందింది.
పాండురాజు మరణం మాద్రి సహగమనం
పాండురాజు
భార్యలతో పిల్లలతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఒక వసంత కాలం సమయంలో
ప్రకృతి మనోజ్ఞంగా ఉన్న సమయంలో పాండురాజు మాద్రి సౌందర్యానికి ఆకర్షితుడై
బలవంతంగా ఆమెను చేరాడు. ఆ పై శాపకారణంగా మరణించాడు. ఇది చూసిన మాద్రి భయంతో
ఒణికి పోతూ భర్త శవాన్ని చూసి రోదించ సాగింది. అక్కడకు వచ్చిన కుంతీ దేవి
జరిగిన విషయం గ్రహించి సహగమనానికి సిద్దపడింది. కానీ మాద్రి అందుకు
అంగీకరించలేదు. భర్త తన వలన మరణించినందున తాను సహగమనం చేస్తానని చెప్పి
తనకంటే సమర్ధురాలైన కుంతికి ఐదుగురు పుత్రులను కాపాడే బాధ్యతను అప్పగించి
తాను భర్తతో సహగమనం చేసింది. కుంతీదేవికి అక్కడి మునులు సహకరించి వారిని
తీసుకుని హస్థినాపురానికి వెళ్ళారు. పాండురాజు కుమారులను చూడటానికి
హస్థినాపురం ప్రజలు తరలి వచ్చారు. దుర్యోధనుడు తన తమ్ములతో పురోహిత సమేతంగా
ఎదురువచ్చి వారిని సాదరంగా తీసుకు వెళ్ళాడు. భీష్ముడు, విదురుడు, సత్యవతి,
అంబిక, అంబాలిక వారికెదురు వచ్చి మునులకు నమస్కరించి కుంతీదేవిని ఓదార్చి
పాండు కుమారులను ఎత్తుకుని ముద్దాడారు. మునులు కుంతీ సహితంగా పాండు
కుమారులను వారికి అప్పగించి పాండురాజు మరణ వార్త మాద్రి సహగమన వార్తను
చెప్పారు. ఆ తరువాత భీష్ముడు పాండుసుతులతో పాండురాజుకు ఉత్తర సంస్కారం
చేయించాడు. ఆ సందర్భంగా అక్కడకు వచ్చిన వ్యాసుడు తన తల్లి సత్యవతితో "అమ్మా
దృతరాష్ట్రుని కుమారులు దుర్మార్గులు. వారి ఆగడాలు మీరు చూడలేరు కనుక మీరు
తపోవనానికి వెళ్ళి ప్రశాంతంగా జీవించండి "అని చెప్పాడు. సత్యవతి అంబిక,
అంబాలికలను తీసుకుని తపోవనానికి వెళ్ళింది. కాక్రమేణా ఆ ముగ్గురు
స్వర్గస్థు లైయ్యారు. ధృతరాష్ట్రుడు తన కుమారులను తమ్ముని కుమారులను
భేదభావం లేకుండా పెంచుతున్నాడు. భీముడు తన బలంతో దుర్యోధనుని తమ్ములను
ఆటలలో ఓడిస్తూ ఉండటం దుర్యోధనునికి సహింపరానిది అయింది. అతని బలసంపన్నతకు
ఈసు భయంకలిగిన దుర్యోధనుడు మేనమామ తమ్ముడు దుశ్శాననుడు, శకునితో చేరి
కుటిలోపాయాలు ఆలోచించ సాగారు. భీముని చంపి ధర్మరాజుని చెరలో పెట్టితే కానీ
తనకు రాజ్యం దక్కదని అనుకున్నాడు. దీనికి శకుని వంత పాడాడు. ఒకరోజు
పిల్లలంతా జలక్రీడలలో మునిగి తేలి అలసిపోయి నిద్రిస్తున్న సమయంలో
దుర్యోధనుడు తమ్ములతో చేరి భీముని తీగలతో కట్టించి గంగానదిలో త్రోయించాడు.
