Thursday, March 16, 2017

ఆది పర్వము ప్రథమాశ్వాసము -2


భృగువు

 పూర్వం భృగువు అనే మహాముని వుండేవాడు. అతడి భార్య పేరు పులోమ. ఆమె నిండు గర్భవతిగా ఉన్న సమయంలో భృగువు స్నానానికి వెళుతూ భార్యని హోమాగ్నిని సిద్ధం చేయమన్నాడు. అప్పుడు పులోముడు అనే రాక్షసుడు పులోమను చూసాడు. అతడికి పులోమ మీద మోహం కలిగింది. అతడు అగ్ని దేవునితో ఆమె ఎవరని అడిగారు. అగ్నిదేవుడు సందిగ్ధంలో పడ్డాడు. ఈ పులోముడు ఒకప్పుడు పులోమను చేసుకోవాలని అనుకున్నాడు. అయితే పులోమ తండ్రి ఆమెను భృగువుకు ఇచ్చి వివాహం చేసాడు. ఇప్పడు నిజం చెపితే పులోముడు పులోమను ఏమి చేస్తాడో అని భయపడ్డాడు. అదీ కాక భృగువుకు కూడా తన మీద కోపం రావడంమేగాక తనను శపించవచ్చు. కాని నిజం చెప్పకుంటే తనకు అసత్య దోషం అంట వచ్చు. అనగ సందిగ్ధంలో పడినా ముని శాపం ఎలాగైనా పోగొట్టుకోవచ్చు. అనుకొని అసత్య దోషానికి భయపడి ఆమె భృగువు భార్య అని నిజం చెప్పాడు. అది వినగానే పులోముడు పులోమను గుర్తు పట్టాడు. వివాహం కాక మునుపు ఆమెను పులోముడు చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆమెను భృగువు వివాహం చేసుకున్నాడు. ఈ నిజం తెలిసిన రాక్షసుడు పంది రూపంలో పులోమను ఎత్తుకుని వెళ్ళాడు. ఆ కుదుపులకు పులోమ గర్భంలోని శిశువు కింద పడ్డాడు. కింద పడిన కారణంగా అతడికి చ్యవనుడు అన్న పేరు వచ్చింది. చ్యవనుడు కళ్ళు తెరచి చూడగానే ఆ తేజో శక్తికి రాక్షసుడు దగ్ధం అయ్యాడు.

అగ్నిహోత్రుడి మీద భృగువు ఆగ్రహించుట

తరువాత పులోమ కుమారునితో భర్త దగ్గరకు చేరింది. ఆ తరుణంలో పులోమ కంటి నుండి జానువారిన కన్నీరు నదిగా మారి ప్రవహించ సాగింది. ఆ నదికి బ్రహ్మదేవుడు వధూసర అని నామకరణం చేసాడు. నదీ స్నానానికి వెళ్ళిన భృగువు ఆశ్రమానికి తిరిగి వచ్చి తేజోవంతుడైన కుమారుడిని చూసాడు. అప్పుడు పులోమ జరిగినది భర్తకు చెప్పింది. భృగువు భార్యతో " నీవు పులోమ అని నా భార్యవు అని అతడికి ఎలా తెలిసింది " అని అడిగాడు. పులోమ " నాధా ! ఈ అగ్నిదేవుడు నేను పులోమ అని నీ భార్యను అని చెప్పాడు. వరాహరూపంలో అతడు నన్ను తీసుకు పోతున్న తరుణంలో కిందకు జారిన చ్యవనుడు తీక్షణతకు రాక్షసుడు భస్మం అయ్యాడు " అని చెప్పింది. అది విని భృగువు కోపించి అగ్నితో " ఆ రాక్షసుడు నా భార్యకు అపకారం చేస్తాడని తెలిసి కూడా నీవు నా భార్య గురించి చెప్పావు కనుక నీవు క్రూరుడవు. అందు వలన నీవు సర్వ భక్షకుడివి అయిపో " అగ్నిదేవుని శపించాడు.

అగ్నిహోత్రుడి అలక

అగ్నిదేవుడు " మహర్షీ ! అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియనిదా. నేను అసత్య దోషానికి భయపడి అలా చెప్పాను. కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలుకగలనా ! నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపం ఇచ్చావు. నేనూ నీకు ప్రతిశాపం ఇవ్వగలను. అయినా పరుషోక్తులు పలికిలా, కొట్టినా, తిట్టినా ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే ! నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను. బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను. నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు కనుక నేను నిన్ను శపించను. సమస్త లోకాలకు హితము చేసే నన్ను శపించి లోకాలకు అపకారం చేసావు. నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమద్రవ్యములను, హవిస్సులను తీసుకు వెళ్ళి దేవతలకు, పితరులకు ఇస్తాను. అందు వలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు. నీ శాపకారణంగా నేనిక అపవిత్రుడిని ఔతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు, పితరులకు అందజేయలేను. నేనా పని చేయకున్న లోకాలు స్థంభిస్తాయి " అని చెప్పాడు. అసత్య దోషానికి భయపడి నిజం చెప్పిన తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్ని దేవుడు సర్వ భక్షుకుడైన తాను పితృ కార్యానికి, దేవ కార్యానికి పనికి రానని తన జ్వాలలను ఉపసంహరించాడు. లోకంలో దేవక్రతువులు, యజ్ఞయాగములు, ఔపోసనాది కార్యములు ఆగి పోయాయి. దేవతార్చనలో దీపాలు ఆరిపోయాయి. పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగి పోయాయి. అగ్ని కార్యాలు ఆగి పోయాయి. ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్ళారు. వారంతా దేవతల వద్దకు వెళ్ళారు. దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి " అగ్ని దేవా ! నీవు సమస్త భూతములకు నీవు యజమానివి, చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు, సమస్త దేవతలకు నీవు ముఖం వంటి వాడిని. లోకోపావకుడివి అయిన నీవు ఇలా చెయ్యడం ధర్మం కాదు. భృగువు వాక్కు అసత్యం కాదు. సర్వభక్షకుడివి అయినా నీవు సర్వ కార్యాలలో ప్రధముడివి. నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివి, పూజింప తగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి. కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింప చేయుము బ్రాహ్మణ సహాయంతో దేవతలకు హవిస్సును అందించు " అని అర్ధించాడు. అందుకు అగ్నిదేవుడు సమ్మతించాడు.

రురుడు ప్రమద్వరల వృత్తాంతం


చ్యవనునికి శర్యాతి కుమార్తె నుకన్యకు వివాహమైంది. వారికి ప్రమతి అనే కుమారుడు ఉన్నాడు. ప్రమతికి క్షీరసాగర సమయంలో అమృత కలశంతో పుట్టిన ఘృతాచి అనే అప్సరసతో వివాహం అయింది. ప్రమతికి ఘృతాచికి పుట్టిన కుమారుడు రురుడు. రురుడు స్థూలకేశుడు అనే ముని ఆశ్రమంలో పెరుగుతున్న ప్రమద్వరను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. విశ్వావసు అనే గంధర్వ రాజుకు మేనకకు పుట్టిన కుమార్తె ప్రమద్వర. ఒక రోజు ప్రమద్వర పాముకాటుతో మరణించింది. ప్రమద్వర మరణానికి ఆశ్రమవాసులు దుఃఖించసాగారు. అది విన్న రురుడు రోదేస్తూ అరణ్యంలోకి పరిగెతుతాడు.

ప్రమద్వరను బ్రతికించుట

రురుడు శోకిస్తూ ప్రద్వరను బ్రతికించమని దేవతలను " ఓ దేవతలారా ! ఓ బ్రాహ్మణులారా ! నేను దేవ యజ్ఞములు, వేదాధ్యయనం, వ్రతములు, పుణ్యకార్యములు చేసిన వాడిని అయితే, నేను నా గురువులను భక్తితో సేవించిన వాడిని అయితే, నేను ఘోరమైన తపసు చేసిన వాడిని అయితే నా ప్రేయసి ప్రమద్వర మీ దయ వలన విషం నుండి విముక్త కాగలదు" ప్రార్థించాడు. తిరిగి " మంత్ర తంత్రములు తెలిసిన వారు విషతత్వ శాస్త్రములు తెలిసిన వారు ఎవరైనా ప్రమద్వర విషమును హరిస్తే అతడికి నా తపః ఫలమును, అధ్యయన ఇలమును ధారపోస్తాను. " అని రోదించాడు. అప్పడు ఆకాశం నుండి ఒక దేవత " బ్రాహ్మణోత్తమా !ప్రమద్వర కాలవశమున మరణిండింది. ఆయుస్షు తీరింది కనుక దానిని ఆపడం ఎవరి తరం. అయినా దానికి నేను ఒక ఉపాయం చెప్తాను. ఎవరైనా తమ ఆయుష్షులో సగం ఇస్తే ఆమె ముదరి కంటే తేజస్సుతో బ్రతుకుతుంది అని నేను యమధర్మరాజు అనుమతితో పలుకుతున్నాను " అని పలికాడు. రురుడు అందుకు అంగీకరించి తన ఆయుర్ధాయంలో సగం ఇచ్చి ఆమెను బ్రతికించి వివాహం చేసుకున్నాడు.