భీముడు ఒళ్ళు విరవగానే ఆ తీగలన్నీ పటాపంచలైనాయి. మరొక రోజు దుర్యోధనుడు
సారథిని ప్రేరేపించి భీముని నల్ల త్రాచులతో కరిపించాడు. భీముని
వజ్రశరీరాన్ని ఆ పాముకోరలు ఛేదించ లేకపోయాయి. ఒకరోజు దుర్యోధనుడు భీమునికి
కాలకూట విషం ఆహారంలో కలిపి తినిపించాడు. భీ ముడు ఆ ఆహారాన్ని
జీర్ణించుకున్నాడు. భీష్ముడు కుమారులందరికి విద్యను మొదట క్రుపాచార్యుడు
వద్ద ఆ తరువాత ద్రోణాచార్యుని వద్ద నేర్పించ సాగాడు. అప్పుడు జనమేజయుడు
మహర్షీ క్రుపాచార్యుడు, ద్రోణాచార్యుని జన్మ వృత్తాంతం తెలుపగలరా అని
వైశంపాయనుని అడిగాడు.
కౌరవుల నామధేయాలు
|1. దుర్యోధనుడు, 2. దుశ్శాసనుడు, 3.దుస్సహుడు 4.దుశ్శలుడు, 5.జలసంధుడు, 6. సముడు, 7.సహుడు, 8. విందుడు, 9. అనువిందుడు,
10.దుర్దర్షుడు, |11.సుబాహుడు, 12.దుష్పప్రదర్శనుడు, 13.దుర్మర్షణుడు, 1
4.దుర్ముఖుడు, 15.దుష్కర్ణుడు,16. కర్ణుడు,17. వివింశతుడు,18.
వికర్ణుడు,19. శలుడు 20.సత్వుడు, |21.సులోచనుడు, 22.చిత్రుడు,
23.ఉపచిత్రుడు, 24.చిత్రాక్షుడు, 25.చారుచిత్రుడు, 26.శరాసనుడు,
27.దుర్మధుడు, 28.దుర్విగాహుడు, 2 9.వివిత్సుడు, 30.వికటాననుడు,
|31.నోర్ణనాభుడు, 32.సునాభుడు, 33.నందుడు, 34.ఉపనందుడు, 35.చిత్రాణుడు,
36.చిత్రవర్మ, 37.సువర్మ, 38.దుర్విమోచనుడు, 39.అయోబాహుడు, 40.మహాబాహుడు,
|41.చిత్రాంగుడు, 42.చిత్రకుండలుడు, 43.భీమవేగుడు, 44.భీమలుడు, 45.బలాకుడు,
46.బలవర్ధనుడు, 47.నోగ్రాయుధుడు, 48.సుషేణుడు, 4 9.కుండధారుడు,
50.మహోదరుడు, |51.చిత్రాయుధుడు, 52.నిషింగుడు, 53.పాశుడు, 54.బృందారకుడు,
55.దృఢవర్మ, 56.దృఢక్షత్రుడు, 57.సోమకీర్తి, 58.అనూదరుడు, 59.దృఢసంధుడు,
60.జరాసంధుడు, |61.సదుడు, 62.సువాగుడు, 63.ఉగ్రశ్రవుడు, 64.ఉగ్రసేనుడు,
65.సేనాని, 66.దుష్పరాజుడు, 67.అపరాజితుడు, 68.కుండశాయి, 69.విశాలాక్షుడు,
70.దురాధరుడు, |71.దుర్జయుడు, 72.దృఢహస్థుడు, 73.సుహస్తుడు, 74.వాయువేగుడు,
75.సువర్చుడు, 76.ఆదిత్యకేతుడు, 77.బహ్వాశి, 78.నాగదత్తుడు,
79.అగ్రయాయుడు, 80.కవచుడు, |81.క్రధనుడు, 82.కుండినుడు, 83.ధనుర్ధరోగుడు,
84.భీమరధుడు, 85.వీరబాహుడు, 86.వలోలుడు, 87.రుద్రకర్ముడు,88.దృఢరదాశ్రుడు,
89.అదృష్యుడు, 90.కుండభేది, |91.విరావి, 92.ప్రమధుడు, 93.ప్రమాధి,
94.దీర్ఘరోముడు, 95.దీర్ఘబాహువు, 96.ఊడోరుడు, 97.కనకద్వజుడు, 98.ఉపాభయుడు,
99.కుండాశి, 100.విరజనుడు. నూట ఒకటవ కుండనుండి దుస్సల అనే ఆడపిల్ల
జన్మించింది.
కృపాచార్యుడు ద్రోణాచార్యుడు దృపదుడు జన్మ వృత్తాంతం
గౌతముడు
అనే మహామునికి శరద్వంతుడు అనే కుమారుడు ఉన్నాడు .అతనికి వేదాధ్యనంలో
ఆసక్తి లేక ధనుర్విద్యలో ప్రావీణ్యం సంపాదించాడు. ఇంకా సంపాదించాలని ఆశించి
ఘోరమైన తపమాచరించాడు. అతని తపస్సు భగ్నంచేయడానికి ఇంద్రుడు
జలపద అనే యువతిని పంపించాడు. ఆమెను చూసిన శర్వందుడు పరవశుడైనాడు. అతని
చేతిలోని ధనుర్భాణాలు జారవిడిచాడు. అతనికి వీర్యపతనం జరిగి ఒక రెల్లు
పొదలపై బడింది. శరద్వంతుడు తిరిగి తపస్సుకు వెళ్ళాడు. పతనమైన వీర్యం రెండు
భాగాలుగా విడిపడి ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లవాడు జన్మించారు. ఒకరోజు శంతన
మహారాజు వేటకు వచ్చి ఆ బిడ్డలను పక్కన ఉన్న ధనుర్భాణాలు, జింకచర్మాలు చూసి
వారు బ్రాహ్మణ బాలురని గ్రహించి తీసుకు వెళ్ళి పెంచుకున్నాడు. వారికి కృపి,
కృపుడు అని పేర్లు పెట్టాడు. ఒకనాడు శరద్వంతుడు వచ్చి వారు తన పిల్లలని
చెప్పి కృపునకు ఉపనయనం చేసి ధనుర్విద్య నేర్పించాడు. కృపాచార్యుని భీష్ముడు
పాండవ కౌరవులకు గురువుగా నియమించాడు. భరద్వాజముని గంగా తీరంలో తపసు
చేసుకుంటున్నాడు.ఘృతాచి అనే అప్సరస గంగా నదిలో జలకాలాడు తున్నప్పుడు ఆమె
వస్త్రం తొలగిన సమయంలో భరద్వాజుడు చూసాడు. అది చూసిన భరద్వాజునకు వీర్యపతనం
జరిగింది. అతడు ఆ వీర్యాన్ని ఒక ద్రోణంలో (కలశంలో) దాచాడు. ఆ వీర్యం నుండి
శుక్రాచార్యుని అంశతో ద్రోణుడు
జన్మించాడు. భరద్వాజుని స్నేహితుడు పాంచాల దేశ రాజైన పృషతుడు. అతడు
అరణ్యాలకు వెళ్ళి తపస్సు చేసాడు. అతడికి ఒకరోజు మేనక అనే అప్సరసను చూసి
వీర్యపతనం జరుగగా దాని నుండి దృపదుడు
జన్మించాడు. పృషతుడు ఆ బాలుని భరద్వాజుని ఆశ్రమంలో ఉంచి పాంచాలదేశానికి
వెళ్ళాడు. భరద్వాజ ఆశ్రమంలో ద్రోణుడు దృపదుడు కలసి విద్య నభ్యసించారు.
దృపదుడు పాంచాల దేశానికి వెళ్ళి రాజయ్యాడు. దృపదుడు అగ్నివేశుని వద్ద
అస్త్రవిద్య నేర్చుకున్నాడు. కృపాచార్యుని చెల్లెలెలు కృపిని ద్రోణుడికి
ఇచ్చి భరద్వాజుడు వివాహం చేసాడు. వారిరువురికి అశ్వత్థామ అనే కుమారుడు
కలిగాడు.పరశురాముడు
తన ధనాన్ని బ్రాహ్మణులకు దానం చేస్తున్నాడని తెలుసుకుని ధనార్ధియై
ద్రోణుడు పరశురాముని వద్దకు వెళ్ళాడు. కానీ అప్పటికే ధనమంతా దానంచేసిన
పరశురాముడు మిగిలి ఉన్న అస్త్రశస్త్రాలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు.