సర్పముల మీద రురుడి పగ

కానీ రురుడికి పాముల మీద కోపం పోలేదు. కర్రతో కనిపించిన పాములను చంపడం మొదలు పెట్టాడు. చెట్ల వెంట పుట్టల వెంట తిరుగుతూ కనిపించిన పామపలను చంపుతూ ఉండసాగాడు. అలా చంపుతూ ఒక రోజు డుండుభం అనే ఒక పామును చంపడానికి కర్రమును పైకి ఎత్తాడు. ఆ పాము భయపడి " తేజోవంతుడివి అయిన బ్రాహ్మణుడివి అయిన నీవు ఇలా పాములను చంపడానికి కారణం ఏమిటి " అని అడిగాడు. రురుడు " నా పేరు రురుడు. నేను ప్రమద్వర అనే ఆమెను ప్రేమించాను. నేను ప్రాణప్రదంగా ప్రేమించిన ప్రమద్వరను ఒక పాము కాటు వేసింది. అందు వలన నేను పాములను చంపుతున్నాను. నిన్ను కూడా చంపుతాను " అని చెప్పి కర్రను పైకెత్తాడు. వెంటనే ఆ పాము ఒక మునిగా మారి రురుడి ముందు నిలిచింది.

ఖగముని వృత్తాంతం


రురుడు డుండుభం అనే పాముని చంపబోతుండగా ఆ పాము ఒక మునిగా మారాడు. రురుడు ఆ పాముని " ఇదేమిటి పాముగా ఉన్న నీవు మనిషిగా మారడానికి కారణం ఏమిటి య " అడిగాడు. అందుకు ఆ పాముని "నేను సహస్రపాదుడు అనే మునీశ్వరుడను. నా సహచరుడు ఖగముడు. ఒక రోజు నా సహచరుడు ఖగముడు అగ్ని కార్యం చేస్తున్నాడు. ఆసమయంలో నేను అతడి మీద పరిహాసంగా గడ్డితో చేసిన పాముని వేసాను. అతడు నాపై కోపించి నన్ను విషం లేని పాముగా పడి ఉండమని శపించాడు. నేను అతడిని పరిహాసానికి చేసిన పనికి నన్ను ఇలా శపిస్తావా ! నన్ను క్షమించ లేవా " అని ప్రార్థించాను. నా ప్రార్థన మన్నించి ఖగముడు " మిత్రమా ! నా మాట జరిగి తీరుతుంది. అయినా నీవు పాముగా పడి ఉన్న తరుణంలో రురుడు అనే భృగువంశ సంజాతుడు వస్తాడు. అతడిని చూడగానే నీకు నీ రూపం వస్తుంది. " అని చెప్పాడు. అయ్యా మీరు బ్రాహ్మణులు. దయాగుణం కలవారు. పూర్వం నీ తండ్రి శిష్యుడైన ఆస్తికుడు కద్రువ శాప కారణంగా సర్పయాగంలో ఆహుతి అవుతున్న పాములను కాపాడాడు. నీవు కూడా పాములను చంపడం ఆప లేవా ! " అన్నాడు. రురుడు పాములను చంపడం ఆపివేసాడు. ఈ కథను వింటున్న మునులు " తల్లి కొడుకులకు శాపం ఇవ్వడం ఏమిటి. మాకు సవిస్తరంగా చెప్పండి " అని కోరారు.

No comments:

Post a Comment

Featured Post

RAMAYANAM - రామాయణము