ద్రోణుడు అవి చాలని చెప్పి అస్త్రశత్రాలను ప్రయోగం ఉపసంహారాలతో
నేర్చుకున్నాడు. ఒక రోజు ద్రోణుడు చిన్ననాటి స్నేహం పురస్కరించుకుని
దృపదుని వద్దకు వెళ్ళాడు. దృపదుడు గర్వియై స్నేహమంటే సమాన అంతస్తు ఉండాలని
పేద బ్రాహ్మణునితో స్నేహమేమిటని అవమానించి పంపాడు. ఆ అవమానం భరించలేక
ద్రోణుడు రాజ్యం విడిచి హస్థినాపురానికి వెళ్ళాడు.
పాండవులు కౌరవుల విద్యాభ్యాసం
యుధిష్టురినితో భీష్ముడు |
ద్రోణాచార్యుడు హస్థినలో ప్రవేశించే సమయంలోజరిగిన సంఘటన ఆయనను పాండు
సుతులకు కౌరవులకు గురువైయ్యేలా చేసింది. పాండవులు కౌరవులు బంతితో ఆడుకునే
సమయంలో అది ఒక లోతైన నూతిలో పడింది. వారు దానిని తీయటానికి విఫల ప్రయత్నం
చేసి నిస్సహాయంగా చూస్తున్న సమయంలో అక్కడకు కుటుంబ సహితంగా వచ్చిన
ద్రోణాచార్యుడు ఆ బంతిని ఒకదాని తరువాత ఒక బాణాన్ని వేస్తూ బయటకు తీసి
ఇచ్చాడు. రాజకుమారుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న భీష్ముడు ద్రోణుని
రాజకుమారులకు ఆ చార్యునిగా నియమించాడు. విద్య నేర్పడానికి ముందు అతడు
రాకుమారులను చూసి మీలో నాకోరికను తీర్చగలవారు ఎవ్వరు అని ప్రశ్నించాడు.
అందరూ సంశయిస్తుండగా అర్జునుడు మాత్రం ముందుకు వచ్చి గురుదేవా నేను మీరు
ఏది కోరితే అది చేస్తాను అన్నాడు. దేశదేశాల నుండి వచ్చిన రాకుమారులతో
దృపదుని కుమారుడు కర్ణుడు కూడా ద్రోణుని వద్ద విద్యనభ్యసించ సాగాడు. కర్ణుడు మాత్రం ఎప్పుడూ దుర్యోధన పక్షం వహించేవాడు. అర్జునుడు మాత్రం గురువును వినయ విధేయతలతో సేవిస్తూ ద్రోణుని ప్రేమాభిమానానికి పాత్రుడైయ్యాడు. అశ్వత్థామకు
అర్జునుడంటే విద్యామత్సరం ఉండేది. ఒక రోజు అర్జునుడు భోజనం చేస్తుండగా
దీపం ఆరిపోయింది. అర్జునుడు చీకటిలో అన్నంతింటూ ఉండగా చీకటిలో బాణప్రయోగం
కూడా చేయవచ్చన్న ఆలోచన వచ్చి అలా అభ్యాసం చేయనారంభించాడు. అది చూసి
ద్రోణుడు అర్జునుని పట్టుదలకు మెచ్చి పరశురాముని వద్ద తాను నేర్చుకున్న
విద్యనంతా నేర్పించాడు. దుర్యోధనాదులు భీముని బలం అర్జునిని విలువిద్యా
నైపుణ్యం సహించలేక పోయారు. ఒకరోజు ద్రోణుడు రాజకుమారులకు విలువిద్యలో
పరీక్ష పెట్టాడు. ఒక పక్షి బొమ్మను చెట్టు కొమ్మకు కట్టి ఒక్కొక్కరిని
పిలిచి వారి ఏకాగ్రతను పరీక్షించగా అర్జునుడికి తప్ప ఎవరికీ తగినంత ఏకాగ్రత
లేదని గ్రహించాడు. ఒకరోజు ద్రోణుడు నదిలో స్నానమాచరిస్తుండగా ఒక మొసలి
అతని కాలును పట్టుకుంది. అతడు రక్షించమని వేసిన కేకలకు రాకుమారులంతా
దిక్కుతోచక పరుగెడుతున్న సమయంలో అర్జునుడు చాకచక్యంగా బాణం వేసి గురువుని
రక్షించాడు. ఎప్పటికైనా అర్జునుడు ఒక్కడే దృపదుని పట్ల తనకు కలిగిన పగ
చల్లార్చ గలడని గ్రహించి ద్రోణుడు అర్జునునికి దివ్యాస్త్రాలను ఇచ్చాడు.
ఏకలవ్యుడు
ద్రోణుని కీర్తి విని హిరణ్యధన్వునుడు అనే ఎరుకల రాజు కుమారుడు ఏకలవ్యుడు
అతనిని తన గురువుగా ఎంచుకున్నాడు .అతడు ద్రోణుని వద్దకు వెళ్ళి విలువిద్య
నేర్పమని కోరాడు. హీనజాతి వాడికి విలు విద్య నేర్పడానికి ద్రోణుడు
అంగీకరించలేదు. పట్టువదలని ఏకలవ్యుడు అడవిలో ద్రోణుని విగ్రహం పెట్టి
భక్తితో విలు విద్యను సాధన చేసాడు. ఒక రోజు పాడవులు, కౌరవులు సమయంలో
పాండవుల వేట కుక్క తప్పించుకు పోయింది. అది ఏకలవ్యుడు సాధన చేస్తున్న
ప్రదేశంలో మొరగ సాగింది. ఏకలవ్యుడు ఏడు బాణాలు సంధించి ఆ కుక్క నోట్లో
కొట్టాడు. ఆ బాణాలతో ఆ కుక్క పాండవుల చెంతకు రాగా అది చూసిన రాకుమారులు
ఆబాణాలు సంధించిన నైపుణ్యం విస్మయపరచింది. వారు వెతుక్కుంటూ ఏకలవ్యుని చూసి
అతడు ద్రోణుని శిష్యుడని అతనిద్వారానే అడిగి తెలుసుకున్నారు. అర్జునుడు
ద్రోణునితో "గురువర్యా నేను మీ ప్రియశిషుణ్ణి అని చెప్పారు కదా నాకంటే
ఏకలవ్యుని విలువిద్యలో నైపుణ్యత అధికంగా ఇచ్చారెందుకు " అని వేదనగా
అడిగాడు. ద్రోణుడు అర్జునునితో ఏకలవ్యునికి దగ్గరకు వెళ్ళి అతని వద్ద గురుదక్షిణగా అతని బొటన వ్రేలిని గ్రహించి అ ర్జునిని జగదేక వీరునిగా చేసాడు.
NEXT
ఆది పర్వము షష్టమాశ్వాసము
- 1.0 అస్త్ర విద్యా ప్రదర్శన
- 1.1 అర్జుడి విలువిద్యా ప్రదర్శన
- 1.2 కర్ణుడిప్రవేశం
- 1.3 కర్ణుడిరాజ్యాభిషేకం
- 1.4 గురుదక్షిణ
- 1.5 ధర్మరాజ యౌవ రాజ్య పట్టాభిషేకం దుర్యోదనాదులకుట్ర
- 1.6 పాండుసుతులు వారణావతానికి వెళ్ళుట లక్కాగృహ దహనం
- 1.7 పాండవుల వారణావత వాసం
- 1.8 పాండవులు లక్క ఇంటి నుండి తప్పించుకొనుట
- 1.9 హిడింబాసుర వధ
- 1.10 హిడింబ భీమసేనుల వివాహం- ఘటోత్కచుని జననం
- 1.11 ఏకచక్రపురం బకాసురవధ
- 1.12 బ్రాహ్మణ కుటుంబం విలపించుట
- 1.13 బకాసురుడి వృత్తాంతం విని కుంతి బ్రాహ్మణుడికి అభయమిచ్చుట
- 1.14 భీముని ఉత్సాహము చూసి ధర్మరాజు కలతపడుట
- 1.15 బకాసుర వధ
No comments:
Post a Comment